ఆకుపచ్చ సూర్యదయం | GGreen sunrise | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యదయం

Jul 9 2017 1:08 AM | Updated on Sep 5 2017 3:34 PM

ఆకుపచ్చ సూర్యదయం

ఆకుపచ్చ సూర్యదయం

గౌరవనీయ సభ్యులకు! ఫితూరీ నాయకుడు శ్రీరామరాజు గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో నిపుణుడు. మైదాన ప్రాంతంతో సంబం«ధం కలిగి ఉన్నాడు.

‘‘గౌరవనీయ సభ్యులకు! ఫితూరీ నాయకుడు శ్రీరామరాజు గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో నిపుణుడు. మైదాన ప్రాంతంతో సంబం«ధం కలిగి ఉన్నాడు. చింతపల్లి, మరో రెండు పోలీసు స్టేషన్ల మీద దాడులతో విశాఖ మన్యం తిరుగుబాటు ఆరంభమైంది. పోలీసులు ప్రతిఘటించలేకపోయారు. మద్రాసు జిల్లా పోలీసు యంత్రాంగంతో చర్చించి, మలబారు దళాలను పంపించాం. అవసరమైతే సైనిక వ్యవస్థ సేవలు తీసుకోవడానికి కూడా సంప్రదించాం. మోత పని కోసం గుర్రాలు పంపించాం. వైర్లెస్‌ సెట్లు కూడా వెళ్లాయి.

 పదిహేను మంది వరకు బ్రిటిష్‌ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. మద్రాస్‌ రెడ్‌క్రాస్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. హిజ్‌ ఎక్స్‌లెన్సీ గవర్నర్‌ అదనపు వ్యయం కోసం ఇరవై వేల రూపాయలు మంజూరు చేశారు.’’ అంటూ చాలా విషయాలు చెప్పాడు. చివరికి శ్రీరామరాజు ఉద్యమం గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సభ్యులకి సమాచారం ఇవ్వాలని అంతా కోరారు. సాధ్యమైనంత త్వరగా అణచివేయాలని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
2
అలా వచ్చి వయ్యారంగా వాలిందా పావురం, చిత్రాంగి భుజం మీద.‘‘ఎవరిదీ కపోతము?’’ ముచ్చటపడుతూ చెలికత్తెను ప్రశ్నించింది చిత్రాంగి. ‘‘ఇది... ఇది... యువరాజు సారంగధరుల వారి పావురము వలెనున్నది మహారాణి!’’ చెప్పింది చెలికత్తె. ఆ మాటతో చిత్రాంగి ఉబ్బితబ్బిబ్బయింది. ముందున్న హార్మోనిస్టుకు సైగ చేసి, పాట అందుకుంది. దానికి తగ్గట్టు నృత్యం కూడా చేస్తోంది. ‘‘పాపం! ఆ రోజుల్లో సమాచారం పంపాలంటే పావురాలే ఆధారం కాబోలు?!’’ అన్నాడు ఆ కానిస్టేబుల్‌ అక్కడే ఉన్న గొలుగొండ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ కందుకూరి నారాయణరావుతో.నర్సీపట్నం–కృష్ణదేవిపేట మార్గంలో ఉంది జోగంపేట.

రామరాజు దళం ఆ చుట్టుపక్కలే అనంతసాగరం, వెలగపాలెం, కొత్తమల్లంపేట వంటి చోట్ల తిరుగుతోందని తెలిసి పట్టుకోవడానికి బయలుదేరిన ప్రత్యేక పోలీసు బృందం కాళ్లు పీకి, నాటక ప్రదర్శన జరుగుతూ ఉంటే చతికిలపడింది. ఆ బృందానికి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నాడు. సారంగధర నాటకం. రామాలయం దగ్గరే వేదిక. చిత్రాంగి వేషం పురుషుడే కట్టినా లొట్టలు వేస్తూ చూస్తున్నారు పోలీసులు.‘‘తెల్లదొరలు రావడం కొంచెం ఆలస్యమైంది గానీ, లేకపోతే చిత్రాంగి కూడా సారంగధరుడితో ఫోన్‌లో మాట్లాడుకునేది.’’ అన్నాడు తనో కొత్త విషయం కనుక్కున్నట్టు ఆ కానిస్టేబుల్‌.‘‘సారంగధరుడంటే పదకొండో శతాబ్దం వాడు. అప్పటికి వాళ్లకి కూడా ఫోన్లు లేవు’’ అన్నాడు నారాయణరావు, ఆ కానిస్టేబుల్‌ అజ్ఞానాన్ని ఎద్దేవా చేస్తున్నట్టు.‘‘అలాగా! దొరగారూ! ఇంతకీ కృష్ణదేవిపేట–నర్సీపట్నం మధ్యన ఫోన్లు ఎప్పుడు మాట్లాడతాయి?’’ అడిగాడు, కానిస్టేబుల్‌. ‘‘ఎంతోకాలం పట్టదు. వైర్లు కూడా బిగించారు.’’ అన్నాడు నారాయణరావు. ‘‘ఇంక కృష్ణదేవిపేటకి కబురు తీసుకెళ్లాలంటే గుర్రాల మీద, సైకిళ్ల మీద, ఎడ్లబండి మీద పోనక్కరలేదయితే!’’ అడిగాడు కానిస్టేబులు.

సాంకేతిక పరిజ్ఞానం మీద వీడికి ఇప్పుడే ఉత్సుకత రేగాలా, నా ఖర్మ కాకపోతే అనుకుంటున్నాడు నారాయణరావు. కానీ టెలిఫోన్‌ తీగల వ్యవహారం అందరికీ ఆసక్తిగానే ఉంది. రామరాజు ఉద్యమం కాదుగానీ, చాలా కొత్త కొత్త షయాలు మన్యం దాకా వస్తున్నాయి.పందిట్లో ఒక మూలగా వేసి ఉంది కర్ర కుర్చీ. అందులో కూర్చుని ఉన్నాడు నారాయణ రావు. అతడి పక్కనే నిలబడి నాటకం చూడనివ్వకుండా విసిగిస్తున్నాడు కానిస్టేబుల్‌.‘‘రాత్రుళ్లు కూడా మాట్లాడుకోవచ్చా?’’ అడిగాడు కానిస్టేబుల్‌.‘‘రాత్రయితే ఏం?’’ విసుగ్గా అడిగాడు నారాయణరావు.‘‘తీగలు కనిపించవు కదా!’’ అన్నాడు కానిస్టేబుల్‌.‘మాకు బాగానే కనిపించాయి!’ లోపలే అనుకున్నాడు, గొంగళి కప్పుకుని ఈ ఇద్దరికి కాస్త సమీపంలో కూర్చుని నాటకం చూస్తున్న ఒక వ్యక్తి.

పగటివేళ మన్యమంటే మనోహర ప్రకృతి దృశ్యాల సజీవ చయనిక. కానీ ముసిరిన చీకట్లలో అదో బీభత్స హేల. కాటుక దిబ్బల్లా కనిపించే కొండల మీద తారకల మసక చీకట్ల ఆకాశం– దిగంతాలు కలసిపోయినట్టుంటుంది సుదూరంలో. ఆ చీకటిలోనే ఇంతసేపూ తిరిగి, ఇప్పుడే అక్కడికి వచ్చారు కొండదళం సభ్యులు. కృష్ణదేవిపేటలో మొదలు పెట్టారు, టెలిఫోన్‌ తీగలను గమనించడం. కొద్దిసేపటి క్రితమే జోగంపేట గ్రామ శివార్ల దాకా చూశారు వాటిని. ఊర్లోకి వచ్చి పోలీసులతో పాటే నాటకం చూస్తున్నారు హాయిగా.ఆ గొంగళి కప్పుకున్న వ్యక్తి గోకిరి ఎర్రేసు. అతడికి కొంచెం దూరంగా అలాగే గొంగళి కప్పుకుని కునికి పాట్లు పడుతూనే నాటకం చూస్తున్న మనిషి మల్లు. తల మీద నుంచి నల్లటి గొంగడి కప్పుకుని, ఒక ఇంటి అరుగు మీద నిలబడి కళ్లప్పగించి నాటకం చూస్తున్న మనిషి శ్రీరామరాజు. ఆ అంకం పూర్తయింది. వేదికకి అటూ ఇటూ వేలాడదీసిన పెట్రోమాక్స్‌ లైట్ల మీదకి వెదురు బుట్టలను దింపుతున్నారు నిర్వాహకులు.

వేదిక మీద చీకటి ఆవహిస్తోంది. నెమ్మదిగా దిగడం ఆరంభమైంది తెర. అప్పుడే ఎవరో గట్టిగా అరిచారు– ‘‘వందేమాతరం!’’ ప్రేక్షకులంతా లేచిపోయి ఒక్కసారిగా అరిచారు–‘‘మనదే రాజ్యం!’’ఆ వెంటనే మరో నినాదం –‘‘అల్లూరి శ్రీరామరాజుకీ!’’ ‘‘జై!’’ ఏమీ అర్థం కావడం లేదు పోలీసులకి. భయంతో అంతా అక్కడ నుంచి పారిపోయారు.ఏకాకిగా మిగిలిన కందుకూరి నారాయణరావు దగ్గరకి వచ్చి నమస్కరించాడు రామరాజు.ఇప్పుడు రామరాజు, ఆయన సహచరులందరి ఒంటి మీద ఖాకీ దుస్తులు లేవు. అంతా కోరా ఖద్దరు దుస్తులు ధరించి ఉన్నారు. పోలీసులు, ఉద్యమకారులు ఖాకీ దుస్తులే ధరించడం చాలామందికి మనస్కరించడం లేదు.

రామరాజు ఒంటి మీద కోరా చొక్కా, ఖద్దరు నిక్కరు ఉన్నాయి. ‘‘నమస్కారం రాజుగారు! చాలా రోజులైంది కలసి. మీరు ఇక్కడకి వస్తారని ఊహించలేదు. అంతా నాటకీయంగా ఉంది. సమయానికి కలుసుకున్నాం. ఒక ముఖ్య విషయం మీతో చెప్పాలని ఉంది. ఇటు వస్తారా?’’ అన్నాడు నారాయణరావు.ఇద్దరూ ఒక చెట్టు కిందకు వచ్చారు. వేదిక మీద తెర దించుతున్నారు నిర్వాహకులు.‘‘పాపం మా మూలంగా తెర చాలాసేపు దించవలసి వచ్చింది!’’ అన్నాడు రామరాజు.‘‘ఒకమాట చెబుతాను రాజుగారు! దొరతనానికీ మీకూ మధ్య జరుగుతున్న దోబూచులాటలకి కూడా తెర దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం పిడికిలి బిగించడం ఇక తప్పదు. అప్పుడు మాత్రం దెబ్బ తిన్న పులిలా పడతారు.’’ అన్నాడు నారాయణరావు.

‘‘మలబారు దళాల అండతోనా?’’ రామరాజు అన్నాడు.
‘‘మలబారు దండు ఎలాగూ తోడవుతుంది. దక్షిణ కమాండ్‌ నుంచి లూయీ ఫిరంగులు వచ్చి చేరాయి. వాటిని చూసుకునే, అణచివేతలో కొత్త అంకాన్ని ఆరంభించాలని నిర్ధారించుకుంది పోలీసు యంత్రాంగం. దానికి మించి, ఇప్పుడు మీరంటే కొత్త భయాలు మొదలైనాయి. రాజమండ్రి జైలు నుంచి నాగపూర్‌ తీసుకువెళుతుంటే గదర్‌ విప్లవకారుడు పృథ్వీసింగ్‌ ఆజాద్‌ రైలులో నుంచి దూకి తప్పించుకున్నాడు. అది పుండు మీద కారం రాసినట్టే ఉంది దొరతనానికి. ’’‘‘ఎప్పుడు తప్పించుకున్నారాయన?’’ అడిగాడు రామరాజు, ఆశ్చర్యపోతూ.‘‘నిన్ననే. 29వ తేదీ. వేగంగా పోతున్న రైల్లో నుంచే దూకేశాడటాయన. ఇవాళ మధ్యాహ్నమే మాకు తెలిసింది. అది కాదు అసలు వింత.  మిమ్మల్ని వెతుక్కుంటూ పృథ్వీసింగ్‌ నేరుగా విశాఖ మన్యానికే వస్తాడని గట్టి అనుమానం వీళ్లందరికీ! కొత్త అంకం బీభత్సరసంతోనే ఉండొచ్చు.’’ చెప్పాడు నారాయణరావు, కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ.
∙∙
తెల్లవారాక అ«ధికారులకి అసలు విషయం తెలిసింది.
రాత్రి కొండదళం కృష్ణదేవిపేట నుంచి  జోగంపేట శివార్ల వరకు ముప్పయ్‌ చోట్ల టెలిఫోన్‌ తీగలను కత్తిరించింది. ఆ ఊళ్లోనే భోజనాలు చేసింది. కొద్దిసేపు నాటకం కూడా చూసింది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కందుకూరి నారాయణరావు అంత మంది చూస్తుండగా రామరాజుతో మాటామంతీ జరిపాడు.అందుకే  వెంటనే ఆయన్ను సస్పెండ్‌ చేసేసి, కేసు నమోదు చేయించాడు హెపెల్‌ .
 3

అక్టోబర్‌ 12, 1922 నాటికి మలబారు దళాల రాక పూర్తయింది.పూనాలోని దక్షిణ కమాండ్‌ కార్యాలయం నుంచి రెండు లూయీస్‌ గన్‌లు కూడా వచ్చేశాయి.ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన బలమైన ఆయుధం – లూయీస్‌ గన్‌. అమెరికా వారు తయారు చేస్తే మొదటిసారి ఇంగ్లండ్‌ మహా యుద్ధంలో ప్రయోగించింది. లూయీస్‌ ఆటోమేటిక్‌ గన్‌ లేదా లూయీస్‌ ఆటోమేటిక్‌ రైఫిల్‌ అంటారు.  అక్టోబర్‌లో వచ్చిన పెను తుపానుతో అనారోగ్యం పాలైన పోలీసులు కూడా కోలుకున్నారు. రామరాజు జబ్బు పడి ఉన్నాడని మన్యంలో చెప్పుకుంటున్న తరుణం. అసలు కొండదళంలోనే చీలిక వచ్చిందని కూడా వినిపిస్తోంది. ఇలాంటి అదును కోసమే చూస్తోంది పోలీసు యంత్రాంగం. బ్రిటిష్‌ సామ్రాజ్యం తలుచుకుంటే ఎంతటి గాయం చేయగలదో చూపించాలని తహతహ లాడిపోతున్నది. ఆ రోజు డిసెంబర్‌ 6, 1922.శరభన్నపాలెంలో వెతికారు. అక్కడ నుంచి కొండ దరిన ఉన్న నిమ్మగడ్డలో గాలించారు.

అక్కడికి మైలు దూరంలోనే ఉంది పెద్దగడ్డపాలెం.ఈ కదలికలన్నీ గమనిస్తున్నారు ఇద్దరు కొండదళం సభ్యులు. జాన్, చార్‌స్లీ నాయకత్వంలో పెద్ద బలగమే గాలిస్తోంది.59 మంది మలబారు దళం సభ్యులు. అంటే రెండు పటాలాలు. కూడా మరో 20 మంది అధికారులు – దాదాపు 15 కంచర గాడిదలు, ఆహార పదార్థాలతో. ఏదో కీడు శంకిస్తూ, గడగడలాడిపోతోంది మన్యం. ఆ ఇద్దరు నిన్నటి నుంచి తమని అనుసరిస్తున్న సంగతి మొదట జాన్‌ కనిపెట్టేశాడు.ఈ ఉదయం ఆ ఇద్దరు దొరికిపోయేలా చిన్న పథకం వేశాడు.బలపరుపుగా ఉన్న ఒక రాయి మీద కూర్చోమన్నాడు చార్‌స్లీని, జాన్‌. వెనక జేబులో నుంచి ఒక కాగితం తీసి రాయి మీద పరిచాడు. పై జేబులో నుంచి ఒక పెన్సిల్‌ ముక్క తీసి ఊరికే పెదవులు కదుపుతూ గీయడం మొదలుపెట్టాడు. ఆ ఇద్దరు చూస్తూనే ఉన్నారు, దూరం నుంచి.ఏదో నిర్ధారించినట్టు చివాల్న లేచాడు జాన్‌. అతడి వెనకే లేచాడు చార్‌స్లీ. అక్కడ నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఆ కాగితం అక్కడ వదిలేశారు.

పావుగంట ఆగి, నెమ్మదిగా ఆ ఇద్దరు ఆ రాయి దగ్గరకే వచ్చి ఆ కాగితం తీసుకుపోయారు.రెండు బలమైన చేతులు ఇద్దరి మెడలని ఒక్కసారే పట్టేశాయి, పాము కప్పని పట్టినట్టు.ఒక జమేదారు, ఒక కానిస్టేబుల్‌. వాళ్లతో ఇంకో నలుగురు, లాఠీలతో. ముందే మాటేసి వచ్చి పట్టుకున్నారు. అక్కడే ఉంది ఒక చిన్న పశువుల కొట్టం. కన్నుమూసి తెరిచే లోగా అందులోకి చేర్చారు ఇద్దరినీ.ఇద్దరూ యువకులే. భయంతో వణికిపోతున్నారు. ‘‘ఎవర్రా మీరు?’’ చింతపల్లి పోలీసు పిడికిలి బిగిస్తూనే అడిగాడు.‘‘కొండోళ్లం దొరా!’’ అన్నాడొకడు. ఎప్పుడు పిడికిలి వాడి కడుపును తాకిందో, ఎప్పుడు కింద పడిపోయాడో తెలియదు.

ఆ సమాధానం ఇచ్చిన వాడు కింద పడి గిలగిలలాడుతున్నాడు.‘‘నువ్వు చెప్పరా? ఎవరు మీ ఇద్దరు?’’ మళ్లీ బిగుసుకుంటోంది పిడికిలి.‘‘నాకేం తెల్దు దొరా! నాకేం తెల్దు!’’ ఈసారి ముఖం పగిలిపోయేటట్టు కొట్టాడు చింతపల్లి పోలీసు, రెండోవాడిని.పెదవి పగిలి చివ్వున చిమ్మింది రక్తం. ‘‘చెప్పండి!’’ ఆ ఆరుగురు కలసి నరకం చూపిస్తున్నారు. అయినా నోరు విప్పడం లేదు.ఆ మొండి పట్టుదలతోనే పోలీసులకి రూఢీ అయింది.‘‘మీరు కొండదళంలో వాళ్లే. చెప్పండి! Æమరాజు ఎక్కడున్నాడు?’’ పళ్లు నూరుతూ అడిగాడు చింతపల్లి పోలీసు.మళ్లీ ఎముకలు విరిగేటట్టు గుద్దారు.‘‘మీరు ఇవాళ ఏదో ఒకటి చెబితేనే బతుకుతారు. లేకపోతే ఇక్కడే చస్తారు.’’ గంట తరువాత మాంసం ముద్దలైపోయారు ఆ కొండవాళ్లు ఇద్దరూ. మొత్తానికి చెప్పించాడు చింతపల్లి పోలీసు.

వెంట తెచ్చిన ఒక లూయీస్‌ గన్‌తో పెద్దగడ్డపాలెం వైపు ఉరికింది మలబార్‌ బలగం. ఒకచోట విశాలమైన వరిపొలాలు కనిపించాయి. మధ్య మధ్య చింతచెట్ల గుబుర్లు. తుపాకులు బారుపెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు డబ్బయ్‌ మంది.అన్ని వైపులా దృష్టి సారించుకుంటూ సాగుతున్నారు. బాగా పెరిగిన వరిపొలం గట్టున నడుస్తుంటే, చాటు నుంచి హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. ఆ వరిపొలంలో తుపాకులుపేలిన  వైపు పరుగులు తీశారంతా. అక్కడ ఎంత హఠాత్తుగా కాల్పులు మొదలైనాయో, అంత హఠాత్తుగానూ ఆగిపోయాయి కాల్పులు.వరిచేలకి ఒకవైపు ఉన్న కొండ మీద రహస్య స్థలాల నుంచి బయటపడి అక్కడ నుంచి కాల్పులు మొదలుపెట్టింది కొండదళం.

కానీ ఒక పక్క నుంచి జాన్‌ బృందం, మరో పక్క నుంచి చార్‌స్లీ దండు ఒక్కసారే కాల్పులు మొదలుపెట్టి కొండదళం అయోమయంలో పడిపోయేటట్టు చేశారు.ఆ అయోమయం నుంచి బయటపడి పోలీసు బలగాన్ని ఎదుర్కొనాలని మూడుసార్లు చేసిన ప్రయత్నం కూడా విఫలమైపోయింది. కొండ మీద ఉన్న ప్రధాన దళం మినహా, మిగిలిన వారంతా వరిచేలలో పాక్కుంటూ అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం ప్రారంభించారు. వరిచేల మీదుగా పారిపోవడం అంటే, పోలీసు బలగాల ఎదుటి నుంచి వెళ్లడమే. ఒక ఉద్యమకారుడు అక్కడికక్కడే కూలిపోయాడు.కొండదళాన్ని తరుముకుంటూ జాన్‌ బృందం వెళ్లింది. వరిచేలకి అవతలే కొద్దిదూరంలో మళ్లీ  జొన్నచేలు కనిపించాయి. మనిషి ఎత్తున ఉంది పైరు. అక్కడికి వెళ్లాక గాని రామరాజు సేనకు ఊపిరి తీసుకుని తిరిగి కాల్పులు జరపడానికి వీలుకాలేదు.

అప్పుడే లూయీస్‌ గన్‌ ప్రయోగించడం మొదలుపెట్టాడు జాన్‌. కొండదళం తట్టుకోలేక నిష్క్రమించక తప్పలేదు. గుళ్లని వర్షిస్తోంది అది.మరో ఇద్దరు కొండదళం సభ్యులు పడిపోయారు. వాళ్లలో హాహాకారాలు. ఇవతల పక్క జమేదార్‌ కేశవనాయర్‌ కడుపు మీద తూటా తగిలి బలమైన గాయమైంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏడుపులు పెడబొబ్బలతో చేతి కందిన సామాను తీసుకుని ఇళ్ల నుంచి కట్టుబట్టలతో ఎవరికి తోచిన దిక్కుకు వారు పరుగెడుతున్నారు. వరసగా గ్రామాలన్నింటికీ చేరుతోంది సమాచారం. తల్లడిల్లిపోతున్నారు కొండప్రజలు. కొండ కనుమలలో గాలిస్తున్న స్వెయిన్‌ బలగాలకి కూడా పెద్దగడ్డపాలెం కాల్పుల గురించి తెలిసింది.

47 మంది నాన్‌ కమిషన్డ్‌ అధికారులు, ఇంకో పటాలం మలబారు దళం, కీనే, సుబేదార్‌ ఫణిక్కర్, పరమేశ్వరన్‌ నాయర్‌ అనే మరో మలబార్‌ దళం అధికారి హుటాహుటిన ట్రక్కులలో అక్కడకి చేరిపోయారు. అంతా కలసి కొండదళాన్ని తరుముకుంటూ వెళ్లారు.కొంతదూరం వచ్చేసరికి మళ్లీ ఎవరూ కనిపించలేదు. సాయంత్రం అవుతోంది. అయినా వెనుదిరగకుండా గాలిస్తూనే ఉన్నారు. ‘‘ఇక్కడే ఉంటారు. ఇవాళ వదిలే ప్రశ్నే లేదు.’’ జాన్‌ శపథం చేస్తున్నట్టే అన్నాడు.అప్పుడే అటుగా వచ్చారు ఒక గిరిజన కుటుంబం. ఈ కాల్పులకు భయపడే సామాను పట్టుకుని ఎటో పోతున్నారు.వాళ్లని కొట్టినంత పనిచేస్తే కొందరు విల్లమ్ములతో లింగాపురం వైపు వెళుతూ కనిపించారని చెప్పారు.

పెద్దగడ్డపాలానికి అయిదు మైళ్ల దూరంలోనే ఉంది లింగాపురం. అక్కడే పెద్ద వాగు కనిపించింది. జాన్, చార్‌స్లీ అలసటతో దాని గట్టున కూలబడ్డారు. బలగాలు చుట్టూ వెతుకుతూనే ఉన్నాయి. చీకట్లు పడిపోతున్నాయి. బ్యాటరీ లైట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అప్పుడే ఎలా వచ్చిందో ఆ ఆలోచన, స్వెయిన్‌కి. ఆ వాగులోనే దిగి, వాయువ్యంగా అలాగే శబ్దం కాకుండా నెమ్మదిగా నీళ్లలో నడిచాడు. ఆ వెనకే సుబేదార్‌ ఫణిక్కర్‌. ఇద్దరూ గన్‌లు గురిపెట్టి నడుస్తున్నారు.తన కళ్లని తనే నమ్మలేకపోయాడు స్వెయిన్‌.  అక్కడే ఉంది కొండదళం స్థావరం. ఒక్క క్షణం పరికించాడు. ఒక పక్క ఎవరో కొందరు వంటలు చేస్తున్నారు.

కొందరు తూటాలు తగిలిన వాళ్లకి ఏవో ఆకులు వేసి కట్లు కడుతున్నారు. రెండు నెగళ్లు వేసి ఉన్నాయి అప్పటికే. వాటి వెలుగులో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే రెండు కడవలు తీసుకుని అటు వచ్చారు ఇద్దరు. ఆ ఇద్దరిని వెనుక నుంచి పీకలు పట్టుకుని చాలాదూరం వెనక్కి లాక్కుపోయారు ఇద్దరు పోలీసులు. అంతలోనే ఒకడు తప్పించుకున్నాడు. ఒక్క ఉదుటన దూకాడు. కానీ గురి తప్పింది. ఫణిక్కర్‌ తుపాకీ అడ్డం పెట్టాడు. దాని బాయ్‌నెట్‌ మీద పడిపోయాడు. కడుపు చీరుకుపోయింది. కొద్దిసేపటికే చనిపోయాడు. అతడు శరభన్న పడాలు. వెనక్కి వచ్చిన స్వెయిన్‌ సంగతి చెప్పి, మలబారు దళాలను మూడు భాగాలు చేశాడు. ఒక విభాగం నీటిలో నుంచే వెళ్లింది. రెండో విభాగం వెనుక పక్కకు వెళ్లి మాటు వేసింది. మరొకటి ముందుకు వెళ్లింది.

పగలంతా యుద్ధం. తిండి లేదు. అంతా డస్సిపోయి ఉన్నారు కొండదళంలో.అప్పుడు రెండు విభాగాలు ఒక్కసారిగా విరుచుకుపడి కాల్పులు ప్రారంభించాయి. అయినా కొందరు వీరోచితంగా ఎదురొడ్డి పోరాడారు. కాల్పులు జరిపారు. కానీ ఎదుర్కొనడం సాధ్యం కాలేదు. అక్కడే ఉన్న కొండగుహలోకి పారిపోయారంతా. నిజానికి అసలు స్థావరం అదే.రామరాజు కోసం, ఇతర నాయకుల కోసం అక్కడ పక్కలు కూడా వేసి ఉన్నాయి. రామరాజు అక్కడే ఉండి, గాయపడిన వాళ్లకి ఏవో లేపనాలు పూస్తున్నాడు కాగడాల వెలుగులో.ఆ పక్కల మీద ఎవరో ఉన్నారని కాల్పులు సాగించారు. నిజానికి రామరాజు పడుకునే పరుపు మీద కూడా కాల్పులు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement