'సత్యా నాదెళ్ల ఉద్యోగంపై బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం' | buggana rajendranath reddy slams chandrababu naidu over satya nadella job comments | Sakshi
Sakshi News home page

'సత్యా నాదెళ్ల ఉద్యోగంపై బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం'

Jun 6 2016 1:53 PM | Updated on Sep 4 2017 1:50 AM

'సత్యా నాదెళ్ల ఉద్యోగంపై బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం'

'సత్యా నాదెళ్ల ఉద్యోగంపై బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం'

మైక్రోసాప్ట్ సీఈవో సత్యా నాదెళ్ల ఉద్యోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : మైక్రోసాప్ట్ సీఈవో సత్యా నాదెళ్ల  ఉద్యోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐటీపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. '1992లోనే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం నా వల్లే సత్య నాదెళ్ల ఐటీ చదివారని చెబుతున్నారు. చంద్రబాబు మాటలు చూస్తే నవ్వొస్తోంది. ఆయన 1995లో ముఖ్యమంత్రి అయితే సత్యా నాదెళ్ల అంతకు ముందే అమెరికాలో స్థిరపడ్డారు. 1992లోనే ఆయన సన్ మైక్రో సిస్టమ్స్లో పని చేశారు.

(ఇంతకీ చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఏం మాట్లాడారంటే ..'మన రాష్ట్రంలో పుట్టాడు.. నాదెళ్ల సత్య, మన దగ్గర చదువుకున్నాడు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడేవాడిని... వాళ్ల తండ్రి యుగంధర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండేవాడు. నా దగ్గర పని చేసేవాడు. ఆయన ఒకటే చెప్పాడు.. నేను ఫోన్ చేసి అభినందించాను. మీ అబ్బాయికి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చిందని. ఆయన చెప్పింది.. మామూలుగా అయితే ఐఏఎస్ ఆఫీసర్ గా వెళ్లేవాడు, మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు దానివల్ల  ఆ చదువు చదివాడు.. చదివిన తర్వాత మైక్రోసాఫ్ట్ కు వెళ్లాడు.. ఈరోజు మైక్రోసాఫ్ట్ పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు.' అని చెప్పుకొచ్చారు.)

మరి చంద్రబాబు నుంచి ఆయన స్ఫూర్తి పొందింది ఎక్కడ? ప్రపంచానికి నేనే ఐటీని నేర్పానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఇక యుగంధర్ గారు 86 నుంచి 88 వరకూ ఏపీలో పనిచేశారు. ఇక చంద్రబాబు 95లో సీఎం అయ్యారు. ఆయన దగ్గర యుగంధర్ గారు ఎప్పుడు పని చేశారు. చెప్పేందుకైనా నమ్మకశ్యం అయ్యే మాటలు మాట్లాడాలి.  బాబు పాలన సమయంలో హైదరాబాద్ కంటే బెంగళూరులోనే ఐటీ ఎక్కువగా అభివృద్ధి చెందింది. అందరూ నన్ను చూసే స్ఫూర్తి పొందారని చెప్పుకునే చంద్రబాబుకు...మరి అలా ఆదర్శంగా తీసుకున్నామని ఎవరూ ఎందుకు చెప్పలేదు.

సత్యా నాదెళ్ల కూడా చంద్రబాబు నుంచే స్ఫూర్తి పొందానని ఎప్పుడు చెప్పలేదు. అంతెందుకు ప్రపంచం అంతటికీ స్ఫూర్తిదాతగా నిలిచిన చంద్రబాబు నుంచి ..మరి ఆయన కుమారుడు లోకేష్ ఎందుకు ఇన్స్పైర్ అవలేదో తెలియదు. హైదరాబాద్ గురించి మాట్లాడితే నేనే కట్టానని గొప్పలు చెబుతారు. విశాఖలో కబడ్డీ మ్యాచ్కు వెళ్లి అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబుకు అర్థం అవుతుందా. చంద్రబాబు తక్షణమే సత్యా నాదెళ్లకు క్షమాపణ చెప్పాలి' అని బుగ్గన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement