టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండో సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను మాత్రమే సొంతం చేసుకుంది.
దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్.. మళ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత తలపడనుంది.
ఈ టూర్లో వన్డే సిరీస్లో గిల్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇప్పటికే టీ20 జట్టుకు అతడు దూరం అయ్యాడు కాబట్టి... ఈ టూర్ మొదలయ్యే వరకు గిల్ భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచనలు కన్పించడం లేదు. ఈ క్రమంలో గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ దేశవాళీ టోర్నీ సెకెండ్ లీగ్లో పంజాబ్ ఆడే తొలి మ్యాచ్లో గిల్ బరిలోకి దిగే అవకాశముంది. జనవరి 22న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్రతో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర తరపున సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆడనున్నాడు.
న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జడేజా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి జడేజాకు రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అవేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి


