ఆకుపచ్చ సూర్యదయం | Green sunlight | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యదయం

Jul 2 2017 12:47 AM | Updated on Sep 5 2017 2:57 PM

ఆకుపచ్చ సూర్యదయం

ఆకుపచ్చ సూర్యదయం

ఔను. వచ్చాడు. మీరు వస్తున్నారని పదిహేను రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా నిన్ననే పటాలంతో దిగాడు.

‘‘ఔను. వచ్చాడు. మీరు వస్తున్నారని పదిహేను రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా నిన్ననే పటాలంతో దిగాడు. ఎంత నవ్వొచ్చే సంగతంటే– రిజర్వు దళాల చేత తాలూకా ఆఫీసులో ఫైళ్లన్నీ సర్దించి, వాటిని రాజమండ్రి పంపారు. పోలీస్‌ స్టేషన్‌లో ఆయుధాలు ఖాళీ చేయించి ఎక్కడికో పట్టుకెళ్లారు. రాక ఏం చేస్తాడు? మిమ్మల్ని సజీవంగా పట్టుకోమని కలెక్టరు దొర వారి ఆదేశం మరి!’’ చెప్పాడు పంతులు.‘‘నేను ఇక్కడ ఉన్నట్టు, మీరూ వచ్చినట్టు ఈపాటికి తెలిసి ఉండాలి. రాడేం?’’ ప్రశ్నించాడు రామరాజు.‘‘అతడు వచ్చింది మిమ్మల్ని అరెస్టు చేయడానికి కాదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రభుత్వం భయపెడుతున్నట్టు, వెంటాడుతున్నట్టు  ప్రజల్లో ఒక భావన, భయం పెంచడానికే వచ్చాడు.’’ అన్నాడు పంతులు.‘‘అంటే ఈ సాచివేత, ఈ వెనకడుగు ఒక వ్యూహమేనంటారు!’’ ఒక్క నిమిషం మౌనం తరువాత అన్నాడు రామరాజు.

‘‘సరిగ్గా గ్రహించారు. రామరాజుగారూ! నేనొకటి అడగనా? ఈ ప్రయాణం ఎక్కడికి? రాజ్యాన్ని స్థాపిస్తామని చెబుతున్నారని విన్నాను. అది సాధ్యమా?’’ సూటిగా అడిగాడు పంతులు.
‘‘నేను ఈ కొండలలో రాజ్యాన్ని నిర్మిస్తానా? భారతదేశమే స్వతంత్రం కావాలని అనుకుంటున్నానా? వీటికి సమీప భవిష్యత్తులోనే సమాధానాలు దొరుకుతాయి. ఒకటి మాత్రం చెబుతాను. ఈ దేశంలో పుట్టిన ఎవరికైనా  మాతృభూమికి స్వేచ్ఛ కల్పించాలన్నæ ఆశయం ఉండవచ్చు. ఉండాలి కూడా. ’’ కొంచెం ఆవేశంగానే చెప్పాడు రామరాజు. ‘‘గాంధీగారి పోరాటం మాటేమిటి?’’ అడిగాడు పంతులు.‘‘ఆయన పోరాటం మాటేమో గానీ, ఆయన వ్యక్తిత్వం ఆదర్శనీయం. నేను సాయుధ పోరాటం ద్వారానే మన దేశానికి స్వరాజ్యం వస్తుందనే నమ్ముతున్నాను. అహింస అంటే పోలీసుల లాఠీలకి, తుపాకులకి అమాయక ప్రజలని అప్పగించడం మాత్రం కాదు.’’ అన్నాడు రామరాజు. తను తెచ్చిన సంచిలో నుంచి అరటిపళ్లు తీసి రామరాజు చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించి అన్నాడు పంతులు, ‘‘మరి సెలవా!’’

