‘సాక్షి’కి అంతర్జాతీయ గుర్తింపు | sakshi placed in international quality club | Sakshi
Sakshi News home page

‘సాక్షి’కి అంతర్జాతీయ గుర్తింపు

Sep 22 2016 3:06 AM | Updated on Aug 20 2018 8:20 PM

తెలుగువారి మనస్సాక్షి ‘సాక్షి’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. రాశిలో వాసిలో ఉన్నతప్రమాణాలను పాటిస్తున్న సాక్షి దినపత్రికకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ప్రచురణలో ఉన్నత ప్రమాణాలకు దక్కిన గౌరవం
ఇంటర్నేషనల్ కలర్‌క్వాలిటీ క్లబ్‌లో సభ్యత్వం
ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 128 పత్రికలు
65పత్రికలకు దక్కిన మెంబర్‌షిప్
ఈ ఖ్యాతి దక్కించుకున్న తొలి తెలుగు పత్రిక ‘సాక్షి’

 
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగువారి మనస్సాక్షి ‘సాక్షి’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. రాశిలో వాసిలో ఉన్నతప్రమాణాలను పాటిస్తున్న సాక్షి దినపత్రికకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ న్యూస్‌పేపర్ కలర్‌క్వాలిటీ క్లబ్ (ఐఎన్‌సీక్యుసి)లో ‘సాక్షి’కి సభ్యత్వం లభించింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి తెలుగుపత్రిక ‘సాక్షి’ కావడం విశేషం. ప్రింటింగ్‌లో అంతర్జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలను క్రమం తప్పకుండా పాటించే వార్తాపత్రికలు, ప్రచురణా సంస్థల మధ్య పోటీ నిర్వహించి ఈ సభ్యత్వానికి ఎంపికచేస్తారు.  

కొల్‌కతాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ ప్రింటర్స్ ఫోరమ్, వాన్ ఇఫ్రా (జర్మనీ) డిప్యూటీ సీఈవో మన్‌ఫ్రెడ్ వెర్ఫెల్ చేతులు మీదుగా ‘సాక్షి’ ప్రతినిధులు ఈ సభ్యత్వ ధృవపత్రాన్ని అందుకున్నారు. వాన్ ఇఫ్రా ఇండియా 24వ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో అనేక అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన పలువురు మీడియా ప్రముఖులు పాల్గొన్నారు.
 
 65 పత్రికలకు సభ్యత్వం
 ప్రపంచవ్యాప్తంగా 128 పత్రికలు ఈ సభ్యత్వం కోసం పోటీపడ్డాయి. ఐఎన్‌సీక్యుసీ అంతర్జాతీయంగా ప్రింటింగ్‌లో ఉన్నతప్రమాణాలను పాటిస్తున్న పత్రికల మధ్య ప్రతి రెండేళ్లకొకమారు పోటీ నిర్వహించి తమ సంస్థలో సభ్యత్వం ఇస్తుంది. రెండేళ్ల (2016-2018) కాలానికి గాను ఈసారి 65 పత్రికలు ఎంపికయ్యాయి. ప్రింటింగ్ క్వాలిటీని నిరూపించుకోవడం కోసం ఈ పోటీలో పాల్గొనే పత్రికలు ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన మీడియా నిపుణులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది.

1994లో ప్రారంభమైన ఐఎన్‌సీక్యుసి అప్పటి నుంచి వార్తాపత్రికలు, ప్రచురణ సంస్థల మధ్య ‘కలర్ ప్రింటింగ్ క్వాలిటీ’ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. క్వాలిటీ ప్రింటింగ్‌లో ప్రపంచస్థాయి గుర్తింపు కోసం వార్తాపత్రికలు, ప్రచురణ సంస్థలు ఈ పోటీలో పాల్గొంటాయి. కొల్‌కతాలో జరిగిన సభ్యత్వ ప్రదానం కార్యక్రమంలో సాక్షి తరఫున పి.వి.కె.ప్రసాద్ (డెరైక్టర్, ఆపరేషన్స్), టి.కె.సురేష్ (సీజీఎం, ఆపరేషన్స్), బి.గౌరీశంకర్ (జీఎం, క్వాలిటీ అండ్ ప్రీప్రెస్) పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement