కేంద్రం నుంచి అదనపు విద్యుత్‌కు కృషి | Additional Electricity from the center of effort | Sakshi
Sakshi News home page

కేంద్రం నుంచి అదనపు విద్యుత్‌కు కృషి

Apr 12 2015 1:03 AM | Updated on Sep 3 2017 12:10 AM

కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మరో 500 మెగావాట్ల అదనపు విద్యుత్ కేటాయించేలా కృషి చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

కేంద్రమంత్రి దత్తాత్రేయ
 
కుషాయిగూడ : కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మరో 500 మెగావాట్ల అదనపు విద్యుత్ కేటాయించేలా కృషి చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం చర్లపల్లిలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు ఆయన రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 24 గంటలు విద్యుత్ అందించే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తమ శాఖవద్ద నున్న 5 లక్షల 25 కోట్ల ఈపీఎఫ్ నిధుల్లోంచి ప్రతి కార్మికునికి గూడు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు దీటుగా మౌలాలి, చర్లపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.

రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ  ‘తెలంగాణాకు ఎవరితో పోటీలేదు..ప్రధాని మోదీ గతంలో పాలించిన గుజరాత్ రాష్ట్రంతోనే పోటీపడుతుంది.. ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్నా నాలుగు సంవత్సరాల్లో మొదటి స్థానానికి చేరుకుంటాం’ అని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు చర్లపల్లి నుంచి బోగారం వరకు రేడియల్ రోడ్డు  నిర్మాణానికి రూ:95 కోట్లు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మూడోదశ కృష్ణాజలాలు నగరవాసులకు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రాంచందర్‌రావు, ఐలా ప్రతినిధులు మనోహర్‌రాజు, కట్టంగూర్ హరీష్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు గణేష్ ముదిరాజ్, కాసుల సురేందర్‌గౌడ్, నర్సింగ్‌రావు, లక్ష్మణ్‌గౌడ్, నాధం, ఆనంద్‌గౌడ్, వెంకులు, రజనీకాంత్‌రెడ్డి, రాములు యాదవ్, కడియాల పోచయ్య, రుద్రగోని రాంచందర్‌గౌడ్, బొడిగె రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement