స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే! | Reasons For The Stock Market Crash | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే!

Jan 20 2026 4:15 PM | Updated on Jan 20 2026 4:48 PM

Reasons For The Stock Market Crash

దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.

ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..

స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలు

వాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్‌లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్‌లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.

క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్‌లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.

పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.

బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.

ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement