సంక్షేమానికి పెద్ద పీట | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి పెద్ద పీట

Published Sun, Aug 16 2015 4:52 AM

The welfare of the large plateaus

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజోవత్

 నాంపల్లి : ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్‌ఎస్ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, ఈ పథకాల అమలుకు రూ.12 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజోవత్ అన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో తెలంగాణ దళిత హక్కుల చైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలోని పొందుపరిచిన పథకాలను అమలు చేస్తున్నా, వాటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

వీటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల అవసరాలపై పోరాటాలు చేపట్టి సాధించుకోవాలన్నారు. ఉభయ పార్లమెంట్ సభల్లో 184 మంది దళితులు సభ్యులుగా ఉన్నారని, వారు ఏకమైతే సభలను స్తంభింపజేయవచ్చన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో టికెట్లు రావనే భయంతో ఉన్నారని, నాకు కాకుంటే మన జాతిలోనే మరొకరికి వస్తుందనే భావన రావాలన్నారు. రాష్ట్రంలో  దళితులు ఏకమైతే 55 అసెంబ్లీ సీట్లు సాధించుకోవచ్చునన్నారు.

పైసలకు, సారాకు లొంగకుండా సరైన అభ్యర్థికి ఓటు వేస్తే చేతులు చాచి అడుక్కోవాల్సిన అవసరం ఉండదన్నారు.  కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ ఆర్.సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, రాష్ట్ర దళిత సేన అధ్యక్షులు జేబి రాజు, నాయకులు ఆనందరావు, ప్రొఫెసర్ ఎంఎన్ భూషి, మోహన్ రావు, చంద్రయ్య, బోస్, దుర్గం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement