
ఎస్ఆర్పీసీ చైర్మన్గా డి.ప్రభాకర్రావు
దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) చైర్మన్గా తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నియమించింది.
అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ (ఎస్ఆర్పీసీ) చైర్మన్గా తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడాది కాలంపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు పాండిచ్చేరి ఎస్ఆర్పీసీలో సభ్యులుగా ఉంటాయి. తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ హోదాలో ప్రభాకర్ రావు దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య జరిగే విద్యుత్ పంపిణీ, పవర్ గ్రిడ్ ఆపరేషన్, విద్యుత్ వినియోగం, అంతర్రాష్ట్ర విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కేంద్రంతో సంప్రదింపులు, విద్యుత్ రంగానికి సంబంధించిన అంతర్రాష్ట్ర వివాదాలు... తదితర అంశాల్లో ఎస్ఆర్పీసీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఎస్ఆర్పీసీ సభ్య రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది ఒకరిని రొటేషన్ పద్ధతిలో చైర్మన్గా నియమిస్తారు.
సీఎం అభినందనలు...
ఎస్ఆర్పీసీ చైర్మన్గా నియామకం అయిన డి.ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తెలంగాణలో కోతల్లేని విద్యుత్ అందించడంలో ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు. ప్రతిభ, పనితీరుకు దక్కిన గౌరవంగా సీఎం అభివర్ణించారు. ప్రభాకర్ రావు నాయకత్వంలో తెలంగాణ విద్యుత్ శాఖ విజయవంతంగా ముందుకుపోతున్నట్లే ఇకపై దక్షిణాది రాష్ట్రాలు కూడా సమన్వయంతో, పరస్పర సహకారంతో ముందడుగు వేస్తాయనే నమ్మకం వ్యక్తం చేశారు.
యాదాద్రికి లైన్ క్లియర్ పట్ల సీఎం హర్షం
యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫారసు చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చే ప్రక్రియలో యాదాద్రి ప్లాంటు ముఖ్యమైనదని, దాని నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగడం సంతోషకరమని అన్నారు. అనుమతుల సాధనకు కృషి చేసిన జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావును సీఎం ఫోన్లో అభినందించారు. వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంటును రూ.27వేల కోట్ల వ్యయంతో టీఎస్ జెన్కో చేపట్టింది. ఆర్ఈసీ దీనికోసం రూ.21వేల కోట్ల ఆర్థిక సహకారం అందిస్తోంది.