సీబీఐ వలలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ | Gopala Krishnamurthy in CBI trap | Sakshi
Sakshi News home page

సీబీఐ వలలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

Mar 9 2017 12:51 AM | Updated on Apr 4 2019 5:53 PM

సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది.

రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గోపాల కృష్ణమూర్తి

సాక్షి, హైదరాబాద్‌: సీబీఐ వలలో మరో అవినీతి తిమింగళం పట్టుబడింది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో యాంటీ ఇవాషన్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఎస్‌.గోపాల కృష్ణమూర్తి.. కాటేదాన్‌లోని కేఎం ప్లాస్టిక్‌ కంపెనీకి అనుకూలంగా ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌ ఇచ్చేందుకు ఆ సంస్థ యజమాని జగదీశ్‌ ప్రసాద్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన గోపాల కృష్ణమూర్తి బృందం కంపెనీలో తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో అనుకూలంగా రిపొర్ట్‌ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం రూ.6 లక్షలను గోపాల కృష్ణమూర్తికి జగదీశ్‌ ఇచ్చాడు. మిగతా రూ.4 లక్షలు మధ్యాహ్నం ఇస్తానని చెప్పాడు.

అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ ద్వారా ఈ సమాచారం అందుకున్న సీబీఐ ఇన్‌స్పెక్టర్‌ రాందాస్‌.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకొని రూ.4 లక్షలు ఇస్తున్న సమయంలో గోపాల కృష్ణమూర్తితోపాటు జగదీశ్‌ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. గోపాల కృష్ణమూర్తి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు రూ.5.6 లక్షల నగదుతోపాటు కీలకమైన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ డీఐజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement