4న సగం సిటీకి నీళ్లు బంద్ | Half of the city and the water bandh on 4 | Sakshi
Sakshi News home page

4న సగం సిటీకి నీళ్లు బంద్

Apr 1 2015 12:29 AM | Updated on Sep 27 2018 8:48 PM

ఈ నెల 4(శనివారం)న గ్రేటర్ పరిధిలో సగం నగరానికి కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది.

కృష్ణా మూడోదశ కింద 45 మిలియన్
గ్యాలన్ల నీటి తరలింపు నేపథ్యంలో..
మొదటి, రెండవ దశల పరిధిలో  నీటిసరఫరా నిలిపివేత..
ఈ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా  చర్యలు తీసుకుంటాం..
విలేకరుల సమావేశంలో జలమండలి
మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్

 
సిటీబ్యూరో:  ఈ నెల 4(శనివారం)న గ్రేటర్ పరిధిలో సగం నగరానికి కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా మూడోదశ పథకం కింద నగరానికి 45 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించ డంతోపాటు.. ఈ నీటిని కృష్ణా ఫేజ్-1,2 పైప్‌లైన్ల ద్వారా నగరం నలుమూలలకు పంపిణీ చేసే విధానాన్ని పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో 180 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాల సరఫరా నిలిపివేయడం అనివార్యమైందని జలమండలి ఎండీ ఎం.జగదీశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నీటిసరఫరా నిలిపివేతకు గల కారణాలను ఇతర ఉన్నతాధికారులతో కలిసి వివరించారు.

నల్లగొండ జిల్లాలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా మొదటి, రెండవ దశ పైప్‌లైన్ల ద్వారా ప్రస్తుతం నీటిని తరలిస్తున్నామని, ఈనెల 4న మూడోదశకు అవసరమైన పైప్‌లైన్‌ను ఈ జలాశయంలో ఏర్పాటు చేసి నీటిని తోడే ఏర్పాట్లను పదిగంటల వ్యవధిలో పూర్తిచేయనున్నామన్నారు. అదే రోజున కృష్ణా మూడోదశకు సంబంధించిన జంక్షన్లు, వాల్వ్‌లు, నూతన రిజర్వాయర్ల వద్ద పెం డింగ్  పనులను పూర్తిచేస్తామని ఎండీ తెలిపారు. మూడో దశ నీళ్లను నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు రింగ్‌మెయిన్-1 పనులు 6.5 కి.మీ మేర పూర్తికావాల్సి ఉన్నందున ఫేజ్-1,ఫేజ్-2 పైప్‌లైన్లను వాడుకోవాల్సి వస్తుందన్నారు. మరో మూడునెలల్లో మూడోదశ పథకానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తిచేస్తామని స్పష్టంచేశారు.  

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..

 నీటి సరఫరా నిలిపివేయనున్న నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధానకార్యాలయంలో ఉన్నతాధికారులతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ కమిటీ, అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసినట్లు ఎండీ తెలిపారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు 9989995690,9989990824 నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించాలని కోరారు. అత్యవసర పరిస్థితిని సమీక్షించేందుకు సెక్షన్, డివిజన్ స్థాయిలో అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. బస్తీల దాహార్తిని తీర్చేందుకు నగరంలో 16 డివిజన్ల పరిధిలో ప్రతి డివిజన్‌కు 500 ట్యాంకర్ ట్రిప్పులను అదనంగా సరఫరా చేస్తామన్నారు.
 
వేసవిలో నో ఫికర్...


ఈ వేసవిలో నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎండీ తెలిపారు. ఏప్రిల్ 7న గండిపేట్ వద్ద పంపింగ్ ద్వారా నీటిని తోడనున్నామన్నారు.  సింగూరు జలాశయం వద్ద మే నెలలో పంపింగ్ ద్వారా నీటిని తోడుతామన్నారు. కృష్ణా మూడోదశ ద్వారా అదనంగా నీటిని తరలించనున్న నేపథ్యంలో వేసవిలో అంత ఆందోళన అవసరం లేదని స్పష్టంచేశారు.  వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు రూ.73 కోట్లు కేటాయించామన్నారు.
 
ఈ ప్రాంతాల్లోనే..
 
 కృష్ణా ఫేజ్-1:
 పూర్తిగా సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
 నారాయణగూడ, బర్కత్‌పురా, నల్లకుంట,
 ముషీరాబాద్, నింబోలిఅడ్డా, అడిక్‌మెట్, శివం, చిలకలగూడ, బొగ్గులకుంట, మహబూబ్‌మాన్షన్, వినయ్‌నగర్, అస్మాన్‌ఘడ్, చంచల్‌గూడ, బార్కాస్, చాంద్రాయణగుట్ట, మైసారం, యాకుత్‌పురా, సంతోష్‌నగర్, వైశాలినగర్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం,
 ఎన్‌టీఆర్‌నగర్, అల్కాపురి, మలక్‌పేట్.
 పాక్షికంగా సరఫరా నిలిపివేయనున్న ప్రాంతాలు
 మీరాలం, మిశ్రీగంజ్ ,జహానుమా,
 బహదూర్‌పురా, ఆజంపురా, మొఘల్‌పురా
 కృష్ణా ఫేజ్-2:
 పూర్తిగా నీటిసరఫరా నిలిచిపోయే ప్రాంతాలు: సాహెబ్‌నగర్,బాలాపూర్,మైలార్‌దేవ్‌పల్లి,హైదర్‌గూడా,ఉప్పర్‌పల్లి, ప్రశాసన్‌నగర్, తార్నాక,లాలాపేట్,మౌలాలి, నాచారం, బీరప్పగడ్డ, బోడుప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, మల్కాజ్‌గిరి,
 డిఫెన్స్‌కాలనీ, సాయినాథ్‌పురం, గాయత్రీనగర్, చాణక్యపురి, భువనగిరి మున్సిపాల్టీ, గచ్చిబౌలి, సైనిక్‌పురి, ఎలుగుట్ట, కైలాశ్‌గిరి రిజర్వాయర్ ప్రాంతాలు.
 పాక్షికంగా నిలిచిపోనున్న ప్రాంతాలు:
 లింగంపల్లి, మారేడ్‌పల్లి, సీతాఫల్‌మండి,
 మెట్టుగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ,
 ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, ఎల్లారెడ్డిగూడ,
 కెపిహెచ్‌బి, భాగ్యనగర్, మూసాపేట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement