దూకుడు పెంచిన ఆర్మీ అధికారులు | from october 2 the transportation was stopped in mid night | Sakshi
Sakshi News home page

దూకుడు పెంచిన ఆర్మీ అధికారులు

Oct 1 2014 2:13 AM | Updated on Sep 2 2017 2:11 PM

కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సామాన్యుల రాకపోకలను అక్టోబర్ 2 నుంచి రాత్రి వేళల్లో నియంత్రించనున్నట్టు ప్రకటించిన ఆర్మీ అధికారులు..

కంటోన్మెంట్: కంటోన్మెంట్ పరిధిలోని ఆర్మీ రోడ్లపైకి సామాన్యుల రాకపోకలను అక్టోబర్ 2 నుంచి రాత్రి వేళల్లో నియంత్రించనున్నట్టు ప్రకటించిన ఆర్మీ అధికారులు.. రెండ్రోజుల ముందే చర్యలు ప్రారంభించారు. ఎలాంటి సమాచారం లేకుండా సోమవారం రాత్రి ఆంక్షలు విధించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మారేడ్‌పల్లి నుంచి ఏఓసీకి వెళ్లే మార్గంలోని అలహాబాద్ గేట్ వద్ద, పికెట్- ఏఓసీ మార్గంలో స్టాప్ అండ్ గో బేకరీ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలో మీటర్లు మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

తూతూ మంత్రంగా భేటీ
ఆంక్షల అమలు నేపథ్యంలో ఏఓసీ సెంటర్ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం సమీప కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశం మొక్కుబడిగా ముగిసింది. భేటీకి హాజరైన ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న అభిప్రాయాలను సైతం ఖాతరు చేయకుండా ఆర్మీ అధికారులు తామేమి చెప్పాలనుకున్నారో దానికే పరిమితమయ్యారు. ఆంక్షల నేపథ్యంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై చర్చించి పరిష్కరించుకునేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కూడిన సివిల్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసే వరకు రాత్రివేళల్లో సైతం రోడ్లను మూసేయొద్దని ఎంపీ, ఎమ్మెల్యే పదేపదే కోరినా అర్మీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మల్లారెడ్డి, సాయన్న సమావేశం నుంచి బయటకు వెళ్లడంతో ప్రజలు సైతం వారిని అనుసరించారు.

బాబుతో ఒత్తిడి తెప్పిస్తా: మల్లారెడ్డి
సమస్యను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement