పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్‌! | Chinese Social Media users are Rallying Behind Huawei | Sakshi
Sakshi News home page

పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్‌!

May 22 2019 10:59 AM | Updated on May 23 2019 8:13 AM

Chinese Social Media users are Rallying Behind Huawei - Sakshi

బీజింగ్ :  చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేను ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు  చైనా  యువత భారీ షాకిచ్చింది. ఈ మేరకు అక్కడి  సోషల్‌ మీడియా యూజర్లు, యువత  కీలక నిర్ణయం తీసుకుంది.  తమ దేశ టెక్‌ దిగ్గజం హువావేకు అక్కడి యూజర్లు మద్దతుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్‌ ఉత్పత్తులను నిషేధించాలంటూ పిలుపు నిచ్చారు.

ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన  ట్రంప్ ప్రభుత్వంపై  అక్కడి యువత మండిపడుతోంది.  ట్విటర్‌, వైబోలాంటి సోషల్‌ మీడియా వేదికల్లో  ఆపిల్‌ ఉత్పత్తులను బ్యాన్‌ చేయాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు లభిస్తున్నాయి. దీంతో చైనా అంతటా యాంటీ ఆపిల్‌ ఉద్యమం ఊపందుకుంది. హువావేపై ట్రంప్‌ సర్కార్‌ కావాలనే వేధింపులకు పాల్పడుతోందని యూజర్లు మండి పడుతున్నారు. అలాగే ఆపిల్‌ ఐఫోన్‌ కొనాలన్న తన ఆలోచనను మార్చుకుని హువావే ఫోన్‌ను కొనుగోలు చేయనున్నామని మరో యూజర్‌  ప్రకటించారు. 

మరోవైపు ఈ నిర్ణయం స్వల్పకాలంలో చైనాలో ఆపిల్ అమ్మకాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్‌ తిరస్కరించింది. దీంతో అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ మరింత ముదురుతున్న ఆందోళన నెలకొంది. కాగా హువావేపై ఆంక్షలను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు అమెరికా  ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement