
అప్పు తీర్చమన్నాడని హత్య
తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించమన్నాడని కక్షగట్టిన ఓ వ్యాపారి తోటి వ్యాపారిని అతిదారుణంగా నరికి చంపాడు
వ్యాపారి ప్రాణం తీసిన స్నేహితుడు
గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు
నలుగురు నిందితుల అరెస్టు
సుల్తాన్బజార్ : తనకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించమన్నాడని కక్షగట్టిన ఓ వ్యాపారి తోటి వ్యాపారిని అతిదారుణంగా నరికి చంపాడు. గంటల వ్యవధిలో నలుగురు నిందితులను సుల్తాన్బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... కింగ్కోఠికి చెందిన షేక్ ఖాదర్పాషా కింగ్కోఠిలో స్పీడ్ మోటార్స్ పేరిట సెకండ్ హ్యాండ్ బైక్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఇదే బిజినెస్ చేసే రాంకోఠికి చెందిన సర్పరాజుద్దీన్ అలియాస్ డాక్టర్(28) స్నేహితుడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా డబ్బు విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఖాదర్కు సర్పరాజుద్దీన్ కొంత డబ్బు బాకీ పడ్డాడు. ఆ డబ్బు గురించి తరచూ తనను అడుతుండటంతో ఖాదర్ను హత్య చేయాలని సర్పరాజుద్దీన్ నిర్ణయించుకున్నాడు. తన ఇంటికి వస్తే డబ్బు ఇచ్చేస్తానని ఆదివారం రాత్రి ఖాదర్కు ఫోన్ చేశాడు. రాత్రి 11 గంటలకు సర్పరాజుద్దీన్ ఇంటికి ఖాదర్ తన కారులో వెళ్లాడు. అప్పటికే వేట కోడవలి, ఇనుపరాడ్తో సిద్ధంగా ఉన్న సర్పరాజుద్దీన్, అతని తమ్ముడు సయ్యద్సాహెబ్ హష్మీ (26) కారు దిగుతున్న ఖాదర్పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తర్వాత కింగ్కోఠికి చెందిన తమ స్నేహితుడు మహ్మద్ సాహెబ్ (23)తో కలిసి బైక్పై పారిపోయారు.
సమాచారం అందుకున్న డీసీపీ రవీందర్, టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ రావుల గిరిధర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న ఖాదర్ను హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలతో గాలించి సోమవారం మధ్యాహ్నం ఎంజీబీఎస్లో నిందితులను అరెస్ట్ చేశారు. కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ టీం, సుల్తాన్బజార్ పోలీసులను డీసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, అదనపు డీసీపీ చంద్రశేఖర్, సుల్తాన్బజార్ ఏసీపీ రావుల గిరిధర్, ఇన్స్పెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు.