బడ్జెట్ అత్యంత అవాస్తవికంగా, ఊహాజనితంగా, అప్పుల కుప్పగా ఉందని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ విమర్శించారు. అబద్ధాలతో అంకెల గారడీ చేసినట్లు ఉందని పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ అత్యంత అవాస్తవికంగా, ఊహాజనితంగా, అప్పుల కుప్పగా ఉందని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ విమర్శించారు. అబద్ధాలతో అంకెల గారడీ చేసినట్లు ఉందని పేర్కొన్నారు. బడ్జెట్పై మూడోరోజు చర్చలో భాగంగా శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేసినట్లు బడ్జెట్ ఉందన్నారు. ‘ఈటల బాట-అప్పుల వేట.. ఈటల అభివృద్ధి-అంకెల మాయ’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఓవరాల్గా బడ్జెట్ హౌస్ఫుల్.. కలెక్షన్లు నిల్’ అంటూ చురకలు అంటించారు.
గత రెండు బడ్జెట్ల అనుభవాలను బేరీజు వేసుకోకుండానే 2016-17 బడ్జెట్లో రూ.1.30 లక్షల కోట్ల కేటాయింపులు జరిపారన్నారు. 30 శాతం అదనపు ఆదాయాన్ని చూపారని, ఇది రాబట్టేందుకు ప్రభుత్వం దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై రూ.1.18 లక్షల అప్పుల భారం ఉందన్నారు. వడ్డీలు చెల్లించేందుకే రూ.7,706 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రం రూ. 1.23 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు.