వైఎస్సార్ సీపీలోకి పలువురు బ్రాహ్మణ నేతలు
సాక్షి, హైదరాబాద్: హిందూ ధర్మ ప్రచార సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ నేత ఏలేశ్వరపు జగన్మోహన్రావు (విజయవాడ) నేతృత్వంలో పలువురు బ్రాహ్మణ నేతలు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్న నేతలు తమ అభీష్టాన్ని వెల్లడించారు. జగన్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారి వెంట వచ్చిన ఘనాపాటీలు వేదమంత్రోచ్ఛారణలతో జగన్కు శాస్త్రోక్తంగా తలపాగా చుట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మల్లంపల్లి నాగేంద్రకుమార్, పోతావజ్జుల పురుషోత్తం, కోలవెన్ను రాధాకృష్ణ, పులిపాక ప్రసాద్, విజయవాడ ట్యాక్సీ యూనియన్ అధ్యక్షులు రంగా, ఆటోవర్కర్స్ యూనియన్ చీమల గోవిందు, పరశురామసేన కార్యదర్శి, పురోహితుల సంఘం సభ్యుడు పులుపుల సాయి ఉన్నారు.