పరిహారం ఇచ్చాకే ఖాళీ చేయిస్తాం | government guarantee to the High Court on the Midmaneru victims compensation | Sakshi
Sakshi News home page

పరిహారం ఇచ్చాకే ఖాళీ చేయిస్తాం

Aug 6 2017 2:05 AM | Updated on Aug 30 2019 8:19 PM

మిడ్‌మానేరు ఇళ్ల ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు హామీనిచ్చింది.

‘మిడ్‌మానేరు’ బాధితుల పరిహారంపై హైకోర్టుకు ప్రభుత్వం హామీ
 
సాక్షి, హైదరాబాద్‌: మిడ్‌మానేరు ఇళ్ల ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు హామీనిచ్చింది.  జూలై నెలాఖరులోగా ఇళ్లను ఖాళీ చేయాలని వేములవాడ తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసును నీలోజిపల్లి, కొండుముంజు గ్రామాలకు చెందిన వి.మల్లేశంతో పాటు మరో 40 మందికిపైగా రెండు పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేశారు. వీటిని జస్టిస్‌ ఎ. రామలింగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. రైతులకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం ఇళ్ల ముంపు బాధితులకు ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదించారు.

ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తగ్గించడం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ సిఫార్సులకు వ్యతిరేకమన్నారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. పరిహారం కోసం ఇళ్ల నిర్మాణాల వ్యయాన్ని పెంచేసి చెబుతున్నారని, ఈమేరకు నిఘా నివేదికలు కూడా వచ్చాయన్నారు. అయినా తగిన పరిహారం ఇచ్చిన తర్వాతే వారిని ఖాళీ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఈ నెల 9న భూసేకరణ అధికారి నిర్వహించే విచారణ సమయంలో ముంపు బాధితుల çసమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11 కి వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement