
ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపు
తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులపై ఎప్పుడూ కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వంపై శ్రీకాంత్రెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులపై ఎప్పుడూ కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని ఉద్యోగులపైకి నెడుతోందని విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మరో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలసి ఆయన మాట్లాడారు. తాము చెప్పినట్టు చేయని ఉద్యోగులను విధుల నుంచి తొల గించడం, బదిలీ చేయడం, పోలీసులతో అక్రమంగా కేసులు పెట్టించి వేధించే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ‘ఏం బాలేదు’ అన్న శీర్షికన ఓ పత్రిక (సాక్షి కాదు)లో ప్రచురితమైన కథనాన్ని శ్రీకాంత్రెడ్డి మీడియాకు చూపిం చారు. ఉద్యోగుల విధులకు అడుగడుగునా ఆటంకం కలిగించడం, తమకు అనుకూలంగా పనిచేయని వారిని బదిలీ చేయడం టీడీపీ సర్కార్కి పరిపాటైందన్నారు.
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి..: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని శ్రీకాంత్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. ఏపీఎండీఎస్, ఏపీఎస్ఆర్టీసీ తదితర కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచాలని కోరారు. టీడీపీ ఎన్నికల ముందు ప్రతి ఉద్యోగికీ ఇంటి కోసం స్థలమిస్తామని, అందులో తక్కువ వడ్డీతో ఇల్లు కట్టిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలన్నారు.