భారీ అగ్నిప్రమాదం : 200 ఏళ్ల క్రితం నాటి సంపదంతా... | Brazil's National Museum Engulfed By Massive Fire | Sakshi
Sakshi News home page

భారీ అగ్నిప్రమాదం : 200 ఏళ్ల క్రితం నాటి సంపదంతా...

Sep 3 2018 7:47 PM | Updated on Sep 3 2018 8:27 PM

 Brazil's National Museum Engulfed By Massive Fire - Sakshi

మంటల్లో కాలిపోయిన బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియం

బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శతాబ్దాల కాలం నాటి పురాతన సంపదంతా కాలి బూడిదైపోయింది.

బ్రెజిల్‌ నేషనల్‌ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో శతాబ్దాల కాలం నాటి పురాతన సంపదంతా కాలి బూడిదైపోయింది. రియో డి జానీరో ప్రాంతంలో ఈ మ్యూజియం ఉంది. 200 ఏళ్ల క్రితం నాటి ఈ మ్యూజియం సుమారు 20 మిలియన్ల కళాఖండాలకు పుట్టినిల్లు. జీవి, మానవశాస్త్ర, పురావస్తు శాస్త్ర, మానవజాతికి సంబంధించిన, భూగర్భ శాస్త్ర, జంతుజాలానికి సంబంధించిన అన్ని రకాల కళాఖండాలు దీనిలో ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఈ మ్యూజియం అగ్ని ప్రమాదానికి గురికావడంతో, ఈ సంపదంతా కాలి బూడిదైపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆ మ్యూజియమంతా మంటలు వ్యాపించేశాయని బ్రెజిల్‌ అధ్యక్షుడు మిచెల్ టెమర్‌ చెప్పారు. 200 ఏళ్ల నాటి వర్క్‌, రీసెర్చ్‌, నాలెడ్జ్‌ అంతా తాము కోల్పోయామని టెమర్‌ ఆవేదనతో ట్వీట్‌ చేశారు. ఇది బ్రెజిలియన్ల విషాదకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని రియో డి జానీరో ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో వెల్లడించలేదు. ఈ అగ్నిప్రమాద వార్త వినగానే, తొమ్మిదేళ్లకు పైగా అక్కడే మ్యూజియాలజిస్ట్‌గా పనిచేస్తున్న మార్కో ఆరేలియో కాల్డాస్‌ అక్కడికి చేరుకున్నారు. ‘ఇది మా 200 ఏళ్ల నాటి సైంటిఫిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌. లాటిన్‌ అమెరికాలో ఇది ఎంతో ప్రముఖమైనది. అంతా అయిపోయింది. మా వర్క్‌, మా జీవితం మొత్తం కోల్పోయాం’ అని కాల్డాస్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఇతర మ్యూజియంలో పనిచేసే వారు, పరిశోధకులు, విద్యావేత్తలు, ఇంటర్నులు కూడా మ్యూజియం అగ్నిప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎగిసిపడుతున్న మంటలను చూసి, కన్నీటిపర్యంతమయ్యారు. 

అమెరికన్ల చరిత్రకు సంబంధించిన అరుదైన కళాఖండాలకు పుట్టినిల్లు ఇది. అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటైన"లుజియా" దీనిలోనే ఉంది. ఇది సుమారు 11,000 సంవత్సరాల క్రితం మరణించిన 25 ఏళ్ల మహిళ పుర్రె మరియు ఎముకలు. అతిపెద్ద ఉల్కను ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఇది 5.36 టన్నులు బరువు ఉంటుంది. దీని 1784 సంవత్సరంలో కనుగొన్నారు. మమ్మీలు, శిల్పకళా విగ్రహాలు, రాతి శిల్పాలు వంటి పలు ఈజిప్ట్‌ కళాఖండాలు ఈ మ్యూజియంలో ఆకర్షణీయంగా ఉండేవి. కానీ ఇవన్నీ ఈ ప్రమాదంలో ఖాళీ బూడిదైపోయినట్టు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఇది పోర్చుగీస్‌ రాయల్‌ ఫ్యామిలీ. ఈ రాయల్‌ ప్యాలెస్‌ మ్యూజియంగా మార్చి, ప్రముఖ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా తీర్చిదిద్దారు. 1818లో దీన్ని ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement