అవినీతి, అక్రమాల్లోనే బాబు ‘ప్రత్యేక’త! | YSRCP MLA Roja takes on Chandrababu | Sakshi
Sakshi News home page

అవినీతి, అక్రమాల్లోనే బాబు ‘ప్రత్యేక’త!

Aug 10 2015 2:37 AM | Updated on Jul 28 2018 3:23 PM

అవినీతి, అక్రమాల్లోనే బాబు ‘ప్రత్యేక’త! - Sakshi

అవినీతి, అక్రమాల్లోనే బాబు ‘ప్రత్యేక’త!

అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధించడంలో తప్ప చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాల్లో మాత్రం అనేక ప్రత్యేకతలు సాధించారని

సాక్షి, హైదరాబాద్: అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా సాధించడంలో తప్ప చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాల్లో మాత్రం అనేక ప్రత్యేకతలు సాధించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా దుయ్యబట్టారు. ఆదివారమిక్కడఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారం చేపట్టగానే రాష్ట్రానికి కరువు కాటకాలను తెచ్చి ప్రత్యేకత సాధించారని, రైతులు, డ్వాక్రా మహిళల రుణాల్ని మాఫీ చేయకుండా మోసగించడంలో ప్రత్యేకహోదా సాధించారని ధ్వజమెత్తారు.

జాతీయహోదా లభించిన పోలవరం ప్రాజెక్టు పనుల్ని తుంగలో తొక్కి పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టి రూ.700 కోట్ల అవినీతి సొమ్మును కాజేయడంలో నంబర్‌వన్‌గా నిలవడం, ఇసుక దోపిడీలో టీడీపీ మంత్రులు, చీఫ్‌విప్‌లు నంబర్‌వన్ స్థానంలో ఉండటం, ఆడపిల్లల అభద్రతలో నంబర్‌వన్, మద్యం అమ్మకాలు, బెల్ట్‌షాపుల్లో నంబర్‌వన్ స్థానంలో రాష్ట్రాన్ని నిలిపారని ఆమె దుయ్యబట్టారు.

గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొనడం ద్వారా చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి ప్రత్యేకతను సంతరింపజేసుకున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీఎంకే కోటి మృతికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలని ఆమె అన్నారు.
 
పోయి చేతులు కట్టుకున్నారు: బుగ్గన
రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి వారి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక తప్పులు చేసి వాటిలో కూరుకుపోయిన చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడిగే పరిస్థితిలో లేరన్నారు.హోదాకు 14వ ఆర్థిక సంఘం అడ్డు చెబుతోందని గాలి ముద్దు కృష్ణమనాయుడు చెప్పడం తగదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement