టెన్త్ పరీక్షల టైంటేబుల్ జారీ | 10th time table relese | Sakshi
Sakshi News home page

టెన్త్ పరీక్షల టైంటేబుల్ జారీ

Dec 10 2015 4:25 AM | Updated on Oct 8 2018 7:35 PM

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 21వ తేదీ నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టైంటేబుల్ జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 21వ తేదీ నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టైంటేబుల్ జారీ చేసింది. ఈ షెడ్యూల్‌కు గతంలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదం తెలిపినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విద్యాశాఖ దాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం పంపింది. ఎట్టకేలకు ఈసీ నుంచి ఆమోదం లభించడంతో టైంటేబుల్‌ను ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. రెగ్యులర్ పదో తరగతి, ఓఎస్సెస్సీ(ఓరియంటల్ ఎస్సెస్సీ), వొకేషనల్ రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులకు (న్యూ సిలబస్) ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు.
 
 ద్వితీయ భాష పరీక్ష ఉదయం 9.30 నుంచి..
 ఈసారి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఉంటాయి. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుంది. ఇది ఒక పేపరే ఉంటుంది. మిగతా సబ్జెక్టులు రెండు పేపర్ల చొప్పున ఉంటాయి. ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయి. ఎస్సెస్సీ వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు ఉంటుంది. ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ పరీక్షలకు ఒకే సిలబస్, ఒకే ప్రశ్నపత్రాన్ని ఉపయోగిస్తారు. విద్యార్థులు తమ కోర్సుతో సంబంధం లేని ప్రశ్నలకు సమాధానమిస్తే వారి సమాధానాలను పరిగణనలోకి తీసుకోరు. సరైన ప్రశ్నపత్రాలను అడిగి తీసుకునే బాధ్యత వారిదే.


 

Advertisement
 
Advertisement
Advertisement