నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ

Published Fri, Aug 19 2016 2:27 AM

నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ

సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఒకరోజు ముంబై పర్యటనలో భాగంగా మంత్రి పలువురు వ్యాపార దిగ్గజాలను కలిశారు. ఫోర్త్ ఇంజక్షన్, బ్లో మౌల్డింగ్ అండ్ పీఈటీ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 600 మంది ప్లాస్టిక్, పెట్రో కెమికల్, ప్యాకేజింగ్ రంగాల పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఆయా పరిశ్రమలకున్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పెస్, రక్షణ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

టీ హబ్, నూతన పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి అంశాలు ఈ రంగాల్లో ముందుకు వెళ్లేం దుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరా, టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహపూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న ల్యాండ్‌బ్యాంకు పెట్టుబడులకు మరో అదనపు ప్రయోజనమని మంత్రి తెలిపారు. వంద ఎకరాల్లో సుల్తాన్‌పూర్‌లో మొదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

రెండో దశలో మూడు వందల నుంచి 500 ఎకరాల్లో ప్లాస్టిక్ సిటీని మెదక్ నిమ్జ్ పార్కులో ఏర్పాటు చేస్తామని అన్నారు.  పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి వివరించారు. మంత్రి ప్రజెంటేషన్‌పై పారిశ్రామికవేత్తలు అభినందనలు తెలిపారు.
 
ఆర్‌బీఐ గవర్నర్‌ను కలిసిన మంత్రి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను మంత్రి కేటీఆర్ ముంబైలో గురువారం కలిశారు. ఎంఎస్‌ఎం ఈ సెక్టార్‌లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్‌కు వివరించారు. పలు ఎంఎస్‌ఎంఈ రంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఈ పరిశ్రమలను ఆదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలను వివరించి పలు సూచనలను తీసుకున్నారు.

Advertisement
Advertisement