‘‘ఏదీ చెప్పకుండానే!’’ అన్నాడు రామరాజు వాటిని అందుకుంటూ, ఎంతో ఆశ్చర్యంగా.  ‘‘ధర్మబద్ధమైన మీ వాదన ఏమిటో తెలుసు. వాళ్ల పశుత్వం గురించీ తెలుసు. మీకేదో హితబోధ చేయాలని పశుత్వానికి ప్రతినిధిగా నేను రాలేదు రామరాజుగారూ!  మీ దర్శనం కోసం వచ్చాను. వెళుతున్నాను.’’ అన్నాడు పంతులు. అరటిపళ్లు ఎర్రేసు చేతికి ఇచ్చి పంతులును గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రామరాజు. ‘‘మిమ్మల్ని కలవడం నాకూ ఆనందమే. సాయంత్రం నాలుగు గంటలకి పోలీసు స్టేషన్‌కు వెళతాను. ఒకవేళ కలెక్టర్‌ అడిగితే ఇదే నా మాటగా  చెప్పండి .’’సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల వేళ.

త్రివర్ణ పతాకధారి ముందు నడుస్తూ ఉండగా  పోలీసు స్టేషన్‌ ముందుకు వచ్చింది రామరాజు దళం. అక్కడే నిలబడి తుపాకులు పేల్చింది, తమ రాకను తెలియచేస్తూ.స్టేషన్‌కు కొద్దిదూరంలోనే ఉన్న జాన్, అతడి సాయుధ పోలీసులు అటు నుంచి అటే జారుకున్నారు. స్టేషన్‌లో వెతకనవసరం లేదని కొండదళానికి తెలుసు. అప్పటిదాకా లోపల ఉన్న సబ్‌ మేజిస్ట్రేట్, సబ్‌ఇన్స్‌పెక్టర్, మఫ్టీలో ఉన్న ఐదుగురు కానిస్టేబుళ్లు వినయంగా బయటకు వచ్చారు. నమస్కరించి మౌనంగా వెళ్లిపోయారు.ఐదుగంటలకి ఊరిలో డబ్బాల మెట్ట దగ్గరకి వచ్చాక మళ్లీ తుపాకులు పేల్చారు ఉద్యమకారులు.మునసబు, తాలూకా ఆఫీసులో ఒక గుమాస్తా, గ్రామపెద్దలు స్వాగతం పలికారు. అంతా కలపి నలభై మంది.

‘‘రంపచోడవరం జనాభా ఇంతేనా?’’ నవ్వుతూ అడిగాడు రామరాజు మునసబుని.‘‘ఏం చెప్పమంటారు? కాల్పులకి భయపడి వెళ్లిపోయారు’’ తాలూకా ఆఫీసు గుమాస్తా అన్నాడు.‘‘మునసబుగారూ! అందరినీ పిలిపించండి! నేను ఇక్కడే ఉంటాను.’’ చెప్పాడు రామరాజు.వెంటనే టముకు వేయించాడు మునసబు. సంత జరిగే చోటుకు వచ్చి రామరాజు గారు చెప్పేది వినవలసిందని బారిక టముకు వేశాడు. అంత వరకు రామరాజు, ఆయన బృందం  ట్రావెలర్స్‌ బంగ్లా ఆవరణలో ఒక చెట్టుకింద ఉన్నారు. గంతన్నదొర, శరభయ్యదొర రామరాజు పక్కనే తుపాకులు పట్టుకుని నిలబడ్డారు. చిత్రంగా గంటలోనే దాదాపు ఎనిమిదివందల మంది వచ్చి చేరారు. ఖాకీ నిక్కరు, ఎర్ర ఖద్దరు చొక్కాలో రామరాజును చూశారు. భయమంతా పటాపంచలైపోతోంది. దగ్గరగా వచ్చి నమస్కారం చేస్తున్నారంతా. ఎవరో మరి, ఒక ఆవునే అక్కడికి తోలుకు వచ్చాడు. కూడా తెచ్చిన చెంబులోకి కొంచెం పాలు పిండి భక్తిగా రామరాజుకి అందించాడతడు. ఉద్యమకారులకి మునసబు భోజనాలు పెట్టించాడు.
సభ ఆరంభమైంది.

