ఢిల్లీ పర్యాటకురాలిపై అత్యాచారం | Rape on Delhi tourists | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పర్యాటకురాలిపై అత్యాచారం

Aug 18 2017 12:51 AM | Updated on Jul 28 2018 8:53 PM

ఢిల్లీ పర్యాటకురాలిపై అత్యాచారం - Sakshi

ఢిల్లీ పర్యాటకురాలిపై అత్యాచారం

నగర సందర్శనకు వచ్చిన ఓ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

బంజారాహిల్స్‌లో ఘటన
హైదరాబాద్‌: నగర సందర్శనకు వచ్చిన ఓ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఢిల్లీకి చెందిన యువతి (20) తన స్నేహితులతో కలసి ఈ నెల 13న హైదరాబాద్‌ పర్యటనకు వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–10లోని వోయో హోటల్‌లో బస చేసింది. ఈ నెల 15 రాత్రి 9 గంటల సమయంలో నగర సందర్శన అనంతరం ఆమె హోటల్‌కు తిరిగి వచ్చింది. లిఫ్ట్‌లో తన రూమ్‌కు వెళుతుండగా... అదే హోటల్‌లో బస చేస్తున్న నలుగురు యువకులు యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. తమ గదికి రావాలంటూ బెదిరించారు. ఎలాగో వారి నుంచి తప్పించుకుని ఆమె తన గదిలోకి వెళ్లింది.

 మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటలకు సర్వీస్‌ బాయ్‌నంటూ ఓ యువకుడు యువతి రూమ్‌ తలుపు తట్టి, ఆమెను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లాడు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నగరంలో దిగినప్పటి నుంచీ యువతిని వెంబడిస్తూ వచ్చిన ఆ యువకుడు, ఆమె బస చేసిన హోటల్‌ తెలుసుకుని అక్కడే మకాం వేసినట్టు తెలిసింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement