ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లినప్పటికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం పాలన యథావిధిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
కంటోన్మెంట్, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లినప్పటికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం పాలన యథావిధిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని అధికారుల పర్యవేక్షణలో పాలన సాగే కంటోన్మెంట్లో రాష్ట్రప్రభుత్వ పాత్ర చాలా పరిమితం. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన ప్రభావం ఇక్కడ పెద్దగా ఉండదని కంటోన్మెంట్ పెద్దలు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగా అటానమస్ పద్ధతిలోనే పాలన కొనసాగుతుందని కంటోన్మెంట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) సుజాత గుప్తా స్పష్టం చేశారు.
పాలనపై ప్రభావం ఉండదు
కంటోన్మెంట్లో అభివృద్ధి పనులన్నీ బోర్డు ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. నెలకోసారి జరిగే ఈ సమావేశంలో అభివృద్ధి పనుల ప్రణాళిక, వివిధ టెండర్లు, ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, వినియోగం తదితర అంశాలన్నింటికీ బోర్డు ఆమోదం ఉంటే సరిపోతుంది. అధికార యంత్రాంగం సైతం పూర్తిగా బోర్డు ఆదీనంలో పనిచేస్తుంది. కంటోన్మెంట్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని అంశాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తంలో పాలనాపరంగా అమలయ్యే ఆంక్షలు కంటోన్మెంట్లో వర్తించవని పరిశీలకులు పేర్కొంటున్నారు.
అటానమస్గానే కొనసాగుతుంది
కంటోన్మెంట్ ప్రాంతాల్లో పాలన మొదటి నుంచి భిన్నంగానే ఉంటుంది. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో కొత్తగా అమల్లోకి వచ్చే నిబంధనలు ఏమీ ఉండవు. గతంలో మాదిరిగానే అటానమస్గా పాలన కొనసాగుతుంది. బోర్డు సమావేశాలు, నిర్ణయాలు యథావిధిగానే కొనసాగించే వెసులుబాటు ఉంటుంది.
- సుజాత గుప్తా, సీఈఓ
ముందు నుంచీ కేంద్రం పాలనే
కంటోన్మెంట్ ప్రాంతం ముందు నుంచీ కేంద్రం ఆధీనంలోనే కొనసాగుతుంది. రాష్ట్రపతి పాలన అమలయ్యే ప్రాంతాలు కేంద్రం ఆధీనంలోకి వెళతాయి. అంటే రాష్ట్రపతి పాలన విధించడం వల్ల కొత్తగా కంటోన్మెంట్పై ఎలాంటి ప్రభావం ఉండదు. రాష్ట్రప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలపై మాత్రం దీని ప్రభావం ఉండొచ్చు. బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నా. కంటోన్మెంట్లో రహదారులపై మిలట్రీ అధికారులు ఆంక్షలు విధించకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల మూసివేతపై మిలట్రీ అధికారులు, పౌరులతోపాటు బోర్డు సభ్యులు, నగర పోలీస్, ట్రాఫిక్ విభాగం ప్రతినిధులతో క మిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకువాలని అభిప్రాయపడ్డారు.
- జంపన ప్రతాప్, బోర్డు సభ్యుడు, వైఎస్సార్ సీపీ నేత