ఇది ముమ్మాటికీ బాబు వైఫల్యమే | ysrcp mla srikanth reddy fires on AP CM chandrababu | Sakshi
Sakshi News home page

ఇది ముమ్మాటికీ బాబు వైఫల్యమే

Mar 2 2016 2:28 AM | Updated on Oct 9 2018 6:34 PM

ఇది ముమ్మాటికీ బాబు వైఫల్యమే - Sakshi

ఇది ముమ్మాటికీ బాబు వైఫల్యమే

అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మీడియా సంస్థలు ఎందుకు ప్రశ్నించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అడిగారు.

♦ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులే లేవు
♦ పార్థసారథి, గడికోట ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగినన్ని కేటాయింపులు రాబట్టకపోవడం సీఎం చంద్రబాబు వైఫల్యమేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పెద్దగా కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్రప్రజలు ఆగ్రహోదగ్రులవుతున్నారన్నారు. కేంద్రబడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీలుగానీ, ప్రత్యేక హోదాగానీ కనిపించట్లేదని.. రాష్ర్టంలోని వారందరికీ కనిపిస్తున్నదల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అందజేస్తున్న ప్యాకేజీలు మాత్రమేనని పార్థసారథి ఎద్దేవా చేశారు.

రాజధాని శంకుస్థాపనకు ప్రధాని వచ్చి మట్టి, నీరు అందజేసినపుడే చంద్రబాబు తన నిరసనను తెలిపివుంటే ఈరోజు బడ్జెట్‌లో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మొన్నటిదాకా 2018 నాటికి పోలవరం, 2019 నాటికి ప్రపంచస్థాయి రాజధాని, విజయవాడ మెట్రోరైలును నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారని, ఇపుడు బడ్జెట్‌లో కేంద్రం కేటాయింపులు చేయని నేపథ్యంలో ఈ ప్రాజెక్టులన్నింటినీ వాయిదా(రీషెడ్యూలింగ్) చేసుకుంటారా? అని ప్రశ్నించారు. తమ పార్టీని వీడని ఎమ్మెల్యేల్ని కూడా వెళ్లిపోతున్నారంటూ పదేపదే టీవీల్లో ప్రసారం చేస్తూ, కథనాలు రాస్తున్న మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేయబోతున్నట్టు గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు ఒక పార్టీనుంచి మరో పార్టీకి వెళుతుంటే అందులోని అనైతికతను ప్రశ్నించకుండా వెళ్లిపోతున్నారంటూ ఊదరగొట్టేలా ప్రచారం చేయడం దారుణమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement