ట్రెండింగ్‌కు ఇక ఫేస్‌బుక్‌ గుడ్‌బై! | Facebook is shutting down trending topics feature | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌కు ఇక ఫేస్‌బుక్‌ గుడ్‌బై!

Jun 2 2018 4:27 AM | Updated on Aug 20 2018 4:52 PM

Facebook is shutting down trending topics feature - Sakshi

న్యూయార్క్‌: ఫేస్‌బుక్‌ తన ‘ట్రెండింగ్‌ న్యూస్‌’ ఫీచర్‌కు స్వస్తి పలకనుంది. ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న, చర్చిస్తున్న వార్తాంశాలను తన వినియోగదారులకు అందించే ఉద్దేశంతో 2014లో ఫేస్‌బుక్‌ ట్రెండింగ్‌ న్యూస్‌ను ప్రవేశపెట్టింది. ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అప్పట్లో ఫేస్‌బుక్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను వినియోగదారులు ఆదరించలేదనీ, ఇది కాలం చెల్లిన ఆప్షన్‌ అని ఫేస్‌బుక్‌ తాజాగా పేర్కొంది.

వాస్తవానికి ట్రెండింగ్‌ న్యూస్‌ ఫీచర్‌ ఫేస్‌బుక్‌కు అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. నకిలీ వార్తలు, రాజకీయాల పరంగా సమతుల్యం లేకపోవడం, వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని కృత్రిమ మేధస్సు అందించలేక పోవడం తదితర సమస్యలను ఫేస్‌బుక్‌ ఎదుర్కొంది. ఎట్టకేలకు ఈ ఫీచర్‌ను తొలగించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.

దీని స్థానంలో బ్రేకింగ్‌ న్యూస్‌ పేరుతో కొత్త ఫీచర్‌ మొదలు పెట్టాలని... ఇందులో ప్రాంతీయ వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఫేస్‌బుక్‌ భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే బ్రేకింగ్‌ న్యూస్‌ సెక్షన్‌ను అమెరికాలో పరీక్షిస్తోందని, దాదాపు 44 శాతం వయోజనాలు ఫేస్‌బుక్‌ నుంచి న్యూస్‌ పొందుతున్నారని కొన్ని సర్వే సంస్థలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement