జూలైకల్లా పాలమూరు ప్రాజెక్టులు | Palamuru projects By July | Sakshi
Sakshi News home page

జూలైకల్లా పాలమూరు ప్రాజెక్టులు

Apr 16 2016 3:06 AM | Updated on Sep 3 2017 10:00 PM

మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పనులను జూలై నెలాఖారుకల్లా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

♦ అధికారులకు హరీశ్ ఆదేశం
♦ హెడ్‌క్వార్టర్స్‌లో నివసించకుంటే హెచ్‌ఆర్‌ఏలో కోతే
 
 సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పనులను జూలై నెలాఖారుకల్లా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై శుక్రవారం సుదీర్ఘంగా ఐదుగంటల పాటు ఆయా ప్రాజెక్టుల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు, ఈ ఖరీఫ్ నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేయాల్సిందేనన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషిచేయాలని, అందుకు రానున్న రెండు నెలలు ఎంతో కీలకమని అన్నారు.

కొందరు సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారని ఆగ్రహించారు. నిర్లక్ష్యం, నిర్లిప్తత వీడాలని హెచ్చరించారు. జూలైకల్లా కల్వకుంట్ల ప్రాజెక్టు ద్వారా 1.5 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షలు, బీమా ద్వారా 1.4 లక్షలు, కోయిల్‌సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరందించాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. హెడ్‌క్వార్టర్స్‌లో నివసించకుండా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే అధికారులకు హెచ్‌ఆర్‌ఏలో కోత విధిస్తామని మంత్రి హెచ్చరించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషీ, ఓఎస్డీ దేశ్‌పాండే, వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement