శంషాబాద్లో నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్ | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్

Published Tue, Oct 6 2015 2:10 PM

fake police gang arrested in shamshabad

శంషాబాద్: పోలీసుల వేషంలో రహదారుల్లో కాపుకాసి రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను శంషాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఏడుగురు సభ్యుల ముఠా గత కొంతకాలంగా పోలీసుల వేషంలో జాతీయ రహదారిలో కాపుకాసి వాహనాలను ఆపి, బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. గత నెల 28న హైదరాబాద్‌కు చెందిన ఒక రేషన్ డీలర్‌ నుంచి బలవంతంగా రూ.80 వేలు వసూలు చేశారు. అనుమానం వచ్చిన లారీ యజమాని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాదు.


నిఘా వేసిన పోలీసులు హైవేపే లారీలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులను మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఏడుగురి ముఠాలో ఇద్దరు జర్నలిస్టులు ఉండడం గమనార్హం. మాదిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, మాదిరెడ్డి రాజేందర్‌రెడ్డి ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరులుగా పనిచేస్తున్నారు.

వీరితో పాటు వెంకటరెడ్డి, గోవర్దన్‌రెడ్డి, శివకుమార్, శివకుమార్‌రెడ్డి, శ్రీనివాస్ ముఠాగా ఏర్పడి గత కొంత కాలంగా పోలీసుల వేషంలో దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. మంగళవారం ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుపడగా, జర్నలిస్ట్ మాదిరెడ్డి రాజందర్‌రెడ్డి పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వీరందరూ శంషాబాద్‌కు చెందినవారే.
 

Advertisement
Advertisement