‘వరల్డ్కప్తో తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకొని గురువారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఆయన అనుచరులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. అమెరికా పర్యటన సానుకూలంగా సాగిందన్నారు. వరల్డ్కప్ సాధించిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన అనుభూతి తనకు కలిగిందని చెప్పారు.
(చదవండి : పాక్లో 40 వేల మంది ఉగ్రవాదులు!)
పాక్ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలన్ని చేపడతామన్నారు. పాకిస్తాన్లో ఉగ్రజాడ లేకుండా చేసేందుకే ఉగ్రవాద సంస్థల నుంచి ఆయుధాలు, విద్యాసంస్థలు, అంబులెన్సులు, ఆసుపత్రులు సహా ఆస్తులను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. పర్యటనలో భాగంగా ఇమ్రాన్ఖాన్ వైట్హౌజ్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను, సెక్రేటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తదితరులను కలిశారు. యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ సంస్థ వాషింగ్టన్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.