
నేడే కేబినెట్ భేటీ
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం భేటీ కానుంది.
కొత్త జిల్లాలు, వేడుకల నిర్వహణపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో... కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్పై ప్రధానంగా చర్చించనున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేయాలనే దానితోపాటు దసరా రోజున కొత్త జిల్లాల ఏర్పాటు సంబురాల నిర్వహణకు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
దానిపై కసరత్తు చేసేందుకు సీఎస్ రాజీవ్శర్మ అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీని కూడా నియమించారు. మరోవైపు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా చేయాలని నిర్ణయించారు. కొత్తగా సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటికీ సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపే అవకాశముంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనందున వాటిలో కొన్నింటికి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్లు జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉద్యోగుల డీఏ పెంపునకు సంబంధించిన ఫైలుపై కేబినెట్ లాంఛనంగా ఆమోదముద్ర వేయనుంది.