క్లుప్తంగా ప్రసంగించాడు రామరాజు. హత్తుకునే విధంగా చెప్పాడా నాలుగు మాటలు.
‘‘ప్రజలు భయపడే పని, ఆశయం తల దించుకునే పని ఎక్కడైనా కొండదళం చేసినట్టు మీ దృష్టికి వచ్చిందా? చెప్పండి! ఇది ఫితూరీ కాదు సోదరులారా! స్వాతంత్య్రోద్యమం. ఈ పోరాటం ప్రజల మీద కాదు. ప్రజల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం ఈ తెల్ల ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం. కొండదళం మిమ్మల్ని దోచుకోదు. గుండెల్లో దాచుకుంటుంది. మేం మీ సోదరులం. మనమంతా ఒకేజాతి వాళ్లం.’’ అంతా జేజేలు పలికారు. పది గంటలకి సభ అయిపోయింది. అందరినీ ఇళ్లకి వెళ్లమన్నాడు రామరాజు.రాత్రి ఉద్యమకారులంతా ట్రావెలర్స్‌ బంగ్లాలో బస చేశారు.
తెల్లవారే సరికి ఎవరూ అక్కడ కనిపించలేదు.

 5
‘‘మొన్న రామవరం దగ్గర గాయపడ్డాడు ఒక పోలీసు. అతని బెడ్‌ ఎక్కడ?’’ ఎదురుగా వస్తున్న డాక్టర్‌ని అడిగాడు స్టీవర్ట్‌. ‘‘ఆ రెండో వార్డులో పదో నెంబరు’’ చెప్పాడు డాక్టరు. నిన్న మొన్నటి దాకా అది నర్సీపట్నం లోకల్‌ ఫండ్‌ హాస్పిటల్‌. ఇప్పుడు బేస్‌ హాస్పిటల్‌. 50 పడకల క్లియరింగ్‌ ఆస్పత్రి కూడా. దామనపల్లి ఘటన తరువాత ఆగమేఘాల మీద సిద్ధమైంది. స్టీవర్ట్‌కి పక్కనే నడుస్తున్న సాండర్స్‌ ఇంకా అవమానభారం నుంచి కోలుకోలేదనిపిస్తోంది. రామవరంలో శ్రీరామరాజు దళం మీద దాడి చేయబోయి భంగపడ్డాడు. ఈ పదో నెంబరు బెడ్‌ పోలీసు అప్పుడు గాయపడిన వాళ్లలో ఒకడు. అతడిని చూడ్డానికే సాండర్స్‌ వస్తే, మరెవరినో చూడడానికి వచ్చి కలిశాడు స్టీవర్ట్‌.‘‘మలబారు దళాలు వచ్చేదాకా చొరవ తీసుకోవద్దని చెప్పారు కదా! ఎందుకు ఆ హైరానా?’’ సూటిగానే అడిగాడు స్టీవర్ట్‌.‘‘అడ్డతీగెల, రంపచోడవరం పోలీసు స్టేషన్లని చెప్పి మరీ కొట్టారు కొండవాళ్లు. ఈసారైనా నిరోధిద్దామని వెళ్లాను.’’ అన్నాడు సాండర్స్‌. ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ అతడు. వైద్య సౌకర్యాలను కొన్ని రెట్లు పెంచారు. పోలీసు బలగాలకే కాదు, వైద్య కేంద్రంగా కూడా మారింది నర్సీపట్నం. పన్నెండు మంది సబ్‌ సర్జన్లను నియమించారు.

నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్‌ దాకా తీసుకువెళ్లడానికి ఒక ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే అటు రాజమండ్రి, కాకినాడ, లేదా ఇటు  విశాఖపట్నం తీసుకెళ్లడానికి వీలుగా రైళ్లకు అందించడానికి ఆ ఏర్పాటు జరిగింది. కలకత్తా నుంచి వచ్చేవీ, కలకత్తా వెళ్లేవీ ప్రధాన రైలు బళ్లన్నీ ఉద్యమం జరుగుతున్నంత కాలం నర్సీపట్నం రోడ్డు స్టేషన్‌లో ఆపే ఏర్పాటు కూడా చేశారు. కృష్ణదేవిపేట (పద్నాలుగు పడకలు), లంబసింగిల (నాలుగు పడకలు)లో అంబులెన్సులతో సహా ప్రాథమిక చికి త్సా కేంద్రాలు వెలిశాయి. బెడ్‌ మీద నిద్రపోతున్నాడు కానిస్టేబుల్‌. పేరు –అడ్డాల సుబ్బారావు. నిడదవోలు.లేపడం ఇష్టం లేక మళ్లీ ఇద్దరూ డీఎస్‌పీ కార్యాలయం దగ్గరకి బయలుదేరారు.రామవరం దాడిని మరచిపోలేకపోతున్నాడు సాండర్స్‌. అందుకే అధికారులకి రాసిన నివేదికలో నిర్మొహమాటంగా అంగీకరించాడు. అప్పుడు రాసిన మాటే అందుకు నిదర్శనం–‘ఐ వాక్డ్‌ ఇన్‌గ్లోరియస్‌లీ హోమ్‌’ (నేను అవమానకరంగా ఇంటి ముఖం పట్టాను).

 6
బారిక మోగిస్తున్న డప్పు గంగరాజు మాడుగుల అంతా వినిపిస్తోంది. ఊళ్లో చాలామంది చావడి దగ్గరికి వచ్చారు. వాళ్లలో  డొలవుడు కూడా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఏం జరిగినా గంతన్నకు సమాచారం చేరవేస్తుంటాడు.  ‘‘గూడెం, పాడవ తాలూకాల మొదలు,  మైదానాలలో మాడుగుల దాకా నివసించి ఉన్న ప్రభుత్వ విధేయులు, ప్రజలకు తెలియచేయునది ఏమనగా!‘‘తుపాకులు, పిస్తోళ్లు, తుపాకీల కత్తులు, పట్టాకత్తులు మొదలైనవి కలిగి ఉన్నవారు, వాటిని వెంటనే కృష్ణదేవిపేట, చింతపల్లి, పాడేరు పోలీసు స్టేషన్లలో– ఏదో ఒకచోట– అప్పగించాలని పోలీసువారు ఆదేశిస్తున్నారు. ఆయుధాలు తీసుకువెళుతున్న వారంతా ఫితూరీకి చెందినవారని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించవచ్చు. కాల్చి చంపవచ్చు.  త్వరలో మలబారు ప్రత్యేక పోలీసులు వస్తున్నారు కాబట్టి ఆయుధాలు అప్పగించే పని వెంటనే పూర్తి చేయవలసిందని పోలీసు వారు ఆదేశిస్తున్నారు.

‘‘మలబారు పోలీసులు చాలా కఠినంగా ఉంటారనీ, ప్రతి ఇల్లు తనిఖీ చేస్తారనీ కూడా పోలీసువారు హెచ్చరించడమైనది.’’ అర్ధరాత్రి దాటుతుండగా నెమ్మదిగా వచ్చి తన ఇంటి అరుగు మీద కూర్చున్నాడు డొలవుడు. వెన్నెల రోజులు. కొంచెం చలిగా ఉంది. ఇంటి లోపలికి వెళ్లాలంటే, పోలీసులు ఇల్లు చుట్టుముడతారేమోనని భయం. ఒక్కసారి గట్టిగా గాలి వీచింది. చేను మధ్యలో ఉన్న వెదురుపొద బొంగులు ఒరుసుకుంటూ శబ్దం చేస్తున్నాయి. ఆ గుబురు ఇప్పుడు కొంచెం పలచబడింది. కొద్దిరోజుల క్రితం డొలవుడే కొన్ని బొంగులు నరికేశాడు. వాటి మధ్య నుంచి కొంచెం దూరంలోనే  కనిపిస్తోంది ఒంటరి వెట్టి బంగ్లా. కొండవాళ్ల చేత వెట్టి చేయించి కట్టారెప్పుడో.

అలసటగా ఉంది. అరుగు మీదే కునికిపాట్లు పడుతూ గడుపుతున్నాడు.అప్పుడే దూరంగా కోలాహలం, హఠాత్తుగా. తెలివి తెచ్చుకుని చుట్టూ చూశాడు డొలవుడు. కొండదారి వెంటే గ్రామంలోకి దిగుతోంది మలబారు దండు. వాన పడేటట్టుంది.సందేహం లేదు. ఆ పెట్రోమాక్స్‌ లైట్లు, రెండు మూడు బ్యాటరీ లైట్లు అవన్నీ దండుకు సంబంధించినవే. గ్రామంలోకే వస్తున్నారు. ఒక్కసారిగా బిక్క చచ్చిపోయాడు. అదిగో, దండు తన ఇంటివైపే వస్తోంది. మెదడు మొద్దుబారిపోతోంది. ఇప్పుడు ఆ పెట్రోమాక్స్‌ లైట్లు, బ్యాటరీ లైట్లు మరింత కాంతిమంతంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విన్న చాటింపే చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి నిలబడ్డాడు డొలవుడు.

ఎండిన ఆ చేనుకు అడ్డంబడి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ వెదురుపొద దగ్గరగా వెళ్లాడు. వరసగా  నరికిన వెదురు బొంగులు– శూలాల్లాగ. పోలీసులు ఇంకా దగ్గరగా వచ్చారనిపించింది. ఆకాశం కేసి చూశాడు ఆందోళనగా. చినుకులు పెద్దవవుతున్నాయి. గ్రామదేవతని è లుచుకున్నాడు భక్తిగా. మొలతాడులో నుంచి గోచీ వెనక భాగం కిందకి లాగేశాడు.మోకాళ్ల ఎత్తు వరకు ఉన్న శూలం లాంటి బొంగుకి అటు ఇటు కాళ్లు వేసి నిలబడ్డాడు. పిరుదులు ఎడం చేసి, గుదాన్ని ఆ వెదరుబొంగు కొస మీద ఆన్చాడతడు.అంతే, కాళ్లు రెండు ఒక్కసారిగా పైకి ఎత్తేశాడు. అడవి ఉలిక్కిపడినంత హృదయ విదారకమైన కేక. కొన్ని నిమిషాలలోనే దూరంగా మెరుపు.. వెట్టి బంగ్లాను వెతుక్కుంటూ వచ్చిన మలబారు దండు సరిగ్గా వర్షం మొదలయ్యే సరికి లోపలికి దూరిపోయారు.  

‘‘అమ్మయ్య! ఇది ఇక్కడ ఉండడం బాగా పనికొచ్చింది!’’కురిసి కురిసి వర్షం ఎప్పుడో వెలిసిపోయింది. తెల్లవారి వెలు వచ్చింది. ఆ దారిన పోతూ ఎవరో చూశారు– ఆ దృశ్యాన్ని.వెదురుపొద ఉన్న ఆ చిన్న దిబ్బ నెత్తుటి పూత పూసుకుని ఎర్రబడింది. మొలతాడు నుంచి వేలాడుతోంది గోచీ– రక్తంలో సగం తడిసిన తెల్లజెండాలా. పళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది నాలుక. తను పుట్టిన కాలానికి ఎంత క్రౌర్యం ఉందో దర్శించి విచలితమైపోయినట్టున్నాయి, ఉబికి వచ్చిన కనుగుడ్లు.డొలవుడు కొర్రు దిగి చచ్చిపోయాడు. భయం... భయానికి తట్టుకోలేక కొర్రు దిగి చనిపోయాడు.
∙∙
‘మన్యాన్ని ఇంత భయపెట్టినవాళ్లం! మమ్మల్ని ఇప్పుడు ఇంత భయం ఎందుకు ఆవహించింది?’ ఒక్కసారిగా ప్రశ్నించుకున్నాడు ఫర్బీస్‌. రామరాజును కృష్ణదేవిపేటకు చేర్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ భయం పెరిగిపోతోంది.  ఈ రెండేళ్ల యుద్ధంలో ఎట్టకేలకు తాము గెలిచినట్టు సంకేతాలు కచ్చితంగా కనిపిస్తున్నా భయంగానే ఉంది. ఇన్నాళ్లూ మేం భయపెట్టాం. గెలిచినా భయపడుతున్నాం. ఇదేమిటో? అనుకున్నాడు ఫర్బీస్‌. అరెస్టయి వచ్చిన రామరాజుని స్పెషల్‌ కమిషనర్‌ ఎక్కడికి తీసుకువెళతాడు?
పదవ అధ్యాయం
1    
                                                  
‘‘అధ్యక్షా!
ప్రశ్న ఒకటి:  విశాఖ మన్యంలో తిరుగుబాటును ప్రబోధిస్తున్న సహాయ నిరాకరణవాదిని పోలీసు బందోబస్తుతో ఒక సబ్‌ఇన్స్‌పెక్టర్‌ ఏజెన్సీ డివిజన్‌ నుంచి పంపించారా, లేదా?’’
చెన్నపట్నంలో ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో కౌన్సిల్‌ చాంబర్స్‌ భవనం. నవంబర్‌ 13, 1922.
లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో శశిభూషణ్‌ ర థ్‌ లేచి ప్రశ్నలు సంధించడం ఆరంభించారు. విషయం విశాఖ మన్యంలో శ్రీరామరాజు పోరాటం. సభలో ఒక్కసారిగా అలజడి రేగింది.
 ముఖ్యమంత్రి పానగల్లు రాజా రామరాయణింగార్‌ సభలోనే ఉన్నారు. తలపాగాతో, లాంగ్‌కోటు, పైజమాతో ఒక రాజులాగే ఉన్నారు.

మంత్రులు కూర్మా వెంకటరెడ్డినాయుడు, అన్నెపు పరశురామపాత్రో కూడా దగ్గరదగ్గరగా అలాంటి వేషధారణలోనే ఉన్నారు. అగరం సుబ్బరాయలురెడ్డియార్‌ తప్పుకోవడంతో మంత్రిగా అవకాశం పొందినవాడే ఏపీ పాత్రో. అంటే అన్నెపు పరుశురామపాత్రో. నేరుగా ఎన్నికైన సభ్యులు, ప్రభుత్వం నియమించిన సభ్యులు అంతా తలపాగాలతో, లాంగ్‌కోట్లతో ఉన్నారు. కౌన్సిల్‌ అధ్యక్షుడు లేదా స్పీకర్‌ దివాన్‌ బహదూర్‌ పెరుంగ్‌వూర్‌ రాజగోపాల ఆచారియర్, కేసీఎస్‌ఐ; సీఐయీ. గతంలో మద్రాసు ప్రెసిడెన్సీ న్యాయశాఖలో పనిచేసిన ఆచార్య స్వతంత్ర సభ్యుడు.

దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు సర్‌ లయోనిల్‌ డేవిడ్సన్, ఆర్థిక విభాగం సభ్యుడు సర్‌ చార్లెస్‌ థోడ్‌హంటర్, రెవెన్యూ విభాగం సభ్యుడు మహమ్మద్‌ హబీబుల్లా, న్యాయ వ్యవహారాల విభాగం సభ్యుడు ఎస్‌. శ్రీనివాస అయ్యంగార్‌ కూడా సభలోనే ఉన్నారు. ప్రభుత్వానికి చెందిన వారంతా సూటూ బూటూతో ఉన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికై వచ్చిన సభ్యులను చూస్తుంటే కృష్ణదేవరాయల సభను చూస్తున్నట్టే ఉంది.రథ్‌ ప్రశ్నతో అంతా ఒక్కసారిగా తమ తమ స్థానాలలోనే నిటారుగా అయ్యారు. మద్రాసు మొదలు విజయనగరం వరకు పత్రికలలో నాలుగైదు నెలలుగా విశాఖ మన్యం అలజడుల వార్తలు హోరెత్తుతున్నాయి. సరిగ్గా అదే విషయం సభలో లేవదీశాడు రథ్‌. నలభై ఏళ్ల రథ్‌ మంచి వక్త.

‘‘ప్రశ్న రెండు:  ఆ సహాయ నిరాకరణవాది వ్యవహారం పరిశీలించిన పౌర అధికారే మళ్లీ ఆ సహాయ నిరాకరణవాది మన్యంలో ప్రవేశించడానికి అనుమతించాడా? అలాగే ఆ సహాయ నిరాకరణవాది విషయంలో హద్దులు మీరుతున్నావంటూ పోలీసులను ఆ పౌర అధికారి నోరు పారేసుకున్నాడా? ‘‘ప్రశ్న మూడు: అల్లూరి శ్రీరామరాజు అనే ఆ సహాయనిరాకరణవాది మన్యానికి స్వతంత్ర అధినేత కావాలని కోరుకుంటున్నాడా? ‘‘ప్రశ్న నాలుగు: రంప ఏజెన్సీలో ఇంతకు ముందు కూడా ఇలాంటి తిరుగుబాట్లు జరిగాయి. అందుకు కారణాలు ఏమిటి? ‘‘ప్రశ్న ఐదు: ప్రస్తుత తిరుగుబాటును అణచడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అసలు ఈ తిరుగుబాటు తలెత్తడానికి కారణాలు ఏమిటో కూడా ఈ ప్రభుత్వం సభ్యులకు తెలియ చేయాలని కోరుతున్నాను.’’

రథ్‌ గంజాం జిల్లా వాడు. మంచి సాహిత్యవేత్త. న్యూ ఒరిస్సా అనే పత్రికతో పాటు, సత్యవాది, ప్రదీప అనే రెండు సాహిత్య పత్రికలు కూడా నడుపుతున్నాడు. ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రం కోసం పాటు పడుతున్నాడు.127 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్‌లో 63 మంది జస్టిస్‌ పార్టీ సభ్యులే. ముఖ్యమంత్రి పానగల్లు రాజా కూడా ఆ పార్టీ వాడే. సహాయ నికారణోద్యమం చేస్తోంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్‌ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. అందుకే బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం గురించి ఏ ప్రశ్న వచ్చినా దాని మీద చర్చ అంటే –  అణచడం గురించి సూచనలు తీసుకోవడమే. దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కల్నల్‌ నాఫ్‌ సహా, అధికారులు ఎవరూ పెద్దగా స్పందించలేదు.

కానీ ర థ్‌ ప్రశ్నలకు ముందే విశాఖ మన్యంలో జరుగుతున్న ఆందోళనను అదుపు చేయడానికి మరోసారి 66,800 రూపాయలు మంజూరు చేయమని సభను అభ్యర్థిస్తూ నాఫ్‌ ఒక ప్రతిపాదన చేశాడు. అందుకు సభ మారుమాట్లాడకుండా ఆమోదించింది కూడా. విశాఖ మన్యంలో అలజడుల అణచివేతకే అదనంగా మరో లక్ష రూపాయల నిధి కోసం కూడా ప్రతిపాదన సభ ముందు ఉంది. సభాపతి ఆదేశం మేరకు దీనికి సమాధానం చెబుతూ ఈ విషయాలు ప్రభుత్వం వెల్లడించింది. అంటే నాఫ్‌ ప్రభుత్వం తరఫున సభలో చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement