green sunrise
-
ఆకుపచ్చ సూర్యదయం
1 ‘రామరాజు దళం రంగూన్ పారిపోయే ప్రయత్నంలో ఉంది. ఇందుకు డబ్బు కూడా వసూలు చేస్తోంది.’1923 జనవరిలో ఒక్కసారిగా ఈ మాట మన్యమంతా పాకింది. బలంగా వ్యాపించిన వదంతి. పెద్దగడ్డపాలెం, లింగాపుర ం ఓటమి తరువాత రామరాజు దళం కదలికలు ఎక్కడా కనిపించలేదు. అయినా ఆ వదంతిని వదంతిగానే చూస్తే మంచిదని చెప్పిన వాళ్లే ఎక్కువ. రామరాజునీ, కొండదళం సభ్యులనీ పట్టిచ్చినవారికి బహుమతులంటూ, గ్రామాల మీద సామూహిక శిక్షా సుంకం అంటూ హిగ్గిన్స్ అట్టహాసంగా ప్రకటన వెలువరించిన రెండు మూడు రోజులకే పెద్దవలçసలో మలబార్, బళ్లారి స్పెషల్ పోలీసు బలగాలు ఉన్న ఏడు పాకలకు నిప్పంటుకుంది. ఆ మరునాడే నర్సీపట్నం పోలీసు శిబిరంలో నీళ్లు కల్తీ అయ్యాయి. 1923, ఆరంభంలో కొండలలో తిరుగుతున్న బలగాలు తక్కువేమీ కాదు. 665 మంది కానిస్టేబుల్స్ గాలిస్తున్నారు. వాళ్ల మీద 73 మంది హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎనమండుగురు సార్జెంట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ముగ్గురు పోలీస్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 28 మంది సబ్ఇన్స్పెక్టర్లు నిద్రాహారాలు మానేసి తిరుగుతూనే ఉన్నారు. అలాంటి సమయంలోనే గూడెం ప్రాంతంలో పదహారు మందితో రామరాజు కనిపించాడని సమాచారం.కంగుతిన్నది జిల్లా యంత్రాంగం. ఏప్రిల్ మండుటెండలలో, నెల మధ్యలో వడదెబ్బ లాంటి మరో సమాచారం. 2 సూర్యోదయ వేళ! ‘మూలతో బ్రహ్మరూపాయ; మధ్యతశ్చ మహేశ్వరం... అగ్రతః విష్ణు రూపాయ; త్రై్యక రూపాయతేనమః’రత్నగిరి కొండల పక్కన నుంచి సాగుతున్న పంపా నది పలచగా ప్రవహిస్తోంది. స్నానం ముగించి, భక్తిగా కళ్లు మూసుకుని ఈ శ్లోకం వల్లిస్తున్నాడు, చెరుకూరి నరసింహమూర్తి. రత్నగిరి మీద ఉన్న శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామిని దర్శించుకోదలచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కూడా నదిలో స్నానం చేస్తున్నారు. నరసింహమూర్తి దైవ దర్శనం కోసం వచ్చినవాడు కాదు. ఆ ఊరివారి అల్లుడు. అసలు ఊరు గోదావరి జిల్లాలోనే రామచంద్రపురం దగ్గర దంగేరు. శ్లోకం పూర్తయ్యాక కళ్లు తెరిచి చూశాడు మూర్తి. జనమంతా పరుగులు తీస్తున్నారు ఊరి వైపు. కొందరు మళ్లీ వచ్చి స్నానం చేయవచ్చునన్నట్టు బట్టలు కట్టేసుకుని సంచులు తీసుకుని పరుగు అందుకుంటున్నారు. ఆయన కూడా గట్టు మీదకు వచ్చి, పరుగులు తీస్తున్న ఒక యువకుడిని ఆపి ఆడిగాడు, ‘‘ఏమైంది?’’ ‘‘అల్లూరి శ్రీరామరాజుగారు వచ్చారంటండి!’’ అన్నాడా యువకుడు.‘‘ఏమిటి? అల్లూరి శ్రీరామరాజే?’’ రెట్టించి అడిగాడు నరసింహమూర్తి. ‘‘ఆయ్, ఆయనేనంటండి! పోలీసు స్టేషన్కాడ ఉన్నారంటండి!’’ అనేసి రుగందుకున్నాడతడు. నిజమే రామరాజు మొదట పోస్టాఫీస్కు వెళ్లాడు. తరువాత పోలీస్ స్టేషన్కు వెళుతున్నాడని తెలిసింది. ఇంటికి వెళ్లిపోయి పొడిబట్టలు కట్టేసుకుని, ఐదే ఐదు నిమిషాలలో స్టేషన్ దగ్గరకొచ్చి పడ్డాడు నరసింహమూర్తి– చేతిలో డైరీ, జేబులో కలంతో.గర్భగుడి ముందు ముఖమండపాన్ని గుర్తుకు తెస్తున్నది ఆ దృశ్యం. మూల విరాట్ ముందు నిలబడి ఉన్నట్టు చేతులు జోడించి భక్తి పారవశ్యంతో చూస్తున్నారు జనం– సబిన్స్పెక్టర్ కూర్చొనే ఆ గది లోపలికి. ఎస్ఐ కూర్చునే కుర్చీలో కూర్చుని ఉన్నాడాయన. ఖద్దరు నిక్కరు, దాని మీద ఎర్రటి ఖద్దరు చొక్కా. ఆయనే రామరాజని అర్థమైంది. అందమైన ముఖం. దాని మీద చక్కని చిరునవ్వు. పక్కనే నిలబడి ఉన్న మనిషి అవతారాన్ని బట్టి మల్లుదొర అని అర్థమైంది. అతడి పక్కనే ఉన్నాడు మరో మనిషి, గంతన్న అని తరువాత తెలిసింది. ఇంకో పది మంది వరకు ఒక పక్కగా నిలబడి ఉన్నారు. ఎవరికీ పైన ఆచ్ఛాదనలు లేవు. కాళ్లకి చెప్పులూ లేవు. తుపాకీ, విల్లు, కత్తి, గొడ్డలి– ఏదో ఒక ఆయుధం ఉంది అందరికీ. నుమానం తీరని మల్లుదొర స్టేషన్ అంతా తిరిగి చూశాడు. నిజమే సబిన్స్పెక్టర్ చెప్పినట్టు ఆయుధాలు స్టేషన్లో లేవు. తరువాత ఆయన బయటకు వచ్చాడు. అప్పటికే రెండు మూడు వందల మంది చేరిపోయారు. అందరికీ నమస్కరిస్తూ రామరాజు మెట్లదారి వరకూ వచ్చాడు. తాను స్నానం చేయవలసి ఉందనీ, మళ్లీ కలుసుకోవచ్చుననీ చెప్పి అక్కడే ఉన్న సత్రంలోకి వెళ్లాడు. చొక్కా జేబులో నుంచి గడియారం తీసి చూసుకున్నాడు రామరాజు. అప్పటికే సమయం ఏడు గంటలయిపోతోంది. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు రామరాజు. ప్పుడే వచి చేతులు జోడించి అన్నాడు నరసింహమూర్తి, ‘‘నమస్కారం!’’చిరునవ్వుతో అన్నాడు రామరాజు, ‘‘నమస్కారం.’’ తను ఎవరో చెప్పాడు మూర్తి. రాక కారణం కూడా చెప్పాడు. మూర్తి అంటే ఎవరో తెలియదు. అయినా ఎదురుగానే ఉన్న మరో కుర్చీలో కూర్చోబెట్టి తన ఉద్దేశం, తన పంథా, ఆలోచన అన్నింటి గురించి ఓపిగ్గా సమాధానం చెప్పాడు రామరాజు. తరువాత సత్రం ప్రాంగణంలోనే ఉన్న బావి దగ్గర అరగంట సేపు స్నానం చేశారాయన. కొద్దిసేపు జపం చేసుకున్నాడు. ఆపై సబిన్స్పెక్టరు, పోస్టుమాస్టరు, డిప్యూటీ తహసీల్దారు ఆహ్వానాల మేరకు వాళ్ల ఇళ్లకు వెళ్లాడు రామరాజు. అక్కడికీ అనుసరించారు జనం. ఆ ఇల్లాళ్లు స్వయంగా వారే కాళ్లు కడిగి, నీటిని నెత్తిన జల్లుకున్నారు. రకరకాల పువ్వులు కాళ్ల మీద వేసి కళ్లకి అద్దుకున్నారు. ఇంటిల్లి పాది పాదాభివందనాలు చేశారు. చాలామంది కొత్త బట్టలు ఇచ్చారు. కొందరు డబ్బు చేతిలో పెట్టారు. ఆ వెంటనే అనుచరులతో కొండపైకి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నాడు రామరాజు. అప్పుడు సమయం తొమ్మిది. ఇంకో గంటలో ఇక్కడికొచ్చే రైలేదో ఉంది. అందులో బలగాలు వచ్చే అవకాశమే ఎక్కువ. అప్పుడే ఆ యువకుడు ఎదురుగా వచ్చి నమస్కరించి అన్నాడు, ‘‘నా పేరు ఆవంత్స వెంకట రామారావు. శంఖవరం నుంచి వచ్చాను. మా నాన్నగారు వెంకటరావుగారు. తమరిని మా ఊరికి ఆహ్వానించాలని ఆయన కోరిక.’’ ఒక్క నిమిషం పాటు ఆలోచించి, ‘‘నడవండి!’’ అన్నాడు రామరాజు ఆ యువకునితో. విస్తుపోయాడతడు. స్టేషన్లో ఆయుధాలు దొరకలేదు. కానీ తన మీదా తన ఉద్యమం మీదా మైదాన ప్రాంత తెలుగు ప్రజలకి ఎంత విశ్వాసం ఉందో రుజువు దొరికింది. ∙ పదింటికి అన్నవరం చేరుకోవలసిన మద్రాస్ మెయిల్ను పిఠాపురంలో నిలిపివేశారు. కారణం– అన్నవరంలో రామరాజు దళం ఉంది. ప్రయాణికులంతా ప్లాట్ఫారమ్ మీదకి దిగిపోయి ఆ విషయమే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విస్తుపోయి మాట్లాడుకుంటున్నారు. అందరితో పాటు ఆ యువకుడు కూడా దిగాడు. శ్రీరామరాజు వీరోచిత కృత్యాలు అతడిని రోమాంచితం చేస్తున్నాయి. ఉప్పొంగిపోతున్నాడు మనసులో. అతడి గమ్యం కలకత్తా. బెంగాల్ తీవ్ర జాతీయవాదులతో కలసి పనిచేయడం. అతడిని అగ్గిరాజు అంటారంతా. ఆవేశపరుడు కావడం వల్ల కొందరు మిత్రులు ముద్దుగా ఆ పేరు పెట్టారు. అసలు పేరు వేగిరాజు సత్యనారాయణరాజు. పాతికేళ్లుంటాయి. ఎంత ఆవేశపరుడో, అంత ధర్మవర్తనుడు కూడా. భీమవరం దగ్గరి కుముదవల్లి నుంచి వస్తున్నాడు. తండ్రి లేడు. చదివింది నాలుగో తరగతి. తల్లీ, తను. ఇల్లు గడవడానికి పాలేరుతనం చేసేవాడు. అక్కడ నుంచి ఖద్దరు ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, భీమవరం కాంగ్రెస్ శిబిరంలో స్వచ్ఛంద సేవకుడు– ఇలా ఎదిగి వచ్చాడు. అడవి బాపిరాజు వంటి రచయితలు, విద్యావంతులతో అనుబంధం పెరిగింది. కానీ గాంధీజీ పిలుపు మేరకు ప్రజలు అహింసాయుతంగా ఉద్యమిస్తున్నారు. కానీ పోలీసులేమో యువకులు, బాలలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చావగొడుతున్నారు. అహింస అంటే ఇదే అనిపించింది. పోలీసులంటే ఒకరకమైన కక్ష. అందుకే జాతీయ కాంగ్రెస్ను విడిచిపెట్టాడు. తరువాత ఇల్లు కూడా విడిచిపెట్టాడు. కలకత్తా బయలుదేరాడు. యాదృచ్ఛికంగా ఆ ఉదయమే నిడదవోలు వచ్చి ఈ రైలెక్కాడు. గంట తరువాత పిఠాపురం నుంచి రైలు బయలుదేరింది. మరో గంటకి అన్నవరం చేరుకుంది. అగ్గిరాజు మనసు మారిపోయింది. అక్కడే దిగిపోయాడు. శంఖవరంలో ఆవంత్స వెంకటరావు గారింటికి వెళ్లింది రామరాజు దళం. అన్నవరానికి నాలుగు మైళ్లు.తన కోసం నేయించి పెట్టుకున్న ఖద్దరు పంచెను వెంకటరావుగారు రామరాజుకు బహూకరించారు. అందరికీ భోజనాలు పెట్టారు. గ్రామంలో వసూలైన కొంత పైకం కూడా ఇచ్చి పంపించారు.ఆ సాయంత్రమే వెంకటరావుగారింటికి పోలీసులు వచ్చారు. ఆయన్ను అరెస్టు చేసి తీసుకుపోయారు. రామరాజు శంఖవరం రావడం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బ్రేకన్ అన్నవరంలో దిగడం దాదాపు ఒకసారే జరిగాయి. సత్కారాల గురించి తప్ప రామరాజు గురించి తెలియలేదు. కొండలలో పోలీసు స్టేషన్లని కొట్టిన తరువాత రామరాజు ఇప్పుడు మైదాన ప్రాంతాల స్టేషన్ల మీద దృష్టి సారించాడా? ఆ ప్రశ్న వేసుకుంటేనే వణుకు పుడుతోంది. అన్నవరం, శంఖవరాల మీద నాలుగువేల రూపాయల సామూహిక శిక్షా సుంకం విధించాడు. 3 ఆ రోజు ఏప్రిల్ 24, 1923. శనివారం. చాలా మందికి గుర్తుండిపోయిన రోజు. అన్నవరంలో రామరాజు ఇచ్చిన ఇంటర్వ్యూను ఆంధ్రపత్రిక ఆ రోజునే ప్రచురించింది. ఏప్రిల్ 17వ తేదీన రామరాజుతో మాట్లాడిన నరసింహమూర్తి మరునాడే ప్యాసింజరు రైలులో కాకినాడ వచ్చాడు. అక్కడ ఆంధ్రపత్రిక విలేకరిని వెతికి పట్టుకుని సంభాషణ అంతా ఇచ్చాడు. అదే అచ్చయింది.శ్రీరామరాజు హృదయాన్ని చాలా వరకు ఆవిష్కరించిన ఇంటర్వ్యూ మరి. ఆయన పట్ల మరింత గౌరవాన్ని పెంచిన ఇంటర్వ్యూ. ఇంకా చెప్పాలంటే పత్రికలలో ఇంతకాలం వచ్చిన ఉద్యమ వ్యతిరేక వార్తలన్నింటికీ, ఊహాగానాలన్నింటికీ, అర్ధ సత్యాలన్నింటికీ సమాధానం అన్నట్టుంది. కొంచెం ఆలస్యం కావచ్చు. అయినా ఎక్కడలేని ఆసక్తితో చదువుకుంటున్నారు కృష్ణదేవిపేట వాసులు రామరాజు ఇంటర్వ్యూని. ఊరిలోకి పోలీసు శిబిరాలు వచ్చిన తరువాత ఆంధ్రపత్రిక కూడా బహిరంగంగా చదువుకోవడానికి ధైర్యం చాలడం లేదు, ఊరివాళ్లకి. అందుకే భాస్కరుడిగారి ఇంటి వెనుక పెరడంతా కిక్కిరిసిపోయి ఉంది. ఒకసారి భాస్కరుడుగారు చదివి వినిపించారు. చాలామందికి తృప్తి కలగలేదు. రెండోసారి చదువుతున్నాడు దాలినాయుడు. ఎప్పుడూ లేనిది సోమమ్మ, మరికొందరు మహిళలు కూడా వచ్చి వింటున్నారు ప్రశ్న జవాబుల రూపంలోని ఆ ముఖాముఖీ.... నరసింహమూర్తి: మీరే సంకల్పముతో ఫితూరీని నడుపుతున్నారు? రామరాజు: ప్రజలకు స్వాతంత్య్రము లభించుటకే!నర: ఏ సాధనము వలన?రామ: దౌర్జన్యము వలననే! యుద్ధము చేసినగానీ మనకు స్వరాజ్యము రాదు.నర: స్వాతంత్య్రము బడయుగలుగుదునను నమ్మకము మీకు గలదా?రామ: రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించునను నమ్మకము నాకు కలదు.నర: రెండేండ్లలో స్వరాజ్యము ఎట్లు లభించును? మీరవలంభించుచున్న పద్ధతి వలనే స్వరాజ్యము వచ్చునా?రామ: వచ్చును. తప్పక వచ్చును. నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది. జనము లోటేమియూ లేదు. కానీ తుపాకులను మందుగుండునూ కావలెను. వాని కొరకే సంచారము చేయచున్నాను. నర: దౌర్జన్యముతో కూడిన యుద్ధముల వలన జన నష్టముల వలన ప్రపంచము విసుగు చెందియున్నది. దౌర్జన్యము కూడదను సిద్ధాంతమునే ఇపుడు ప్రపంచములోని అన్ని దేశముల వారు ఆదరించుచున్నారు. జర్మనీ వారు గూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్య రాహిత్య శాంతి సాధనములందు మాత్రమే మాకు నమ్మకము కలదు. బోధించుటకు దేవదూత గాంధీ మహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచము వారందరునూ నమ్ముచున్నారు. రామ: నాకు దౌర్జన్యరాహిత్యమునందు నమ్మకము లేదు. దౌర్జన్యము వలననే స్వరాజ్యము బడయగలుగుదుమని నేను గట్టిగా నమ్ముచున్నాను. నర: దౌర్జన్యము వలన ప్రాణ నష్టమునూ, వినాశనమునూ కలుగును. శాంతి సాధనముల వలననే స్వరాజ్యము లభించును. ఇంతకు పూర్వము మీకునూ, పోలీసు వారికిని జరిగిన యుద్ధములందు మీ స్థితి ఎట్లుండెను?రామ: మొదటి ఐదు యుద్ధములలోను నేను సులభముగానే జయమును బడసితిని. ఆరవ యుద్ధమునను, కడపటి యుద్ధమునను మేము నిద్రపోవుచుండగా పోలీసువారు హఠాత్తుగా తలపడిరి. వారు దూరము నుంచి మరతుపాకులను కాల్చసాగిరి. అరగంట సేపటుల విడవకుండా వారు కాల్చిన పిమ్మట మా జట్టులోని వారికి మెలకువ వచ్చినది. మరి రెండు నిమిషములకు నాకునూ మెలకువ వచ్చెను. నేను లేచి చూచుసరికి పోలీసుల సంఖ్య విస్తారముగా నుండెను. మావారి సంఖ్య తక్కువగా నుండెను. తుపాకి రవ్వలు తగిలి నా పరుపంతయు చిల్లులు పడియుండెను గాని నాకొక్కటియును తగులలేదు. నేనంతట మావారితో గూడ తప్పించుకొనిపోతిని.నర: ఈ నాలుగు నెలలును మీరేమి చేయుచుంటిరి? రామ: నేను తపము చేయుచుంటిని.నర: గయలో జరిగిన కాంగ్రెస్ సభకు మీరు వెళ్లినారని ప్రజలు విస్తారముగా చెప్పుకొనుచుందురు. అది నిజమేనా?రామ: నా స్థూల శరీరము గయకు పోలేదు. కాని నా యాత్మ అచటికి పోయినది.నర: అచట జరిగిన విషయములన్నియు తెలియునన్నమాటేనా?రామ: నేనంతయు స్వయముగా చూడగలిగితిని. రెండు కక్ష్యలేర్పడెను. కొందరు శాసనసభలను బహిష్కరింపవలెననగా, మరికొందరు సభలకు వెళ్లవలెననిరి. వెళ్లవలెననువారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పము. ఉప్పు పన్నును హెచ్చించినందులకు, ధర్మాదాయ చట్టమునామోదించినందులకు భారత శాసన సంఘ సభ్యులలోను చెన్నపురి రాష్ట్రీయ శాసనసంఘ సభ్యులలోను ఎవరైనా రాజీనామాలిచ్చారా? నర: ఎవరును రాజీనామాలనీయలేదు. గాని మీకీ రాజకీయ విషయములన్నియు నెటుల తెలియుచున్నవి?రామ: నేనందులకు తగిన ఏర్పాట్లు చేసితిని. ఇంకో వార్త ఏదీ తెలుసుకోవాలని అనిపించలేదు ఎవరికీ. దీర్ఘంగా నిట్టూర్చి లోపలికి Ðð ళ్లారు సోమమ్మ. 4 ‘‘చౌరీచౌరా తరువాత సహాయ నిరాకరణోద్యమాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం కంటే, ఈ తీర్పు మీద నోరెత్తకపోవడమే మరింత నిరంకుశత్వమని నేనంటాను.’’ వేకువజాము ఐదుగంటల ప్రాంతం. సంగోలు పూజ బస ఎదురుగా ఉన్న ఏరులో స్నానం చేస్తున్నారు అగ్గిరాజు, రామరాజు. అన్నవరంలో రైలు దిగిపోయిన అగ్గిరాజు తుని, కోటనందూరుల మీదుగా నర్సీపట్నం చేరుకున్నాడు. అక్కడే ఆంధ్రపత్రిక కొనుక్కుని చదివాడు. అందులోనే ఉంది ఆ వార్త. పద్నాలుగు మాసాల తరువాత ఏప్రిల్ 20, 1923న అలహాబాద్ హైకోర్టు చౌరీచౌరా కేసు మీద తుది తీర్పు ఇచ్చిందట. నర్సీపట్నం నుంచి డౌనూరుకు వచ్చాడు అగ్గిరాజు, రామరాజును వెతుక్కుంటూనే.చిత్రంగా దారంతా కొండవాళ్ల పిల్లలు అతడిని రహస్యంగా అనుసరిస్తూనే ఉన్నారు. రామరాజు కోసం వాకబు చేసుకుంటూ వస్తున్నాడని తెలిసి, ఒక మునసబు పంపించాడు, అగ్గిరాజుని. ‘‘నాది ఆవేశమని అంతా అంటారు. దీని మీద కూడా ఆవేశపడకుండా నోరు మూసుకుని పడి ఉంటే ఇక ఈ మానవ జన్మ ఎందుకు రామరాజుగారూ?’’ అన్నాడు అగ్గిరాజు. ‘‘ఈ తీర్పు గురించేనా?’’ అడిగాడు రామరాజు. ‘‘ఔను. చౌరీచౌరా పోలీసు స్టేషన్ని తగలబెట్టినప్పుడు ఎంతమంది చనిపోయారు? 22 మంది కదా! 225 మందిని ఎనిమిది నెలలు విచారించారు. వాళ్లలో 172 మందికి మరణశిక్ష వేసేస్తాడా జడ్జి? హింస మొదలు పెట్టింది వాళ్లు. శిక్ష మాత్రం అహింసాయుతంగా సత్యాగ్రహం చేసినవాళ్లకి! ఆరుగురు విచారణ సమయంలో పోలీసు కస్టడీలోనే చనిపోయారట. వాళ్లదీ మరణదండనే. ఇంత అన్యాయం జరుగుతోంది, ఒక్కమాట అన్నాడా గాంధీగారు? తర్వాత అలహాబాద్ హైకోర్టు ఆ 172 మందిలో 19 మందికి మరణదండనని ఖరారు చేసింది. 110 మందికి యావజ్జీవ ఖైదు వేసింది. చౌరీచౌరాలో ఉల్లంఘన జరిగిందనే అనుకుందాం. దానికి ఇంతమందిని ఉరికంబం ఎక్కిస్తారా? ఇలాంటి జాత్యహంకారుల ముందా భారతజాతి చేతులు జోడించి దేహీ అంటూ స్వరాజ్యం ఇమ్మని అడిగేది? అలా చేయమనే కదా గాంధీగారు, ఈ మోతీలాలు, కొండా వెంకటప్పయ్యలు చెబుతున్నది! ఎమ్మెన్ రాయ్ గారట ఎవరో, ఆయన అన్నారట, తీర్పు గురించి. ఇది లీగలైజ్డ్ మర్డర్ అని. ఆయన కి శిరసు వంచి నమస్కరించాలి.’’ అంటూ అనర్గళంగా, అదే ఆవేశంతో చెప్పాడు అగ్గిరాజు. శ్రీరామరాజు స్నానం ముగించి గట్టున నిలబడి మొలకు కట్టిన తుండుగుడ్డే విప్పి పిడిచి తల తుడుచుకుంటున్నాడు. -
ఆకుపచ్చ సూర్యదయం
కానీ ఆ సమయంలో ఆయన లేడు. ఆ చీకటిలోనే రామరాజును తీసుకుని గంతన్న, కొటికల బాలయ్య బయటపడ్డారు. మల్లు, పడాలు నాయకత్వంలో పోరాటం సాగుతోంది. అర్థరాత్రి వరకు ఒక కసితో, ఉన్మత్తతతో కాల్పులు సాగించారు పోలీసులు.చివరికి మల్లు కూడా గాయప పక్కకి తప్పుకున్నాడు. 4 తెల్లవారింది. అలాంటి వేకువని మన్యం ఏనాడూ చూడలేదు. అడవిబిడ్డల నెత్తురులోని ఎరుపును కూడా రంగరించుకుని మరింత ఎర్రబడ్డాడు సూర్యుడు. లింగాపురం నుంచి శరభన్నపాలెం వైపు నడుస్తున్నాయి –మూడు పోలీసు పటాలాలు.ఒక పటాలం ముం. రెండు పటాలాలు వెనుక. వాటి మధ్యలోనే పదమూడు నులక మంచాలు.ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క శవం. పొట్ట చీలి పేగులు బయటకు కనిపిస్తున్న శవం ఒకటి. తలలో తూటా దిగిన శవం ఒకటి. గుండె చీలినది ఒకటి.... నిన్నటి పోరులో కన్నుమూసిన అడవి బిడ్డల శవాలే అన్నీ. ఒళ్లు జలదరించేటట్టు....రక్తం గడ్డకట్టేటట్టు ఉన్నాయి కొన్ని. ఇంకా రక్తమోడుతున్నవి కొన్ని. పెద్దగడ్డపాలెంలో చనిపోయిన వాళ్లు ఐదుగురు. లింగాపురంలో కూలినవాళ్లు ఎనిమిదిమంది....అదొక నిలువెత్తు రక్తపు ముద్దల ఊరేగింపు. ఛిద్ర మానవాంగాల భయానక ప్రదర్శన.పోయిన భయం మన్యవాసుల కళ్లలో మళ్లీ వచ్చి చేరుతున్న సంగతి పోలీసులకి తృప్తినిస్తోంది.పొగిలి పొగిలి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అణచి పెట్టుకుంది మన్యం.దొరికిన పదిమందిని చేతులు కట్టేసి నడిపిస్తున్నారు.ఇది ఘన విజయమంటూ మద్రాసుకు తంతి వార్త పంపాడు హెపెల్. 5 మలబారు పోలీసులు ఉన్న ఆ డేరాలోకి దూసుకొచ్చాడు ఇన్స్పెక్టర్.అంతా కంబళ్లు కప్పుకుని పడుకుని ఉన్నారు. అక్కడికొచ్చి మళ్లీ విజిల్ వేశాడు కర్ణకఠోరంగా.కృష్ణదేవిపేటలో వేసిన పది డేరాలలో మొదటే ఉంది. నులక మంచాల మీద వరసగా పడుకుని ఉన్నారు రెండు పటాలాల స్పెషల్ పోలీసులు. అంటే దాదాపు యాభయ్ మంది.కుడివైపు నాలుగో మంచం మీద ఉన్నవాడు కంబళి సర్రున విసిరి, ‘‘ఎవడ్రా ఆడు? మనిషా పశువా? ఏంటా గోల? బయటికిపో!’’ అన్నాడు గొంతు పగిలేటట్టు. ‘‘నేను ఇన్స్పెక్టర్ని. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.’’ అన్నాడు విజిల్ నోట్లోంచి తీసి.‘‘అయితే ఏంటంట!’’ నాలుగో మంచం మీది మనిషే అన్నాడు. అతడో కానిస్టేబుల్.‘‘తక్షణం మీ రెండు పటాలాలు శరభన్నపాలెం వెళ్లాలి. ఇది ఆర్డర్.’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘కుదరదు.’’ అన్నాడు నాలుగో మంచం మీద వ్యక్తి సర్రున లేస్తూ, అంతే పెద్ద స్వరంతో.‘‘తాగున్నావా రాస్కెల్? ఏం మాట్లాడుతున్నావ్?’’ మీదకొచ్చాడు ఇన్స్పెక్టర్.అన్ని మంచాల మీద నుంచి పోలీసులు లేచి నిలబడ్డారు, గబగబా. అందరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి. నిద్రాభంగమైనందుకు మండిపోతున్నారు వాళ్లంతా.‘‘ఎవడ్రా తాగి ఉన్నాడు? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు!’’ అన్నాడు నాలుగో మంచం మీద మనిషి. ‘‘ఏయ్....!’’ ఇంకా మీదకు రాబోయాడు ఇన్స్పెక్టర్. ‘‘ఆగండి సార్! ముందుకు రాకండి!’’ అప్పుడు కలగచేసుకున్నాడు ఆ చివర మంచం మీద నుంచి అప్పుడే లేచిన ఇంకో కానిస్టేబుల్.ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చి అడిగాడు అతడు, ‘‘ఏంటిసార్! ఆడు తాగి ఉన్నాడా? ఇప్పుడు సెర్చ్కి వెళ్లాలా? రెండురోజుల నుంచి రాత్రీపగలూ లేకుండా కొండలంట తిప్పుతున్నారు. రాత్రి ఒంటి గంటకి వచ్చి పడుకున్నాం. ఇంకా ఆరు కూడా అయి ఉండదు. ఇప్పుడు మళ్లీ వెళ్లాలా? మేమేమన్నా పొలం దున్నే పశువులం అనుకున్నారా?’’ అని నిలదీశాడు.‘‘ఈ ఉద్యోగంలో విధులు ఇలాగే ఉంటాయి. తెలియకుండానే చేరారాæ?’’ అన్నాడు దర్పంగా ఇన్స్పెక్టర్. ‘‘అందరి విధులు ఒకలా లేవు. మీ పనిగంటలు వేరు. మాకు ఆ లెక్కలు ఉండవు. మీకు సకల సదుపాయాలు ఉంటాయి. వేళకి సుష్టుగా భోజనం ఉంటుంది. కంటి నిండా నిద్ర ఉంటుంది. మాకేం ఉంది?’’ అంటూ బిగ్గరగా అరిచాడు ఇంకో కానిస్టేబుల్. ‘‘కొండల్లో తాగడానికి నీళ్లు కూడా లేవు. మోత పనీ మాదే. మా కాళ్లు చూడండి! ఎలా వాచిపోతున్నాయో! మీ సామాను గుర్రాలు మోస్తాయి. మీరేమో పంకాలు ఏసుకుని సుబ్బరంగా పడుకుంటారు. మేం దోమలతో జాగారాలు చేస్తున్నాం. మేం ఇప్పుడు పోలేం. మాకు కొంచెం విశ్రాంతి కావాలి!’’ మొదట మాట్లాడినవాడే చెప్పేశాడు. ‘‘మీ అంతు చూస్తాను!’’ అంటూ రుసరుసలాడుతూ వెనుదిరిగాడు ఇన్స్పెక్టర్. 6 మలబారు పోలీసులు తిరగబడిన తరువాత మరునాడే వచ్చాడు సాండర్స్.అప్పటికి వాళ్ల మీద ఫిర్యాదుల గుట్ట తయారై సిద్ధంగా ఉంది. దర్యాప్తు అన్నారు అధికారులు.మొదట ఇన్స్పెక్టర్ మీద అరిచిన కానిస్టేబుల్ది క్రమశిక్షణా రాహిత్యమని నిర్ధారించారంతా.పోలీసులు మరీ మొండికేశారు. నిన్నటి నుంచి వెళ్లమన్న చోటకి వెళ్లడానికి కుదరదని చెబుతున్నారు. తూర్పు దిక్కున సెర్చ్ చేయమంటే నీళ్లు లేవు, ఎలాగంటున్నారు. పోనీ దక్షిణం వైపు వెళ్లమంటే మనుషులని రుచి మరిగిన పులి ఉందంటున్నారు. ఈ సమస్యని చాలా మెత్తగా తుంచాలని సాండర్స్ అభిప్రాయం. ఇలాంటి వాళ్లతో పనిచేయించడం కష్టం. వదుల్చుకోవడమే మంచిది. విశాఖ మన్యంలో గాలింపు నుంచి మాత్రమే కాదు, అసలు ఆ శాఖ నుంచి ఉద్వాసన చెప్పడమే వీళ్లకి సరైన మందు అని తీర్మానించుకున్నాడు. ముగ్గుర్ని పిలిచి మాట్లాడాడు. అంతే కరుకుగా మాట్లాడారు వాళ్లు. కావాలంటే రాజీనామా తీసుకోమని రాసుకొచ్చిన కాగితాలు టేబుల్ మీద పడేశారు. కంగుతిన్నాడు సాండర్స్. వీళ్లని సోమరులనేకంటే, కొండదళంతో కుమ్మక్కయిపోయారని అనడం సరైనదన్న అభిప్రాయానికి వెంటనే వచ్చేశాడు సాండర్స్. అదే, కొండదళంతో వీళ్లు కుమ్మక్కు కావడమే నిజమైతే ఇంక ఏ తెల్లవాడు బతకలేడు. 1857లో సిపాయీలు తెల్లఅధికారులను చంపినట్టు చంపినా ఆశ్చర్య పోనక్కరలేదు. ‘‘ఓకే... ఇంకా ఎందరు రాజీనామాలు ఇస్తారో అవి కూడా ఇచ్చేస్తే, కొత్తవాళ్లని రప్పిస్తాం!’’ దర్పంగా అన్నాడు.‘ఆమోదించడమే తరువాయి...’అన్నట్టు రెండు రోజులలోనే 47 మంది రాజీనామాలు చేసేశారు.మొదట తిరుగుబాటుచేసిన కానిస్టేబుల్ని మాత్రం అరెస్టు చేయించి, మూడు నెలలు జైలు శిక్ష పడేటట్టు చేశారు. 7 గాయపడి అప్పుడప్పుడే కోలుకుంటున్న సైనిక శిబిరంలా ఉంది కంపమానుపాకలు పూజబస. పెద్దగడ్డపాలెం– లింగాపురం పోరాటం తర్వాత చెదిరిన గుండెను కొండదళం ప్రోది చేసుకుంటున్న క్షణాలలో ప్రభుత్వం ఈ ప్రకటన మన్యం మీదకి వదిలిపెట్టింది. శ్రీరామరాజు జీవించి ఉన్నట్టా, లేనట్టా? అన్న అనుమానం కలిగేటట్టు చేసింది ప్రభుత్వం. పూజబస మధ్యగా అగ్నిహోత్రం ఇంకా వెలుగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే శ్రీరామరాజు సంధ్యావందనం పూర్తి చేసుకుని, తనను కలుసుకోవాలని ఆదరాబాదరా వచ్చిన మునసబులు, మొఖాసాదారులతో సమావేశం ప్రారంభించాడు. బస మధ్యలోనే ఉంది అగ్నిహోత్రం. దాంతో లోపలంతా కాస్త వెచ్చగా ఉంది. రామరాజు, ఇంకో ఇద్దరు ముగ్గురు మినహా అంతా గొంగళ్లు కప్పుకుని కూర్చుని ఉన్నారు, నేల మీద. డిసెంబర్ మాసం, చివరి రోజు. చలితో వేళ్లు కొంకర్లు పోతున్నాయి.ఇప్పుడు ఇలాంటి శిబిరమే శ్రేయస్కరమని పదిరోజుల క్రితం రామరాజునీ, కొండదళం ముఖ్యలనీ ఇక్కడికి తీసుకువచ్చినవాడు లక్ష్మయ్య అయ్యవారే. ఆ స్థలానికి కొన్ని గజాల ముందు జలజలా పారుతూ ఉంటుంది జలపాతం– పెద్ద శబ్దంతో. దాని పక్క నుంచి పైకి ఎక్కి కొండ పక్క నుంచి నడిస్తే చిన్న బాట కనిపిస్తుంది. అక్కడ నుంచి పది గజాలు వెళ్లాక కొండరాళ్ల వరస, చిన్నకోటలా. ఆ లోపలే ఉంది కంపమానుపాకలు గ్రామం. అక్కడ నిర్మించి ఉంచారు ఒక పూజబస. రామరాజు నులక మంచం మీద మోచేతుల మీద వాలి ఉన్నాడు వెనక్కి. దాని పక్కనే వెదురుబొంగులతో చేసిన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు కూడా లక్ష్మయ్య. ‘‘పిడికిలి బిగిస్తున్నారు!’’ లేని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు లక్ష్మయ్య.‘‘అది అనూహ్యం కాదు కదా అయ్యవారు!’’ నిబ్బరంగా అన్నాడు రామరాజు.‘‘మిమ్మల్ని పట్టిచ్చిన వారికి ఇనాం ప్రకటించింది స్వామీ ప్రభుత్వం!’’ చాలా బాధగా, ఆవేశంతో అన్నాడు ఒక మునసబు. ఒక్క నిమిషం మౌనం. తరువాత అన్నాడు రామరాజు, ‘‘ఇది ఇక్కడితో ఆగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. సరే, అంతా విందాం, చదవండి మీరే!’’ అన్నాడు రామరాజు.గొంతు సవరించుకుని చదవడం మొదలుపెట్టాడు లక్ష్మయ్య. ‘‘ప్రకటన (1) గూడెం తాల్కు, యెల్లవరం తాల్కు, రంపచోడవరం తాల్కులో ఉన్న ముఠాదార్లు, విలేజి మేజిస్ట్రేటులు, విలేజీ మునసబులు, యిజారాదార్లు, భూఖామందులు, రయితులు, గ్రామస్తులు అందర్కి మహారాజ రాజశ్రీ యేజన్సీ డివిజన్ యేజన్సీ కమిషనరు దొరవారు ప్రచురించే ప్రకటన యేమనగా:– (2) యీ సంవత్సరం ఆగష్టు నెలలో దిగువ నుంచి అల్లూరి శ్రీరామరాజు అనేవాడు పయిన చెప్పబడిన తాలూకాలలో నుంచి 200 మంది మనుష్యుల సహాయముతో గవర్నమెంటు వారి మీద పితూరీ చేసినాడన్న సంగతి మీకు అందరికి తెలిసేయున్నది. యీ పితూరీ మొనగాడు అయిన శ్రీరామరాజు గవర్నమెంటు పటాలములను అతి సులువుగా ఓడించి పై తాలూకాలకు రాజును అవుతానని బహిరంగముగా చాటినాడు. యింతవర్కు కొంచెముమంది తప్ప యావన్మంది ముఠాదార్లు, గ్రామ మేజిస్ట్రేటులు విలేజి మునసబులు, యిజారాదార్లు, భూఖామందులు, రయితులు, గ్రామస్తులు పోలీసు వార్కి యేమీ సహాయం చేయడం లేదు. సహాయము చేయకపోవడము సరిగదా, అనేకమంది ముఠాదార్లు, గ్రామ మునసబులు, యిజారాదార్లు, భూఖామందులు యేకమయి పితూరీదార్లకు బియ్యం వగయిరా సప్లయిలు యివ్వడం, వాండ్ల సామానులు మోయిడము, వాండ్ల సమాచారం, వాండ్ల జాడలు తెలియకుండా దాచిపెట్టడము, కొండలలో వాండ్లు దాగుందుకి వీలయిన స్థలములు చూపించడము వగయిరా పనులు చేసినారు. అందుచేత పితూరీదార్లకు సాయము చేసిన వాండ్లపయిన యీ దిగువ చర్య జరిగించబడినది. పితూరీదార్లకు సాయము చేసినందుకు మాకారము ముఠా గవర్నమెంటువారు తీసుకున్నారు. ఆ ముఠాదారును శిక్షించి జెయిలులో పెట్టినారు. అలాగునే పితూరీదార్లకు సాయము చేసినందుకున్నూ, పితూరీదార్ల విషయమయి సమాచారం యివ్వనందుకున్నూ చిట్టింపాడు గ్రామ మున్సబు శిక్షించబడ్డాడు. కొంతమంది ముఠాదార్లు నవుఖరి నుండి మన్నా చేయబడ్డారు. పితూరీదార్లకు సాయము చేసినంద్కు గంగరాజుమాడుగుల ముఠాదారు పయినిన్ని, దామనాపల్లి గ్రామ మునసబు పయినిన్ని కేసులు చేయబడినవి. (3) 6–12–1922 తేదీని పితూరిదార్లను పోలీసువారు 2 మాటులు ఓడించి 13 మంది పితూరిదార్లను చంపివేసినారు. అనేకమందికి గుండుదెబ్బ తగిలి పట్టుబడ్డారు. దీనినిబట్టి యేమి అగుపడుతుందంటే గవర్నమెంటు పటాలములను యెప్పుడూ ఓడించివేస్తాను, పితూరీదార్లకు గుండుదెబ్బ తగలదు అని శ్రీరామరాజు మీకు చెప్పిన మాటలు అబద్ధాలని తెలియవస్తుంది. (4) పితూరిదార్లు వేగిరము పట్టుబడుటకు గాను గవర్నమెంటువారు యీ దిగువ బహుమతులు అనగా యినాములు యిచ్చుటకుగాను హుకూము దయచేసినారు.1. అల్లూరి శ్రీరామరాజుని పట్టుకుంటే రూ. 1500 – 00 యినాము.2. గనర్లపాలెం కాపరస్తుడు గాం గంతన్నదొరను పట్టుకుంటెను రూ. 1000 – 00 యినాము.3. గనర్లపాలెం కాపరస్తుడు గాం మల్లుదొరను పట్టుకుంటే రూ. 1000 – 00 యినాము. 4. ముఖ్యమయిన యే పితూరిదారునయినా పట్టుకోవడము గానీ లేదా వాడి విషమయి గతిన సమాచారం యిచ్చి పట్టించడముగానీ చేస్తే అటువంటి ఒక్కొక్క ముఖ్యమయిన పితూరిదారు విషయము రూ. 50–0–0 యినాము. (5) ఒక్క పోలీసు తుపాకి గానీ, ఒక బళ్లారి తుపాకి గానీ అప్పగించితే రూ. 50–0–0 లు యినాము. యీ మీద చెప్పిన బహుమానములు యిస్తామన్నప్పటికి యీ దేశప్రజలు తగిన సహాయం చేయకపోయినా పితూరిదార్లను అప్పజెప్పకపోయినా నియమింపబడిన గానీ, సంబంధము కలిగినాగానీ పితూరిదార్ల విషయము తగిన సమాచారము యివ్వకపోతే వాండ్లందరి పయిన కఠినమయిన చర్య జరిగించబడుతుంది. అందరు నమ్మవలసింది. యేలాగంటే పితూరిదార్లు అందరిని అప్పజెప్పడముగానీ లేదా పితూరిదార్లు పట్టుబడేటట్టు పోలీసువార్కి సమాచారము యివ్వడము గానీ – యీ రెండు పనులు జరిగేవర్కు పోలీసు వార్కి, కంచరగాడిదెలకు, ఏనుగులకు వగయిరా అయ్యేటటువంటి ఖర్చులన్నీ కట్టి పుచ్చుకోబడును. యిదిగాక యింకా హుకుములు మన్నించనటువంటిన్ని, సాయము చేయనటువంటిన్ని ముఠాదార్లు తాల్కు ముఠాలు గవర్నమెంటు వారిచే తీసుకోబడును. గ్రామమున్సబులను ఏజెన్సీ వారంట్ల పయిని ఏజెన్సీ నుంచి పయికి పంపి వేయుటకున్నూ క్రిమినల్ ప్రొశీజరు కోడ్డు శె. 44–45నులు యింకా యితర శెక్షనుల ప్రకారం మున్సబులను భూఖామందులనున్నూ, రయితులను అరష్టు చేసి కేసులు చేయబడును. (6) కొంతమంది పితూరిదార్లు యొక్క జాబితా యిందులో జతపరిచినాము. ప్రతి ముఠాదారు ప్రతి యిజారాదారు ప్రతి గ్రామ మున్సబు ఆ గ్రామాల్లో పితూరిలో కలసినటువంటి పితూరిదార్ల పేర్లు తక్షణం రిపోర్టు చేయవలసినదని యిందుమూలముగా కఠినముగా ఉత్తరువు చేయడమయింది. ఇదిగాక, ప్రజలకు యిదివర్కు గానీ, యిప్పుడు గాని వున్నటువంటి యెటువంటి బాధలు అయినప్పటికి తెలియచేసుకున్న యెడల కమిషనరువారు తక్షణం తగిన దరియాప్తు చేసి న్యాయం యిప్పిస్తారని యిందుమూలముగా తెలుసుకోవలసింది. సంతకం జె.ఆర్. హిగ్గిన్స్, ఏజెన్సీ కమిషనర్, 29–12–22’’చివాల్న లేచి నిలబడ్డాడు రామరాజు. పూర్తిగా ఆరిన పొడవాటి వెంట్రుకలు భుజం దాకా వేలాడుతున్నాయి. భృకుటి మధ్య నుంచి పాపిడి దాకా ఉన్న కుంకం బొట్టు కొద్దిగా చెదిరి ఉంది. ‘‘ఇక యుద్ధం విశాఖ మన్యానికీ, బ్రిటిష్ మకుటానికీ మధ్య జరుగుతుంది. ఇది మనం ఎత్తుకోబోతున్న పెద్ద భారమే. ఆ వాస్తవాన్ని అంగీకరిద్దాం! మనం చనిపోవలసి వస్తే చనిపోదాం కూడా! కానీ మన హక్కును రక్షించుకునే ప్రయత్నంలో చనిపోవాలి. అది జీవితమనిపించుకుంటుంది. రామరాజు, గంతన్న, మల్లు – ఈ ముగ్గురి తలలు తెగి పడితే ఉద్యమం నిలిచిపోతుందా? భ్రమ. గ్రామాల మీద శిక్షా సుంకం విధించారు. అంటే పొత్తిళ్లలో బిడ్డ మీద కూడా రాజద్రోహం ముద్ర వేశారు. వాడు ప్రకటించినవి ఇనాములు కాదు. లంచాలు. సహకరించకుంటే కఠినచర్యలు తీసుకుంటాడా? అయితే ఇంకా పోరాడుతాం. ఇంకా పోరాడుదాం. ఇంకా ఇంకా పోరాడతాం. మనం పోరాటం విరమించే దశను దాటి ఎంతో దూరం ముందుకు వచ్చేశాం. పోరాటం ఆపితే అందుకు ముష్టిలా పడే జైలు కూడు నాకు అవసరం లేదు. అంతకంటే పోరాడి మరణిస్తాను. దేనికోసం ఈ పోరాటం? దేనికోసం ఈ తెగింపు? మన బతుకులు కోసమేనా? మీ బిడ్డల కోసమేనా? కాదు, బతుకునిచ్చే అడవి కోసం కూడా. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, ఒంజేరి, దామనాపల్లి, అడ్డతీగెల, రంపచోడవరం, పాడేరు, తూరమామిడి, లక్కవరపుకోట – పది విజయాలు – మనం సాధించాం.. మన దురదృష్టం... మన దురదృష్టం– పెద్దగడ్డపాలెం– లింగాపురంలో విజయం సా«ధించలేకపోయాం. పది విజయాల ముందు ఒక అపజయం ఎంత అని నేను అనను. ఆ అపజయంలోనూ త్యాగం ఉంది. అది మన సోదరులది. కొద్ది తుపాకులే ఉన్నా, ఈ గోచిపాతరాయుళ్లూ, ఈ బక్కప్రాణాలూ బాణాలు, శూలాల సాయంతో సాధించిన ఈ పది విజయాలు గొప్పవా? బలిసిన శరీరాలతో, యూనిఫారాలతో, కాలికి బూట్లతో, తలలకు ఉక్కు టోపీలతో, ప్రపంచ యుద్ధపు ఆయుధాలతో వచ్చి సాధించిన ఒకే ఒక్క విజయం గొప్పదా? ఇక కొండలను దాటి దాటి వెళ్లి అక్కడ స్టేషన్లు కొడదాం. ఆయుధాలు తెచ్చుకుందాం.’’ అన్నాడు రామరాజు. ‘‘మీ వెంటే మేమంతా స్వామీ!’’ అన్నాడు మల్లన్న లేచి, ఉద్విగ్నంగా.అక్కడ ఉన్నవాళ్లంతా లేచి నిలబడ్డారు, మల్లుదొరకు మద్దతు అన్నట్టు. ∙∙ ‘‘హలో నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్.... హెడ్క్వార్టర్స్.... ఓవర్’’ అవతల నుంచి ఈవ్లింగ్ కంఠం.‘‘హలో కేడీపేట... క్యాంప్.. ఓవర్....ఈవ్లింగ్.... ఏమిటి?’’ అన్నాడు ఫర్బీస్.‘‘స్పెషల్ కమిషనర్ బయలుదేరి చాలాసేపయింది. జాగ్రత్త. చాలా ఘటికుడు. కొంచెం తేడా వచ్చినా చీల్చి చెండాడతాడు. ఓవర్.’’ ఈవ్లింగ్.‘‘తెలుస్తూనే ఉంది. ఓవర్.’’ ఫర్బీస్.‘‘సరే, రామరాజుతో ఇంకా ఎవరు పట్టుబడ్డారు?’’ ‘‘ఇంకా ఎవరా? ఒక్క రామరాజే దొరికాడంటున్నారు కదా!’’ ‘‘ఇంత పెద్ద రెబెలియన్ నడిపినవాడు చివరికి ఒక్కడైపోయాడా? ఇదెలా సాధ్యం?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఈవ్లింగ్. -
ఆకుపచ్చ సూర్యదయం
‘‘గౌరవనీయ సభ్యులకు! ఫితూరీ నాయకుడు శ్రీరామరాజు గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో నిపుణుడు. మైదాన ప్రాంతంతో సంబం«ధం కలిగి ఉన్నాడు. చింతపల్లి, మరో రెండు పోలీసు స్టేషన్ల మీద దాడులతో విశాఖ మన్యం తిరుగుబాటు ఆరంభమైంది. పోలీసులు ప్రతిఘటించలేకపోయారు. మద్రాసు జిల్లా పోలీసు యంత్రాంగంతో చర్చించి, మలబారు దళాలను పంపించాం. అవసరమైతే సైనిక వ్యవస్థ సేవలు తీసుకోవడానికి కూడా సంప్రదించాం. మోత పని కోసం గుర్రాలు పంపించాం. వైర్లెస్ సెట్లు కూడా వెళ్లాయి. పదిహేను మంది వరకు బ్రిటిష్ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారు. మద్రాస్ రెడ్క్రాస్ అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. హిజ్ ఎక్స్లెన్సీ గవర్నర్ అదనపు వ్యయం కోసం ఇరవై వేల రూపాయలు మంజూరు చేశారు.’’ అంటూ చాలా విషయాలు చెప్పాడు. చివరికి శ్రీరామరాజు ఉద్యమం గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సభ్యులకి సమాచారం ఇవ్వాలని అంతా కోరారు. సాధ్యమైనంత త్వరగా అణచివేయాలని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. 2 అలా వచ్చి వయ్యారంగా వాలిందా పావురం, చిత్రాంగి భుజం మీద.‘‘ఎవరిదీ కపోతము?’’ ముచ్చటపడుతూ చెలికత్తెను ప్రశ్నించింది చిత్రాంగి. ‘‘ఇది... ఇది... యువరాజు సారంగధరుల వారి పావురము వలెనున్నది మహారాణి!’’ చెప్పింది చెలికత్తె. ఆ మాటతో చిత్రాంగి ఉబ్బితబ్బిబ్బయింది. ముందున్న హార్మోనిస్టుకు సైగ చేసి, పాట అందుకుంది. దానికి తగ్గట్టు నృత్యం కూడా చేస్తోంది. ‘‘పాపం! ఆ రోజుల్లో సమాచారం పంపాలంటే పావురాలే ఆధారం కాబోలు?!’’ అన్నాడు ఆ కానిస్టేబుల్ అక్కడే ఉన్న గొలుగొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కందుకూరి నారాయణరావుతో.నర్సీపట్నం–కృష్ణదేవిపేట మార్గంలో ఉంది జోగంపేట. రామరాజు దళం ఆ చుట్టుపక్కలే అనంతసాగరం, వెలగపాలెం, కొత్తమల్లంపేట వంటి చోట్ల తిరుగుతోందని తెలిసి పట్టుకోవడానికి బయలుదేరిన ప్రత్యేక పోలీసు బృందం కాళ్లు పీకి, నాటక ప్రదర్శన జరుగుతూ ఉంటే చతికిలపడింది. ఆ బృందానికి నారాయణరావు నాయకత్వం వహిస్తున్నాడు. సారంగధర నాటకం. రామాలయం దగ్గరే వేదిక. చిత్రాంగి వేషం పురుషుడే కట్టినా లొట్టలు వేస్తూ చూస్తున్నారు పోలీసులు.‘‘తెల్లదొరలు రావడం కొంచెం ఆలస్యమైంది గానీ, లేకపోతే చిత్రాంగి కూడా సారంగధరుడితో ఫోన్లో మాట్లాడుకునేది.’’ అన్నాడు తనో కొత్త విషయం కనుక్కున్నట్టు ఆ కానిస్టేబుల్.‘‘సారంగధరుడంటే పదకొండో శతాబ్దం వాడు. అప్పటికి వాళ్లకి కూడా ఫోన్లు లేవు’’ అన్నాడు నారాయణరావు, ఆ కానిస్టేబుల్ అజ్ఞానాన్ని ఎద్దేవా చేస్తున్నట్టు.‘‘అలాగా! దొరగారూ! ఇంతకీ కృష్ణదేవిపేట–నర్సీపట్నం మధ్యన ఫోన్లు ఎప్పుడు మాట్లాడతాయి?’’ అడిగాడు, కానిస్టేబుల్. ‘‘ఎంతోకాలం పట్టదు. వైర్లు కూడా బిగించారు.’’ అన్నాడు నారాయణరావు. ‘‘ఇంక కృష్ణదేవిపేటకి కబురు తీసుకెళ్లాలంటే గుర్రాల మీద, సైకిళ్ల మీద, ఎడ్లబండి మీద పోనక్కరలేదయితే!’’ అడిగాడు కానిస్టేబులు. సాంకేతిక పరిజ్ఞానం మీద వీడికి ఇప్పుడే ఉత్సుకత రేగాలా, నా ఖర్మ కాకపోతే అనుకుంటున్నాడు నారాయణరావు. కానీ టెలిఫోన్ తీగల వ్యవహారం అందరికీ ఆసక్తిగానే ఉంది. రామరాజు ఉద్యమం కాదుగానీ, చాలా కొత్త కొత్త షయాలు మన్యం దాకా వస్తున్నాయి.పందిట్లో ఒక మూలగా వేసి ఉంది కర్ర కుర్చీ. అందులో కూర్చుని ఉన్నాడు నారాయణ రావు. అతడి పక్కనే నిలబడి నాటకం చూడనివ్వకుండా విసిగిస్తున్నాడు కానిస్టేబుల్.‘‘రాత్రుళ్లు కూడా మాట్లాడుకోవచ్చా?’’ అడిగాడు కానిస్టేబుల్.‘‘రాత్రయితే ఏం?’’ విసుగ్గా అడిగాడు నారాయణరావు.‘‘తీగలు కనిపించవు కదా!’’ అన్నాడు కానిస్టేబుల్.‘మాకు బాగానే కనిపించాయి!’ లోపలే అనుకున్నాడు, గొంగళి కప్పుకుని ఈ ఇద్దరికి కాస్త సమీపంలో కూర్చుని నాటకం చూస్తున్న ఒక వ్యక్తి. పగటివేళ మన్యమంటే మనోహర ప్రకృతి దృశ్యాల సజీవ చయనిక. కానీ ముసిరిన చీకట్లలో అదో బీభత్స హేల. కాటుక దిబ్బల్లా కనిపించే కొండల మీద తారకల మసక చీకట్ల ఆకాశం– దిగంతాలు కలసిపోయినట్టుంటుంది సుదూరంలో. ఆ చీకటిలోనే ఇంతసేపూ తిరిగి, ఇప్పుడే అక్కడికి వచ్చారు కొండదళం సభ్యులు. కృష్ణదేవిపేటలో మొదలు పెట్టారు, టెలిఫోన్ తీగలను గమనించడం. కొద్దిసేపటి క్రితమే జోగంపేట గ్రామ శివార్ల దాకా చూశారు వాటిని. ఊర్లోకి వచ్చి పోలీసులతో పాటే నాటకం చూస్తున్నారు హాయిగా.ఆ గొంగళి కప్పుకున్న వ్యక్తి గోకిరి ఎర్రేసు. అతడికి కొంచెం దూరంగా అలాగే గొంగళి కప్పుకుని కునికి పాట్లు పడుతూనే నాటకం చూస్తున్న మనిషి మల్లు. తల మీద నుంచి నల్లటి గొంగడి కప్పుకుని, ఒక ఇంటి అరుగు మీద నిలబడి కళ్లప్పగించి నాటకం చూస్తున్న మనిషి శ్రీరామరాజు. ఆ అంకం పూర్తయింది. వేదికకి అటూ ఇటూ వేలాడదీసిన పెట్రోమాక్స్ లైట్ల మీదకి వెదురు బుట్టలను దింపుతున్నారు నిర్వాహకులు. వేదిక మీద చీకటి ఆవహిస్తోంది. నెమ్మదిగా దిగడం ఆరంభమైంది తెర. అప్పుడే ఎవరో గట్టిగా అరిచారు– ‘‘వందేమాతరం!’’ ప్రేక్షకులంతా లేచిపోయి ఒక్కసారిగా అరిచారు–‘‘మనదే రాజ్యం!’’ఆ వెంటనే మరో నినాదం –‘‘అల్లూరి శ్రీరామరాజుకీ!’’ ‘‘జై!’’ ఏమీ అర్థం కావడం లేదు పోలీసులకి. భయంతో అంతా అక్కడ నుంచి పారిపోయారు.ఏకాకిగా మిగిలిన కందుకూరి నారాయణరావు దగ్గరకి వచ్చి నమస్కరించాడు రామరాజు.ఇప్పుడు రామరాజు, ఆయన సహచరులందరి ఒంటి మీద ఖాకీ దుస్తులు లేవు. అంతా కోరా ఖద్దరు దుస్తులు ధరించి ఉన్నారు. పోలీసులు, ఉద్యమకారులు ఖాకీ దుస్తులే ధరించడం చాలామందికి మనస్కరించడం లేదు. రామరాజు ఒంటి మీద కోరా చొక్కా, ఖద్దరు నిక్కరు ఉన్నాయి. ‘‘నమస్కారం రాజుగారు! చాలా రోజులైంది కలసి. మీరు ఇక్కడకి వస్తారని ఊహించలేదు. అంతా నాటకీయంగా ఉంది. సమయానికి కలుసుకున్నాం. ఒక ముఖ్య విషయం మీతో చెప్పాలని ఉంది. ఇటు వస్తారా?’’ అన్నాడు నారాయణరావు.ఇద్దరూ ఒక చెట్టు కిందకు వచ్చారు. వేదిక మీద తెర దించుతున్నారు నిర్వాహకులు.‘‘పాపం మా మూలంగా తెర చాలాసేపు దించవలసి వచ్చింది!’’ అన్నాడు రామరాజు.‘‘ఒకమాట చెబుతాను రాజుగారు! దొరతనానికీ మీకూ మధ్య జరుగుతున్న దోబూచులాటలకి కూడా తెర దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం పిడికిలి బిగించడం ఇక తప్పదు. అప్పుడు మాత్రం దెబ్బ తిన్న పులిలా పడతారు.’’ అన్నాడు నారాయణరావు. ‘‘మలబారు దళాల అండతోనా?’’ రామరాజు అన్నాడు. ‘‘మలబారు దండు ఎలాగూ తోడవుతుంది. దక్షిణ కమాండ్ నుంచి లూయీ ఫిరంగులు వచ్చి చేరాయి. వాటిని చూసుకునే, అణచివేతలో కొత్త అంకాన్ని ఆరంభించాలని నిర్ధారించుకుంది పోలీసు యంత్రాంగం. దానికి మించి, ఇప్పుడు మీరంటే కొత్త భయాలు మొదలైనాయి. రాజమండ్రి జైలు నుంచి నాగపూర్ తీసుకువెళుతుంటే గదర్ విప్లవకారుడు పృథ్వీసింగ్ ఆజాద్ రైలులో నుంచి దూకి తప్పించుకున్నాడు. అది పుండు మీద కారం రాసినట్టే ఉంది దొరతనానికి. ’’‘‘ఎప్పుడు తప్పించుకున్నారాయన?’’ అడిగాడు రామరాజు, ఆశ్చర్యపోతూ.‘‘నిన్ననే. 29వ తేదీ. వేగంగా పోతున్న రైల్లో నుంచే దూకేశాడటాయన. ఇవాళ మధ్యాహ్నమే మాకు తెలిసింది. అది కాదు అసలు వింత. మిమ్మల్ని వెతుక్కుంటూ పృథ్వీసింగ్ నేరుగా విశాఖ మన్యానికే వస్తాడని గట్టి అనుమానం వీళ్లందరికీ! కొత్త అంకం బీభత్సరసంతోనే ఉండొచ్చు.’’ చెప్పాడు నారాయణరావు, కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ. ∙∙ తెల్లవారాక అ«ధికారులకి అసలు విషయం తెలిసింది. రాత్రి కొండదళం కృష్ణదేవిపేట నుంచి జోగంపేట శివార్ల వరకు ముప్పయ్ చోట్ల టెలిఫోన్ తీగలను కత్తిరించింది. ఆ ఊళ్లోనే భోజనాలు చేసింది. కొద్దిసేపు నాటకం కూడా చూసింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కందుకూరి నారాయణరావు అంత మంది చూస్తుండగా రామరాజుతో మాటామంతీ జరిపాడు.అందుకే వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసేసి, కేసు నమోదు చేయించాడు హెపెల్ . 3 అక్టోబర్ 12, 1922 నాటికి మలబారు దళాల రాక పూర్తయింది.పూనాలోని దక్షిణ కమాండ్ కార్యాలయం నుంచి రెండు లూయీస్ గన్లు కూడా వచ్చేశాయి.ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన బలమైన ఆయుధం – లూయీస్ గన్. అమెరికా వారు తయారు చేస్తే మొదటిసారి ఇంగ్లండ్ మహా యుద్ధంలో ప్రయోగించింది. లూయీస్ ఆటోమేటిక్ గన్ లేదా లూయీస్ ఆటోమేటిక్ రైఫిల్ అంటారు. అక్టోబర్లో వచ్చిన పెను తుపానుతో అనారోగ్యం పాలైన పోలీసులు కూడా కోలుకున్నారు. రామరాజు జబ్బు పడి ఉన్నాడని మన్యంలో చెప్పుకుంటున్న తరుణం. అసలు కొండదళంలోనే చీలిక వచ్చిందని కూడా వినిపిస్తోంది. ఇలాంటి అదును కోసమే చూస్తోంది పోలీసు యంత్రాంగం. బ్రిటిష్ సామ్రాజ్యం తలుచుకుంటే ఎంతటి గాయం చేయగలదో చూపించాలని తహతహ లాడిపోతున్నది. ఆ రోజు డిసెంబర్ 6, 1922.శరభన్నపాలెంలో వెతికారు. అక్కడ నుంచి కొండ దరిన ఉన్న నిమ్మగడ్డలో గాలించారు. అక్కడికి మైలు దూరంలోనే ఉంది పెద్దగడ్డపాలెం.ఈ కదలికలన్నీ గమనిస్తున్నారు ఇద్దరు కొండదళం సభ్యులు. జాన్, చార్స్లీ నాయకత్వంలో పెద్ద బలగమే గాలిస్తోంది.59 మంది మలబారు దళం సభ్యులు. అంటే రెండు పటాలాలు. కూడా మరో 20 మంది అధికారులు – దాదాపు 15 కంచర గాడిదలు, ఆహార పదార్థాలతో. ఏదో కీడు శంకిస్తూ, గడగడలాడిపోతోంది మన్యం. ఆ ఇద్దరు నిన్నటి నుంచి తమని అనుసరిస్తున్న సంగతి మొదట జాన్ కనిపెట్టేశాడు.ఈ ఉదయం ఆ ఇద్దరు దొరికిపోయేలా చిన్న పథకం వేశాడు.బలపరుపుగా ఉన్న ఒక రాయి మీద కూర్చోమన్నాడు చార్స్లీని, జాన్. వెనక జేబులో నుంచి ఒక కాగితం తీసి రాయి మీద పరిచాడు. పై జేబులో నుంచి ఒక పెన్సిల్ ముక్క తీసి ఊరికే పెదవులు కదుపుతూ గీయడం మొదలుపెట్టాడు. ఆ ఇద్దరు చూస్తూనే ఉన్నారు, దూరం నుంచి.ఏదో నిర్ధారించినట్టు చివాల్న లేచాడు జాన్. అతడి వెనకే లేచాడు చార్స్లీ. అక్కడ నుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఆ కాగితం అక్కడ వదిలేశారు. పావుగంట ఆగి, నెమ్మదిగా ఆ ఇద్దరు ఆ రాయి దగ్గరకే వచ్చి ఆ కాగితం తీసుకుపోయారు.రెండు బలమైన చేతులు ఇద్దరి మెడలని ఒక్కసారే పట్టేశాయి, పాము కప్పని పట్టినట్టు.ఒక జమేదారు, ఒక కానిస్టేబుల్. వాళ్లతో ఇంకో నలుగురు, లాఠీలతో. ముందే మాటేసి వచ్చి పట్టుకున్నారు. అక్కడే ఉంది ఒక చిన్న పశువుల కొట్టం. కన్నుమూసి తెరిచే లోగా అందులోకి చేర్చారు ఇద్దరినీ.ఇద్దరూ యువకులే. భయంతో వణికిపోతున్నారు. ‘‘ఎవర్రా మీరు?’’ చింతపల్లి పోలీసు పిడికిలి బిగిస్తూనే అడిగాడు.‘‘కొండోళ్లం దొరా!’’ అన్నాడొకడు. ఎప్పుడు పిడికిలి వాడి కడుపును తాకిందో, ఎప్పుడు కింద పడిపోయాడో తెలియదు. ఆ సమాధానం ఇచ్చిన వాడు కింద పడి గిలగిలలాడుతున్నాడు.‘‘నువ్వు చెప్పరా? ఎవరు మీ ఇద్దరు?’’ మళ్లీ బిగుసుకుంటోంది పిడికిలి.‘‘నాకేం తెల్దు దొరా! నాకేం తెల్దు!’’ ఈసారి ముఖం పగిలిపోయేటట్టు కొట్టాడు చింతపల్లి పోలీసు, రెండోవాడిని.పెదవి పగిలి చివ్వున చిమ్మింది రక్తం. ‘‘చెప్పండి!’’ ఆ ఆరుగురు కలసి నరకం చూపిస్తున్నారు. అయినా నోరు విప్పడం లేదు.ఆ మొండి పట్టుదలతోనే పోలీసులకి రూఢీ అయింది.‘‘మీరు కొండదళంలో వాళ్లే. చెప్పండి! Æమరాజు ఎక్కడున్నాడు?’’ పళ్లు నూరుతూ అడిగాడు చింతపల్లి పోలీసు.మళ్లీ ఎముకలు విరిగేటట్టు గుద్దారు.‘‘మీరు ఇవాళ ఏదో ఒకటి చెబితేనే బతుకుతారు. లేకపోతే ఇక్కడే చస్తారు.’’ గంట తరువాత మాంసం ముద్దలైపోయారు ఆ కొండవాళ్లు ఇద్దరూ. మొత్తానికి చెప్పించాడు చింతపల్లి పోలీసు. వెంట తెచ్చిన ఒక లూయీస్ గన్తో పెద్దగడ్డపాలెం వైపు ఉరికింది మలబార్ బలగం. ఒకచోట విశాలమైన వరిపొలాలు కనిపించాయి. మధ్య మధ్య చింతచెట్ల గుబుర్లు. తుపాకులు బారుపెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు డబ్బయ్ మంది.అన్ని వైపులా దృష్టి సారించుకుంటూ సాగుతున్నారు. బాగా పెరిగిన వరిపొలం గట్టున నడుస్తుంటే, చాటు నుంచి హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. ఆ వరిపొలంలో తుపాకులుపేలిన వైపు పరుగులు తీశారంతా. అక్కడ ఎంత హఠాత్తుగా కాల్పులు మొదలైనాయో, అంత హఠాత్తుగానూ ఆగిపోయాయి కాల్పులు.వరిచేలకి ఒకవైపు ఉన్న కొండ మీద రహస్య స్థలాల నుంచి బయటపడి అక్కడ నుంచి కాల్పులు మొదలుపెట్టింది కొండదళం. కానీ ఒక పక్క నుంచి జాన్ బృందం, మరో పక్క నుంచి చార్స్లీ దండు ఒక్కసారే కాల్పులు మొదలుపెట్టి కొండదళం అయోమయంలో పడిపోయేటట్టు చేశారు.ఆ అయోమయం నుంచి బయటపడి పోలీసు బలగాన్ని ఎదుర్కొనాలని మూడుసార్లు చేసిన ప్రయత్నం కూడా విఫలమైపోయింది. కొండ మీద ఉన్న ప్రధాన దళం మినహా, మిగిలిన వారంతా వరిచేలలో పాక్కుంటూ అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం ప్రారంభించారు. వరిచేల మీదుగా పారిపోవడం అంటే, పోలీసు బలగాల ఎదుటి నుంచి వెళ్లడమే. ఒక ఉద్యమకారుడు అక్కడికక్కడే కూలిపోయాడు.కొండదళాన్ని తరుముకుంటూ జాన్ బృందం వెళ్లింది. వరిచేలకి అవతలే కొద్దిదూరంలో మళ్లీ జొన్నచేలు కనిపించాయి. మనిషి ఎత్తున ఉంది పైరు. అక్కడికి వెళ్లాక గాని రామరాజు సేనకు ఊపిరి తీసుకుని తిరిగి కాల్పులు జరపడానికి వీలుకాలేదు. అప్పుడే లూయీస్ గన్ ప్రయోగించడం మొదలుపెట్టాడు జాన్. కొండదళం తట్టుకోలేక నిష్క్రమించక తప్పలేదు. గుళ్లని వర్షిస్తోంది అది.మరో ఇద్దరు కొండదళం సభ్యులు పడిపోయారు. వాళ్లలో హాహాకారాలు. ఇవతల పక్క జమేదార్ కేశవనాయర్ కడుపు మీద తూటా తగిలి బలమైన గాయమైంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏడుపులు పెడబొబ్బలతో చేతి కందిన సామాను తీసుకుని ఇళ్ల నుంచి కట్టుబట్టలతో ఎవరికి తోచిన దిక్కుకు వారు పరుగెడుతున్నారు. వరసగా గ్రామాలన్నింటికీ చేరుతోంది సమాచారం. తల్లడిల్లిపోతున్నారు కొండప్రజలు. కొండ కనుమలలో గాలిస్తున్న స్వెయిన్ బలగాలకి కూడా పెద్దగడ్డపాలెం కాల్పుల గురించి తెలిసింది. 47 మంది నాన్ కమిషన్డ్ అధికారులు, ఇంకో పటాలం మలబారు దళం, కీనే, సుబేదార్ ఫణిక్కర్, పరమేశ్వరన్ నాయర్ అనే మరో మలబార్ దళం అధికారి హుటాహుటిన ట్రక్కులలో అక్కడకి చేరిపోయారు. అంతా కలసి కొండదళాన్ని తరుముకుంటూ వెళ్లారు.కొంతదూరం వచ్చేసరికి మళ్లీ ఎవరూ కనిపించలేదు. సాయంత్రం అవుతోంది. అయినా వెనుదిరగకుండా గాలిస్తూనే ఉన్నారు. ‘‘ఇక్కడే ఉంటారు. ఇవాళ వదిలే ప్రశ్నే లేదు.’’ జాన్ శపథం చేస్తున్నట్టే అన్నాడు.అప్పుడే అటుగా వచ్చారు ఒక గిరిజన కుటుంబం. ఈ కాల్పులకు భయపడే సామాను పట్టుకుని ఎటో పోతున్నారు.వాళ్లని కొట్టినంత పనిచేస్తే కొందరు విల్లమ్ములతో లింగాపురం వైపు వెళుతూ కనిపించారని చెప్పారు. పెద్దగడ్డపాలానికి అయిదు మైళ్ల దూరంలోనే ఉంది లింగాపురం. అక్కడే పెద్ద వాగు కనిపించింది. జాన్, చార్స్లీ అలసటతో దాని గట్టున కూలబడ్డారు. బలగాలు చుట్టూ వెతుకుతూనే ఉన్నాయి. చీకట్లు పడిపోతున్నాయి. బ్యాటరీ లైట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అప్పుడే ఎలా వచ్చిందో ఆ ఆలోచన, స్వెయిన్కి. ఆ వాగులోనే దిగి, వాయువ్యంగా అలాగే శబ్దం కాకుండా నెమ్మదిగా నీళ్లలో నడిచాడు. ఆ వెనకే సుబేదార్ ఫణిక్కర్. ఇద్దరూ గన్లు గురిపెట్టి నడుస్తున్నారు.తన కళ్లని తనే నమ్మలేకపోయాడు స్వెయిన్. అక్కడే ఉంది కొండదళం స్థావరం. ఒక్క క్షణం పరికించాడు. ఒక పక్క ఎవరో కొందరు వంటలు చేస్తున్నారు. కొందరు తూటాలు తగిలిన వాళ్లకి ఏవో ఆకులు వేసి కట్లు కడుతున్నారు. రెండు నెగళ్లు వేసి ఉన్నాయి అప్పటికే. వాటి వెలుగులో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే రెండు కడవలు తీసుకుని అటు వచ్చారు ఇద్దరు. ఆ ఇద్దరిని వెనుక నుంచి పీకలు పట్టుకుని చాలాదూరం వెనక్కి లాక్కుపోయారు ఇద్దరు పోలీసులు. అంతలోనే ఒకడు తప్పించుకున్నాడు. ఒక్క ఉదుటన దూకాడు. కానీ గురి తప్పింది. ఫణిక్కర్ తుపాకీ అడ్డం పెట్టాడు. దాని బాయ్నెట్ మీద పడిపోయాడు. కడుపు చీరుకుపోయింది. కొద్దిసేపటికే చనిపోయాడు. అతడు శరభన్న పడాలు. వెనక్కి వచ్చిన స్వెయిన్ సంగతి చెప్పి, మలబారు దళాలను మూడు భాగాలు చేశాడు. ఒక విభాగం నీటిలో నుంచే వెళ్లింది. రెండో విభాగం వెనుక పక్కకు వెళ్లి మాటు వేసింది. మరొకటి ముందుకు వెళ్లింది. పగలంతా యుద్ధం. తిండి లేదు. అంతా డస్సిపోయి ఉన్నారు కొండదళంలో.అప్పుడు రెండు విభాగాలు ఒక్కసారిగా విరుచుకుపడి కాల్పులు ప్రారంభించాయి. అయినా కొందరు వీరోచితంగా ఎదురొడ్డి పోరాడారు. కాల్పులు జరిపారు. కానీ ఎదుర్కొనడం సాధ్యం కాలేదు. అక్కడే ఉన్న కొండగుహలోకి పారిపోయారంతా. నిజానికి అసలు స్థావరం అదే.రామరాజు కోసం, ఇతర నాయకుల కోసం అక్కడ పక్కలు కూడా వేసి ఉన్నాయి. రామరాజు అక్కడే ఉండి, గాయపడిన వాళ్లకి ఏవో లేపనాలు పూస్తున్నాడు కాగడాల వెలుగులో.ఆ పక్కల మీద ఎవరో ఉన్నారని కాల్పులు సాగించారు. నిజానికి రామరాజు పడుకునే పరుపు మీద కూడా కాల్పులు జరిగాయి. -
ఆకుపచ్చ సూర్యదయం
‘‘ఔను. వచ్చాడు. మీరు వస్తున్నారని పదిహేను రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా నిన్ననే పటాలంతో దిగాడు. ఎంత నవ్వొచ్చే సంగతంటే– రిజర్వు దళాల చేత తాలూకా ఆఫీసులో ఫైళ్లన్నీ సర్దించి, వాటిని రాజమండ్రి పంపారు. పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఖాళీ చేయించి ఎక్కడికో పట్టుకెళ్లారు. రాక ఏం చేస్తాడు? మిమ్మల్ని సజీవంగా పట్టుకోమని కలెక్టరు దొర వారి ఆదేశం మరి!’’ చెప్పాడు పంతులు.‘‘నేను ఇక్కడ ఉన్నట్టు, మీరూ వచ్చినట్టు ఈపాటికి తెలిసి ఉండాలి. రాడేం?’’ ప్రశ్నించాడు రామరాజు.‘‘అతడు వచ్చింది మిమ్మల్ని అరెస్టు చేయడానికి కాదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రభుత్వం భయపెడుతున్నట్టు, వెంటాడుతున్నట్టు ప్రజల్లో ఒక భావన, భయం పెంచడానికే వచ్చాడు.’’ అన్నాడు పంతులు.‘‘అంటే ఈ సాచివేత, ఈ వెనకడుగు ఒక వ్యూహమేనంటారు!’’ ఒక్క నిమిషం మౌనం తరువాత అన్నాడు రామరాజు. ‘‘సరిగ్గా గ్రహించారు. రామరాజుగారూ! నేనొకటి అడగనా? ఈ ప్రయాణం ఎక్కడికి? రాజ్యాన్ని స్థాపిస్తామని చెబుతున్నారని విన్నాను. అది సాధ్యమా?’’ సూటిగా అడిగాడు పంతులు. ‘‘నేను ఈ కొండలలో రాజ్యాన్ని నిర్మిస్తానా? భారతదేశమే స్వతంత్రం కావాలని అనుకుంటున్నానా? వీటికి సమీప భవిష్యత్తులోనే సమాధానాలు దొరుకుతాయి. ఒకటి మాత్రం చెబుతాను. ఈ దేశంలో పుట్టిన ఎవరికైనా మాతృభూమికి స్వేచ్ఛ కల్పించాలన్నæ ఆశయం ఉండవచ్చు. ఉండాలి కూడా. ’’ కొంచెం ఆవేశంగానే చెప్పాడు రామరాజు. ‘‘గాంధీగారి పోరాటం మాటేమిటి?’’ అడిగాడు పంతులు.‘‘ఆయన పోరాటం మాటేమో గానీ, ఆయన వ్యక్తిత్వం ఆదర్శనీయం. నేను సాయుధ పోరాటం ద్వారానే మన దేశానికి స్వరాజ్యం వస్తుందనే నమ్ముతున్నాను. అహింస అంటే పోలీసుల లాఠీలకి, తుపాకులకి అమాయక ప్రజలని అప్పగించడం మాత్రం కాదు.’’ అన్నాడు రామరాజు. తను తెచ్చిన సంచిలో నుంచి అరటిపళ్లు తీసి రామరాజు చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా నమస్కరించి అన్నాడు పంతులు, ‘‘మరి సెలవా!’’ ‘‘ఏదీ చెప్పకుండానే!’’ అన్నాడు రామరాజు వాటిని అందుకుంటూ, ఎంతో ఆశ్చర్యంగా. ‘‘ధర్మబద్ధమైన మీ వాదన ఏమిటో తెలుసు. వాళ్ల పశుత్వం గురించీ తెలుసు. మీకేదో హితబోధ చేయాలని పశుత్వానికి ప్రతినిధిగా నేను రాలేదు రామరాజుగారూ! మీ దర్శనం కోసం వచ్చాను. వెళుతున్నాను.’’ అన్నాడు పంతులు. అరటిపళ్లు ఎర్రేసు చేతికి ఇచ్చి పంతులును గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు రామరాజు. ‘‘మిమ్మల్ని కలవడం నాకూ ఆనందమే. సాయంత్రం నాలుగు గంటలకి పోలీసు స్టేషన్కు వెళతాను. ఒకవేళ కలెక్టర్ అడిగితే ఇదే నా మాటగా చెప్పండి .’’సరిగ్గా సాయంత్రం నాలుగు గంటల వేళ. త్రివర్ణ పతాకధారి ముందు నడుస్తూ ఉండగా పోలీసు స్టేషన్ ముందుకు వచ్చింది రామరాజు దళం. అక్కడే నిలబడి తుపాకులు పేల్చింది, తమ రాకను తెలియచేస్తూ.స్టేషన్కు కొద్దిదూరంలోనే ఉన్న జాన్, అతడి సాయుధ పోలీసులు అటు నుంచి అటే జారుకున్నారు. స్టేషన్లో వెతకనవసరం లేదని కొండదళానికి తెలుసు. అప్పటిదాకా లోపల ఉన్న సబ్ మేజిస్ట్రేట్, సబ్ఇన్స్పెక్టర్, మఫ్టీలో ఉన్న ఐదుగురు కానిస్టేబుళ్లు వినయంగా బయటకు వచ్చారు. నమస్కరించి మౌనంగా వెళ్లిపోయారు.ఐదుగంటలకి ఊరిలో డబ్బాల మెట్ట దగ్గరకి వచ్చాక మళ్లీ తుపాకులు పేల్చారు ఉద్యమకారులు.మునసబు, తాలూకా ఆఫీసులో ఒక గుమాస్తా, గ్రామపెద్దలు స్వాగతం పలికారు. అంతా కలపి నలభై మంది. ‘‘రంపచోడవరం జనాభా ఇంతేనా?’’ నవ్వుతూ అడిగాడు రామరాజు మునసబుని.‘‘ఏం చెప్పమంటారు? కాల్పులకి భయపడి వెళ్లిపోయారు’’ తాలూకా ఆఫీసు గుమాస్తా అన్నాడు.‘‘మునసబుగారూ! అందరినీ పిలిపించండి! నేను ఇక్కడే ఉంటాను.’’ చెప్పాడు రామరాజు.వెంటనే టముకు వేయించాడు మునసబు. సంత జరిగే చోటుకు వచ్చి రామరాజు గారు చెప్పేది వినవలసిందని బారిక టముకు వేశాడు. అంత వరకు రామరాజు, ఆయన బృందం ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఒక చెట్టుకింద ఉన్నారు. గంతన్నదొర, శరభయ్యదొర రామరాజు పక్కనే తుపాకులు పట్టుకుని నిలబడ్డారు. చిత్రంగా గంటలోనే దాదాపు ఎనిమిదివందల మంది వచ్చి చేరారు. ఖాకీ నిక్కరు, ఎర్ర ఖద్దరు చొక్కాలో రామరాజును చూశారు. భయమంతా పటాపంచలైపోతోంది. దగ్గరగా వచ్చి నమస్కారం చేస్తున్నారంతా. ఎవరో మరి, ఒక ఆవునే అక్కడికి తోలుకు వచ్చాడు. కూడా తెచ్చిన చెంబులోకి కొంచెం పాలు పిండి భక్తిగా రామరాజుకి అందించాడతడు. ఉద్యమకారులకి మునసబు భోజనాలు పెట్టించాడు. సభ ఆరంభమైంది. క్లుప్తంగా ప్రసంగించాడు రామరాజు. హత్తుకునే విధంగా చెప్పాడా నాలుగు మాటలు. ‘‘ప్రజలు భయపడే పని, ఆశయం తల దించుకునే పని ఎక్కడైనా కొండదళం చేసినట్టు మీ దృష్టికి వచ్చిందా? చెప్పండి! ఇది ఫితూరీ కాదు సోదరులారా! స్వాతంత్య్రోద్యమం. ఈ పోరాటం ప్రజల మీద కాదు. ప్రజల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం ఈ తెల్ల ప్రభుత్వం మీద చేస్తున్న పోరాటం. కొండదళం మిమ్మల్ని దోచుకోదు. గుండెల్లో దాచుకుంటుంది. మేం మీ సోదరులం. మనమంతా ఒకేజాతి వాళ్లం.’’ అంతా జేజేలు పలికారు. పది గంటలకి సభ అయిపోయింది. అందరినీ ఇళ్లకి వెళ్లమన్నాడు రామరాజు.రాత్రి ఉద్యమకారులంతా ట్రావెలర్స్ బంగ్లాలో బస చేశారు. తెల్లవారే సరికి ఎవరూ అక్కడ కనిపించలేదు. 5 ‘‘మొన్న రామవరం దగ్గర గాయపడ్డాడు ఒక పోలీసు. అతని బెడ్ ఎక్కడ?’’ ఎదురుగా వస్తున్న డాక్టర్ని అడిగాడు స్టీవర్ట్. ‘‘ఆ రెండో వార్డులో పదో నెంబరు’’ చెప్పాడు డాక్టరు. నిన్న మొన్నటి దాకా అది నర్సీపట్నం లోకల్ ఫండ్ హాస్పిటల్. ఇప్పుడు బేస్ హాస్పిటల్. 50 పడకల క్లియరింగ్ ఆస్పత్రి కూడా. దామనపల్లి ఘటన తరువాత ఆగమేఘాల మీద సిద్ధమైంది. స్టీవర్ట్కి పక్కనే నడుస్తున్న సాండర్స్ ఇంకా అవమానభారం నుంచి కోలుకోలేదనిపిస్తోంది. రామవరంలో శ్రీరామరాజు దళం మీద దాడి చేయబోయి భంగపడ్డాడు. ఈ పదో నెంబరు బెడ్ పోలీసు అప్పుడు గాయపడిన వాళ్లలో ఒకడు. అతడిని చూడ్డానికే సాండర్స్ వస్తే, మరెవరినో చూడడానికి వచ్చి కలిశాడు స్టీవర్ట్.‘‘మలబారు దళాలు వచ్చేదాకా చొరవ తీసుకోవద్దని చెప్పారు కదా! ఎందుకు ఆ హైరానా?’’ సూటిగానే అడిగాడు స్టీవర్ట్.‘‘అడ్డతీగెల, రంపచోడవరం పోలీసు స్టేషన్లని చెప్పి మరీ కొట్టారు కొండవాళ్లు. ఈసారైనా నిరోధిద్దామని వెళ్లాను.’’ అన్నాడు సాండర్స్. ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అతడు. వైద్య సౌకర్యాలను కొన్ని రెట్లు పెంచారు. పోలీసు బలగాలకే కాదు, వైద్య కేంద్రంగా కూడా మారింది నర్సీపట్నం. పన్నెండు మంది సబ్ సర్జన్లను నియమించారు. నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ దాకా తీసుకువెళ్లడానికి ఒక ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే అటు రాజమండ్రి, కాకినాడ, లేదా ఇటు విశాఖపట్నం తీసుకెళ్లడానికి వీలుగా రైళ్లకు అందించడానికి ఆ ఏర్పాటు జరిగింది. కలకత్తా నుంచి వచ్చేవీ, కలకత్తా వెళ్లేవీ ప్రధాన రైలు బళ్లన్నీ ఉద్యమం జరుగుతున్నంత కాలం నర్సీపట్నం రోడ్డు స్టేషన్లో ఆపే ఏర్పాటు కూడా చేశారు. కృష్ణదేవిపేట (పద్నాలుగు పడకలు), లంబసింగిల (నాలుగు పడకలు)లో అంబులెన్సులతో సహా ప్రాథమిక చికి త్సా కేంద్రాలు వెలిశాయి. బెడ్ మీద నిద్రపోతున్నాడు కానిస్టేబుల్. పేరు –అడ్డాల సుబ్బారావు. నిడదవోలు.లేపడం ఇష్టం లేక మళ్లీ ఇద్దరూ డీఎస్పీ కార్యాలయం దగ్గరకి బయలుదేరారు.రామవరం దాడిని మరచిపోలేకపోతున్నాడు సాండర్స్. అందుకే అధికారులకి రాసిన నివేదికలో నిర్మొహమాటంగా అంగీకరించాడు. అప్పుడు రాసిన మాటే అందుకు నిదర్శనం–‘ఐ వాక్డ్ ఇన్గ్లోరియస్లీ హోమ్’ (నేను అవమానకరంగా ఇంటి ముఖం పట్టాను). 6 బారిక మోగిస్తున్న డప్పు గంగరాజు మాడుగుల అంతా వినిపిస్తోంది. ఊళ్లో చాలామంది చావడి దగ్గరికి వచ్చారు. వాళ్లలో డొలవుడు కూడా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఏం జరిగినా గంతన్నకు సమాచారం చేరవేస్తుంటాడు. ‘‘గూడెం, పాడవ తాలూకాల మొదలు, మైదానాలలో మాడుగుల దాకా నివసించి ఉన్న ప్రభుత్వ విధేయులు, ప్రజలకు తెలియచేయునది ఏమనగా!‘‘తుపాకులు, పిస్తోళ్లు, తుపాకీల కత్తులు, పట్టాకత్తులు మొదలైనవి కలిగి ఉన్నవారు, వాటిని వెంటనే కృష్ణదేవిపేట, చింతపల్లి, పాడేరు పోలీసు స్టేషన్లలో– ఏదో ఒకచోట– అప్పగించాలని పోలీసువారు ఆదేశిస్తున్నారు. ఆయుధాలు తీసుకువెళుతున్న వారంతా ఫితూరీకి చెందినవారని బ్రిటిష్ ప్రభుత్వం భావించవచ్చు. కాల్చి చంపవచ్చు. త్వరలో మలబారు ప్రత్యేక పోలీసులు వస్తున్నారు కాబట్టి ఆయుధాలు అప్పగించే పని వెంటనే పూర్తి చేయవలసిందని పోలీసు వారు ఆదేశిస్తున్నారు. ‘‘మలబారు పోలీసులు చాలా కఠినంగా ఉంటారనీ, ప్రతి ఇల్లు తనిఖీ చేస్తారనీ కూడా పోలీసువారు హెచ్చరించడమైనది.’’ అర్ధరాత్రి దాటుతుండగా నెమ్మదిగా వచ్చి తన ఇంటి అరుగు మీద కూర్చున్నాడు డొలవుడు. వెన్నెల రోజులు. కొంచెం చలిగా ఉంది. ఇంటి లోపలికి వెళ్లాలంటే, పోలీసులు ఇల్లు చుట్టుముడతారేమోనని భయం. ఒక్కసారి గట్టిగా గాలి వీచింది. చేను మధ్యలో ఉన్న వెదురుపొద బొంగులు ఒరుసుకుంటూ శబ్దం చేస్తున్నాయి. ఆ గుబురు ఇప్పుడు కొంచెం పలచబడింది. కొద్దిరోజుల క్రితం డొలవుడే కొన్ని బొంగులు నరికేశాడు. వాటి మధ్య నుంచి కొంచెం దూరంలోనే కనిపిస్తోంది ఒంటరి వెట్టి బంగ్లా. కొండవాళ్ల చేత వెట్టి చేయించి కట్టారెప్పుడో. అలసటగా ఉంది. అరుగు మీదే కునికిపాట్లు పడుతూ గడుపుతున్నాడు.అప్పుడే దూరంగా కోలాహలం, హఠాత్తుగా. తెలివి తెచ్చుకుని చుట్టూ చూశాడు డొలవుడు. కొండదారి వెంటే గ్రామంలోకి దిగుతోంది మలబారు దండు. వాన పడేటట్టుంది.సందేహం లేదు. ఆ పెట్రోమాక్స్ లైట్లు, రెండు మూడు బ్యాటరీ లైట్లు అవన్నీ దండుకు సంబంధించినవే. గ్రామంలోకే వస్తున్నారు. ఒక్కసారిగా బిక్క చచ్చిపోయాడు. అదిగో, దండు తన ఇంటివైపే వస్తోంది. మెదడు మొద్దుబారిపోతోంది. ఇప్పుడు ఆ పెట్రోమాక్స్ లైట్లు, బ్యాటరీ లైట్లు మరింత కాంతిమంతంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విన్న చాటింపే చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి నిలబడ్డాడు డొలవుడు. ఎండిన ఆ చేనుకు అడ్డంబడి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ వెదురుపొద దగ్గరగా వెళ్లాడు. వరసగా నరికిన వెదురు బొంగులు– శూలాల్లాగ. పోలీసులు ఇంకా దగ్గరగా వచ్చారనిపించింది. ఆకాశం కేసి చూశాడు ఆందోళనగా. చినుకులు పెద్దవవుతున్నాయి. గ్రామదేవతని è లుచుకున్నాడు భక్తిగా. మొలతాడులో నుంచి గోచీ వెనక భాగం కిందకి లాగేశాడు.మోకాళ్ల ఎత్తు వరకు ఉన్న శూలం లాంటి బొంగుకి అటు ఇటు కాళ్లు వేసి నిలబడ్డాడు. పిరుదులు ఎడం చేసి, గుదాన్ని ఆ వెదరుబొంగు కొస మీద ఆన్చాడతడు.అంతే, కాళ్లు రెండు ఒక్కసారిగా పైకి ఎత్తేశాడు. అడవి ఉలిక్కిపడినంత హృదయ విదారకమైన కేక. కొన్ని నిమిషాలలోనే దూరంగా మెరుపు.. వెట్టి బంగ్లాను వెతుక్కుంటూ వచ్చిన మలబారు దండు సరిగ్గా వర్షం మొదలయ్యే సరికి లోపలికి దూరిపోయారు. ‘‘అమ్మయ్య! ఇది ఇక్కడ ఉండడం బాగా పనికొచ్చింది!’’కురిసి కురిసి వర్షం ఎప్పుడో వెలిసిపోయింది. తెల్లవారి వెలు వచ్చింది. ఆ దారిన పోతూ ఎవరో చూశారు– ఆ దృశ్యాన్ని.వెదురుపొద ఉన్న ఆ చిన్న దిబ్బ నెత్తుటి పూత పూసుకుని ఎర్రబడింది. మొలతాడు నుంచి వేలాడుతోంది గోచీ– రక్తంలో సగం తడిసిన తెల్లజెండాలా. పళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉంది నాలుక. తను పుట్టిన కాలానికి ఎంత క్రౌర్యం ఉందో దర్శించి విచలితమైపోయినట్టున్నాయి, ఉబికి వచ్చిన కనుగుడ్లు.డొలవుడు కొర్రు దిగి చచ్చిపోయాడు. భయం... భయానికి తట్టుకోలేక కొర్రు దిగి చనిపోయాడు. ∙∙ ‘మన్యాన్ని ఇంత భయపెట్టినవాళ్లం! మమ్మల్ని ఇప్పుడు ఇంత భయం ఎందుకు ఆవహించింది?’ ఒక్కసారిగా ప్రశ్నించుకున్నాడు ఫర్బీస్. రామరాజును కృష్ణదేవిపేటకు చేర్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ భయం పెరిగిపోతోంది. ఈ రెండేళ్ల యుద్ధంలో ఎట్టకేలకు తాము గెలిచినట్టు సంకేతాలు కచ్చితంగా కనిపిస్తున్నా భయంగానే ఉంది. ఇన్నాళ్లూ మేం భయపెట్టాం. గెలిచినా భయపడుతున్నాం. ఇదేమిటో? అనుకున్నాడు ఫర్బీస్. అరెస్టయి వచ్చిన రామరాజుని స్పెషల్ కమిషనర్ ఎక్కడికి తీసుకువెళతాడు? పదవ అధ్యాయం 1 ‘‘అధ్యక్షా! ప్రశ్న ఒకటి: విశాఖ మన్యంలో తిరుగుబాటును ప్రబోధిస్తున్న సహాయ నిరాకరణవాదిని పోలీసు బందోబస్తుతో ఒక సబ్ఇన్స్పెక్టర్ ఏజెన్సీ డివిజన్ నుంచి పంపించారా, లేదా?’’ చెన్నపట్నంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్లో కౌన్సిల్ చాంబర్స్ భవనం. నవంబర్ 13, 1922. లెజిస్లేటివ్ కౌన్సిల్లో శశిభూషణ్ ర థ్ లేచి ప్రశ్నలు సంధించడం ఆరంభించారు. విషయం విశాఖ మన్యంలో శ్రీరామరాజు పోరాటం. సభలో ఒక్కసారిగా అలజడి రేగింది. ముఖ్యమంత్రి పానగల్లు రాజా రామరాయణింగార్ సభలోనే ఉన్నారు. తలపాగాతో, లాంగ్కోటు, పైజమాతో ఒక రాజులాగే ఉన్నారు. మంత్రులు కూర్మా వెంకటరెడ్డినాయుడు, అన్నెపు పరశురామపాత్రో కూడా దగ్గరదగ్గరగా అలాంటి వేషధారణలోనే ఉన్నారు. అగరం సుబ్బరాయలురెడ్డియార్ తప్పుకోవడంతో మంత్రిగా అవకాశం పొందినవాడే ఏపీ పాత్రో. అంటే అన్నెపు పరుశురామపాత్రో. నేరుగా ఎన్నికైన సభ్యులు, ప్రభుత్వం నియమించిన సభ్యులు అంతా తలపాగాలతో, లాంగ్కోట్లతో ఉన్నారు. కౌన్సిల్ అధ్యక్షుడు లేదా స్పీకర్ దివాన్ బహదూర్ పెరుంగ్వూర్ రాజగోపాల ఆచారియర్, కేసీఎస్ఐ; సీఐయీ. గతంలో మద్రాసు ప్రెసిడెన్సీ న్యాయశాఖలో పనిచేసిన ఆచార్య స్వతంత్ర సభ్యుడు. దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు సర్ లయోనిల్ డేవిడ్సన్, ఆర్థిక విభాగం సభ్యుడు సర్ చార్లెస్ థోడ్హంటర్, రెవెన్యూ విభాగం సభ్యుడు మహమ్మద్ హబీబుల్లా, న్యాయ వ్యవహారాల విభాగం సభ్యుడు ఎస్. శ్రీనివాస అయ్యంగార్ కూడా సభలోనే ఉన్నారు. ప్రభుత్వానికి చెందిన వారంతా సూటూ బూటూతో ఉన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎంపికై వచ్చిన సభ్యులను చూస్తుంటే కృష్ణదేవరాయల సభను చూస్తున్నట్టే ఉంది.రథ్ ప్రశ్నతో అంతా ఒక్కసారిగా తమ తమ స్థానాలలోనే నిటారుగా అయ్యారు. మద్రాసు మొదలు విజయనగరం వరకు పత్రికలలో నాలుగైదు నెలలుగా విశాఖ మన్యం అలజడుల వార్తలు హోరెత్తుతున్నాయి. సరిగ్గా అదే విషయం సభలో లేవదీశాడు రథ్. నలభై ఏళ్ల రథ్ మంచి వక్త. ‘‘ప్రశ్న రెండు: ఆ సహాయ నిరాకరణవాది వ్యవహారం పరిశీలించిన పౌర అధికారే మళ్లీ ఆ సహాయ నిరాకరణవాది మన్యంలో ప్రవేశించడానికి అనుమతించాడా? అలాగే ఆ సహాయ నిరాకరణవాది విషయంలో హద్దులు మీరుతున్నావంటూ పోలీసులను ఆ పౌర అధికారి నోరు పారేసుకున్నాడా? ‘‘ప్రశ్న మూడు: అల్లూరి శ్రీరామరాజు అనే ఆ సహాయనిరాకరణవాది మన్యానికి స్వతంత్ర అధినేత కావాలని కోరుకుంటున్నాడా? ‘‘ప్రశ్న నాలుగు: రంప ఏజెన్సీలో ఇంతకు ముందు కూడా ఇలాంటి తిరుగుబాట్లు జరిగాయి. అందుకు కారణాలు ఏమిటి? ‘‘ప్రశ్న ఐదు: ప్రస్తుత తిరుగుబాటును అణచడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అసలు ఈ తిరుగుబాటు తలెత్తడానికి కారణాలు ఏమిటో కూడా ఈ ప్రభుత్వం సభ్యులకు తెలియ చేయాలని కోరుతున్నాను.’’ రథ్ గంజాం జిల్లా వాడు. మంచి సాహిత్యవేత్త. న్యూ ఒరిస్సా అనే పత్రికతో పాటు, సత్యవాది, ప్రదీప అనే రెండు సాహిత్య పత్రికలు కూడా నడుపుతున్నాడు. ప్రత్యేక ఒరిస్సా రాష్ట్రం కోసం పాటు పడుతున్నాడు.127 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో 63 మంది జస్టిస్ పార్టీ సభ్యులే. ముఖ్యమంత్రి పానగల్లు రాజా కూడా ఆ పార్టీ వాడే. సహాయ నికారణోద్యమం చేస్తోంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. అందుకే బ్రిటిష్ వ్యతిరేక పోరాటం గురించి ఏ ప్రశ్న వచ్చినా దాని మీద చర్చ అంటే – అణచడం గురించి సూచనలు తీసుకోవడమే. దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కల్నల్ నాఫ్ సహా, అధికారులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ ర థ్ ప్రశ్నలకు ముందే విశాఖ మన్యంలో జరుగుతున్న ఆందోళనను అదుపు చేయడానికి మరోసారి 66,800 రూపాయలు మంజూరు చేయమని సభను అభ్యర్థిస్తూ నాఫ్ ఒక ప్రతిపాదన చేశాడు. అందుకు సభ మారుమాట్లాడకుండా ఆమోదించింది కూడా. విశాఖ మన్యంలో అలజడుల అణచివేతకే అదనంగా మరో లక్ష రూపాయల నిధి కోసం కూడా ప్రతిపాదన సభ ముందు ఉంది. సభాపతి ఆదేశం మేరకు దీనికి సమాధానం చెబుతూ ఈ విషయాలు ప్రభుత్వం వెల్లడించింది. అంటే నాఫ్ ప్రభుత్వం తరఫున సభలో చెప్పాడు. -
ఆకుపచ్చ సూర్యదయం
నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయం. కొన్ని నిమిషాలలోనే మొదలుకాబోతున్న ఆ సమావేశం ఎంత కీలకమైనదో తలుచుకుంటేనే గుబులు రేగుతోంది. వస్తున్నవాడు– మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కల్నల్ ఎ.ఆర్.కె. నాప్. దామనపల్లి ఘటన జరిగిన సరిగ్గా వారానికే ప్రత్యేకంగా ప్రభుత్వం పంపించింది. ఒక టేబుల్, కుర్చీ; వాటికి ఎదురుగా పదిహేను వరకు కుర్చీలు వేసి ఉంచారు. అడ్డతీగెల నుంచి ఈవ్లింగ్; కొయ్యూరు నుంచి డాసన్; కృష్ణదేవిపేట నుంచి ఫర్బీస్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కీనే; గుర్తేడు నుంచి హ్యూమ్; పెద్దవలస నుంచి సాండర్స్; గూడెం నుంచి టాల్బట్, చాడ్విక్; లంబసింగి నుంచి మార్టిన్–ఇలా ముఖ్యమైన పోలీసు అధికారులంతా వచ్చారు.కవర్డ్, హైటర్ల కాల్చివేత సమాచారంతో మరునాడే, అంటే 25వ తేదీన చేరిన టెలిగ్రామ్ ఫోర్ట్ సెయింట్ జార్ట్ని కలవరపరచింది. కీలక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని అర్థమైంది. వేసవికని ఊటీ వెళ్లిన గవర్నర్ విల్లింగ్డన్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ టెలిగ్రామ్ పట్టుకుని 26వ తేదీనే హుటాహుటిన వెళ్లి, విల్లింగ్డన్తో చర్చించి, వెంటనే నర్సీపట్నం బయలుదేరాడు. వెంట మద్రాసు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎ.జె.హెపెల్ ఉన్నాడు. ఉదయం పది గంటలకి సమావేశం. కవర్డ్, హైటర్ల సమాధులకి సెల్యూట్ చేసి, ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా గడియారం గంట కొట్టగానే ప్రహారీ లోపలకి అడుగుపెట్టాడు కల్నర్ నాప్.విశాఖ జిల్లా కలెక్టర్ సి.ఎ. హ్యాండర్సన్, పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్, ఏజెన్సీ కమిషనర్ స్టీవర్డ్స్ సెల్యూట్ చేసి లోపలికి తీసుకువచ్చారు కల్నల్ నాప్నీ, హెపెల్నీ.కల్నల్ నాప్ ఆరున్నర అడుగుల మనిషి. నోటిలో ఎబొనీ చర్చ్వార్డెన్ టుబాకో పైప్. దాని నల్లటి బౌల్ చూడ ముచ్చటగా, చక్కగా ఉంది. లోపలికి రాగానే అధికారులంతా సెల్యూట్ చేశారు. అందరినీ పరిచయం చేశాడు ఆర్మిటేజ్. అధ్యక్ష స్థానంలో కూర్చుని, పైప్ గట్టిగా పీల్చి చాంబర్ లోపల బూడిదని యాష్ట్రేలోకి పోసి పక్కన పెట్టాడు పైప్. అప్పుడే అందరి కేసి చూస్తూ, చిన్నగా నవ్వుతూ అన్నాడు నాప్.‘‘ఈ శిలారూపాలేమిటి నాముందు? మామూలుగా కూర్చోండి!’’ అన్నాడు. కాస్త ఊపిరి తీసుకున్నారంతా. ఒక నిమిషం తరుéత మళ్లీ నాప్ అన్నాడు– ‘‘గాయాలు ఎలా ఉన్నాయి!’’ ‘‘తగ్గిపోయినట్టే సార్!’’ అన్నాడు ఆర్మిటేజ్, చటుక్కున.‘‘గాలింపు ఆపేసి.. వారమైంది. ఎందుకు తగ్గవు!’’ అన్నాడు అంతే వేగంగా, నాప్.కంగుతిన్నారు అక్కడ కూర్చున్నవాళ్లు. ‘‘స్టీవర్డ్స్! ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎలా జరిగింది? ’’ అడిగాడు నాప్. చింతపల్లి స్టేషన్ మీద దాడి దగ్గర నుంచి దామనపల్లి దాడి వరకు అంతా వివరించాడతడు.‘‘సరిగ్గా ఒక్క నెల.... ఐదు ఘటనలు. ఒక్కచోట కూడా నిరోధించలేకపోయారా?’’ అన్నాడు నాప్. అందరూ మౌనంగా ఉండిపోయారు. ‘‘లంబసింగి రోడ్డు పనిలో జరిగిన హింసే కారణమట. నిజమా?’’ అడిగాడు నాప్.‘‘గూడెం డిప్యూటీ తహసీల్దారు బాస్టియన్ రాక్షసుడిలాగా ప్రవర్తించాడని చెబుతారు.’’ అన్నాడు ఆర్మిటేజ్.‘‘అందుకే తిరుగుబాటుదారుడిలో దేవుణ్ణి చూశారా వీళ్లు?’’ నవ్వుతూ అడిగాడు నాప్.‘‘అసలు ఈ రగడని అణచడానికి తిరుగుబాటుదారులకున్న ఈ ఒక్క బలహీనత చాలు. ఆ దేవుడే వీళ్లని రక్షిస్తాడట, విల్లూ బాణాలూ పట్టుకుని.....’’ అన్నాడు కీనే.అతడి కేసి తీక్షణంగా చూసేసరికి, ఠక్కున నోర్మూశాడు కీనే. నాప్ అడిగాడు ‘‘గ్రేట్వార్లో పనిచేశావా?’’. ‘‘లేదు, వెళ్లలేదు.’’ అన్నాడు కీనే. ‘‘పోనీలే. చూడు కీనే. ఈ కొండవాళ్లు రామరాజుని దేవుడనుకుంటూ బాణాలూ, విల్లులూ పట్టుకుని వాళ్లే యుద్ధం చేస్తున్నారు. మనమైతే దేవుళ్ల చేతే యుద్ధం చేయించాం! మోన్స్ యుద్ధం అదే. మనం మిషనరీ వాళ్లల్లా ఆలోచించకూడదు. మిలట్రీవాళ్లలా వ్యవహరించాలి. భౌతిక ప్రపంచంలో దైవభావన ఒక శూన్యం. అదే మనసు దాకా వెళితే తుపాను. వాళ్లందరిని అడుగులో అడుగు వేసి నడిపిస్తున్నదీ దైవభావనే.’’ అన్నాడు నాప్. ‘‘చాటు నుంచి యుద్ధం చేస్తాడు. అదే ఇబ్బంది.’’ అన్నాడు సాండర్స్ విషయం మారుస్తూ.‘‘కాబట్టి, మనం ఎలాంటి యుద్ధం చేస్తున్నామో ముందు తెలుసుకోవాలి. అప్పుడు ఎలా గెలవాలో తెలుస్తుంది. సంప్రదాయ సైన్యానికి వ్యతిరేకంగా ఇర్రెగ్యులర్స్ చేసేదే గెరిల్లా యుద్ధం. శ్రీరామరాజు చేస్తున్నది గెరిల్లా యుద్ధమే. దీన్ని ఇద్దరు మంచి ఆఫీసర్లు చచ్చిపోయాక గుర్తించారా తీరిగ్గా?’’ తీక్షణంగానే అడిగాడు నాప్. ‘‘మాకూ ఇప్పుడిప్పుడే కొండలలో పోరాడటం తెలుస్తోంది. కొన్ని వారాలలోనే అణచివేస్తాం’’ అన్నాడు ఆర్మిటేజ్. ‘‘అంత ధీమా ఏమిటి?’’ ఒక్క నిమిషం తరువాత ప్రశ్నించాడు నాప్.‘‘ఎవరూ లేనప్పుడు రెండు పోలీసు స్టేషన్లు కొడితేనే వీరుడా? ఆ శ్రీరామరాజు సరిగ్గా తుపాకీ కాల్చగలడని కూడా అనుకోను.’’ అన్నాడు స్టీవర్డ్స్.‘‘పోనీ.... ఈ క్లిపింగ్ చూసి ఏమనుకోగలవో చెప్పు!’’ అంటూ హెపెల్ వైపు తిరిగి, ‘‘మద్రాస్ మెయిల్ క్లిపింగ్ ఇటియ్యి!’’ అన్నాడు నాప్. బ్రౌన్ రంగు దళసరి కాగితం మీద అతికించి ఉంది క్లిప్పింగ్.పోలీసు స్టేషన్లను దోచుకున్న తరువాత మద్రాస్ మెయిల్ పత్రిక ప్రచురించిన చిన్న కథనం.ఆ క్లిపింగ్ స్టీవర్డ్స్కు అందిస్తూ ‘‘చదువు, అందరికీ వినిపించేలా!’’ అన్నాడు నాప్.చదవడం మొదలుపెట్టాడు స్టీవర్డ్స్.‘‘ఎవరీ యువకుడు? ‘‘విశాఖ మన్యం, రంప ప్రాంతంలో తిరుగుబాట్లు చేస్తున్న ఈ క్షత్రియ యువకుడు గోదావరి ప్రాంతం వాడు. ఇతడికి తుపాకీ కాల్చడం వచ్చు. ఒక రిటైర్డ్ పోలీసు దగ్గర నేర్చుకున్నాడని తెలుస్తోంది. గ్రేట్వార్ కాలంలో ఇతడు ఎక్కడ ఉన్నదీ ఇప్పటికీ అంతుపట్టని విషయమే. జర్మనీ సాయంతో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని కూలదోయవచ్చునని గట్టిగా నమ్మే సంస్థలతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ యుద్ధంలో పాల్గొనే ఉద్దేశంతో పోరాడేందుకు తర్ఫీదు పొందాడని చెప్పే కొన్ని ఆధారాలు కూడా దొరుకుతున్నాయి......’’‘‘చాలు!’’ అని చెప్పి, అందర్నీ చూస్తూ అన్నాడు నాప్ ‘‘ నేనిచ్చే సలహా ఒకటుంది– మనకి ప్రపంచ యుద్ధజ్వరం వదలాలి.’’.అందరి ముఖాలలో కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదు. మళ్లీ తనే అన్నాడు నాప్, ‘‘స్టీవర్డ్స్! కీనే! కొండలలో పోరాడటం తెలిసిన బలగాలు కావాలని మీరు ఇచ్చిన నివేదిక సరైనదేనని ప్రభుత్వం నమ్ముతోంది. తర్ఫీదు లేని జిల్లా పోలీసులను తొందరపడి ఈ పనికి వినియోగించారు. ఇది మీ తప్పిదం.’’ అంటూ ఒక నిమిషం ఆగాడు నాప్.‘‘సరే, ముందు ఈ తిరుగుబాటును అణచాలి. అదే మొదటి కర్తవ్యం. వినండి!’’ అంటూ చెప్పాడు నాప్. ‘‘శ్రీరామరాజుతో సహా మొత్తం ఆ ఎనభయ్ మందికి ఎవరూ సాయం చేయరాదని ప్రచారం చేయించాలి. తిరుగుబాటుదారులకు సాయం చేస్తే రాజద్రోహమవుతుందన్న సంగతీ, శిక్ష చాలా తీవ్రంగా ఉంటుందన్న సంగతీ ఎంత తొందరగా ప్రజలు గ్రహించగలిగేటట్టు చేస్తే అంత మంచిది. మోప్లా తిరుగుబాటు అణచివేత కోసం ఏర్పాటు చేసిన మలబారు దళాలు అక్టోబర్కల్లా ఇక్కడుంటాయి. సాయపడిన గ్రామాల మీద అపరాధ రుసుం విధించండి. గాలింపులతో ఉక్కిరిబిక్కిరి చేయండి! పూనాలో ఉన్న సదరన్ కమాండ్ సైనిక కేంద్రంతో íß జ్ ఎక్స్లెన్సీ గవర్నర్ వారు చర్చిస్తున్నారు. వైర్లెస్ సెట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. తిరుగుబాటు కేసులనే విచారించడానికి విశాఖపట్నంలోఎల్.హెచ్. ఆరంట్ జడ్జిగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నాం. మద్రాసు డిప్యూటీ పోలీసు కమిషనర్గా ఉన్న ఏజే హెపెల్ను ఏజెన్సీ కమాండర్ ఆపరేషన్స్ హోదాలో నియమించారు. మీరు ఆరోగ్యం గురించి, గాయాల గురించి ఇంక భయపడక్కరలేదు. ఆస్పత్రి సౌకర్యం పెంచారు.’’టేబుల్ మీద పెట్టిన పైప్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ చివరిగా అన్నాడు నాప్. ‘‘భయం... భయం సృష్టించండి! భయపెట్టడంతోటే సగం విజయం సాధించాలి. వీళ్లు చచ్చిపోవాలి భయంతో.’’ 2 ‘‘రాజమండ్రి వెళ్లి, సెంట్రల్ జైలు మీద దాడి చేస్తాడా రామరాజు!? చేయగలడా అని!’’ అన్నాడు విశాఖ ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్. ‘‘అంత సాహసం కొండదళానికి ఉందని నేనైతే అనుకోను!’’ తాపీగా అన్నాడు ఏజెన్సీ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ సాండర్స్. అంతలోనే పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్ కంఠం కంగుమంది. ‘‘ఆ ఖాకీ యూనిఫారాలు విప్పదీసి గోచీలు పెట్టుకోండి! అలా మాట్టాడ్డానికి సిగ్గులేదూ! ఆ పృథ్వీసింగ్ ఆజాద్ ఒక టెర్రరిస్టు. వాడిని ఆ కొండదళం విడిపించుకుపోయే కుట్రతో ఉంది అంటుంటే మీకు బుర్రకెక్కదేం?’’ కుర్చీలో నుంచి లేచి పై కప్పు ఎగిరిపోయేటట్టు అరిచాడు ఆర్మిటేజ్. ఆర్మిటేజ్లో అంత అసహనం చూడటం అదే మొదటిసారి. విశాఖపట్నం నుంచి ఆ ఉదయమే ఆగమేఘాల మీద వచ్చి చేరుకున్నాడు. ఆ ముందు రాత్రే స్టీవర్ట్, సాండర్స్, మార్టిన్, కోల్బ్రూక్, హ్యూమ్, ఫోర్బ్స్, స్వేనీ, కీనే, జాన్లకి వైర్లెస్ సమాచారం చేరింది. అంతా ఉదయం పదకొండు గంటలకల్లా లంబసింగిలో గప్పీదొర బంగ్లాకి చేరుకున్నారు. తెల్లజాతి అధికారులని తప్ప మరెవరినీ పిలవలేదు.రాజమండ్రి సెంట్రల్ జైలు మీద దాడి చేస్తానని శపథం చేశాడట రామరాజు. ఆ జైలులో బందీగా ఉన్న గదర్ పార్టీ నాయకుడు పృథ్వీసింగ్ ఆజాద్ను విడిపించుకుని వెళతాడట. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం కెనడా, అమెరికా దేశాలలో ఉన్న భారతీయులు స్థాపించిన విప్లవ సంస్థ – గదర్ పార్టీ. గదర్ అంటేనే పంజాబీ భాషలో విప్లవం అని. ‘‘రాజమండ్రిలో పృథ్వీసింగ్ని విడిపించడమంటే, రాజవొమ్మంగిలో వీరయ్యదొరని విడిపించడం వంటిదేననుకుంటున్నారా? రాజమండ్రి జైల్లోనే చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. గదర్ పత్రిక ఎడిటర్ జగత్రామ్ భరద్వాజ్ కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. ఇందరు ఉండగా రామరాజు పృథ్వీసింగ్ని విడుదల చేయబోతున్నాడన్న మాట ఎందుకు వచ్చింది? వీరయ్య ముసలి డేగ. పృథ్వీసింగ్ మానవ రక్తం రుచి మరిగిన నడివయసు పులి.’’ మళ్లీ అన్నాడు ఆర్మిటేజ్. హెపెల్ కలగజేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘‘మిస్టర్ ఆర్మిటేజ్! ఇది జరగనివ్వకూడదు. అందుకు ఎంత ప్రయత్నం అవసరమో అంత ప్రయత్నమూ మేం చేస్తాం. మొదట దేవీపట్నం దగ్గర నిఘా పెంచుదాం. రాజమండ్రిలో జైలు దగ్గర సిపాయీలే కాపలా ఉన్నారని మీకు ముందే సమాచారం అందింది.’’ అన్నాడు.‘‘రాజమండ్రి నుంచి తొందరలోనే వాడినీ, ఆ గదర్ పార్టీ వాళ్లనీ నాగపూర్ జైలుకి తీసుకుపోతారని విన్నాను. అప్పటిదాకా వేయి కళ్లతో కాపలా కాసుకోవాలి. ’’అన్నాడు ఆర్మిటేజ్. 3 ‘‘మలబారు పటాలాలు వస్తున్నాయని తెలిసి, ఇలా గూడెం కొండలు వదిలిపెట్టి రంప వైపు వస్తోందంటావా, కొండదళం?’’ ఆందోళనగా అన్నాడు జి.టి.హెచ్. బ్రేకన్, గోదావరి జిల్లా కలెక్టర్.‘‘రామరాజు కదలికలు అంతుపట్టకుండా ఉన్నాయి కదా !’’ బ్రేకన్ కంగారును ఇంకాస్త పెంచే మాట అన్నాడు రంపచోడవరం తహసీల్దారు దంతుర్తి అప్పలనర్సయ్య పంతులు. అడ్డతీగలకు ఐదు మైళ్ల దూరంలో ఉన్న తిమ్మాపురం ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశాడు బ్రేకన్. చీకట్లు పడుతున్న వేళ పంతులుని అక్కడికే రప్పించాడు. ‘‘సరే, ఆ ఇంటెలిజెన్స్ ఎస్ఐ పేరేమిటన్నావ్!’’ అడిగాడు బ్రేకన్, విసుగ్గా.‘‘సదావర్తి ఆదినారాయణ!’’ చెప్పాడు అప్పలనర్సయ్య. ఏం చెప్పాడు?’’ మళ్లీ అడిగాడు బ్రేకన్.‘‘శ్రీరామరాజు చెప్పిందే – పైడిపుట్టకు వెళతాను. అక్కడ పంచాంగం చూసి, ముహూర్తం పెట్టి అడ్డతీగలకు గానీ, రంపచోడవరం గానీ వెళతాను. ఈ విషయం మీద మీ అధికారులకి రిపోర్టు ఇవ్వు!– ఇదే దొరవారు.’’ అక్షరం అక్షరం ఒత్తి పలుకుతూ చెప్పాడు పంతులు. ‘‘నువ్వేం చెప్పావు వాడికి?’’ ఆత్రంగా అడిగాడు బ్రేకన్.‘‘అడ్డతీగలా? రంపచోడవరమా? అది కూడా తెలుసుకుని వచ్చి చెప్పమన్నాను.’’ అన్నాడు పంతులు. ‘‘ఏమైనా చెప్పాడా?’’ అడిగాడు బ్రేకన్.‘‘అడ్డతీగలకే వెళతానని........!’’ అన్నాడు పంతులు. ‘‘ఇదెవరు చెప్పారు?’’ బ్రేకన్ అడిగాడు.‘‘రామరాజే చెప్పాడు, ఆదినారాయణకి.’’వాక్యం పూర్తి చేశాడు పంతులు.‘‘ఏమిటి? ఆ ఇంటెలిజెన్స్ వాడు నేరుగా రామరాజునే అడిగి వచ్చాడా? ఏ పోలీసు స్టేషన్ కొడతారు బాబూ అని నేరుగా తిరుగుబాటుదారుడినే అడుగుతారా? తలకాయ ఉందా?’’ మండిపడ్డాడు బ్రేకన్. అసలు వారంరోజుల నుంచి విచ్చల విడిగా తిరుగుతోంది కొండదళం. పూనాలోని దక్షిణ కమాండ్ నుంచి వైర్లెస్ సెట్లు వచ్చాయి. హీలియో దీపాలు వచ్చాయి. అయినా కొండదళాన్ని నిరోధించే ప్రయత్నం చేయలేకపోతోంది యంత్రాంగం. ‘‘సార్! ఊరి బారిక మిమ్మల్ని కలవాలంటున్నాడు!’’ కంగారు పడుతూ వచ్చి చెప్పాడు క్యాంప్ క్లర్క్. ‘‘మతి పోతోందా? బారిక నన్ను కలవడం ఏమిటి? సంగతేమిటో కనుక్కుని పంపెయ్!’’ అసలే చికాకులో ఉన్న బ్రేకన్ గట్టిగా అరిచేశాడు.‘‘సార్! శ్రీరామరాజు పంపించాడట! ఏదో మీకే చెప్పాలట.’’ బ్రేకన్ అరుపులతో బెంబేలెత్తిపోయిన క్యాంప్ క్లర్క్ అసలు విషయం చెప్పాడు.‘‘రామరాజు దగ్గర నుంచి నాకు కబురా? తీసుకురా!’’ అన్నాడు బ్రేకన్.బారిక లోపలికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టి చిన్న చీటీ అందించాడు వినయంగా.మడత విప్పి చూశాడు బ్రేకన్. ఇంగ్లిష్లో ఉంది.కలెక్టర్ బ్రేకన్కి!‘‘నేను అడ్డతీగలకు రెండు మైళ్ల దూరంలోనే ఉన్నాను. పోలీసు స్టేషన్ని కొడతాను. రేపు మధ్యాహ్నం, అంటే అక్టోబర్ 16, 1922 మధ్యాహ్నం వరకు పైడిపుట్టలో ఉంటాను. తలపడటానికైనా రావచ్చు. మాట్లాడటానికైనా రావచ్చు. – అల్లూరి శ్రీరామరాజు. ’’ హఠాత్తుగా తుపాకులు పేలాయి, అడ్డతీగల పొలిమేరలలో. బలగాలని తరలించుకోవడానికి వైరిపక్షానికి చాలినంత అవకాశం ఇస్తున్న తీరులో రాత్రి పదిగంటల వేళ శ్రీరామరాజు తన దళంతో అడ్డతీగలలో అడుగుపెట్టాడు. దాదాపు తొంభయ్ మంది ఉన్నారు. ఆ విషయాన్ని ప్రకటిస్తూనే తుపాకులు మోగాయి. పది నిమిషాలలోనే పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చింది కొండదళం. మళ్లీ పేలాయి తుపాకులు.స్టేషన్ విడిచి పారిపోయారు పోలీసులు. వాళ్ల వెంటే ఇద్దరు రిజర్వు పోలీసులు వెళ్లిపోయారు. ‘‘లోపల వెతకవలసిన అవసరం లేదు.’’ అన్నాడు రామరాజు.డబ్బయ్ మైళ్లు నడిచి డస్సి పోయి ఉన్నారు సభ్యులు. అంతా గబగబా మూటలు విప్పుకుని అన్నం తిని స్టేషన్ అరుగు మీదే గొంగళ్లు కప్పుకుని నిద్రకి ఉపక్రమించారు. 4 అడ్డతీగల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన నాలుగో రోజే....అంటే అక్టోబర్ 19వ తేదీ..... తెలతెలవారుతుండగా శ్రీరామరాజు దళం రంపచోడవరంలో ప్రవేశించింది. మూడువందల మంది ఉన్నారు వెంట.ఊరికి మూడుమైళ్ల దూరంలో ఉన్న జలపాతం దగ్గర మొదట ఆగాడు రామరాజు. దట్టమైన అడవి. ఎర్రటి వేకువ వెలుతురును పచ్చటి ప్రతి ఆకు నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నట్టే ఉంది. ఎక్కడో, ఏదో శాఖ మీద పక్షి గొంతెత్తిందప్పుడు. ఒక లిప్త తరువాత దానికి జవాబుగా మరో పక్షి గొంతు పలికింది. ఒక జలపాతం కిందే స్నానం చేశాడు రామరాజు. అక్కడికి కొద్దిదూరంలోనే ఉంది మడుగుమల్లేశ్వరస్వామి ఆలయం. అక్కడికి కూడా వెళ్లి విభూతి నుదుట రాసుకున్నాడు. అంత దాకా ఓపికగా వేచి ఉన్న ఒక స్థానికుడు కాగబెట్టిన ఆవుపాల చెంబు అందించాడు భక్తిగా. ముందు చెప్పిన ప్రకారం ఎర్రేసు, మల్లుదొర వెళ్లి రంపచోడవరం తహసీల్దారు అప్పలనర్సయ్య పంతులును తీసుకుని వచ్చారు. ఎర్రని ఖద్దరు నిక్కరు, దాని మీద ఎర్రటి ఖద్దరు లాల్చీ ధరించి ఉన్నాడు రామరాజు. కాళ్లకి పోలీసు బూట్లు. పైన ఒక నల్లటి గొంగడి కప్పుకుని ఉన్నాడు. మెడలో పోలీసులు తగిలించుకునే తూటాల క్రాస్బెల్ట్ ఉన్నట్టు అర్థమవుతోంది.‘‘నమస్కారం తహసీల్దారు గారు!’’ అన్నాడు రామరాజు నవ్వుతూ. ‘‘ఎలా ఉన్నారు మీరు? పైడిపుట్ట నుంచి వెళ్లాక మళ్లీ ఇదే మిమ్మల్ని చూడటం. నిజంగా చాలా సంతోషం రామరాజుగారు!’’ రెండు చేతులు పట్టుకుని అన్నాడు పంతులు. అక్కడ, అడ్డతీగల పోలీసు స్టేషన్లోను ఇద్దరికీ బాగా పరిచయం.‘‘మీరు ఉత్తములు. నిజాయితీపరులు. ఆ తెల్లజాతికి వాస్తవాలు చెప్పకూడదా!’’ సలహా ఇస్తున్నట్టే అన్నాడు రాజు.‘‘నా ఉద్యోగం ఉండాలా?’’ నవ్వుతూ అన్నాడు పంతులు.‘‘బ్రిటిష్ వాళ్లని పంపేశాక గాంధీగారు మీ ఉద్యోగం మళ్లీ మీకే ఇస్తారులెండి!’’ నవ్వుతూనే బదులిచ్చాడు రామరాజు.‘‘నిన్న జాన్ సేనాని వచ్చాడట కదా!’’ అడిగాడు రామరాజు. -
ఆకుపచ్చ సూర్యోదయం
వెంటనే జయరాం వెనక్కి తిరిగి అన్నాడు, ‘‘ఆ న్యూస్ నిజమే. కిందకి దిగిపోయారట.తటాల్న నడుముకు ఉన్న ఎర్రతోలు హోల్స్టర్ నుంచి జర్మన్ సర్వీస్ పిస్టల్ లాగాడు కవర్ట్. ఇప్పుడే లోయ దిగి ఉంటారు. ఇటు.. అన్నాడు జయరాం. ‘‘మూవ్....ఉరుకుతూ అన్నాడు కవర్డ్. హోల్స్టర్ నుంచి తన బ్రిటిష్ సర్వీస్ పిస్టల్ తీశాడు, హైటర్ కూడా.కండచీమల బారులా దిగడం మొదలుపెట్టింది పోలీసు పటాలం. పరుగు తీయడానికి ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. అంత సన్నగా ఉంది బాట. గాముకొండ, ధారకొండ. వాటి మధ్య ఉయ్యాల ఊగుతున్నదే దామనపల్లి లోయ. కుడిపక్క ఉరుకుతోంది జలపాతం, గాముకొండ నుంచి. అందరూ తుపాకీల ట్రిగ్గర్ల మీద వేలు పెట్టే ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ వెనుక నడుస్తున్నారు కవర్ట్, హైటర్. వీరికి మరో ఆరేడు అడుగుల దూరంలోనే ప్రత్యేక పోలీసులు. ఎక్కువగా బళ్లారి స్పెషల్ పోలీసులు, ఇద్దరో ముగ్గురో నర్సీపట్నం, కృష్ణదేవీపేట పోలీసులు. ఈ బృందానికి నాయకుడు కవర్డ్. అంటే ఇద్దరు బ్రిటిష్ అధికారులు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 26 మంది పోలీసులు. ఇంకా చెప్పాలంటే ఇద్దరు బ్రిటిష్ అధికారులు, 28 రైఫిళ్లు. అన్నీ 303 రైఫిళ్లే. ‘‘ఇది నాలుగు మైళ్ల ఘాట్ ఆ నిశ్శబ్దాన్ని భరించలేక కవర్డ్ అన్నాడు. పదిహేను రోజుల నుంచి ఒక కసితో అడవిలో గాలిస్తున్నాడతడు. మొట్టాడం వీరయ్యదొరని రామరాజు దళం విడిపించడం పుండు మీద కారం చల్లినట్టయింది. లాగరాయి ఫితూరీ తరువాత అతడిని పట్టుకున్నది కవర్డే. అయితే రాజవొమ్మంగి నుంచి వచ్చిన పదిరోజుల లోపునే వీరయ్యని పట్టుకుని చింతపల్లి స్టేషన్లలో అప్పగించాడు కవర్డ్. దాంతో మళ్లీ నమ్మకం వచ్చింది. కానీ ఒంజేరి ఘాట్ మీద పోలీసులు చావు దెబ్బ తినడం కుంగదీసింది. ఉన్మాదిలా మారిపోయాడు కవర్డ్. అవేమిటి, ఆ రాళ్లు ఎవరో పేర్చినట్టు లేవూ, అసహజంగా?అనుమానంగా అడిగాడు హైటర్, ఒకచోట. ఒక్కసారి పరిశీలనగా చూసి, అలా అనిపించడం లేదే! అంటూ కొట్టిపారేశాడు కవర్డ్. దామనపల్లి ఘాటీ మీదే సరమండ అనే చోటు. సూర్యరశ్మిని భూమి మీద పడనీయడం లేదు చెట్లు. వాటి కింద ఉన్న చిన్న చిన్న తునికాకు, కుంకుడు చెట్లని ఏవేవో తీగలు చెట్లని కూడా కనిపించనివ్వకుండా పాకాయి. లోపల జంతువు ఉన్నదీ, మనిషి అయినదీ తెలియదు. లక్ష్మయ్య! ఎక్కడున్నారు తెల్లోళ్లు? ఘాటీ వైపే తుపాకి గురిపెట్టి, ట్రిగ్గర్ మీద వేలు ఉంచి, రెప్పవేయకుండా చూస్తున్న ఆ మనిషి అడిగాడు, గొంతు బాగా తగ్గించి. Vð ద్ద వేగంతో వస్తున్నారు.అల్లెతాడు మీద బాణం ఆన్చి కొంచెం పైన నిలిచి ఘాటీ వైపే చూస్తున్న లక్ష్మయ్య చెప్పాడు, తలైనా తిప్పకుండా. ఆ గొంతు ఎండుపడాలుదని పసిగట్టాడు లక్ష్మయ్య. పూర్తి పేరు కుందేరి లక్ష్మయ్య. దామనపల్లి స్థానికుడు. పడాలు కుడి పక్కకి తిరిగి చూశాడు– పన్నెండు మంది– ముగ్గురు తుపాకులతో, మిగిలిన వారు సంప్రదాయిక ఆయుధాలను ఎక్కుపెట్టి ఘాటీ వైపు చూస్తున్నారు. తుపాకులు పట్టినవాళ్లలో మొదటివాడు గోకిరి ఎర్రేసు.ఎండుపడాలు ఎడం వైపు తలతిప్పి కొండవాలు మీదుగా పైకి చూశాడు– కనుచూపు మేరలో కనిపిస్తోంది దిబ్బలపాడు. దాదాపు ఘాటీ అంతమయ్యే చోటు. పడాలు కాపు వేసిన చోటుకి కొంతదూరంలో.... పెద్ద పెద్ద కుంకుడు చెట్ల నడుమ..... దాదాపు పదిహేను మందితో మాటు వేశాడు గంతన్న. కొండవాళ్లని జంతువుల కంటే హీనంగా చూస్తున్నవాడు ఇవాళ ఈ నేలమీదే రక్తం కక్కుకు చావాలి. వాళ్లందరి ఏకైక లక్ష్యం ఇదే. మూడు పోలీసు స్టేషన్ల దాడుల తరువాత కవర్డ్ మన్యంలో సాగించిన హింస, లాగరాయి పితూరీ నాటి హింసను గుర్తుకు తెచ్చింది వాళ్లకిS. ఆరంభంలో దిబ్బలపాడు దగ్గర, మధ్యలో సరమండ దగ్గర, చివర కుంకుడు చెట్ల దగ్గర ఒకే వరసలో ఉన్నాయి కొండదళాలు. ఎడమవైపున అంతా సెలయేటి ప్రవాహం.మరో ఏడెనిమిది నిమిషాలు గడిచిపోయాయి.కిచకిచమంటూ ఎక్కడో నాలుగు కోతులు అరిచాయి హఠాత్తుగా. అదే ఓ సంకేతం. కొండదళ సభ్యులంతా ఊపిరి బిగపట్టేశారు. థక్....థక్.....థక్..... థక్....థక్.. థక్. నెమ్మదిగా బూట్ల చప్పుడు దగ్గరకావడం మొదలైంది.మధ్యలో ఎండు పడాలు, కింద గంతన్న నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు, దిబ్బలపాడు దగ్గర జరగబోయేదాని కోసం. ఆ తరువాత తమ చర్య మొదలవుతుంది. ఎండుపడాలు బృందం మొదటి ప్రయత్నం చేస్తుంది. తరువాత గంతన్న రంగంలోకి దిగుతాడు. చివరికి ఎండుపడాలు దళం కదలి వచ్చి, మల్లు దళంతో కలసి రావడమే కాదు, వెనుక డొంకల్లో దాక్కున్న మిగిలిన దళ సభ్యులు గంతన్న దళానికి తోడు వస్తారు. థక్–థక్–థక్– థక్ – బూటు కాళ్ల అడుగులు మరీ చేరువవుతున్నాయి. మళ్లీ అదే దృశ్యం.... కొండవాలు మీద, రాళ్లు అటూ ఇటూ మార్చినట్టు, కొద్దిగా మట్టి తవ్వినట్టు. వాటి మీద అనుమానం మొదలైంది హైటర్కి. ఒక లిప్త తరువాత ఆ రాళ్ల గుట్ట ఒక్కసారిగా దడదడ జారింది. పెద్ద శబ్దం. పది పన్నెండు సెకన్లు కాకుండానే పదడుగుల దూరంలో మరో రాళ్ల గుట్ట జరజర కొండ మీద నుంచి ఘాటీ మీదకు వచ్చి పడబోతుంటే, పోలీసులు సరమండ వైపు పరుగెత్తారు. కొండదళం పన్నిన వ్యూహంలోనే పడ్డారు. ధన్మని పేలింది, తుపాకీ, కొండ మీద నుంచి. మరు లిప్తలోనే తేరుకుని ‘‘లే డౌన్... లే డౌన్ అంటూ అరిచాడు హైటర్. అప్పుడే ఒళ్లు జలదరించేలా అరుపు పక్కన, ‘‘ఓ మైగాడ్డ్! అంటూ.కొందరు పోలీసులు చటుక్కున నేల మీద పడుకున్నారు. కొందరు ఏం చేయాలో తోచక నిలబడే ఉన్నారు. చటుక్కున పక్కకు తిరిగాడు హైటర్. కవర్డ్ మెడ నుంచి చివ్వున చిమ్ముతోంది రక్తం.అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, వెనకే ఉన్న ఒక పోలీసు.మరు నిమిషంలోనే మరో తూటా దూసుకొచ్చింది. ఆ పోలీసు కూడా అరుస్తూ కూలిపోయాడు.హైటర్ తన చేతిలోని బ్రిటిష్ సర్వీస్ రివాల్వర్ ఎత్తి ఆకాశంలోకి కాల్చబోతుండగానే మరో తూటా వచ్చి అతడి గుండె దగ్గర తాకింది. కిందపడిపోతున్నాడతడు, అది కూడా వాగు వైపు. మరో కానిస్టేబుల్ గబగబా వచ్చి పట్టుకోబోయాడు. మళ్లీ పేలింది తూటా.ఇదంతా కొన్ని సెకన్లలో జరిగిపోయింది. ‘‘హె ల్ప్...హెల్ప్.... మమ్మల్ని కాల్చొద్దు ప్లీజ్! ఇంగ్లిష్లో వేడుకుంటూ పరుగులు తీస్తున్నారు పోలీసులు. నేల మీద పడుకున్న పోలీసులకి గుండెలు అవిసి పోతున్నాయి. క్షణం తరువాత నెమ్మదిగా తలెత్తి చూసి లేచి పరుగులు తీయడం మొదలెట్టారంతా. ఒక కిలోమీటరు దాటాక కాస్త స్థిమితపడ్డారు. అడుగులో అడుగు వేసుకుంటూనే నడిచారు శరభన్నపాలెం వైపు. ఎవరి కోసం ఎవరూ ఆగడం లేదు. ‘సెప్టెంబర్ 24న ఇదంతా జరిగితే... సెప్టెంబర్ 27న శవాలు వస్తున్నాయా? ఇంతకు మించిన అవమానం ఉంటుందా? పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్ కుమిలిపోతున్నాడు. నర్సీపట్నం డీఎస్పీ ఆఫీసులో ఒక గదిలో ఒక్కడే కూర్చుని ఉన్నాడతడు. గాలింపు ఆపివేయమని ఆదేశాలు వెళ్లిపోయాయి. డాసన్, టాల్బట్, చాడ్విక్, ఫర్బీస్, మార్టిన్ అంతా తరలి వచ్చి, డీఎస్పీ ఆఫీసు దగ్గరే ఉన్నారు. అందరి ముఖాలలోను విషాదం.మధ్యాహ్నం రెండు గంటల వేళ. తీక్షణంగా ఉంది ఎండ. ఈ నాలుగు రోజుల నుంచి కంటి మీద కునుకు లేదు. కణతలలో పోటు. కళ్లు మంట. ఇవేమీ ఆర్మిటేజ్ని బాధించడం లేదు. తన ఆప్తమిత్రులను కోల్పోయాడు. అది కలచివేస్తోంది. అప్పుడే తటాల్న ఊహకు తట్టింది. 28 మంది పోలీసులు వెళితే ముగ్గుర్ని చంపారు. అందులో ఇద్దరు తెల్లవాళ్లు! సందేహం లేదు. తెల్లవాళ్లే రామరాజు లక్ష్యం.అప్పుడే పక్కన బూటు కాలును గట్టిగా నేలకు తాటించిన శబ్దమైంది. తిరిగి చూశాడు ఆర్మిటేజ్. ఆసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కీనే సెల్యూట్ చేసి నిలబడ్డాడు. భారంగా లేచి అతని వెంట వెళ్లాడు ఆర్మిటేజ్.సబ్జైలు ఆవరణ éకా నడిచారు ఇద్దరూ. డీఎస్పీ కార్యాలయానికి కొన్ని గజాల దూరంలోనే ఉంది.అక్కడే చెట్టుకింద ఉన్నారు అంతా. గంభీరంగా ఉంది వాతావరణం.పది నిమిషాలకి లోపలికి వచ్చాయి రెండు గోముటెద్దు బళ్లు.పోలీసులు చకచకా బళ్ల మీద ఉన్న రెండు శవపేటికలను దించారు. మూసి ఉన్న లిడ్లని (పైన తలుపులు) తీశాడు ఓ పోలీసు. గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి కవర్డ్, హైటర్ శవాలు. పోస్ట్మార్టం చేశారు. ఒళ్లంతా బ్యాండేజీ ఉంది. ముఖం మాత్రం కనిపిస్తోంది.అప్పటికే అక్కడ వేచి ఉన్న పాస్టర్ వచ్చి గబగబా బైబిల్ వాక్యాలు చదివాడు.ఆ వెంటనే దూరంగా తుపాకులు పేలాయి, గాల్లోకి. ఎవరో పెద్ద గొంతుతో ఆదేశించారు. అంతా సెల్యూట్ చేశారు. వెంటనే లిడ్లని మూసేశారు. మరుక్షణం మరో పదిమంది పోలీసులు వచ్చి చేరారు. అంతా కలసి రెండు శవపేటికలను మోసుకుంటూ ఊరి శివార్లలోకి వెళ్లారు.అప్పటికే అక్కడ రెండు గోతులు సమాంతరంగా తవ్వారు, రెండడుగుల దూరంలోనే. గోతుల్లోంచి తీసిన మట్టిలో గుచ్చి ఉన్నాయి చెక్క శిలువలు రెండు. మళ్లీ గ్రేట్వార్ మరుభూములు గుర్తుకు వచ్చాయి ఆర్మిటేజ్కి. పదవుతోంది. మరో గుటక బ్రాందీ తాగి గ్లాసు టేబుల్ మీద పెట్టి ఆ రిపోర్టు చేతిలోకి తీసుకున్నాడు– ఆర్మిటేజ్. డీఎస్పీ కార్యాలయంలో తన రూంలో ఒక్కడే ఉన్నాడు. లాంతరు వెలుగులో గాజు గ్లాసులోని నల్లని ద్రవం మరింత నల్లగా కనిపిస్తోంది. మద్రాస్ పోలీస్ రిపోర్టు.పేరు: క్రిష్టఫర్ విలియం స్కాట్ కవర్డ్. వయసు: దాదాపు 28 సంవత్సరాలు.హోదా: అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్. నివాసం: కొరాపుట్, మొదట కనిపెట్టినది: హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ హకీమ్. ఎత్తు: 5 అడుగుల 6 అంగుళాలు, గుండ్రని ముఖం. వివాహం: కాలేదు.కుyì భుజం మీద ఒక గుండు దెబ్బ. ఎడమ ఛాతీ పైన ఒక దెబ్బ. హైటర్ గురించి రిపోర్ట్ తీసినా చదవలేక పక్కన పెట్టాడు. మరో రిపోర్టు తీశాడు. ‘‘కృష్ణదేవిపేట కానిస్టేబుల్ మోరుకొండ అప్పారావు నం. 1248 వ్రాయునది–24–9–22 తేదీ మధ్యాహ్నం దావనాపల్లి నుంచి ఈ చనిపోయిన దొరవారున్నూ, హీటరు దొరవారున్నూ అల్లూరి శ్రీరామరాజు దండును పట్టుకొనుటకు వెళుతూ ఉండగా కొండ మీద నుంచి పితూరీదార్లు తుపాకీలు కాల్చినారు. ఆ కాల్చడములో స్కాటు కవర్డు దొరవారికి గుండు దెబ్బ తగిలినందున నేల మీద పడిపోయినారు. వెంటనే చనిపోయినారు. రిజర్వు పార్టీలు బయలుదేరి దావనాపల్లి గ్రామానికి వచ్చేసరికి ఆ గ్రామస్తులు పితూరీదార్లు ఆ గ్రామమును అప్పుడే దోచుకుని పారిపోయినట్టు చెప్పినారు. అందుపైన ఇద్దరు దొరలు వారిని పట్టుకొనడానికి బయలుదేరారు. మమ్ములను చుట్టుదారికి ఏనుగులతో రమ్మన్నారు. వారు వెళ్లిన ఒక అరగంటలో గుళ్ల శబ్దము కొంతసేపు వరకు వినిపించినది. బళ్లారి రిజర్వు నం. 161000 హెడ్కానిస్టేబుల్ మహ్మదు యాకూబ్ను దర్యాప్తు చేయగా వ్రాయించినది.అది పూర్తయిన తరువాత పోస్టుమార్టం నివేదిక చేతిలోకి తీసుకున్నాడు గానీ, చదవాలనిపించలేదు.అన్నీ చదివాక కలం తీసుకుని తన నివేదిక రాశాడు ఆర్మిటేజ్. సెప్టెంబర్ 26, 1922. క్యాంప్: నర్సీపట్నంమద్రాసు ప్రెసిడెన్సీ చీఫ్ సెక్రటరీ గ్రాహంకుఇద్దరు అధికారులు, ఒక కానిస్టేబుల్ మహ్మద్ యాకూబ్ చనిపోయారు. ఒక కానిస్టేబులుకు గాయాలు తగిలాయి. ఒక కానిస్టేబులు కనిపించడం లేదు. తిరుగుబాటుదారులను సాధారణ పోలీసులతో అదుపు చేసే ఆలోచన చాలా ప్రమాదకరం. అడవులలో యుద్ధం చేసే నైపుణ్యం కలిగిన సైనికులు అవసరం. ఈ వాస్తవాన్ని ఇంతకు ముందే గ్రహించలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. ఇది గుర్తించి ముందే ఆదేశాలు ఇచ్చి ఉంటే ఈ రెండు విలువైన ప్రాణాలు పోకుండా ఆపగలిగేవాళ్లం. ఎఫ్ ఆర్మిటేజ్ పక్క గదిలోనే ఏజెన్సీ కమిషనర్ స్టీవర్డ్ కూడా నివేదిక రాస్తున్నాడు, లాంతరు వెలుగులో. చీఫ్ సెక్రటరీ గ్రాహంకు,దామనపల్లి దాడి నిస్సందేహంగా స్కాట్ కవర్డ్ను లక్ష్యంగా చేసుకున్నదే. కవర్డ్ రాజును వెంటాడుతున్నాడు. కొండదళం అక్కడికి వస్తున్నట్టు దామనల్లి నుంచి కవర్డ్కు సమాచారం వచ్చింది. అది రామరాజు పంపించి ఉండాలి. అక్కడ ఆస్తినష్టం ఆరు 303 రైఫిళ్లు, 300 తూటాలు, ఒక జర్మన్ సర్వీస్ పిస్టల్, దీని 16 బులెట్లు, హైటర్కు చెందిన బ్రిటిష్ సర్వీస్ పిస్టల్ కొన్ని బులెట్లు పోయాయి. కవర్డ్, కానిస్టేబుల్ ఇద్దరికీ కూడా మెడ, భుజం మధ్యనే తూటాలు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం తరువాత ఆర్మిటేజ్ 20 మందితో ఘాట్ ఎక్కడానికి ప్రయత్నించాడు, అక్కడ ఎవరైనా ఉంటే ఆదుకోవడానికి. మళ్లీ కాల్చారు. ఒక కానిస్టేబుల్ చనిపోయాడు. నిన్న(సెప్టెంబర్ 25, 1922) నేను 70 మంది పోలీసులతో శరభన్నపాలెం వెళ్లాను. ఇది ఘాట్ కిందే ఉంది. శవాలను స్వాధీనం చేసుకోవడానికి ఉన్న అవకాశం, గాయపడిన మరో లాన్స్నాయక్ను తీసుకురావడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించవచ్చా అని ఆర్మిటేజ్ అడిగాడు. నేను వద్దని చెప్పాను. బాగా డబ్బు ఇచ్చి స్థానికులను పంపారు. గాయపడిన వాడు వచ్చాడు. భవిష్యత్ గురించి ఆర్మిటేజ్తో చర్చించాను. రామరాజును వెతికే పని ఇప్పటికి ఆపాలని ఇద్దరం అభిప్రాయపడ్డాం– శిక్షణ కలిగిన మిలటరీ వచ్చేదాకా. స్టీవర్డ్, ఏజెన్సీ కమిషనర్. ఇదంతా జరిగిన వారం పదిరోజులకి, మన్యంలో ఎక్కడో మారుమూల ఒక కొండవాలు దగ్గర రామరాజు దళం విడిది చేసింది. అది కూడా బొమ్మెత్తుపొద్దే. తన మొలకు కొత్తగా వచ్చిన గడియారం తీసి ముందు చెవి దగ్గర పెట్టుకున్నాడు రామరాజు. క్వీన్ ఏన్ గడియారం. ఎంతో ముచ్చటగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులకి ఇచ్చింది ప్రభుత్వం.రెండులిప్తల తరువాత దాని మీద సమయం చూశాడు.మళ్లీ మొలతాడుకు గడియారం గొలుసు తగిలిస్తూ ఉంటే ఎర్రేసు అడిగాడు అమాయకంగా.‘‘స్వామీ! దాన్ని చెవి దగ్గర పెట్టుకున్నారు. ఏం చెప్పింది? బొమ్మెత్తు పొద్దు అని చెప్పిందా? ‘‘కాలం, అంటే వేళ– అమృతం వంటిది. ఆలస్యం చేస్తే అదికాస్తా విషమైపోతుంది సుమా! అంది అన్నాడు నవ్వుతూ రామరాజు. మన కాలం విషం కాకూడదు స్వామీ! అన్నాడు ఎర్రేసు.అనుకున్నట్టే రెండు ప్రతిజ్ఞలు తీసుకున్నారు వాళ్లు.మొదటి ప్రతిజ్ఞ: మన్యప్రజల పట్ల మర్లుపులి (మనిషి రక్తం రుచి మరిగిన పులి)లా ప్రవర్తిస్తున్న కవర్డ్, అతడి సహోద్యోగి హైటర్ దామనపల్లికి వస్తున్న సంగతి చాలా ముందే గమనించి ఆగమేఘాల మీద వచ్చి కొండదళానికి చెప్పి మహోపకారం చేసిన ఒక మనిషి ఉన్నాడు. ప్రాణాలు పోయినా అతడి పేరు చెప్పరాదు. అతడు దామనపల్లి మునసబు తమ్ముడు కుందేరి బొర్రంనాయుడు. రెండోది– దామనపల్లి మీద ఆ ఇద్దరు దొరలను మట్టుపెట్టినవాడు ఎర్రేసు. ఇది కూడా గుండెల్లో దాచుకోవాలి. కొండదళానికి ఆ బొమ్మెత్తుపొద్దులో కనిపించినది సూర్యుడు కాదు, శ్రీరామరాజు. హలో... హలో... నర్సీపట్నం క్యాంప్... ఓవర్ ఫర్బీస్ దానిని చేతిలోకి తీసుకుని గట్టిగా అన్నాడు, హలో... హలో... కేడీపేట క్యాంప్.. ఈవ్లింగ్! ఏమిటి విషయం. ఓవర్పోలీసు బలగాలు కొయ్యూరు బయలుదేరాయా? ఓవర్ చాలా సేపయింది. రెండు ట్రక్కులలో నాలుగు పటాలాలు వెళ్లాయి. ఓవర్... రామరాజుని కొద్దిసేపట్లోనే కొయ్యూరుకు తీసుకువస్తారని తెలిసింది. ఇంకాస్త ఫోర్సు అవసరమని ఆర్మిటేజ్ చెప్పారు. లంబసింగిలో ఫోర్సుని కూడా కొయ్యూరు పంపించు. గూడెంలో ఉన్న ఫోర్సుని సాయంత్రానికి కేడీపేట వచ్చేలా చూడు. ఓవర్! అన్నాడు ఈవ్లింగ్. ‘‘సరే, ఈ ఫోర్స్ చాలదా? ఓవర్ అడిగాడు ఫర్బీస్.‘‘ చాలవని కాదు. రామరాజుని విడిపించేందుకు దాడి చేస్తారని అనుమానం. అంతేనా! అన్నాడు ఫర్బీస్.అసలు సంగతి అదికాదు. నీకు తెలుసు కదా! వాడెవడు గదర్ మూవ్మెంట్లో వాడు... వాడి పేరు ఏదో సింగ్! వాడు వచ్చి రామరాజుతో కలిశాడని కదా! అందుకు. ఓవర్అన్నాడు ఈవ్లింగ్. వైర్లెస్ కనెక్షన్ కట్ అయింది. నిజమే, రెండు మూడు నెలల క్రితమే వినిపించిందా మాట. తటాల్న గుర్తుకొచ్చింది ఆ పేరు – పృథ్వీసింగ్ ఆజాద్. గొంతు తడారిపోయింది మళ్లీ. -
ఆకుపచ్చ సూర్యదయం
జయపురం ఏనుగులు; ట్రేమన్హేర్, బాస్టియన్ల నాయకత్వంలో పోలీసులు ఒంజేరి దిశగా వస్తున్న సంగతి ఒకేసారి తెలిసింది రామరాజుకి. రిజర్వు దళం ఘాట్ మీదకు చేరడానికి చివరి మలుపు తిరిగే చోటనే పదిమందిని నిలిపాడు రామరాజు. ఘాట్కు పైన చాలా ఎత్తులో ఉంటుంది గిమిలి బాట. ఆ బాటను లక్ష్యంగా చేసి మరో పదిమందిని నిలిపాడు. ఏనుగులను దిగ్బంధనం చేసేందుకు ఇంకో పది మందిని నియమించాడు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతం. కొన్ని నిమిషాలు గడిచాయి, నిశ్శబ్దంగా. అప్పుడే గిమిలి దారే లక్ష్యంగా కాపు వేసిన రాజు దళం మొదట ఆ దృశ్యం చూసింది. ఓ జమేదారు, మరో పదిమంది పోలీసులు నక్కి నక్కి నడుస్తున్నారక్కడ. మరోపక్క ఘాట్ మీది మాటేసిన రాజు దళానికి ట్రేమన్హేర్, బాస్టియన్ దగ్గరవడం కనిపిస్తోంది. రక్తం మరిగిపోతోంది బాస్టియన్ని చూస్తుంటే. గంతన్న, మల్లు ఆవేశంతో ఊగిపోయారు. పడాలు గిమిలి దారికి గురిపెట్టిన బృందంలో ఉండిపోయాడు. బాస్టియన్ రాక అతడికి తెలియదు. లేకపోతే ఏం జరిగేదో? అప్పుడే గంతన్న, మల్లు ఇద్దరికి ఒకేసారి అనుమానం వచ్చింది.అటు ట్రేమన్హేర్, బాస్టియన్; ఇటు పదిహేనుమంది వరకు ఉన్న రిజర్వు పోలీసులు అంత జాగరూకతతో ఎందుకు ఘాటీ ఎక్కుతున్నారు? కొండదళం ఉన్నట్టు తెలిసిపోయిందా? చుట్టూ చూసి, గతుక్కుమన్నారు అన్నదమ్ములు. మలుపు పక్కనే గుబురులో ఉన్న తమ దళ సభ్యుడిS తుపాకీ గొట్టం పైకి కనిపిస్తోంది కొద్దిగా. ట్రేమన్హేర్, బాస్టియన్, పోలీసులు, మూటలు మోస్తున్న కొండవాళ్లు పూర్తిగా ఘాట్ మీదకు చేరేదాకా వేచి ఉన్నాడు మల్లు.ఆ సమయంలోనే ట్రేమన్హేర్ బాస్టియన్కు సైగలతో ఏదో చెప్పడం కనిపించింది.బాస్టియన్ మూటలు మోస్తున్న కొండవాళ్లలో మొదటివాడికి ఏదో చెప్పాడు. వాళ్లంతా ఏనుగులు ఉన్న చోటికి నడవడం కనిపించింది. ఇదంతా గమనిస్తున్న మావటీలలో గుబులు మొదలైంది. అంకుశంతో మెడ మీద పొడిచి ఏదో అన్నాడు మొదటి ఏనుగు మీది మావటి.ఆ ఏనుగు ముందు కాళ్లు వంచి నిలబడింది. మిగిలిన మావటీలు కూడా అలాగే చేయించారు. గిమిలి బాట మీద పోలీసులు ఇంకా వంగునే నడుస్తున్నారు.అక్కడ, తలల మీది సంచులు వేగంగా దించేశారు కొండవాళ్లు.అప్పుడే పెద్దగా అరుపు, ‘‘శ్రీరామరాజుకీ....!’’ వెంటనే స్పందన, ‘‘జై!’’దానితో పాటే బాణాల వర్షం మొదలైపోయింది. మధ్య మధ్య తుపాకులు పేలుతున్నాయి. మొదట మోత కోసం వచ్చిన కొండవాళ్లు, వెనుకే మావటీలు చిటికలో అన్నీ వదిలి మాయమైపోరు.గిమిలి బాట మీద ఉన్నవాళ్లు తల ఎత్తకుండా బాణాలు దూసుకు వస్తూనే ఉన్నాయి. ఎవరైనా సాహసించి నిలబడే ప్రయత్నం చేస్తే తుపాకీలు గర్జిస్తున్నాయి. బెదురుతున్న ఏనుగులు ముంగాళ్ల మీదే కదం తొక్కుతున్నాయి, ఘీంకరిస్తూ. ట్రేమన్హేర్ సాహసించి తన రివాల్వర్ తీసి బాణాలు వస్తున్న మలుపు దగ్గరి పొద మీదకు కాల్చాడు.మరుక్షణం దూసుకువచ్చింది ఓ బాణం. కుడి చెవిని తాకింది.‘‘అబ్బా....!’’ కెవ్వున అరిచాడు ట్రేమన్హేర్. రివాల్వర్ వదిలేసి, చెవి పట్టుకున్నాడు.ఇది చూసి బేజారెత్తిన బాస్టియన్ ఓ చెట్టు చాటుకు పరుగెత్తి, తొంగి చూడబోయాడు.అప్పుడే పొట్టిగా, మోటుగా ఉన్న ఓ చిన్న కత్తి ఒక పక్క నుంచి వచ్చి సర్రున చెట్టులో దిగింది. ముఖాన్ని... ఎడం కన్ను రెప్ప మీద వెంట్రుకలు రాసుకుంటున్నట్టే ఉంది కత్తి. బాస్టియన్ గొంతుకు గురిపెట్టి విసిరిన సంగతి అర్థమవుతోంది. చెట్లని చాటు చేసుకుంటూ పరుగెత్తాడు బాస్టియన్, నర్సీపట్నం వైపు.ట్రేమన్హేర్ బాధనీ, బాస్టియన్ పలాయనాన్ని చూసిన ఒంజేరి ఘాట్ మీది పోలీసులు ఎలాంటి ప్రతిఘటన ఇవ్వకుండానే వెనక్కి పరుగు లంఘించుకున్నారు. ‘‘ఆయుధాలు పడేసి పరుగెత్తండి. లేకపోతే చస్తారు!’’ వెనుక నుంచి పెద్ద కేక.కొందరు ఆయుధాలు కింద పడేసి చేతులు పైకెత్తి పరుగుతీశారు. కొండలలో నడక వేరు. పరుగు తీయడం వేరు. అవి ఎంత కష్టమో అనుభవానికి వస్తోంది– మైదానాల నుంచి వచ్చిన పోలీసులకి. ట్రేమన్హేర్ కూడా పరుగుతీయాలని అటు తిరిగాడు. అంతే, ఒక తూటా వచ్చి కుడి పిక్కను తాకింది. ఇంకా గట్టిగా అరిచాడతడు. అప్పుడే గిమిలి బాట మీద మరో కేక. ఒక కానిస్టేబుల్ కిందపడి కొట్టుకుంటున్నాడు. తలకు తూటా చేసిన గాయం నుంచి పాకుతున్నాయి రక్తధారలు, పాము పిల్లల్లా. ఇక తప్పదన్నట్టు జమేదార్ సాహసించి నిలబడి కాల్చడం మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్లు కూడా నిలబడి కాలుస్తున్నారు.పావుగంటకు పైగా కాల్పులు జరిపింది గిమిలి బాటలో ఉన్న రిజర్వు దళం.కొంతసేపటికి వెనక వైపు నుంచి కూడా బాణాలు గిమిలి బాట మీదకి దూసుకురావడం మొదలైంది. ఈ హఠాత్పరిణామానికి కంగు తిని, జమేదార్ జాగ్రత్తగా ఒంజేరి ఘాట్ కేసి చూశాడు. చిత్రం, ఎవరూ లేరు. అంటే ఇంత సేపు అక్కడ ఉన్న వాళ్లతో యుద్ధం చేసిన కొండదళం సభ్యులు కూడా ఇప్పుడు గిమిలి బాటను లక్ష్యంగా చేసుకున్నారన్నమాట. తుపాకులు కాలుస్తూనే ఒంజేరి రోడ్డు ఘాట్ మీదకు దిగిపోయారు వాళ్లు. మందుగుండు అయిపోయింది.ఘాటీ మీద చెట్లను చాటు చేసుకుంటూ అక్క∙నుంచి పరుగు మొదలుపెట్టారు వాళ్లంతా. పది నిమిషాలు గడిచాయి. అంతా నిశ్శబ్దం. రిజర్వు దళం కకావికలైపోయింది. క్షణం తరువాత దిక్కులు పిక్కటిల్లేటట్టు నినాదం–‘‘శ్రీరామరాజుకీ’’.......‘‘జై’’ మూడు వైపులా ఉన్న రామరాజు దళాలు ఘాట్ మీదకు వచ్చేశాయి.అందరినీ అభినందించాడు రామరాజు. ఎర్రేసు ఏనుగుల దగ్గరకు వెళ్లి మెడ మీద గుద్దుతూ ఏదో అన్నాడు. అవి పూర్తిగా కాళ్లు మడిచి మోకరిల్లాయి. వాటి మీద ఉన్న సామగ్రినీ, కొండవాళ్లు దించిన రిజర్వు పోలీసుల సంచులనీ కొండదళం స్వాధీనం చేసుకుంది. సామాను దించాక ఏనుగులని అడవిలోకి తోలేశారు.ఘాటీ మీద పడి ఉన్న తుపాకులను, బూట్లను, క్రాస్బెల్ట్లు, బాయ్నెట్లను, టోపీలను ఏరారు కొందరు. కంబళ్లు అందరికీ పంచిపెట్టాడు రామరాజు.మిగిలినవి గ్రామంలో పంచిపెట్టమని ఈ సమాచారం అందించిన ఇద్దరు కుర్రాళ్లకి పురమాయించాడు గంతన్న. కొండదళం ఆనందానికి అవధులు లేవు. 4 తలుపు తీయగానే ముందు కనిపించిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆర్మిటేజ్ కు సెల్యూట్ చేశాడు స్కాట్ కవర్డ్. తడిసిన రెయిన్ కోటు విప్పి మేకుకి తగిలించి వచ్చాడతడు. ఉదయం నుంచీ వర్షమే. విశాలంగా ఉన్న ఆ గుండ్రటి టేబుల్ చుట్టూ ఆర్మిటేజ్తో పాటు ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ సాండర్స్, విశాఖపట్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మార్టిన్, నార్తరన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జార్జి, అతడి పక్కనే ట్రేమన్హేర్ కూర్చుని ఉన్నారు. తలపాగా చుట్టినట్టు బ్యాండేజీ ఉంది ట్రేమన్హేర్కి. ఒంజేరి ఘాట్ ఉదంతం గుర్తులు. కాలికి వేసిన బ్యాండేజీ కూడా విప్పలేదు. ఒక కుర్చీలో కూర్చున్నాడు స్కాట్ కవర్డ్, ఎడం చేతిలోని చిన్న సంచిని టేబుల్ మీద పెట్టి. వెంటనే అతడికి కూడా ఒక ప్లేటు నిండా చేపల వేపుడు, ఒక గ్లాసులో బ్రాందీ పోసి తీసుకువచ్చి ఎదురుగా పెట్టాడు బంట్రోతు.ముఖం మీద ఉన్న వర్షపు నీటిని జేబురుమాలుతో తుడుచుకుంటూ అన్నాడు కవర్డ్, ఆర్మ్టేజ్తో.‘‘పెద్ద వ్యూహమే కనిపిస్తోంది!’’ ‘‘మొన్న దొరికిన ఉత్తరం గురించేనా? ఇప్పటిదాకా దాని గురించే అనుకున్నాం!’’ సాండర్స్ అన్నాడు. ‘‘ఈ తిరుగుబాటుకీ, గాంధీ సహాయ నిరాకరణకీ లంకె పెట్టాలని చూస్తున్నాడు రామరాజు.’’ చెప్పాడు కవర్డ్. ‘‘ఐసీ’’ జార్జి, మార్టిన్, సాండర్స్ ఒకేసారి అన్నారు. ట్రేమన్హేర్ మాత్రం మౌనంగానే ఉన్నాడు.‘‘ఇదిగో అనువాదం, అసలు!’’ కూడా తెచ్చిన సంచిలో నుంచి ఆ ఉత్తరం, దాని ఇంగ్లిష్ అనువాదం తీసి ఆర్మిటేజ్కి అందించాడు కవర్డ్. రాత్రి ఏడుగంటల ప్రాంతం. నర్సీపట్నంలో డీఎస్పీ కార్యాలయంలోని ఆ చిన్న హాలు నిశ్శబ్దంగా ఉంది. పెట్రోమాక్స్ లైటు మాత్రం చిన్నగా శబ్దం చేస్తూ మండుతోంది. వర్షపు జల్లుబ్దం బయటనుంచి వినిపిస్తోంది. రామరాజు తునిలో ఉండే పేరిచర్ల సూర్యనారాయణరాజుకి రాశాడు. రెండురోజుల క్రితం ఇద్దరు కొండవాళ్లు కోటనందూరు దగ్గర అనుమానాస్పదంగా కనిపించారు. ఎక్కడికిరా అని ఎవరో అడిగితే తుని వెళ్లాలన్నారు. అదో సీఐడీ కంట పడింది. వాళ్లనే వెంటాడాడు. తుని గ్రామంలో కూడా ఎవడినో అడ్రస్ అడిగారు. వాడు అడ్రస్ చెప్పాడు. దాంతో పాటే, ఏం పని? అని ఆరా కూడా తీశాడు. ఈ ఉత్తరం సంగతి చెప్పేశారు.సీఐడీ అరెస్టు చేసి, ఆ ఉత్తరంతో సహా తీసుకొచ్చి కవర్డ్కు అప్పగించాడు.ఆ కాగితాలు పక్కనే ఉన్న సాండర్స్కి ఇస్తూ, కవర్డ్తో అన్నాడు.‘‘ఆ తుని వాడు కూడా అరెస్టయినట్టే కదా!’’ ‘‘వెంటనే కోటనందూరు నుంచే పోలీసులని పంపించి అరెస్టు చేయించాను!’’ అన్నాడు కవర్డ్.సెప్టెంబర్ 16న రాసిన ఉత్తరమది. మరునాడే దొరికిపోయింది. మిత్రమా! నేను యుద్ధమును ప్రారంభించితిని. ఇంతవరకు నాలుగు ప్రదేశములలో మన సైన్యము బ్రిటిషు సైన్యమును ఓడించినది. ప్రతి పోరాటమునను భగవానుని దయ వలన జయము మన పక్షమునకే లభించినది. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకుని నీవు బయలుదేరి రావలెను. మృత్యువు జననమును వెన్నంటియే యుండును. ప్రతి మానవుడు వాని వంతు వచ్చినప్పుడు మరణించవలసిందే. మానవ శరీరములు శాశ్వతములు కావు. కానీ, కీర్తి అపకీర్తి శాశ్వతములు. క్షత్రియులకు యుద్ధము సహజము. ఎవరైతే జయాపజయాలను, కష్టసుఖములను, చీకటివెలుగులను సమభావముతో చూడగలరో వారే ఆత్మ సాక్షాత్కారము పొందగలరని భగవద్గీత బోధించుచున్నది. మనకు యుద్ధములో విజయము లభించిన ఎడల భౌతికానందము పొందగలము. యుద్ధములో మనము మరణించిన ఎడల మనము వీరస్వర్గము నలంకరించి అనందించగలము. అందువలన ఈ విషయములన్నింటిని నేను జాగ్రత్తగా ఆలోచించి, దేశ క్షేమము కొరకు యుద్ధము అనివార్యమని పూర్తిగా విశ్వసించి ఈ సమరమును ప్రారంభించినాను. ఈ ఉత్తరము చేరిన వెంటనే నీవు తప్పక బయలుదేరి వస్తావని పూర్తిగా నమ్ముచున్నాను. ఇంకనూ ఎవరైనా వస్తే నీతో తీసుకుని రావలెను. ఒకసారి నీవు బయలుదేరి వచ్చి ఇచ్చట నేను పోరాటమును సాగించుటకు చేసిన ఏర్పాట్లను చూడవలెను. అవి నీకు నచ్చకపోయిన ఎడల తిరిగి వెళ్లిపోవచ్చును. అక్కడ పేకేటి వారి అబ్బాయి ఉంటే తప్పక నీతో తీసుకొని రావలెను. మిత్రులకు నా అభినందనలు. అల్లూరి శ్రీరామరాజు ఆర్మిటేజ్ తనలో తాను నవ్వుకుంటూ బ్రాందీ గ్లాసు ఎత్తి రెండు గుక్కలు తాగాడు. ‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అన్నాడు కవర్డ్.‘‘ఆ ఉత్తరం చదివితే ఎవరికైనా నవ్వొస్తుంది.’’ అన్నాడు సాండర్స్.‘‘ ఏం రాశాడు! క్షత్రియులకు యుద్ధం సహజమా?! అంటే రామరాజు అడవిలో క్షత్రియ పాలన ఆరంభిస్తాడా ఏమిటి? నిజమే, ఈ అడవికి రాజైపోవాలని దురాశ. ఎవరితో డీకొంటున్నాడో తెలుసా వాడికి? గ్రేట్వార్ విజేతతో. వీరస్వర్గం అలంకరిస్తాడా! చివరికి జరిగేది అదే. ఇంక ఉపేక్షించడం అనవసరం. మైదాన ప్రాంతాలు తోడొస్తే ఇంకా తలనొప్పి.’’ అన్నాడు ఆర్మిటేజ్.‘‘మీరేమిటి నోరు విప్పడం లేదు?’’ అన్నాడు సాండర్స్, ట్రేమన్హేర్తో.‘‘మనం ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నామేమో?!’’ అన్నాడతడు. 5 ‘‘ఇరవై ఒకటో తేదీన రామరాజు గూడెం దగ్గర గాలికొండ మీద ఏదో ఉత్సవం జరుపుతున్నాడట!’’ టాల్బట్తో చెప్పాడు సాండర్స్. ఇద్దరూ కోరాపుట్ నుంచి వచ్చినవాళ్లే. నర్సీపట్నం డీఎస్సీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ‘‘సీఐడీ రిపోర్టేనా?’’ అన్నాడు టాల్బట్, విసుగ్గా.‘‘అదే, కానీ నమ్మదగినదే. అయినా రిపోర్టు వచ్చిన తర్వాత మన వంతు ప్రయత్నం చేయకపోతే అదో రగడ!’’ అన్నాడు సాండర్స్. మళ్లీ తనే అన్నాడు ‘‘ఇప్పుడెందుకో ఉత్సవం?’’ ‘‘విజయోత్సవమే అయి ఉండాలి!’’ తాపీగా అన్నాడు టాల్బట్. ‘‘విజయోత్సవమా? నాకు తట్టనేలేదు. కొండవాళ్లు పండగలూ, ఉత్సవాలూ జరుపుకుంటూ విర్రవీగిపోతున్నారని రిపోర్టు వెళితే సెయింట్ జార్జ్ ఫోర్టు దృష్టిలో మనమంతా చవటల్లా మిగులుతాం.’’ అన్నాడు సాండర్స్.‘‘అది నిజం!’’ నిర్లిప్తంగానే అన్నాడు టాల్బట్. ‘‘చింతపల్లి దాడి జరిగిన సరిగ్గా నెలరోజులకి విజయోత్సవం చేస్తున్నాడన్నమాట. ఇంతకీ మనమిద్దరమే ఫోర్సుతో వెళ్లాలన్నాడు ఆర్మిటేజ్l.’’ చెప్పాడు సాండర్స్. పెద్దవలసలో ఉండి బలగాలనూ, వ్యూహం అమలునీ టాల్బట్ పర్యవేక్షించాలనీ, గూడెం కొండలలో గాలికొండ మీదకు సాండర్స్ వెళ్లి ఉత్సవాన్ని భగ్నం చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఒక పటాలం పెద్దవలస వస్తున్న సంగతి, మరో పటాలం గాలికొండ వైపు కదులుతున్న సంగతి కొన్ని నిమిషాలలోనే రామరాజుకి తెలిసిపోయింది. పెద్దవలస– ఎండుపడాలు అడ్డా. ఏం జరుగుతున్నదో గ్రామస్థులు ప్రతి క్షణం కబురందిస్తున్నారు. ముందు పెద్దవలసలో ఉన్న పోలీసు శిబిరాన్ని చెదరగొడితే, గాలికొండ వైపు కదులుతున్న సాండర్స్ వెనక్కి రాకతప్పదు. గంతన్నకు అదే చెప్పి పంపాడు రామరాజు. ఒక కొండవాలు మీద ఉన్న చింతచెట్లు ఎక్కి కూర్చున్నారు, నలభయ్ మంది వరకు కొండదళం సభ్యులు. శిబిరం నుంచి సాండర్స్ పటాలంతో గాలికొండ బయలుదేరాడు. పెద్దవలసలో తిష్ట వేసిన టాల్బట్ బలగాలు వంట ప్రయత్నంలో ఉన్నాయి. అప్పుడే కొండదళం సభ్యులతో కలసి శిబిరం మీద హఠాత్తుగా వచ్చి పడ్డారు పడాలు, గంతన్న. చిన్న ప్రతిఘటన కూడా లేదు. పోలీసులంతా చింతపల్లి వైపు పారిపోవడం మొదలుపెట్టారు. గుర్రం ఎక్కుతూ ఒక కానిస్టేబుల్ని పిలిచి సాండర్స్ను తప్పించుకోమని చెప్పి పలాయనం చిత్తగించాడు టాల్బట్. గాలికొండ వెళితే ఇంకెంత ప్రమాదం! సంగతి తెలిసిన సాండర్స్ ప్రశ్నించుకున్నాడు. వేరే దారిలో నర్సీపట్నం బయలుదేరాడు. సాయంత్రం కొండదళం విజయోత్సవ సంరంభంతో గాలికొండ దద్దరిల్లిపోయింది. ‘‘ఈ విజయాలకు సంతోషిద్దాం. మరో విజయాన్ని కూడా సాధిద్దాం!’’ అని సందేశం ఇచ్చాడు రామరాజు. 6 అది బొమ్మెత్తుపొద్దు.ముఖం ఎత్తి సూర్యుడిని చూడవలసిన వేళ. అంటే ఉదయం తొమ్మిది గంటల సమయం. ఐదుగురు సభ్యులున్న ఆ అడ్వాన్స్ పార్టీ అక్కడకు వచ్చి ఆగింది. అడ్వాన్స్పార్టీకి దాదాపు ఇరవై అడుగుల వెనక ఉన్నారు– క్రిష్టఫర్ విలియం స్కాట్ కవర్డ్, లయోనల్ నెవిల్లీ హైటర్. కవర్డ్ లాగే హైటర్ కూడా అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ హోదా కలిగిన ఉన్నతోద్యోగి. అడ్వాన్స్ పార్టీలో ఉన్న జయరాంనాయుడు వెనక్కి వచ్చి చెప్పాడు ఇంగ్లిష్లో. ఒంగోలు నుంచి గాలింపు కోసం మన్యం వచ్చాడు. ‘‘ఇదే సార్! దామనపల్లి’’ వెంటనే స్కాట్ కవర్డ్ కుడి చేయి పైకెత్తి ఏదో సంకేతించాడు.ఆవేళ రామరాజు దళం భోజన సామగ్రి కోసం దామనపల్లి వస్తుందని కచ్చితమైన సమాచారం ఉంది పోలీసులకి.ఎక్కడివాళ్లు అక్కడే నిలిచిపోయారు. చిట్టచివర ఉన్న ఆ రెండు ఏనుగులు, ఒక్క నిమిషం తరువాత ఆగాయి. వాటి వెనకే నడుస్తున్న కంచరగాడిదలు కూడా ఏదో అర్థమైనట్టు అలాగే నిలబడిపోయాయి. వాటి మీద మంచినీళ్లు, ఆహార పదార్థాలు, కంబళ్లు ఉన్నాయి. ఇంకా– ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే సరంజామా ఉంది.చుట్టూ పరికించి చూశాడు కవర్డ్. కాస్త లోతట్టునే ఉంది ఊరు. తాటాకు గొడుగులు ఎండలో పెట్టినట్టు ఉన్నాయి గుడిసెలు. నాలుగో అయిదో ఇళ్లు మాత్రం పెద్దవి. కనుబొమలు ముడిపడ్డాయి కవర్డ్కి. గుడిసెలను చూసి కాదు, వాటి ముందు నిలబడిన ఆడామగా, ముసలీ ముతకా ఏదో చర్చించుకుంటున్నారు, పెద్ద పెద్ద గొంతులతో.కొన్ని క్షణాల ముందు అక్కడ ఏదో కలకలం రేగినట్టే ఉంది.‘‘జయరాం! ఏదో జరిగినట్టే ఉంది. వాళ్లని అడుగు!’’ అన్నాడు కవర్డ్. అదే ఆలోచన వచ్చిన జయరాం వెంటనే రెండడుగులు వేసి, చేతులు ఊపుతూ పెద్ద గొంతుతో పిలిచాడు, ‘‘అరేయ్! మిమ్మల్నే ఇట్రండి! ఇక్కడ ఇక్కడ.’’అప్పుడు చూశారు వాళ్లంతా పైకి.అంతే, పులిని చూసినట్టు చాలామంది, అంతా తలో దిక్కుకు పరుగెత్తారు. ‘‘అరేయ్! అరేయ్! ఆగండి! ఇట్రండి!’’ అన్నాడు బెదిరింపుగా జయరాం.నలుగురు మాత్రం వచ్చి జయరాం నాయుడు ఎదురుగా నిలబడ్డారు, భయం భయంగా.అంతా గోచీలు పెట్టుకుని ఉన్నారు. నల్లటి శరీరాలు. చింపిరి జుట్లు. ‘‘పితూరీ దండేదైనా ఇటొచ్చిందా?’’ 303 రైఫిల్ని భూమి మీద ఆనుస్తూ అడిగాడు జయరాం. మాట్టాడలేదు వాళ్లు. ‘‘నోరు పెగల్దేరా! తల తీసేస్తాం నా కొడకల్లారా! వచ్చారా లేదా?’’ గట్టిగా అన్నాడు జయరాం.‘‘వచ్చారు దొరా! మా కాడన్నీ దోచుకుపోయారు.’’ అన్నాడు ఒక యువకుడు భయపడుతూ.తుపాకీని మళ్లీ అమాంతం భుజం మీద వేసుకుంటూ అడిగాడు జయరాం, ‘‘ఎటు పోయార్రా!’’ ‘‘ఈ ఘాటీ దిగి, ఈ దారంటే.....’’ మరో యువకుడు చెప్పాడు, చేత్తో చూపిస్తూ. -
ఆకుపచ్చ సూర్యదయం
కాగడాలు, నిప్పుమూటలతో స్టేషన్ బయటంతా వెలుగుతో నిండింది. అందరి చేతులలోను ఆయుధాలు. పది పదకొండు తుపాకులు–అవి స్టేషన్ వైపు గురి పెట్టి ఉన్నాయి.‘‘ప్పిప్పి... పితూరీ దండొచ్చే... సింది...!’’ పిచ్చివాడిలా అరిచాడా జవాను.కాపలాకి పడుకున్న ఆ గ్రామస్థులంతా మేల్కోవడం, పరుగు లంఘించడం ఒక్కసారే జరిగాయి. లోపలున్న వాళ్లు ఒక్క ఉదుటన బయటకొచ్చారంతామొదట అడ్డతీగల జవాను, వెంటనే మిగిలిన ఆరుగురు చేతులు ఎత్తేశారు.ఈ పది నిమిషాలలోనే ఆ డెబ్బయ్ ఎనభై మందితో ఉన్న కొండదళానికి మరో యాభయ్ అరవై మంది తోడయ్యారు. అంతా దూసుకొచ్చారు స్టేషన్లోకి. పోలీసులని అసలు పట్టించుకోలేదు. అదే అదనుగా ఒక పక్క నుంచి అరుగు దూకేసి, ‘‘పితూరీ దండొచ్చింది. పితూరీ దండొచ్చింది.’’అని అరుచుకుంటూ గ్రామం వైపు పరుగులు తీశారు పోలీసులు. గ్రామంలో కలకలం. అంతా లేచి, ఇళ్లకు తాళాలు వేసి తలా దిక్కుకు పారిపోతున్నారు. స్టేషన్లో మొదట పడాలు లాకప్ గది తాళాన్ని తుపాకీ మడమతో ఒక్క దెబ్బకి బద్దలు కొట్టాడు. కాగడాలు, ఉప్పు మూటల వెలుగు లోపలికి వస్తుంటే, లాకప్ గది తలుపు తోసుకుని బయటకు వచ్చి, సంభ్రమంగా చూస్తూ నిలబడ్డాడు వీరయ్యదొర.‘‘బాగున్నారా వీరయ్యదొరా!’’ పలకరించాడు గంతన్న, నమస్కరిస్తూ. ‘‘నువ్వు...!?’’ ‘‘గాం జోగిదొర కొడుకుని. బట్టిపనుకుల. గంతన్నlఅంటారు’’ అన్నాడు.‘‘అలాగా!’’ అంటుండగానే, లోపలికి వచ్చాడు రామరాజు.పడాలు కూడా వీరయ్యదొరకి నమస్కరించి, ‘‘వీరయ్యదొర! వారు శ్రీరామరాజుగారు. మిమ్మల్ని తీసుకుని వెళ్లడానికి వచ్చారు’’ అన్నాడు ఆనందంగా.‘‘వీరయ్యగారూ! నమస్కారం.’’ తన చేతిలో ఉన్న తుపాకీ ఆయన చేతిలో పెడుతూ అన్నాడు రామరాజు.స్టేషన్లో దాచిన ఆయుధాలు, తూటాలు చిటికెలో టేబుల్ మీదకు చేరాయి.ఎవరో టేబుల్ మీద లాంతరు దగ్గర ఒక కాగితం, అక్కడే ఉన్న కలం తీసి రామరాజు చేతికిచ్చారు. ఆయుధాల గురించి రాసి సంతకం చేశారాయన. తరువాత వీరయ్య దగ్గరకే వచ్చాడు రామరాజు.‘‘మీరిక స్వేచ్ఛాజీవి. మీ ఉత్సాహాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీరు మా ఉద్యమంలోకి రావచ్చు. మమ్మల్ని నడిపించవచ్చు. రండి వెళదాం.’’ అన్నాడు రామరాజు. టషన్ బయటకు వచ్చి వరుసగా నిలబడ్డారు. నల్లటి ఆకాశం వైపు గురిపెట్టి కాల్చారు. ఇరవై ఒక్క పేలుళ్లు. మూడురోజులలో మూడు స్టేషన్లలో సేకరించిన ఆయుధాలు – ఇరవై ఒకటి. క్షణం తరువాత అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏం జరిగింది? గ్రామస్థులకి అదంతా కలలా ఉంది. 5 ఉదయం తొమ్మిది గంటల వేళ....విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం. మేజిస్ట్రేట్ సి.ఎ. హ్యండర్సన్ మద్రాసులో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎ.గ్రాహంకు సమాచారం పంపే హడావిడిలో ఉన్నాడు. ‘నర్సీపట్నం దగ్గర తిరుగుబాటు జరిగింది. పూర్తి వివరాలు త్వరలో పంపుతాం. ఈ తిరుగుబాటులో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్ల నుంచి ఆయుధాలు దొచుకోవడం మినహా మరే విధమైన దోపిడీ, దౌర్జన్యం జరగలేదు. తిరుగుబాటుకు ఇంతవరకు కారణాలు తెలియరాలేదు.దీని నాయకుడు శ్రీరామరాజు అడ్డతీగెల దగ్గర కొంతకాలం ఇంటర్న్ అయినట్టు తెలిసింది. ఇతడు నేపాల్ యాత్రకు అనుమతి తీసుకుని పెద్దవలస ముఠాకు వచ్చాడు. ఇక్కడనే ఎక్కువ మంది అనుచరులను సేకరించినట్టు తెలుస్తున్నది.‘ఈ తిరుగుబాటు ఆశయాల గురించి కూడా తెలియడం లేదు. ఇంటర్న్మెంట్ నుంచి రెండోసారి పారిపోయిన వీరయ్యదొరను జైలు నుంచి రక్షించడానికి కావచ్చు. ‘ఏజెన్సీ కమిషనర్ స్టీవార్ట్ నివేదిక ప్రకారం కూడా ఆయుధాల దోపిడీ మాత్రమే జరిగింది. దీనిని బట్టి కేవలం దోపిడీయే వీరి లక్ష్యం కాదని తోచుచున్నది.’ l‘‘హలో... హలో... కేడీపేట క్యాంప్.... ఓవర్’’ పిలిచాడు ఫర్బీస్.‘‘హలో..నర్సీపట్నం హెడ్క్వార్టర్స్... నర్సీపట్నం హెడ్క్వార్టర్స్.. ఓవర్....’’ అవతల నుంచి వినిపించింది.‘‘హలో... రామరాజుని నేరుగా కేడీపేటలో అప్పగించాలన్న సమాచారం కొయ్యూరు వెళ్లిందా? ఓవర్’’ అవతల నుంచి అడుగుతున్నారు.‘చేరింది. ఓవర్’’ చెప్పాడు ఫర్బీస్.‘‘స్పెషల్ కమిషనర్, జాన్ కొద్దిసేపటి క్రితమే కేడీ పేట బయలుదేరారు.’’ చెప్పారు అవతల.‘‘ఓకే ఒకే... ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఓవర్.’’ ఫర్బీస్. సమయం పదకొండున్నర. ఎండ మండిపోతోంది. ఎనిమిదవ అధ్యాయం 1 చూస్తూ ఉండగానే యుద్ధవాతావరణం ఏర్పడింది మన్యం నిండా.గోచిపాతరాయుళ్లు మూడు పోలీస్ స్టేషన్లు కొట్టడమా? గ్రేట్వార్ను నడిపించిన దేశానికా ఈ పరీక్ష? ఇరవై ఒక్క తుపాకులు ఎత్తుకెళ్లింది కొండదళం. అన్నీ ‘303’ తుపాకులే. ఇప్పుడు కొండదళమూ ఆ«ధునిక పోలీసు పటాలమే. గంట గంటకు పోలీసు బలగాలతో నిండిపోతోంది నర్సీపట్నం. నార్తర్న్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జార్జి దాడుల సంగతి తెలిసిన మరుక్షణమే ఆదేశాలిచ్చాడు, మోహరింపు గురించి.వచ్చినవాళ్లను వచ్చినట్టు కొండలలోకి తరుముతున్నారు. మూడురోజులలోనే మన్యాన్ని ఖాకీవనం చేశారు. అక్షరాలా అష్ట దిగ్బంధనమే. నర్సీపట్నంతో పాటు, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, అడ్డతీగల, కొయ్యూరు, కోటనందూరు, మల్కన్గిరిల దగ్గర పోలీసు శిబిరాలు వెలిశాయి. ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ సాండర్స్ కొద్దిమంది విశాఖపట్నం రిజర్వు పోలీసు బలగాలను వెంటపెట్టుకుని హుటాహుటిన నర్సీపట్నం వచ్చాడు, దాడుల మరునాడే. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అక్కడే ఉంటాడు. హోదా తక్కువ అని ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికీ, ఆగమేఘాల మీద అమలు చేయడానికీ వీలుగా సాండర్సే దిగాడు.చివర్న జిల్లా కలెక్టర్ హ్యాండర్సన్, పోలీసు సూపరింటెండెంట్ మార్టిన్ మోటారు మీద బయలుదేరారు. విశాఖపట్నం రిజర్వుదళాలు వెంటనే కృష్ణదేవిపేట వెళ్లిపోయాయి. ఇవి సాండర్స్ నాయకత్వంలో పనిచేస్తాయి.పార్వతీపురం రిజర్వు దళాలు నర్సీపట్నం మీదుగా చింతపల్లికి వెళ్లాలని ఆదేశాలు వెళ్లాయి. ఆ దళాలు రెండురోజులకి చింతపల్లి చేరుకున్నాయి. అందులో కొంత రిజర్వు దళం 28వ తేదీకల్లా లంబసింగిలో మకాం వేసింది. విశాఖ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల నాయకత్వంలో వచ్చిన 20 మంది రిజర్వు దళాల బృందం వారికి తోడైంది. ఈ దళాల మీద ఆధిపత్యం వహించడానికి స్కాట్ కవర్డ్ను నియమించారు. అడ్డతీగలలో మోహరించవలసిందంటూ రాజమండ్రి రిజర్వు దళాలకి ఆదేశం వెళ్లింది. ఆగస్టు 25నే ఆ దళాలు బయలుదేరాయి. అడ్డతీగల కార్యకలాపాల బాధ్యత డాసన్ చేతికి ఇచ్చారు. అక్కడ నుంచి కొందరు రాజమండ్రి రిజర్వు దళ సభ్యులని మళ్లీ కొయ్యూరు తరిమారు.కాకినాడ రిజర్వు దళాలు వచ్చి తుని దగ్గరలోనే కోటనందూరులో సిద్ధంగా ఉండాలి.కృష్ణా రిజర్వు మల్కన్గిరి చేరుకోవాలి. పోలీసు కార్యకలాపాల వ్యవహారాలకు నర్సీపట్నాన్ని ప్రధాన కేంద్రాన్ని చేశారు.పోలీసు బలగాలను సమన్వయం చేస్తూ, తాజా అలజడిని అణచివేసే బాధ్యతలను కీనేకు అప్పగించారు. ట్రేమన్హేర్ నాయకత్వంలో ఒక దళం, 33 మంది సభ్యుల దళంతో స్కాట్ కవర్డ్ చింతపల్లి చుట్టుపక్కల గాలింపు పేరుతో అప్పుడే వీరవిహారం ఆరంభించారు. 2 ‘‘ఏజెన్సీ ఉద్యమనాదంతో మార్మోగుతున్నది. సహాయ నిరాకరణోద్యమంలో అగ్రభాగాన నిలిచిన జాతీయ కాంగ్రెస్ తరఫున నాయకులు వెంటనే మన్యానికి వెళ్లడం, పరిస్థితిని గమనించడం అవసరం.’’పెద్దాపురం కాంగ్రెస్ నాయకులు వార్తాపత్రికలకీ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులకీ టెలిగ్రామ్లు ఇచ్చి రెండురోజుల యింది. పెద్దలెవరో వస్తారనీ, ఏదో చెబుతారనీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు వారు. అటు విజయనగరం మొదలు, ఇటు మద్రాసు వరకు ఆ వార్తలతోనే పత్రికలు హోరెత్తిస్తున్నాయి. ‘‘ఏజెన్సీలోని కొండగ్రామాల ప్రజలు ఏవేవో కారణాలతో తిరుగుబాటు లేవదీశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు లేదా ఐదు పోలీసు స్టేషన్ల మీద దాడులు చేశారట. ఆయుధాలు, మందుగుండు దోచుకుని వెళ్లారట. ఈ దోపిడీలను అరికట్టడానికి కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి రిజర్వు బలగాలను పంపించారట.....’’రాజమండ్రి నుంచి వెలువడుతున్న మాసపత్రిక ‘కాంగ్రెస్’లో ఆగస్టు 28న వచ్చింది వార్త. ఐదారు మాసాల క్రితమే మొదలైన ‘కాంగ్రెస్’ సైక్లోస్టయిల్ పత్రిక. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు. మరునాడే ‘ఆంధ్రపత్రిక’ ప్రచురించిన వార్త కలకలం సృష్టించింది. ఉరుములేని పిడుగు లాంటి వార్త– పెద్దాపురం విలేకరి రాసినది. ‘‘ఒక క్షత్రియ యువకుని నాయకత్వంలో వందలాదిమంది ఏజెన్సీ ప్రజలు పోలీసు స్టేషన్లను దోచుకున్నారు. చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి స్టేషన్లలో ఆయుధాలు, మందుగుండు తీసుకుపోయారు. కానీ ఆందోళనకారులు ఎవరినీ హింసించలేదు.....’’ఆగస్టు 31 సంచికలో మరో వార్త –‘‘ఆ క్షత్రియ యువకుడు పాతికేళ్లవాడు. పేరు అల్లూరి శ్రీరామరాజు. సాత్వికాహారమే తీసుకుంటాడు. అహింసను ప్రబోధిస్తాడు. అతీతశక్తులు కలిగినవాడని చెబుతారు. ఆయనను తూటాలు కూడా గాయపరచలేవని అక్కడి ప్రజల నమ్మకం. స్టేషన్లను కొల్లగొట్టే ముందు ఆ సమాచారాన్ని కోయల ద్వారా తెలియచేస్తాడు. దాడి ఏ సమయంలో చేసేదీ కూడా చెబుతాడు. రాజు ఎక్కడ ఉన్నాడని ఆ సమాచారం తెచ్చిన కోయను అడిగితే తనకు ఏమీ తెలియదని అతడు చెబుతాడు. తాను రాజాజ్ఞ పాలిస్తున్నానని మాత్రమే చెబుతాడు. వాళ్లిచ్చే నాలుగు అణాల కోసం ఈ పని చేస్తున్నానని అంటాడు.’’ ‘న్యాయదీపిక’ మద్రాసు నుంచి వెలువడుతుంది. సెప్టెంబర్ 4న ‘రంప దాడులు’ పేరుతో వార్త ఇచ్చింది. ‘గోదావరి పత్రిక’, ‘హితకారిణి’ పత్రికలు కూడా మన్యం అలజడులను గురించి వార్తలు అందించాయి.విజయనగరం నుంచి వచ్చే ‘ఆర్యప్రభ’ గూడెం ఫితూరీ అని పేరు పెట్టి, కారణాలు తెలియచేసింది. ‘గూడెం డిప్యూటీ తహసీల్దార్ రోడ్డు పని మొదలుపెట్టి, అందుకోసం కొండ ప్రజలను రప్పించుకున్నాడు. కూలీ ఇవ్వలేదు. అడవిలోకి అడుగు పెట్టే అవకాశం లేని కొండ వాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే రోడ్డు పనికి వచ్చారు. అలాంటి బక్క ప్రాణులను బాస్టియన్ హింసించడంతో ఉద్యమం మొదలైంది...’ సహాయ నిరాకరణోద్యమంలో ఎంతో హింసను చవిచూసిన మైదాన ప్రాంతాల ప్రజలకి శ్రీరామరాజు సాహసం అద్భుతం అనిపిస్తోంది. అలాంటి సమయంలోనే సెప్టెంబర్ మొదటివారంలో ఓ టెలిగ్రాం పట్టుకుని తణుకు నుంచి పెద్దాపురం వచ్చాడు బ్రహ్మజోస్యుల సీతారామయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త. అది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు టంగుటూరి ప్రకాశం పంతులు 30–8–1922న ఇచ్చిన టెలిగ్రాం. ‘‘పెద్దాపురం కాంగ్రెస్ వారు ఏమీ కల్పించుకొనకూడదు. దోపిడీగాండ్రు పోలీసు స్టేషన్లను దోచుకుని తుపాకులను, తూటాలను తీసుకుని పోతుంటే కాంగ్రెస్ వారు చేయవలసిందేమిటో నాకేమీ బోధపడడం లేదు. వారి దగ్గరకు పోయి మీరిట్లా చేయరాదని నెమ్మదిగా బోధించడానికి కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ వారు ఎవరూ కూడా బందిపోట్ల దగ్గరకు పోకూడదు. కాంగ్రెస్ నాయకులు రావాలని పత్రికలకు తంతి వార్తలు పంపడమే అసంగతం.’’ హతాశులయ్యారు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు. 3 ‘‘నేసాలాకుంటిని దొర!’’ దాదాపు ఏడుస్తూ చెప్పాడా కొండవాడు. అంటే– ఈ మోత నా వల్ల కాదు అని. రెండు గంటల క్రితం అలాగే వేడుకున్నాడతడు. ఎవరూ పట్టించుకోలేదు. ఒక జంతువును మోతకు ఉపయోగించుకున్నట్టే. నలభయ్ ఏళ్లుంటాయి. గోచీ తప్ప ఒంటి మీద మరేమీ లేదు. తలగుడ్డ చుట్టి నెత్తి మీద పెట్టుకున్నాడు. దాని మీదే రెండు ఖాకీసంచులు కొలువై ఉన్నాయి–బరువు నలభయ్ కిలోలు పైనే. వాటితో గంటల తరబడి కొండలూ గుట్టలూ ఎక్కుతుంటే నరకం కనిపిస్తోంది.ఒక్కొక్క సంచిలో జత బూట్లు, ఒక యూనిఫారమ్, ఐదారు లీటర్లు పట్టే నీళ్ల డబ్బా, కంబళి, పది అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పు ఉన్న పాస్టిక్ గుడ్డ, డేరా నిలబెట్టడానికి ఉపయోగించే నాలుగు పెద్ద పెద్ద మేకులు ఉన్నాయి. సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు. ఆ కొండ మీదకు వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది పార్వతీపురం రిజర్వు దళానికి. అందుకే నిలబడిపోయారు. అప్పుడే తన నెత్తి మీద ఈ బరువు ఎక్కించిన ఆ రిజర్వు పోలీసు దగ్గరకు వచ్చి అన్నాడు ఆ కొండవాడు. లాగి చెంప మీద కొట్టాడు ఆ పోలీసు. ట్రేమన్హేర్, అతడికి ఏదో చెబుతున్న బాస్టియన్, మిగిలిన పోలీసులు తటాల్న అటు చూశారు. ‘‘నోరెత్తితే తొక్క తీసీగల్ను!.’’అరిచాడా పోలీసు.తల మీది బరువుతో నడుస్తున్న మిగిలిన ఆ పదిమంది కొండవాళ్లు హడలిపోయారు. ఆ రిజర్వు దళంలోని ముప్పయ్ మంది సామగ్రిని ఆ పదకొండు మందే మోస్తున్నారు– నిన్న ఉదయం నుంచి. మొన్న, అంటే రెండో తేదీనే లోతుగెడ్డ దగ్గర ఆ పదకొండుమంది కొండవాళ్లు రిజర్వు దళం బారిన పడి మోత మోస్తున్నారు. తిండి పెడితే పెడతారు. కూలి డబ్బు మాటే లేదు. మరోచోట ఎక్కడో కొత్త వాళ్లు దొరకాలి. ఈలోగా బరువు దించితే చెంపలు పగులుతాయి. తుపాకీ మడమలు ఎముకలు విరుస్తాయి. ఆ రోజు సెప్టెంబర్ 4. పోలీసు స్టేషన్ల మీద దాడులు జరిగి అప్పుడే పదిరోజులు గడిచిపోయాయి. ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారు. అదే ట్రేమన్హేర్ను బా«ధిస్తోంది. నాలుగు రోజుల నుంచి దోబూచులాటే. సెప్టెంబర్ 1న∙రామరాజు, ఆయన మనుషులు సిరిబలి వచ్చారు. మామిడివరం మునసబు నాలుగు కుంచాల బియ్యం, ఒక కోడి ఇచ్చాడు. ఈ సమాచారం నిజమేనని రూఢీ చేసుకుని అక్కడికి పరిగెడితే, చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. సిరిబలి నుంచి ఆ మధ్యాహ్నమే జర్లి చేరింది కొండదళం. ఆ రాత్రికే కిలంకోటకు చేరుకుంది. కిలంకోట కొండరాజు బియ్యం, కోళ్లు పంపాడు. రెండో తేదీ రాత్రికి కొండదళం గంగరాజు మాడుగుల చేరిందని మళ్లీ రిజర్వు దళానికి కబురొచ్చింది. వేకువనే తలో దారి పట్టారు రిజర్వు పోలీసులు. గూడెం మీదుగా ధారకొండ వెళ్లి అక్కడ గాలించమని కవర్ట్కి చెప్పాడు సాండర్స్. మరో దిశలో కప్పాల, ఒంజేరి, గిమిలి, లోచిలి, పాడేరు ప్రాంతాలలో గాలించిరమ్మని ట్రేమన్హేర్ని పురమాయించాడు. ట్రేమన్హోర్ వెంట ఉంటూ దారి చూపించమని బాస్టియన్ని ఆదేశించాడు సాండర్స్. కొండకంబేరు ప్రాంతంలో గాలిస్తానని చెప్పి సాండర్స్ వెళ్లిపోయాడు. పార్వతీపురం దళం రాక అందుకే. కొంత సేద తీరాక మళ్లీ నడక మొదలు పెట్టింది రిజర్వు దళం. అరమైలు నడిచాక ఒక గుబురు చాటు నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యక్తి. పేరు కామయ్యనాయుడు. జైపూర్ నుంచి వచ్చిన సీఐడీ. ‘‘సార్! కొండదళం గంగరాజు మాడుగులలో లేదు. ఒంజేరి వచ్చింది. రామరాజుతో సహా అంతా భోజనాలు చేసి పడుకున్నారని తెలిసింది.’’ చెప్పాడు నాయుడు, హడావిడి పడుతూ. ఒక్కసారిగా కలకలం.‘‘ఒంజేరి ఒకటిన్నర మైళ్ల ఘాటీ సార్! చాలా ఏటవాలుగా ఉంటుంది. దాని పక్కనే గిమిలి. ఒంజేరి నుంచి నర్సీపట్నం 24 కిలోమీటర్లు.’’ అందుకుని ఇంగ్లిష్లో చెప్పాడు బాస్టియన్. ట్రేమన్హేర్కు అప్పగించిన ప్రాంతంలో కొండదళం జాడేది ఉండదని అనుకున్నారు. అది తప్పు అని తేలింది. ఎక్కడలేని ఆవేశంతో అరిచాడు ట్రేమన్హేర్, ‘‘మూవ్!’’∙∙lగిమిలి వైపు నుంచి ఒంజేరి ఘాటీ మీదకి చేరాయి ఆ ఐదు ఏనుగులు. వాటి మీద పెద్ద పెద్ద మూటలు. గోకిరి ఎర్రేసు, ఆరేడుగురు పిల్లలు అక్కడికి వచ్చారు, ఏమీ తెలియనట్టు.‘‘అబ్బాయిలూ! ఇదేనా, ఒంజేరి?’’ ఒరియా యాసతో అడిగాడు మొదటి ఏనుగు మీది మావటి. ‘‘ఇదే బాబయ్యా! ఎక్కణ్ణించి?’’ అమాయకంగా అడిగాడు ఎర్రేసు.‘‘జయపురం మారాజావారి ఏనుగులు.’’ చెప్పాడతడు. ‘‘ఇటెక్కడికి?’’ అడిగాడు ఎర్రేసు. ‘‘ఇక్కడికే!’’ అన్నాడు మావటి. ‘‘ఆ మూటలేంటో!’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు. ‘‘నీకెందుకో!’’ పెడసరంగా అన్నాడు మావటి. ‘‘సాయం కావాలేమోనని....!’’ అన్నాడు ఎర్రేసు. ‘‘అందుకా! ఇవన్నీ బియ్యం, కంబళ్లు, ఉప్పూ, పప్పూ....’’ చెప్పాడు మావటి. ‘‘ఎవరికో!?’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు.‘‘పోలీసులకి. ఇటే వస్తున్నారు’’ చెప్పాడు మావటి. ముఖంలో ఎలాంటి మార్పూ కనపడనీయకుండా అన్నాడు ఎర్రేసు. ‘‘బాబయ్యా! అదిగో ఆ కొండవాలు కాడ చితుకులు ఏరుకుంటూ ఉంటాం. సాయం కావాలంటే ఒక్క కేకెయ్యి!’’ మాకూ ఓ ముద్ద దొరుకుతుంది కదా అన్నట్టు సైగ చేస్తూ.‘‘పోలీసులే కదా! వెసుకుంటార్లే!’’ చెప్పాడు మావటి.కొండవాలు దగ్గరగా వచ్చి తటాల్న మాయమయ్యారు ఎర్రేసు, ఆ పిల్లలు. వెంటనే అక్కడే ఉన్న రామరాజు దళంలో ప్రత్యక్ష మయ్యాడు ఎర్రేసు. కొండదళం సభ్యులంతా అటే చూస్తున్నారు– ఘాటీ మలుపులో ఉన్న పార్వతీపురం రిజర్వు పోలీసుని.కాగడాలు, నిప్పుమూటలతో స్టేషన్ బయటంతా వెలుగుతో నిండింది. అందరి చేతులలోను ఆయుధాలు. పది పదకొండు తుపాకులు–అవి స్టేషన్ వైపు గురి పెట్టి ఉన్నాయి. ‘‘ప్పిప్పి... పితూరీ దండొచ్చే... సింది...!’’ పిచ్చివాడిలా అరిచాడా జవాను.కాపలాకి పడుకున్న ఆ గ్రామస్థులంతా మేల్కోవడం, పరుగు లంఘించడం ఒక్కసారే జరిగాయి. లోపలున్న వాళ్లు ఒక్క ఉదుటన బయటకొచ్చారంతామొదట అడ్డతీగల జవాను, వెంటనే మిగిలిన ఆరుగురు చేతులు ఎత్తేశారు.ఈ పది నిమిషాలలోనే ఆ డెబ్బయ్ ఎనభై మందితో ఉన్న కొండదళానికి మరో యాభయ్ అరవై మంది తోడయ్యారు. అంతా దూసుకొచ్చారు స్టేషన్లోకి. పోలీసులని అసలు పట్టించుకోలేదు. అదే అదనుగా ఒక పక్క నుంచి అరుగు దూకేసి, ‘‘పితూరీ దండొచ్చింది. పితూరీ దండొచ్చింది.’’అని అరుచుకుంటూ గ్రామం వైపు పరుగులు తీశారు పోలీసులు. గ్రామంలో కలకలం. అంతా లేచి, ఇళ్లకు తాళాలు వేసి తలా దిక్కుకు పారిపోతున్నారు. స్టేషన్లో మొదట పడాలు లాకప్ గది తాళాన్ని తుపాకీ మడమతో ఒక్క దెబ్బకి బద్దలు కొట్టాడు. కాగడాలు, ఉప్పు మూటల వెలుగు లోపలికి వస్తుంటే, లాకప్ గది తలుపు తోసుకుని బయటకు వచ్చి, సంభ్రమంగా చూస్తూ నిలబడ్డాడు వీరయ్యదొర.‘‘బాగున్నారా వీరయ్యదొరా!’’ పలకరించాడు గంతన్న, నమస్కరిస్తూ. ‘‘నువ్వు...!?’’‘‘గాం జోగిదొర కొడుకుని. బట్టిపనుకుల. గంతన్నlఅంటారు’’ అన్నాడు.‘‘అలాగా!’’ అంటుండగానే, లోపలికి వచ్చాడు రామరాజు.పడాలు కూడా వీరయ్యదొరకి నమస్కరించి, ‘‘వీరయ్యదొర! వారు శ్రీరామరాజుగారు. మిమ్మల్ని తీసుకుని వెళ్లడానికి వచ్చారు’’ అన్నాడు ఆనందంగా.‘‘వీరయ్యగారూ! నమస్కారం.’’ తన చేతిలో ఉన్న తుపాకీ ఆయన చేతిలో పెడుతూ అన్నాడు రామరాజు. స్టేషన్లో దాచిన ఆయుధాలు, తూటాలు చిటికెలో టేబుల్ మీదకు చేరాయి.ఎవరో టేబుల్ మీద లాంతరు దగ్గర ఒక కాగితం, అక్కడే ఉన్న కలం తీసి రామరాజు చేతికిచ్చారు. ఆయుధాల గురించి రాసి సంతకం చేశారాయన.తరువాత వీరయ్య దగ్గరకే వచ్చాడు రామరాజు.‘‘మీరిక స్వేచ్ఛాజీవి. మీ ఉత్సాహాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీరు మా ఉద్యమంలోకి రావచ్చు. మమ్మల్ని నడిపించవచ్చు. రండి వెళదాం.’’ అన్నాడు రామరాజు. స్టేషన్ బయటకు వచ్చి వరుసగా నిలబడ్డారు. నల్లటి ఆకాశం వైపు గురిపెట్టి కాల్చారు. ఇరవై ఒక్క పేలుళ్లు. మూడురోజులలో మూడు స్టేషన్లలో సేకరించిన ఆయుధాలు – ఇరవై ఒకటి. క్షణం తరువాత అక్కడ ఎవరూ కనిపించలేదు. ఏం జరిగింది? గ్రామస్థులకి అదంతా కలలా ఉంది. 5 ఉదయం తొమ్మిది గంటల వేళ....విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం. మేజిస్ట్రేట్ సి.ఎ. హ్యండర్సన్ మద్రాసులో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎ.గ్రాహంకు సమాచారం పంపే హడావిడిలో ఉన్నాడు.‘నర్సీపట్నం దగ్గర తిరుగుబాటు జరిగింది. పూర్తి వివరాలు త్వరలో పంపుతాం. ఈ తిరుగుబాటులో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్ల నుంచి ఆయుధాలు దొచుకోవడం మినహా మరే విధమైన దోపిడీ, దౌర్జన్యం జరగలేదు. తిరుగుబాటుకు ఇంతవరకు కారణాలు తెలియరాలేదు. దీని నాయకుడు శ్రీరామరాజు అడ్డతీగెల దగ్గర కొంతకాలం ఇంటర్న్ అయినట్టు తెలిసింది. ఇతడు నేపాల్ యాత్రకు అనుమతి తీసుకుని పెద్దవలస ముఠాకు వచ్చాడు. ఇక్కడనే ఎక్కువ మంది అనుచరులను సేకరించినట్టు తెలుస్తున్నది. ‘ఈ తిరుగుబాటు ఆశయాల గురించి కూడా తెలియడం లేదు. ఇంటర్న్మెంట్ నుంచి రెండోసారి పారిపోయిన వీరయ్యదొరను జైలు నుంచి రక్షించడానికి కావచ్చు.‘ఏజెన్సీ కమిషనర్ స్టీవార్ట్ నివేదిక ప్రకారం కూడా ఆయుధాల దోపిడీ మాత్రమే జరిగింది. దీనిని బట్టి కేవలం దోపిడీయే వీరి లక్ష్యం కాదని తోచుచున్నది.’∙∙l‘‘హలో... హలో... కేడీపేట క్యాంప్.... ఓవర్’’ పిలిచాడు ఫర్బీస్.‘‘హలో..నర్సీపట్నం హెడ్క్వార్టర్స్... నర్సీపట్నం హెడ్క్వార్టర్స్.. ఓవర్....’’ అవతల నుంచి వినిపించింది.‘‘హలో... రామరాజుని నేరుగా కేడీపేటలో అప్పగించాలన్న సమాచారం కొయ్యూరు వెళ్లిందా? ఓవర్’’ అవతల నుంచి అడుగుతున్నారు.‘‘చేరింది. ఓవర్’’ చెప్పాడు ఫర్బీస్.‘‘స్పెషల్ కమిషనర్, జాన్ కొద్దిసేపటి క్రితమే కేడీ పేట బయలుదేరారు.’’ చెప్పారు అవతల.‘‘ఓకే ఒకే... ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఓవర్.’’ ఫర్బీస్. సమయం పదకొండున్నర. ఎండ మండిపోతోంది. ఎనిమిదవ అధ్యాయం 1 చూస్తూ ఉండగానే యుద్ధవాతావరణం ఏర్పడింది మన్యం నిండా.గోచిపాతరాయుళ్లు మూడు పోలీస్ స్టేషన్లు కొట్టడమా? గ్రేట్వార్ను నడిపించిన దేశానికా ఈ పరీక్ష? ఇరవై ఒక్క తుపాకులు ఎత్తుకెళ్లింది కొండదళం. అన్నీ ‘303’ తుపాకులే. ఇప్పుడు కొండదళమూ ఆధునిక పోలీసు పటాలమే. గంట గంటకు పోలీసు బలగాలతో నిండిపోతోంది నర్సీపట్నం. నార్తర్న్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జార్జి దాడుల సంగతి తెలిసిన మరుక్షణమే ఆదేశాలిచ్చాడు, మోహరింపు గురించి.వచ్చినవాళ్లను వచ్చినట్టు కొండలలోకి తరుముతున్నారు. మూడురోజులలోనే మన్యాన్ని ఖాకీవనం చేశారు. అక్షరాలా అష్ట దిగ్బంధనమే. నర్సీపట్నంతో పాటు, కృష్ణదేవిపేట, చింతపల్లి, లంబసింగి, అడ్డతీగల, కొయ్యూరు, కోటనందూరు, మల్కన్గిరిల దగ్గర పోలీసు శిబిరాలు వెలిశాయి. ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ సాండర్స్ కొద్దిమంది విశాఖపట్నం రిజర్వు పోలీసు బలగాలను వెంటపెట్టుకుని హుటాహుటిన నర్సీపట్నం వచ్చాడు, దాడుల మరునాడే. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అక్కడే ఉంటాడు. హోదా తక్కువ అని ఆలోచించకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికీ, ఆగమేఘాల మీద అమలు చేయడానికీ వీలుగా సాండర్సే దిగాడు. చివర్న జిల్లా కలెక్టర్ హ్యాండర్సన్, పోలీసు సూపరింటెండెంట్ మార్టిన్ మోటారు మీద బయలుదేరారు. విశాఖపట్నం రిజర్వుదళాలు వెంటనే కృష్ణదేవిపేట వెళ్లిపోయాయి. ఇవి సాండర్స్ నాయకత్వంలో పనిచేస్తాయి.పార్వతీపురం రిజర్వు దళాలు నర్సీపట్నం మీదుగా చింతపల్లికి వెళ్లాలని ఆదేశాలు వెళ్లాయి. ఆ దళాలు రెండురోజులకి చింతపల్లి చేరుకున్నాయి. అందులో కొంత రిజర్వు దళం 28వ తేదీకల్లా లంబసింగిలో మకాం వేసింది. విశాఖ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్ల నాయకత్వంలో వచ్చిన 20 మంది రిజర్వు దళాల బృందం వారికి తోడైంది. ఈ దళాల మీద ఆధిపత్యం వహించడానికి స్కాట్ కవర్డ్ను నియమించారు. అడ్డతీగలలో మోహరించవలసిందంటూ రాజమండ్రి రిజర్వు దళాలకి ఆదేశం వెళ్లింది. ఆగస్టు 25నే ఆ దళాలు బయలుదేరాయి. అడ్డతీగల కార్యకలాపాల బాధ్యత డాసన్ చేతికి ఇచ్చారు. అక్కడ నుంచి కొందరు రాజమండ్రి రిజర్వు దళ సభ్యులని మళ్లీ కొయ్యూరు తరిమారు.కాకినాడ రిజర్వు దళాలు వచ్చి తుని దగ్గరలోనే కోటనందూరులో సిద్ధంగా ఉండాలి.కృష్ణా రిజర్వు మల్కన్గిరి చేరుకోవాలి. పోలీసు కార్యకలాపాల వ్యవహారాలకు నర్సీపట్నాన్ని ప్రధాన కేంద్రాన్ని చేశారు.పోలీసు బలగాలను సమన్వయం చేస్తూ, తాజా అలజడిని అణచివేసే బాధ్యతలను కీనేకు అప్పగించారు. ట్రేమన్హేర్ నాయకత్వంలో ఒక దళం, 33 మంది సభ్యుల దళంతో స్కాట్ కవర్డ్ చింతపల్లి చుట్టుపక్కల గాలింపు పేరుతో అప్పుడే వీరవిహారం ఆరంభించారు. 2 ‘‘ఏజెన్సీ ఉద్యమనాదంతో మార్మోగుతున్నది. సహాయ నిరాకరణోద్యమంలో అగ్రభాగాన నిలిచిన జాతీయ కాంగ్రెస్ తరఫున నాయకులు వెంటనే మన్యానికి వెళ్లడం, పరిస్థితిని గమనించడం అవసరం.’’పెద్దాపురం కాంగ్రెస్ నాయకులు వార్తాపత్రికలకీ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులకీ టెలిగ్రామ్లు ఇచ్చి రెండురోజుల యింది. పెద్దలెవరో వస్తారనీ, ఏదో చెబుతారనీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు వారు. అటు విజయనగరం మొదలు, ఇటు మద్రాసు వరకు ఆ వార్తలతోనే పత్రికలు హోరెత్తిస్తున్నాయి. ‘‘ఏజెన్సీలోని కొండగ్రామాల ప్రజలు ఏవేవో కారణాలతో తిరుగుబాటు లేవదీశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు లేదా ఐదు పోలీసు స్టేషన్ల మీద దాడులు చేశారట. ఆయుధాలు, మందుగుండు దోచుకుని వెళ్లారట. ఈ దోపిడీలను అరికట్టడానికి కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి రిజర్వు బలగాలను పంపించారట.....’’రాజమండ్రి నుంచి వెలువడుతున్న మాసపత్రిక ‘కాంగ్రెస్’లో ఆగస్టు 28న వచ్చింది వార్త. ఐదారు మాసాల క్రితమే మొదలైన ‘కాంగ్రెస్’ సైక్లోస్టయిల్ పత్రిక. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు. మరునాడే ‘ఆంధ్రపత్రిక’ ప్రచురించిన వార్త కలకలం సృష్టించింది. ఉరుములేని పిడుగు లాంటి వార్త– పెద్దాపురం విలేకరి రాసినది.‘‘ఒక క్షత్రియ యువకుని నాయకత్వంలో వందలాదిమంది ఏజెన్సీ ప్రజలు పోలీసు స్టేషన్లను దోచుకున్నారు. చింతపల్లి, కృష్ణదేవి పేట, రాజవొమ్మంగి స్టేషన్లలో ఆయుధాలు, మందుగుండు తీసుకుపోయారు. కానీ ఆందోళనకారులు ఎవరినీ హింసించలేదు.....’’ ఆగస్టు 31 సంచికలో మరో వార్త –‘‘ఆ క్షత్రియ యువకుడు పాతికేళ్లవాడు. పేరు అల్లూరి శ్రీరామరాజు. సాత్వికాహారమే తీసుకుంటాడు. అహింసను ప్రబోధిస్తాడు. అతీతశక్తులు కలిగినవాడని చెబుతారు. ఆయనను తూటాలు కూడా గాయపరచలేవని అక్కడి ప్రజల నమ్మకం. స్టేషన్లను కొల్లగొట్టే ముందు ఆ సమాచారాన్ని కోయల ద్వారా తెలియచేస్తాడు. దాడి ఏ సమయంలో చేసేదీ కూడా చెబుతాడు. రాజు ఎక్కడ ఉన్నాడని ఆ సమాచారం తెచ్చిన కోయను అడిగితే తనకు ఏమీ తెలియదని అతడు చెబుతాడు. తాను రాజాజ్ఞ పాలిస్తున్నానని మాత్రమే చెబుతాడు. వాళ్లిచ్చే నాలుగు అణాల కోసం ఈ పని చేస్తున్నానని అంటాడు.’’ ‘న్యాయదీపిక’ మద్రాసు నుంచి వెలువడుతుంది. సెప్టెంబర్ 4న ‘రంప దాడులు’ పేరుతో వార్త ఇచ్చింది. ‘గోదావరి పత్రిక’, ‘హితకారిణి’ పత్రికలు కూడా మన్యం అలజడులను గురించి వార్తలు అందించాయి.విజయనగరం నుంచి వచ్చే ‘ఆర్యప్రభ’ గూడెం ఫితూరీ అని పేరు పెట్టి, కారణాలు తెలియచేసింది. ‘గూడెం డిప్యూటీ తహసీల్దార్ రోడ్డు పని మొదలుపెట్టి, అందుకోసం కొండ ప్రజలను రప్పించుకున్నాడు. కూలీ ఇవ్వలేదు. అడవిలోకి అడుగు పెట్టే అవకాశం లేని కొండ వాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే రోడ్డు పనికి వచ్చారు. అలాంటి బక్క ప్రాణులను బాస్టియన్ హింసించడంతో ఉద్యమం మొదలైంది...’సహాయ నిరాకరణోద్యమంలో ఎంతో హింసను చవిచూసిన మైదాన ప్రాంతాల ప్రజలకి శ్రీరామరాజు సాహసం అద్భుతం అనిపిస్తోంది. అలాంటి సమయంలోనే సెప్టెంబర్ మొదటివారంలో ఓ టెలిగ్రాం పట్టుకుని తణుకు నుంచి పెద్దాపురం వచ్చాడు బ్రహ్మజోస్యుల సీతారామయ్య అనే కాంగ్రెస్ కార్యకర్త. అది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు టంగుటూరి ప్రకాశం పంతులు 30–8–1922న ఇచ్చిన టెలిగ్రాం. ‘‘పెద్దాపురం కాంగ్రెస్ వారు ఏమీ కల్పించుకొనకూడదు. దోపిడీగాండ్రు పోలీసు స్టేషన్లను దోచుకుని తుపాకులను, తూటాలను తీసుకుని పోతుంటే కాంగ్రెస్ వారు చేయవలసిందేమిటో నాకేమీ బోధపడడం లేదు. వారి దగ్గరకు పోయి మీరిట్లా చేయరాదని నెమ్మదిగా బోధించడానికి కూడా అవకాశం లేదు. కాంగ్రెస్ వారు ఎవరూ కూడా బందిపోట్ల దగ్గరకు పోకూడదు. కాంగ్రెస్ నాయకులు రావాలని పత్రికలకు తంతి వార్తలు పంపడమే అసంగతం.’’ హతాశులయ్యారు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు. 3 ‘‘నేసాలాకుంటిని దొర!’’దాదాపు ఏడుస్తూ చెప్పాడా కొండవాడు. అంటే– ఈ మోత నా వల్ల కాదు అని. రెండు గంటల క్రితం అలాగే వేడుకున్నాడతడు. ఎవరూ పట్టించుకోలేదు. ఒక జంతువును మోతకు ఉపయోగించుకున్నట్టే. నలభయ్ ఏళ్లుంటాయి. గోచీ తప్ప ఒంటి మీద మరేమీ లేదు. తలగుడ్డ చుట్టి నెత్తి మీద పెట్టుకున్నాడు. దాని మీదే రెండు ఖాకీసంచులు కొలువై ఉన్నాయి–బరువు నలభయ్ కిలోలు పైనే. వాటితో గంటల తరబడి కొండలూ గుట్టలూ ఎక్కుతుంటే నరకం కనిపిస్తోంది.ఒక్కొక్క సంచిలో జత బూట్లు, ఒక యూనిఫారమ్, ఐదారు లీటర్లు పట్టే నీళ్ల డబ్బా, కంబ, పది అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పు ఉన్న పాస్టిక్ గుడ్డ, డేరా నిలబెట్టడానికి ఉపయోగించే నాలుగు పెద్ద పెద్ద మేకులు ఉన్నాయి. సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు. ఆ కొండ మీదకు వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది పార్వతీపురం రిజర్వు దళానికి. అందుకే నిలబడిపోయారు. అప్పుడే తన నెత్తి మీద ఈ బరువు ఎక్కించిన ఆ రిజర్వు పోలీసు దగ్గరకు వచ్చి అన్నాడు ఆ కొండవాడు. లాగి చెంప మీద కొట్టాడు ఆ పోలీసు. ట్రేమన్హేర్, అతడికి ఏదో చెబుతున్న బాస్టియన్, మిగిలిన పోలీసులు తటాల్న అటు చూశారు. ‘‘నోరెత్తితే తొక్క తీసీగల్ను!.’’అరిచాడా పోలీసు.తల మీది బరువుతో నడుస్తున్న మిగిలిన ఆ పదిమంది కొండవాళ్లు హడలిపోయారు. ఆ రిజర్వు దళంలోని ముప్పయ్ మంది సామగ్రిని ఆ పదకొండు మందే మోస్తున్నారు– నిన్న ఉదయం నుంచి.మొన్న, అంటే రెండో తేదీనే లోతుగెడ్డ దగ్గర ఆ పదకొండుమంది కొండవాళ్లు రిజర్వు దళం బారిన పడి మోత మోస్తున్నారు. తిండి పెడితే పెడతారు. కూలి డబ్బు మాటే లేదు. మరోచోట ఎక్కడో కొత్త వాళ్లు దొరకాలి. ఈలోగా బరువు దించితే చెంపలు పగులుతాయి. తుపాకీ మడమలు ఎముకలు విరుస్తాయి. ఆ రోజు సెప్టెంబర్ 4. పోలీసు స్టేషన్ల మీద దాడులు జరిగి అప్పుడే పదిరోజులు గడిచిపోయాయి. ఒక్కరిని కూడా పట్టుకోలేక పోయారు. అదే ట్రేమన్హేర్ను బా«ధిస్తోంది. నాలుగు రోజుల నుంచి దోబూచులాటే. సెప్టెంబర్ 1న∙రామరాజు, ఆయన మనుషులు సిరిబలి వచ్చారు. మామిడివరం మునసబు నాలుగు కుంచాల బియ్యం, ఒక కోడి ఇచ్చాడు. ఈ సమాచారం నిజమేనని రూఢీ చేసుకుని అక్కడికి పరిగెడితే, చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. సిరిబలి నుంచి ఆ మధ్యాహ్నమే జర్లి చేరింది కొండదళం. ఆ రాత్రికే కిలంకోటకు చేరుకుంది. కిలంకోట కొండరాజు బియ్యం, కోళ్లు పంపాడు. రెండో తేదీ రాత్రికి కొండదళం గంగరాజు మాడుగుల చేరిందని మళ్లీ రిజర్వు దళానికి కబురొచ్చింది. వేకువనే తలో దారి పట్టారు రిజర్వు పోలీసులు. గూడెం మీదుగా ధారకొండ వెళ్లి అక్కడ గాలించమని కవర్ట్కి చెప్పాడు సాండర్స్. మరో దిశలో కప్పాల, ఒంజేరి, గిమిలి, లోచిలి, పాడేరు ప్రాంతాలలో గాలించిరమ్మని ట్రేమన్హేర్ని పురమాయించాడు. ట్రేమన్హోర్ వెంట ఉంటూ దారి చూపించమని బాస్టియన్ని ఆదేశించాడు సాండర్స్. కొండకంబేరు ప్రాంతంలో గాలిస్తానని చెప్పి సాండర్స్ వెళ్లిపోయాడు. పార్వతీపురం దళం రాక అందుకే. కొంత సేద తీరాక మళ్లీ నడక మొదలు పెట్టింది రిజర్వు దళం. అరమైలు నడిచాక ఒక గుబురు చాటు నుంచి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యక్తి. పేరు కామయ్యనాయుడు. జైపూర్ నుంచి వచ్చిన సీఐడీ.‘‘సార్! కొండదళం గంగరాజు మాడుగులలో లేదు. ఒంజేరి వచ్చింది. రామరాజుతో సహా అంతా భోజనాలు చేసి పడుకున్నారని తెలిసింది.’’ చెప్పాడు నాయుడు, హడావిడి పడుతూ. ఒక్కసారిగా కలకలం.‘‘ఒంజేరి ఒకటిన్నర మైళ్ల ఘాటీ సార్! చాలా ఏటవాలుగా ఉంటుంది. దాని పక్కనే గిమిలి. ఒంజేరి నుంచి నర్సీపట్నం 24 కిలోమీటర్లు.’’ అందుకుని ఇంగ్లిష్లో చెప్పాడు బాస్టియన్. ట్రేమన్హేర్కు అప్పగించిన ప్రాంతంలో కొండదళం జాడేది ఉండదని అనుకున్నారు. అది తప్పు అని తేలింది. ఎక్కడలేని ఆవేశంతో అరిచాడు ట్రేమన్హేర్, ‘‘మూవ్!’’ ∙∙l గిమిలి వైపు నుంచి ఒంజేరి ఘాటీ మీదకి చేరాయి ఆ ఐదు ఏనుగులు. వాటి మీద పెద్ద పెద్ద మూటలు. గోకిరి ఎర్రేసు, ఆరేడుగురు పిల్లలు అక్కడికి వచ్చారు, ఏమీ తెలియనట్టు.‘‘అబ్బాయిలూ! ఇదేనా, ఒంజేరి?’’ ఒరియా యాసతో అడిగాడు మొదటి ఏనుగు మీది మావటి.‘‘ఇదే బాబయ్యా! ఎక్కణ్ణించి?’’ అమాయకంగా అడిగాడు ఎర్రేసు. ‘‘జయపురం మారాజావారి ఏనుగులు.’’ చెప్పాడతడు. ‘‘ఇటెక్కడికి?’’ అడిగాడు ఎర్రేసు. ‘‘ఇక్కడికే!’’ అన్నాడు మావటి. ‘‘ఆ మూటలేంటో!’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు. ‘‘నీకెందుకో!’’ పెడసరంగా అన్నాడు మావటి. ‘‘సాయం కావాలేమోనని....!’’ అన్నాడు ఎర్రేసు. ‘‘అందుకా! ఇవన్నీ బియ్యం, కంబళ్లు, ఉప్పూ, పప్పూ....’’ చెప్పాడు మావటి. ‘‘ఎవరికో!?’’ మళ్లీ అడిగాడు ఎర్రేసు. ‘‘పోలీసులకి. ఇటే వస్తున్నారు’’ చెప్పాడు మావటి.ముఖంలో ఎలాంటి మార్పూ కనపడనీయకుండా అన్నాడు ఎర్రేసు. ‘‘బాబయ్యా! అదిగో ఆ కొండవాలు కాడ చితుకులు ఏరుకుంటూ ఉంటాం. సాయం కావాలంటే ఒక్క కేకెయ్యి!’’ మాకూ ఓ ముద్ద దొరుకుతుంది కదా అన్నట్టు సైగ చేస్తూ.‘‘పోలీసులే కదా! మోసుకుంటార్లే!’’ చెప్పాడు మావటి. కొండవాలు దగ్గరగా వచ్చి తటాల్న మాయమయ్యారు ఎర్రేసు, ఆ పిల్లలు. వెంటనే అక్కడే ఉన్న రామరాజు దళంలో ప్రత్యక్ష మయ్యాడు ఎర్రేసు. కొండదళం సభ్యులంతా అటే చూస్తున్నారు– ఘాటీ మలుపులో ఉన్న పార్వతీపురం రిజర్వు పోలీసుని. -
ఆకుపచ్చ సూర్యదయం
ఖాకీ నిక్కరు మీద, ఖాకీ చొక్కా ధరించాడు రామరాజు. రెండు జేబులు. వాటి పై భాగాలు మూసి ఉన్నాయి. మెడలో తూటాల దండ. ఆయన ఒంటికి ఆ బట్టలు కొద్దిగా పెద్దవిగానే ఉన్నాయి.భుజం మీద తుపాకీతో ఆయనను చూడడం మరీ మరీ వింత. కాళ్లకి చెప్పులు మాత్రం లేవు. మల్లు, గంటం, పడాలు, బోనంగి పోతరాజు, సంకోజి పండడు, కొటికల బాలయ్య, కర్రి కణ్ణిగాడు ఇంకో ఇద్దరు ముగ్గురు ఖాకీ బట్టలలో, భుజాన తుపాకీతో ఉన్నారు. హుందాగా పేరుపేరునా పలకరిస్తూ ,అక్కడ నుం జనం వెంటరాగా గ్రామచావడి దగ్గరకు నడిచాడు రామరాజు. ఎవరో మరి, అప్పటికే నులక మంచం వేసి, తెల్లని వస్త్రం పరిచారు.దాని మీద కూర్చున్నాడు రామరాజు. ఒక్క నిమిషం తరువాత వెనక్కి విశ్రాంతిగా మోచేతుల మీద వాలారు. ఆ క్షణంలో యుద్ధ శిబిరంలో సేద తీరుతున్న యోధుడిలా ఉన్నారాయన.ఆయన చుట్టూ కొద్దిదూరంలో నిలబడ్డారు సాయుధులు. ముందు ఊరి బారికకు కబురంపాడు రామరాజు, డప్పుతో సహా రమ్మని. తక్షణమే వచ్చాడతడు. ‘ఊరివారిని చూడాలి. వారి దర్శనం కావాలి’ అని నా మాటగా చాటింపు వేయమని చెప్పాడు. పడమరన సూర్యుడు ఎర్రబడుతున్నాడు. అటే తలపెట్టి కూర్చున్నాడు రామరాజు. అప్పుడు వచ్చాడు నూకాలు.‘‘దండాలు బాబయ్యా!’’ అక్కడే గొంతుక్కూర్చున్నాడు, ఆప్యాయంగా, గౌరవంగా చూస్తూ. ఆనాడు తాండవలో చూసిన దృశ్యమే మళ్లీ గుర్తుకు వచ్చింది అతడికి. ‘‘నూకాలు! బావున్నావా?’’ అంతే గౌరవంగా అడిగాడు రామరాజు లేచి కూర్చుంటూ. ‘‘అంతా రాములోరి దయ! బావున్నాను స్వామి!’’ అన్నాడు రెండు చేతులూ జోడించి. ‘‘అన్నయ్య గారు.....?’’ అర్ధోక్తిగా ఆపేశాడు రామరాజు.‘‘ఊరెళ్లారు బాబయ్యా!’’ అన్నాడు నీళ్లు నములుతూ నూకాలు.నూకాలు ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు రామరాజు. ‘‘అంటే.... స్వామీ.....!’’ ‘‘నేను ఇంతలోనే కొత్త మనిషినయిపోయానా?’’ నవ్వుతూనే అడిగాడు రామరాజు. గ్రామ ప్రజలంతా గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. చాటింపుతో పరిస్థితి మారిపోయింది.మొదటిగా అక్కడ ప్రత్యక్షమైనవాడు చింతల అచ్చయ్యనాయుడు. రామరాజు లేచి సాదరంగా చేతులు సాచి ఆలింగనం చేసుకున్నాడు. తరువాత చింతల నారాయణస్వామి వచ్చాడు. ఎలా తెలిసిందో ఏమో, కొంగసింగి నుంచి మర్రి సన్యాసిదొర వచ్చాడు.వెంటనే తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి పథకం ఆరంభించాడు రామరాజు. ‘‘ఇప్పుడు కృష్ణదేవిపేట ఎస్ఐ ఎవరు? స్టేషన్లో ఎవరుంటారు?’’‘‘కర్రి లక్ష్మీనారాయణ. ఊళ్లో లేడు. ఏదో ట్రైనింగ్ కోసం విశాఖపట్నం వెళ్లాడని తెలిసింది. హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు, స్టేషన్ రైటర్ గంగుల రాజయ్య, సెంట్రీ కానిస్టేబుళ్లు చిక్కాల రామస్వామి, సింగ్ అని మరో కానిస్టేబులు ఉన్నారు. జగన్నాథం అని మరో కానిస్టేబుల్ కూడా ఉండాలి.’’ చెప్పాడు అచ్చయ్యనాయుడు. ‘‘అచ్చయ్య నాయుడుగారూ! మీ భావాలు నాకు తెలుసు. మీ ధైర్యమూ తెలిసినదే. చిన్న రాయబారం చేసి పెట్టండి.’’ అన్నాడు రాజు. ‘‘సంతోషంగా చేస్తాను.’’ చెప్పాడు అచ్చయ్యనాయుడు. ఒక నిమిషం తరువాత మల్లును పిలిచాడు రామరాజు. ఇద్దరిని పోలీసు స్టేషన్కు వెళ్లి ఆయుధాలు కావాలని, మర్యాదగా అప్పగించమని చెప్పమని పంపాడు.అందరినీ కూర్చోమన్నాడు గంతన్న దొర. ఎంతో ఒద్దికగా కూర్చున్న గ్రామస్థుల దగ్గరగా వచ్చాడు రామరాజు. తన గుండె మీద తన చేత్తోనే నెమ్మదిగా చరుచుకుంటూ అన్నాడు రామరాజు.‘‘మీ ముందు నిలబడి ఉన్నది మీ శ్రీరామరాజే. మేం మొదలుపెట్టినది ఫితూరీ కాదు. ఇది ఉద్యమం. ఇప్పుడు హిందూదేశం మొత్తం తెల్లవాడి మీద ఆగ్రహంతో ఉంది. మాకు కావలసినవి ఆయుధాలు. నిన్న చింతపల్లి వెళ్లినా, ఇవాళ ఈ ఊరు వచ్చినా వాటి కోసమే. అవి తెల్లవాడి మీద ఎక్కుపెట్టడానికే కానీ, సాటి భారతీయుడిని బాధించడానికి కాదు. ఇళ్ల మీద పడడం, దోచుకోవడం జరగదు. మేం ఎక్కడికి వెళ్లినా కోరేది ఒక్కటే. ఒకటి రెండు పూటలకు సరిపోయే భోజన సంబారాలు. అది కూడా మీరు సంతోషంగా ఇస్తేనే తీసుకుంటాం.’’ అక్కడ అందరి మనసులు బాధపడ్డాయి, రామరాజును శంకించినందుకు. పది నిమిషాలలో వెనక్కి వచ్చారు మల్లు, అచ్చయ్య.‘‘స్టేషన్లోకి వస్తే కాల్చేయగలను అన్నాడు సామీ, ఆ కానిస్టేబులు. తమరి ఆజ్ఞ లేదని ఊరుకున్నాను. మా కాడా ఉన్నాయి తుపాకులు అని చెప్పి వచ్చేశాను.’’ అన్నాడు మల్లు, కొంచెం ఆవేశంగా.‘‘ఇంకా ఆలస్యం ఎందుకు? తుపాకులతోనే నడవండి!’’ అన్నాడు రామరాజు.శ్రీరామరాజు ముందు నడవగా గంతన్న, మల్లు, ఎండు పడాలు, కణ్ణిగాడు ఇంకో నలుగురు తుపాకులతో మళ్లీ స్టేషన్ దగ్గరకి వెళ్లారు. వీళ్లని దూరం నుంచి చూసే సరికి స్టేషన్ వదిలి పారిపోయారంతా.ఏడు తుపాకులు దొరికాయి లోపల. కొంత మందుగుండు స్వాధీనమైంది. లోపల నుంచి బయటకు వచ్చాడు రామరాజు. చింతపల్లిలో సేకరించిన పదకొండు తుపాకులు, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న ఏడు మొత్తం– పద్దెనిమిది తుపాకులు. పద్దెనిమిది మంది పట్టుకుని స్టేషన్ బయట వరుసగా నిలబడి గాలిలోకి కాల్చారు. రాజు వెంట వచ్చిన రెండొందల మందికి పైగా ఉద్యమకారులు, గ్రామ ప్రజలు అంతా కలసి ఐదువందల మంది అక్కడ గుమిగూడారు.గంతన్న నినాదం ఇచ్చాడు ‘‘గాం«ధీ గారికీ!’’ అంతా స్పందించారు ‘‘జై!’’‘‘వందేమాతరం’’ ‘‘మనదే రాజ్యం!’’ ‘‘అల్లూరి శ్రీరామరాజుగారికీ’’ ‘‘జై’’అప్పుడే జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వచ్చారు కృష్ణదేవిపేట వైశ్యులు నూతిగట్టు కామరాజు, పూసర్ల లక్షో్మజీ, తమ పనివాళ్లతో కలసి. ‘‘రామరాజుగారూ! ఉడతాభక్తిగా ఈ సంబారాలు మేం సమర్పించుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. కాదనకండి!’’ అన్నారు.పది కుంచాల బియ్యం, నాలుగు తవ్వల పప్పు, ఇంకొన్ని సంబారాలు మూటల్లో మోయించుకొచ్చారు. ‘‘సంతోషం!’’ అంటూ సైగ చేశాడు రామరాజు. కొండదళంలో ఎవరో ఇద్దరు వచ్చి ఆ మూటలు తీసుకున్నారు. అచ్చయ్యనాయుడు మళ్లీ రామరాజు దగ్గరగా వచ్చాడు.‘‘అచ్చయ్య గారూ! రాములవారినీ, నీలకంఠేశ్వరుడినీ కూడా దర్శనం చేసుకోవాలని ఉంది. ఒక్కసారి శ్రీరామవిజయనగరం కూడా’’ అన్నాడు రామరాజు.గంతన్న, పోతరాజు కూడా వస్తామంటే వద్దని వారించాడు రామరాజు. మల్లు ఒక్కడు ఉంటే చాలునని, అటూ ఇటూ చూశాడు. ఆ దరిదాపుల్లో కనిపించలేదు మల్లు. ఊరి చివర ఉంది ఆ దుకాణం. అంతా శ్రీరామరాజును చూసే హడావుడిలో ఉన్నారు. దానితో అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. దలే బెన్నయ్య ఒక్కడే చిన్న ఆముదం దీపం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు, చిన్న గుడిసెలో. అది అతడి సారా దుకాణం. చాలా రహస్యంగా నడుస్తోంది. ‘‘ఎవరది?’’ మామూలుగానే అడిగాడు బెన్నయ్య.‘‘మనం మల్లుదొర. శ్రీరామరాజుగారికి నమ్మినబంటులం.’’ ‘‘అలాగా! ఇటొచ్చావేంటి?’’ అన్నాడు బెన్నయ్య, ఆశ్చర్యంగా.‘‘ఒక డ్రాము....’’ సారాయి కావాలన్నట్టు సైగ చేశాడు మల్లు.‘‘అయ్యయ్యో! స్వామి ఈటికి దూరంగా ఉండాలనేవారు.’’ అన్నాడు బెన్నయ్య.‘‘నేను ఈటికి దగ్గరే. ఇంత కష్టపడుతున్నాం. ఇంత దూరం వచ్చాం.. జేజేలు కొడతన్నాం. ఓ సుక్క...’’ అన్నాడు మల్లు, బతిమాలుతున్నట్టు. ‘‘సరే, ఒక డ్రాము తీసుకో!’’ అన్నాడు బెన్నయ్య. ‘‘చాలు!’’ చెప్పాడు మల్లు. చిన్న గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు బెన్నయ్య.అది తాగిన రెండు నిమిషాలకే అన్నాడు మల్లు, ‘‘ఇదిగో, ఇంకొక్క డ్రాము. నీకు పుణ్యముంటది!’’ ఇంత క్రితమే పోలీసు స్టేషన్ను కొట్టిన సంగతి విన్నాడు బెన్నయ్య. ఆ సాహసం అతడినీ కదిపింది. అందుకే మరో డ్రాము కూడా పోశాడు.నాలుగు నిమిషాలు గడిచాయి. మల్లు అసలు రూపం బయటపడింది.‘‘రేయ్...! ఇంకొకటి పోయ్రా!’’ అన్నాడు గద్దిస్తూ.‘‘ఏంట్రోయ్ కొండోడా! ఏదో స్వాములోరి మనిషినన్నావని పోశా. మళ్లీ మాట్లాడావంటే, ఇప్పుడే వెళ్లి స్వాములారితో చెబుతా. పో!’’ అన్నాడు బెన్నయ్య.‘‘వద్దులే..పోతన్నా.’’ తూలుతూ బయలుదేరాడు. నీలకంఠేశ్వరుడిని చూసి, అచ్చయ్యనాయుడితోనే తిరిగి వస్తున్నాడు రామరాజు. రామాలయం సమీపంలోకి వచ్చాక ఆ ఇద్దరూ గమనించారు – ఆలయం అరుగు మీద ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు.చీకట్లో.రామరాజు ఆయన దగ్గరగళ్లి, ‘‘సూర్యాస్తమయం తరువాత భాస్కర దర్శనం! ఎంత పుణ్యం చేసుకున్నాను!’’ అన్నారు.‘‘మన్నించాలి రాజు గారూ! పొరబడ్డాం.’’ రెండు నిమిషాల తరువాత అన్నాడు భాస్కరనాయుడు.‘‘ఇప్పుడు నా గుండె తేలికపడింది అన్నయ్యగారూ!’’ ఆనందంగా చెప్పాడు రామరాజు.‘‘తెల్లవాడితో ఇలా పోరాడగలమా?’’ అడిగాడు భాస్కరుడు, ఒక నిమిషం తరువాత.‘‘గాంధీగారు పోరాడుతున్నారు కదా!’’ అన్నాడు రామరాజు. ‘‘ ఆ మార్గం గురించే నేనూ చెబుతున్నాను రాజుగారు!’’ అర్థింపుగా చూస్తూ అన్నాడు భాస్కరుడు. ‘‘జలియన్వాలా బాగ్, చౌరీచౌరా వంటి దురాగతాలను గాంధీగారు మరచిపోయినంత సులభంగా నేను వాటిని మరచిపోలేను. జాత్యహంకారం సాగిస్తున్న పాలనలో నేను హాయిగా ఉండలేను అన్నయ్య గారూ! పోరాడతాను. లేదా పోరాడి మరణిస్తాను. ఇప్పుడు ఇంటికి రాలేను. అర్థం చేసుకోగలరు కదా! మళ్లీ ఎప్పుడు కలుస్తామో! ఎలా కలుస్తామో! సెలవు.’’ అన్నాడు రామరాజు, చేతులు జోడించి. అప్పటికే గ్రామంలో చాలామంది అక్కడికి చేరుకున్నారు. లాంతర్లు, కాగడాలు పట్టుకుని ఉన్నారు. రామరాజును చూడగానే డప్పుల మోత మొదలయింది. దాదాపు రెండువందల మంది గ్రామస్తులు రామరాజును, కొండదళం సభ్యులను ఊరి చివరి దాకా సాగనంపడానికి వెళుతున్నారు. కాగడాలు, లాంతర్ల వెలుగూ, డప్పుల మోత క్రమంగా దూరమవుతుంటే, ఆ వైపే చూస్తూ ఉండిపోయాడు భాస్కరుడు.ఊరి బయట వేచి ఉన్న మల్లు చడీచప్పుడూ లేకుండా కొండదళంలోకి చొచ్చుకుపోయాడు. 3 ఆగస్టు 24: తెలతెలవారుతోంది. చిరుచలిగా ఉంది. అప్పుడే లేచి వచ్చాడు రామరాజు. కృష్ణదేవిపేట నుంచి అర్ధరాత్రికి కంతారం∙చేరుకుని, రోడ్డు కూలీల కోసం అక్కడ ఎప్పుడో నిర్మించిన పాకలోనే విశ్రమించింది రామరాజు దళం. అప్పటికే పాక బయట వేపపుల్లలతో పళ్లు తోముకుంటూ మాట్లాడుకుంటున్నారు గంతన్న, ఎర్రేసు. వేపపుల్ల పడేసి అన్నాడు గంతన్న భక్తిగా ‘‘దండాలు సామీ!’’ ‘‘ఇక్కడే ఓ జలపాతం ఉంది సామి! స్నానం చేయవచ్చు!’’ వినయంగా చెప్పాడు ఎర్రేసు.ముందు రామరాజు నడుస్తుంటే, వెనక గంతన్న, ఎర్రేసు నడుస్తున్నారు.‘‘సామీ!’’ నెమ్మదిగా పిలిచాడు గంతన్న. ‘‘చెప్పు గంతన్న!’’ రామరాజు అన్నాడు. ‘‘మొట్టాడం వీరయ్యదొర పేరు విన్నారు కదా! ఇప్పుడు రాజవొమ్మంగి స్టేషన్లో పెట్టి ఉంచారట. ఇవాళే రాజమండ్రి కోర్టుకి తీసుకుపోతారంట. అడ్డతీగల తాసీల్దారుతో ఆ సంగతి మాట్లాడ్డానికే వెళుతూనే చింతపల్లి ఎస్ఐ మనకి తారసపడ్డాడు. లాగరాయి పితూరీ కాణ్ణుంచి వీరయ్యదొరని విజయనగరం జైల్లోనే ఖైదు చేసి ఉంచారు. మళ్లీ జైల్లో ఏస్తే ఇక ఆయన అక్కడే కన్ను మూస్తాడు. ఆయన్ని మనం విడిపించుకుంటే కలిసివస్తాడు. ’’తన్న మాటంటే ఎంతో గురి. అయినా తల పంకించి స్నానానికని జలపాతం కిందకి వెళ్లాడు రామరాజు. స్నానం చేసి, అరగంటకు పైగా ధ్యానం చేసి అప్పుడు వచ్చాడు.‘‘మన వాళ్లని శ్రమ పెడుతున్నాం. అయినా తప్పదు. రాజవొమ్మంగి బయలుదేరదాం.ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్లాలి!’’ 4 ఆ సెల్ నుంచి మరోసారి భారంగా వినిపించింది మూలుగు. వెంటనే ఆగకుండా దగ్గు, ఒక నిమిషం పాటు. చీకటిగా ఉంది సెల్. లోపల చింకి చాప మీద ఒక మనిషి పడుకుని ఉన్న సంగతి కూడా తెలియడం లేదు.రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్.మరోసారి చటుక్కున లేచి గుమ్మం దాకా వెళ్లి బయటికి తొంగి చూశాడా జవాను. రామరాజుకు పోలీసు స్టేషన్లే లక్ష్యం. కానీ రాజవొమ్మంగే వస్తాడనేమిటి? అలాగే రాడని చెప్పడానికీ లేదు. ఎందుకైనా మంచిదన్నట్టు గుమ్మం ఎదురుగానే చూరుకు వేలాడుతున్న రెండు లాంతర్లు తీసుకుని లోపలికి వచ్చి మళ్లీ యథాస్థానంలో కూర్చున్నాడతడు.మరింత చీకటి కమ్ముకుంది పోలీస్ స్టేషన్ అరుగు మీద. అక్కడే గొంగళ్లు కప్పుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నారు– దాదాపు ఇరవైమంది. వాళ్లందరూ రాజవొమ్మంగి గ్రామస్థులే. తిమ్మాపురం డిప్యూటీ తహసీల్దారు బారికతో మాట్లాడి వాళ్లందరినీ ఇక్కడ పడుకునే ఏర్పాటు చేశాడు. నిజానికి నిన్న రాత్రి కూడా వాళ్లు వచ్చి పడుకున్నారు. మళ్లీ బయటకు వచ్చి చూశాడు ఆ పోలీసు. అతడు వచ్చి గంట దాటి పోయింది. అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుంచి సైకిళ్ల మీద ఉరుకులూ పరుగుల మీద వచ్చారు– ఇతడూ, ఆ మూల చతికిల పడి ఉన్న మరో జవాను. ‘జాగ్రత్తలు’ చెబుతూ నర్సీపట్నం పోలీసు కార్యాలయం ఇచ్చిన ఆదేశాన్ని పట్టుకుని వచ్చారు. నిజానికి ‘రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ల మీద దాడి జరిగే అవకాశం ఉంది.’ అంటూ సబిన్స్పెక్టర్ నిన్ననే డిప్యూటీ తహసీల్దారుకి వర్తమానం పంపాడు. నిన్న రాత్రి గ్రామంలో ఉండి, ఇవాళ సాయంత్రమే అడ్డతీగల వెళ్లిపోయాడు.లాంతర్లు ఒకటి లాకప్ గది దగ్గర, మరొకటి ఎస్ఐ టేబుల్ మీద పెట్టి, ఓ బెంచీ మీద కూర్చున్నాడతడు. లోపలే బెంచీల మీద, గోడకి ఆనుకుని నేల మీద కూర్చున్నారు మరో ఐదుగురు. అందరిలోనూ అదే ఉత్కంఠ. ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు, ముగ్గురు జవాన్లు శవజాగారం చేస్తున్నారు. రంప డివిజన్లో చాలా కీలకమైన స్టేషన్ రాజవొమ్మంగి. పిన్ని వెంకటరెడ్డి అక్కడ ఎస్ఐ. స్టేషన్కు కొంచెం దూరంలోనే ఉన్న గ్రామం అలికిడి లేకుండా నిద్రపోతోంది. రాత్రి తొమ్మిది గంటల వేళ. చల్లగా ఉంది వాతావరణం. ‘‘ఎస్ఐగారు ఇవాళ రావాలి కదా!’’ కానిస్టేబుల్ అడిగాడు.‘‘రావాలి. రేపే ఈ మహానుభావుణ్ణి రాజమండ్రి తీసుకుపోవాలని అనుకున్నారు.’’ అన్నాడు రాజవొమ్మంగి స్టేషన్లో జవాను– లాకప్ గది వైపు చూస్తూ.గోడకు జారపడిన మరో జవాను ఒక్కసారిగా నిటారుగా అయ్యాడు.అది చూసి అడ్డతీగల నుంచి వచ్చిన జవాను హడలిపోయి, మళ్లీ గుమ్మం దాకా వెళ్లి వచ్చాడు.‘‘ఏం లేదులే మిత్రమా!’’ అని అడ్డతీగల వాడి సందేహాన్ని తీర్చి, తన సందేహం వెలిబుచ్చాడు. ‘‘ఆ చరిత్ర అయిపోయిందని అంతా అంటా ఉంటే మళ్లీ ఈ పితూరీ ఏంటండీ!’’ పితూరీ అన్న మాట వినిపించగానే లాకప్ గదిలో ఉన్న ఆ మనిషిలో చలనం. గోడవారగా పడుకున్నవాడల్లా లేచొచ్చి ఊచలు పట్టుకుని నిలబడ్డాడు. ఆ గదంతా చీకటే. అందుకే అతడు అక్కడ నిలబడి ఉన్న సంగతి అక్కడెవరూ గమనించలేదు. ‘‘మొన్న చింతపల్లి స్టేషను. నిన్న కృష్ణదేవిపేట. రెండు రోజుల్లో రెండు స్టేషన్లు కొట్టేశారు.’’ ‘‘ఈ రాత్రీ, రేపు పగలూ రాకుండా ఉంటే చాలు!’’ దేవుడికి దణ్ణం అన్నట్టు ఆకాశంలోకి వైపు చూస్తూ అన్నాడు ఓ జవాను. ‘‘ఏంటి దొరా! మళ్లీ పితూరీయా? నిజమా!?’’ ఆ చీకటి కొట్టులో నుంచి హఠాత్తుగా వినపడింది గొంతు. వెంటనే దారుణమైన దగ్గు తెర, అతడి నోటి వెంట. నిలబడే ఓపిక లేక అలాగే కూలబడ్డాడు లోపల.వాళ్లలో ఓ కానిస్టేబుల్కి దడుచుకున్నంత పనైంది. కానీ అంతలోనే తేరుకుని అన్నాడు. ‘‘ఏరా! మళ్లీ చేరతావా? రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వెళ్లి చేరుదువుగాని. అప్పుడు ఏకంగా ఉరికంబమే. నోర్మూసుకు తొంగో.’’ ‘‘ఈడెవడు?’’ అడ్డతీగల నుంచి వచ్చిన జవాను అడిగాడు. ‘‘ఈడేరా బాబూ! వీరయ్య దొర. మొట్టాడం వీరయ్యదొర. ఈడి గురించి మాట్లాడ్డానికే మా ఎస్ఐ మీ తాసీల్దారు కాడికి వచ్చాడు.’’ చెప్పాడు రెండో కానిస్టేబుల్.‘‘ఈడా?! మరి చెప్పవేరా బాబూ! ఈణ్ణి విడిపించడానికి కొండదళం రావొచ్చని అనుకుంటున్నారు!’’ గొంతు తగ్గించి అన్నాడు అడ్డతీగల జవాను, భయంగా. ఒక్కసారిగా అందరిలోనూ సన్నగా ఒణుకు. మరో గంట గడిచింది, భారంగా.అడ్డతీగల నుంచి వచ్చినవాడే మళ్లీ బయటకొచ్చి చూశాడు. అప్పుడే ఏదో వాసన ... కాలుతున్న వాసన. పోలీస్స్టేషన్ ఓ పెద్ద తాటాకు పాక. దానిని పరిశీలించాడు ముందు. ఎక్కడా మంట దాఖలా లేదు. అనుకోకుండా ఎడం వైపు చూశాడు. దూరంగా పొదల వెనక ఏదో కాంతి. కళ్లు చిట్లించి చూశాడటు. చిన్నగా వస్తోంది పొగ. అలా నాలుగైదు చోట్ల కనిపించింది. కుడివైపు కూడా చూశాడు. అక్కడా అంతే. గుండె ఆగిపోయినంత పనైంది, ఆ జవానుకి.హఠాత్తుగా రెండు వైపుల నుంచి అరవై డెబ్బయ్ మంది ఆ పొదలమాటు నుంచి లేచారు ఒక్కసారే. -
ఆకుపచ్చ సూర్యోదయం
అది ఆ కొండలలో కొత్త దృశ్యం. ఆగస్ట్ 22, 1922. మిట్ట మధ్యాహ్నం. నడినెత్తిన మండుతున్నాడు సూర్యుడు. ఆ అర్ధనగ్న సాయుధుల దండయాత్ర సన్నివేశం కొన్ని తరాలపాటు గుర్తుంటుంది.కవాతు చేస్తున్న ఆక్రోశం... నిశ్చయంగా అడుగేస్తున్న ధర్మాగ్రహం...శిరసెత్తి నడిచే ఆత్మగౌరవం– వీటినే రూపు కట్టిస్తున్నాయి, ఆ మూడు సమూహాలు. కొండల మీద మెరుపు వేగంతో కదిలిపోయే మేఘాల నీడల్లా ఉరుకుతున్నాయి ఆ సమూహాలు– లంబసింగి రోడ్డు ఎక్కడానికీ, చింతపల్లి వైపు సాగిపోవడానికీ. అంతా కలసి మూడొందలకు పైనే ఉన్నారు. కొండ ప్రజలు రక్తం చిందించి నిర్మించిన రోడ్డు... ఆ నెత్తుటిఫలం మీద హక్కు ప్రకటిస్తున్నట్టు ధీమా ఆ నడకలో. మొదటి సమూహానికి ముందు పంచపాండవుల్లా నడుస్తున్నారు ఐదుగురు. మధ్య నిలబడిన ఆ బలమైన యువకుని చేతిలో తప్ప మిగిలిన నలుగురి చేతులలోను విల్లంబుల్లున్నాయి. ఆ యువకుడు మాత్రం మూడు నాలుగు అడుగుల బాణాకర్రను ఎత్తి పట్టుకున్నాడు.ఆ కర్ర కొసన రెపరెపలాడుతోంది జెండా. శబరి కొండ మీద నుంచి బయలుదేరినప్పుడు ధరించిన జెండా.బారెడు పొడవు, మూరెడు వెడల్పు ఉంది, మూడు రంగులతో.పైన తెలుపు, మధ్య ఆకుపచ్చ. అడుగున ఎరుపు. తెలుపు, ఆకుపచ్చ రంగుల మీద రాట్నం బొమ్మ.హోంరూల్ ఉద్యమం కోసం పింగళి వెంకయ్యగారు రూపొందించిన పతాకం.మొలకు చిన్న గావంచా, తలకు చిన్న పాగా మాత్రమే ఉన్నాయి ఆ జెండాధారికి. చెమటతో తడిసిపోయి నిగనిగలాడుతోంది నల్లటి దేహం. మునసబు, ముఠాదారు పదవులను అనుభవించిన ఆ కొద్దిమంది మాత్రం కాసెకోక గోచీ పోసి పంచె కట్టారు. వాళ్లు బగత కులస్థులు. మోకాళ్ల దాకా ఉండి, ముందుకు కుచ్చు వేలాడుతూ వెనుక బిళ్ల గోచీలా కనిపిస్తుంది నలుపు, ఎరుపు ఇతర రంగులు కలసిన ఆ పంచె. తమ సాంఘిక ఆధిపత్యాన్ని ప్రకటిస్తూ బగతలే మెడలకు కంటెలు, కాళ్లకు కడియాలు, మొలలకు వెండి మొలతాళ్లు ధరించారు. తమది యుద్ధవీరుల వారసత్వమనీ, కులమనీ వాళ్లు నమ్ముతారు. కొందరు పుట్టగోచీతో కనిపిస్తున్నారు. ముందు భాగం కప్పుతూ, పిరుదులను కప్పని వస్త్రధారణ ఇది. బగతల కంటే కింది స్థాయి కులాలు కొండరెడ్లు, కొండకాపులు ఈ పుట్టగోచీ పోసి కట్టుకుని, చిన్న తలపాగా ధరించారు. అందరి చెవులకీ ముక్కులకీ పోగులు ఉన్నాయి. ఈ తారతమ్యాలని ఒక ఇనుప చట్రంతో పోలవచ్చు. కానీ రామరాజు వీళ్లందరినీ ఇలా నడిపించగలిగాడు. చెమటోడుతున్న వాళ్ల వీపుల మీద వెదురుతో అల్లిన అమ్ములపొదులు వేలాడుతున్నాయి. అలుగు, బల్లెం, చురిక, కత్తి....... రకరకాల సంప్రదాయక ఆయుధాలు కనిపిస్తున్నాయి కొందిరి చేతుల్లో. శబరికొండ మొదలు ప్రతి గ్రామంలోను కొత్తవాళ్లు చేరుతూనే ఉన్నారు. మొదటి సమూహం లంబసింగి రోడ్డు ఎక్కి, కొంచెం ముందుకు నడిచింది– ఎండుపడాలు నాయకత్వంలో. గాం గంతన్న దొర నాయకత్వంలో నడుస్తున్న రెండో బృందం కూడా రోడ్డు మీద వచ్చింది. ఆ తరువాత మూడో బృందం. మూడు బృందాలకీ మధ్య కొద్ది కొద్ది దూరం.మూడో బృందానికి ముందు నడుస్తున్నాడు శ్రీరామరాజు. తెల్లని పంచె అడ్డకట్టు కట్టుకుని, పైన మరో తెల్లని వస్త్రం కప్పుకుని నడుస్తున్నాడు. అతడి చేతిలో కూడా విల్లంబులే ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. పక్కనే గాం మల్లు దొర. ఇవతల పక్క మరో ఉద్యమకారుడు, విల్లంబులతో. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో మానని ఓ మహా గాయాన్ని గుర్తుకు తెస్తోంది ఆ ఎర్ర కంకర రోడ్డు. గప్పీదొర బంగ్లా నిర్మానుష్యంగా ఉంది. అది కూడా దాటి ముందుకు నడిచారు. అప్పుడే, ఎత్తుగా ఉన్న రోడ్డును అతి కష్టం మీద ఎక్కుతున్న గోముటెద్దుల బండి కనిపించింది, ముందు వరసలో ఉన్నవాళ్లకి. పొట్టిగా, బక్కగా ఉంటాయి, గోముటెడ్లు. వాటినే చచ్చేటట్టు బాదుతున్నాడు బండి తోలుతున్నవాడు. బండి చింతపల్లి నుంచి వస్తోందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా బండిలో కూర్చున్న ఆ ఖాకీ బట్టల శరీరం చటుక్కున లేచి నిలబడింది. అతనికి తాటాకు గొడుగు పడుతున్న ఆ గిరిజనుడు ఏదో చెప్పాడు కాబోలు.ఆ ఖాకీదుస్తుల మనిషి ఈరెన అప్పలస్వామినాయుడు. సాక్షాత్తు చింతపల్లి పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్. ఆ సమూహాన్ని చూసి విస్తు పోయాడు.ఖాకీ గుడ్డలు చూస్తే చాలు కొండవాళ్లు– ఒకడైనా, పదుగురైనా– ఆ పొద పక్కకీ, ఈ చెట్టు వెనక్కీ తప్పుకుంటారు. కానీ వీళ్లేమిటో! ఆ అడుగుల్లో బెరుకు లేదు. వాళ్ల కళ్లలో భయమూ లేదు. ఆ సమూహాలు సాగుతూనే ఉన్నాయి. మొదటివరసలోనే నడుస్తున్న కొలగాని సంగతులు అనే గిరిజనుడు ఒక్క క్షణం నిదానించి చూసి, వెంటనే వెతుక్కుంటూ వచ్చి రామరాజుకు చెప్పాడు, ‘‘సామీ! చింతపల్లి సబిన్సుపెట్రు అప్పలసామినాయుడు ఇటే వస్తన్నాడు.’’ ఆయన ముఖంలో చిరునవ్వు. అప్పటికే గంతన్న, గోకిరి ఎర్రేసు, కర్రి కణ్ణిగాడు మరో నలుగురైదుగురు కూడా ఆ కబురుతో అక్కడికే వచ్చారు. అప్పుడన్నాడు రామరాజు, ‘‘మనవాళ్లని ఒక్క క్షణం ఆపండి!’’ఒకింత ఆవేశం కనిపిస్తున్నా, తొందరపడే ఉద్దేశం ఎవరికీ లేదు. అంత జనాన్ని ఒక్కసారి చూసేసరికి గోముటెద్దులు బెదిరి, అడుగు వెనక్కి వేయడం మొదలుపెట్టాయి. వాటి వీపుల మీద కర్రతో కొడుతూనే ఉన్నాడు, బండి తోలుతున్న ఆ గిరిజనుడు. ‘‘ఆపెహె!’’ విసుగ్గా, ఆందోళనగా అరిచాడు ఎస్ఐ. ఖాకీబట్టలు ఎదురైనా ఆగకుండా ఇంతమంది ఎక్కడికి వెళుతున్నట్టు? ఆ బాణాలూ, బరిసెలూ ఎందుకు? తన ప్రాణానికి ముప్పు ఉందా? అప్పుడే గమనించాడు ఎస్ఐ– ఆ జనంలో ఐదారు చేతులలో నాటు తుపాకులు, ఇంకో రెండు మూడు మజిల్ లోడింగ్ గన్నులు ఉన్నాయి. ‘‘ఎవర్రా ఈళ్లంతా?’’ ఆగ్రహాన్ని దాచుకోలేక, ప్రదర్శించలేక సతమతమవుతున్నాడు నాయుడు.గొడుగు పట్టిన గిరిజనుడు నుదుటికి చేయి అడ్డం పెట్టి పరికించి చూస్తూ వణికిపోతూ చెప్పాడు.‘‘దొరా......! మళ్లీ.... పితూరీ కాబోలు?’’ ‘‘నోర్ముయ్! వాళ్లలో నీకెవరైనా తెలిస్తే చెప్పు!’’ తడబడే మాటతో, కళ్లెర్ర చేస్తూ అన్నాడు నాయుడు. ‘‘చిత్తం... జనాన్ని ఆపుతున్నాడు చూడండి! ఆడు, బోనంగి పోతరాజు.’’ ‘‘వాడిదేవూరు?’’ ఉత్కం తో ఉన్నా పోలీసు బుద్ధి పోనిచ్చుకోవడంలేదు నాయుడు.‘‘శరబన్నపాలెం దొరా! ఇంకా.. జర్త ఎండుదొర, ఊరు–గుమ్మడిగూడెం. సాగిన సన్యాసి పడాలు, సింగంపల్లి. పిట్టల పోలయ్య, రామన్నపాలెం. తోట మరిడయ్య, నడింపాలెం. తగ్గి తాపన్న, ఈడిది గూడెం దొరా! ఆడిపక్కన ఉన్నోడు తగ్గి సోమన్నదొర, ఈడిదీ నడింపాలెమే. ఆ తెల్లటోడు, జర్తా తోకయ్య, పెద్దవలస.....కంకిపాటి శరభన్న పడాలు, గబలం సింగడు, మామిడి చిన్నయ్య, జగ్గి వీరయ్యదొర....’’ ఒక్కొక్కరినీ పోల్చుకుంటున్నాడతడు. అప్పుడే గంతన్న, ఎండు పడాలు ముందుకు వచ్చి బండిని ఆపమన్నట్టు చేతులెత్తి సైగ చేశారు. ‘‘దొరా! దొరా! ఆ కాసెకోక గోచెట్టుకున్నోళ్లు ఇద్దర్లో ఒకడు గంతన్న, బట్టిపనుకులోడు. బేస్టిను దొరతో తగాదా ఆడికీ, ఆడి తమ్ముడు మల్లయ్యకీ. గంతన్న పక్కన ఉన్నాడు, ఆడు ఎండు పడాలు, పెద్దవలస! వస్తన్నాడే ఆ బండోడు, ఆడే మల్లయ్య. ఆ గెడ్డాపాయన.....’’ రామరాజు ఎవరో తెలియలేదతడికి. అప్పుడే వచ్చాడు రామరాజు. వెనకే మల్లు.గంతన్న, ఎండుపడాలు, మరో నలుగురు వెంటరాగా పది బారల అవతల ఉన్న బండి దగ్గరకు నడిచాడు రామరాజు. ‘‘అప్పలస్వామినాయుడు గారూ! నా పేరు అల్లూరి శ్రీరామరాజు!’’ అన్నాడు ఎంతో మన్ననతో.‘‘విన్నాను.’’ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సమాధానం ఇచ్చాడు నాయుడు.‘‘వినివుంటే సంతోషం. మేం చింతపల్లిలో ఏం చేయబోతున్నామో చూస్తే ఇంకా సంతోషం. ఇంకాసేపటికి మనం మీ పోలీస్ స్టేషన్లోనే కలసి ఉండేవాళ్లం. ముందే కలిశాం, ఇలా.’’ అన్నాడు రామరాజు. ‘‘ఏంటీ! పితూరీ చేస్తారా? తొక్కేస్తాం!’’ అన్నాడు మరింత పొగరుతో, ఎస్ఐ.‘‘మర్యాద!’’ గంతన్న, మల్లు, పడాలు ఒక్కసారే అన్నారు, నాయుడికేసి చూస్తూ. మాట నిదానంగా ఉన్నా, హద్దు మీరితే నాలుక తెగుతుందన్న హెచ్చరిక కూడా ఉంది అందులో. ఆ మూడు సమూహాల జనం ఒక్క అడుగు మాత్రమే ముందుకు వేశారు, ఆ క్షణంలో. ఈ అలజడికి గోముటెద్దులు బెదిరి, అటూ ఇటూ కదిలాయి. కంగుతిన్నాడు ఎస్ఐ.వెంటనే రామరాజు అన్నాడు, ‘‘పడిపోతారు. దిగి రండొకసారి!.’’బుద్ధిగా దిగి రాజు దగ్గరకు వచ్చాడు నాయుడు. ‘‘మీరు ప్రభుత్వోద్యోగులు. మర్యాద మన్నన ఇకనైనా నేర్చుకోక తప్పదు. లేదంటే వీళ్లే నేర్పిస్తారు నాయుడుగారు!’’ అన్నాడు రామరాజు.కొన్ని లిప్తల తరువాత శ్రీరామరాజే అన్నాడు, ‘‘నిజమే నాయుడుగారూ! ఇది ప్రభుత్వ ధిక్కారమే. ఆ ప్రభుత్వానికి కాపుదలగా ఉండే ఈ పోలీసు విభాగాన్ని ఎదిరిస్తున్నాం. కానీ మాది పితూరీ కాదు. వినండి. మేం చింతపల్లిలో చేయబోయే పని– మీ పోలీసు స్టేషన్ మీద దాడి!’’ ఈ మాట చాలా కంగారు పెట్టింది నాయుడిని, వెంటనే చేతులు కట్టుకున్నాడు. క్క నిమిషం తరువాత మళ్లీ రామరాజు అన్నాడు, ‘‘ఈ అడవిబిడ్డలంతా.. పట్టపగలు మీ స్టేషన్ను కొల్లగొడుతున్నారు. మీ ఆయుధాలు తీసుకుంటున్నారు. అవి ఈ ప్రభుత్వం మీదే ఎక్కుపెడతారు! వెనక్కి వస్తారా? ముందుకు వెళతారా? మీ ఇష్టం. అర్థమైంది కదా! పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నామని ముందే చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడ ఆపాం.’’అంటూనే చింతపల్లి వైపు అడుగు వేశాడు రామరాజు. మళ్లీ కదిలింది కొండదళం. సబ్ఇన్స్పెక్టర్ అలా చేతులు కట్టుకుని మాట్లాడడం చూసి నిబిడాశ్చర్యంలో మునిగారు కొండవాసులు. అప్పుడే కొటికల బాలయ్య పాట అందుకున్నాడు– ‘‘వెరవడు చంద్రయ్య....... వెనుదీయడు.....’’ఒక్కసారిగా అందుకున్నారంతా.‘‘వాడి నడుము నట్టెడి లేడికావించు’’‘‘వాడు శిరసు సిమ్మాలమ్మ గద్దెగావించు....’’వాడి పండ్లు పగడాల పట్టు తోరాలు.’’ద్వారబంధాల చంద్రయ్యని గుర్తు చేసే పాట. నాయుడు భరించలేçకపోయాడు. ఒక్కసారిగా బండెక్కి, ‘‘పగ్గాలు వదల్రా! ముందుకే పోనీ!’’ నర్సీపట్నం వైపు చూపిస్తూ అరిచాడు.దూరంగా లోయలనీ, కొండలనీ ప్రతిధ్వనింపచేస్తూ ఆ పాట– ‘‘వెరవడు చంద్రయ్య......’’ రెండు గంటలవుతూ ఉండగా చింతపల్లి చేరుకుంది రామరాజు సేన.చింతపల్లి–లంబసింగి రోడ్డుకు పక్కనే, పెద్దవలస, రంపుల ఘాటీ పోయే మార్గంలో– ఒక ఒంపులో కట్టారు పోలీస్ స్టేషన్, పెద్ద తాటాకు ఇల్లు.కోలాహలం విని బయటకొచ్చారు ముగ్గురు కానిస్టేబుళ్లు. గుండెలదిరిపోయాయి.ఉరుకుతున్నారు గిరిజనులు. అందరి చేతులలోను ఆయుధాలే. అది పితూరీయేనని తీర్మానించుకుని, తలా ఒక దిక్కుకు పరుగెత్తారు. పితూరీ అంటే పోలీసుల రక్తం చూస్తారు. స్టేషన్ తగలబెడతారు. అదే వాళ్ల నమ్మకం. ఆ ముగ్గురినీ పట్టుకుంది రామరాజు దళం. అందులో ఒక కానిస్టేబుల్ తనను పట్టుకున్నవాళ్ల కేసి భయం భయంగా చూశాడు. తన కుడిభుజం పట్టుకున్న ఆ మనిషి ఎవరో కాదు, కోలంకి కన్నడు. అంటే చింతపల్లి బారిక. పెంట్రపాడు దగ్గర కలసిన యాభై మందిలో అతడూ ఒకడు. నిజానికి ఆ ఊరి మునసబు పాత్రలు, బియ్యం ఇచ్చి పంపితే, అప్పగించడానికి వచ్చి, వాళ్లలో కలసిపోయాడు.‘‘కట్టెయ్యండి!’’ గట్టిగా చెప్పాడు గాం గంతన్న.పైప్రాణాలు పైనే పోయాయి వాళ్లకి. ముగ్గురినీ తీసుకెళ్లి స్తంభాలకి కట్టేశారు. పైగా నలుగురు వంతున ఒక్కొక్క కానిస్టేబుల్ దగ్గర కాపలా. అప్పుడే రామరాజు ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు.అంతా పక్కకి తప్పుకుని దారి ఇస్తుంటే, వేగంగా లోపలికి నడిచాడాయన.వెనకే మల్లు, గంతన్న, పడాలు, సంకోజి పండడు, కణ్ణిగాడు, ఎర్రేసు వెళ్లారు.నాలుగు గదులున్నాయి. వాటిలో రెండింటికి తాళాలు. వాటిని పగలకొట్టి వెతికారు.రామరాజు స్వయంగా ఎస్ఐ టేబుల్ మీద ఉన్న స్టేషన్ డైరీ తీసుకుంటూ అడిగాడు, ‘‘ఎన్ని దొరికాయి పడాలు?’’‘‘పదకొండు తుపాకులు. ఐదు కత్తులు. పద్నాలుగు బాయ్నెట్లు. తూటాలు లెక్కపెట్టాలి.’’‘‘లెక్కి పెట్టండి!’’ అంటూ స్టేషన్ డైరీ తెరిచాడు రామరాజు.పది సంచులలో ఉన్న మందుగుండును అంతా కలసి లెక్కపెడుతున్నారు.రెండు నిమిషాలు ఆలోచించి, అక్కడే ఉన్న ఊటకలంతో రాశాడు రామరాజు.‘అల్లూరి శ్రీరామరాజు అను నేను, నా సహచరులతో ఈ పోలీసు స్టేషన్ను ముట్టడించి, సెంట్రీని ఆయుధాగారం గది తాళాలు అడిగాను. ఇవ్వడానికి అంగీకరించలేదు. స్టేషన్ స్తంభానికి కట్టివేసి తాళాలు తీసుకున్నాను. ఆయుధాలు సేకరించబడినాయి.’ ‘‘సామీ! 1,390 తూటాలు.’’ చెప్పాడు గంతన్న.అది కూడా డైరీలో రాసి, కింద ‘అల్లూరి శ్రీరామరాజు’ అని సంతకం చేసి లేచాడు రామరాజు. అప్పటికే చింతపల్లి ప్రజలు కొందరు అక్కడికి చేరుకున్నారు.కొందరికి స్టేషన్ తగలబడితే చూడాలని ఉంది. అదేమీ పైశాచికానందం కాదు. పోలీసుల మీద ఉన్న పగ. ఇంత సులభంగా పోలీసులని లొంగదీసిన ఆ సాములోరిని చూద్దామనీ కొందరొచ్చారు.అప్పుడే లోపల నుంచి వస్తున్నాడు రామరాజు. ‘‘ఆ సాములే... శ్రీరామరాజు గారు!’’ ఎవరో అరిచారు. వెంట మల్లు, గంతన్న, పడాలు, మిగిలినవాళ్లు. అందరి భుజాల మీద తుపాకులు. గోకిరి ఎర్రేసు కత్తులు పట్టుకుని వచ్చాడు. తేగ గ్రామస్తుడు సుంకరి పోతయ్య పోలీసుల యూనిఫారాలు మూటగట్టి తెస్తున్నాడు, చివరన.రామరాజు స్టేషన్ మెట్లు దిగి వస్తుంటే మహా విజేతను చూసినట్టే ఉంది వాళ్లందరికీ.ఆ జనాన్ని చూసి రామరాజే స్వయంగా నినాదం ఇచ్చాడు, ‘‘వందేమాతరం’’దిక్కులు పిక్కటిల్లేటట్టు స్పందించారు, ‘‘మనదే రాజ్యం!’’ అంటూ.‘‘గాంధీజీకి’’ మళ్లీ రామరాజే అన్నాడు. ‘‘జై!’’ అన్నారంతా.మళ్లీ మల్లు దొర నినాదం ఇచ్చాడు, ‘‘అల్లూరి శ్రీరామరాజు గారికీ’’ ‘‘జై... జై.... జై.....’’ అంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ప్రతి నమస్కారం చేస్తూనే వేగంగా ప్రాంగణం నుంచి బయటకు వచ్చాడు రామరాజు.ఆ క్షణంలో ఒక వాస్తవం చాలామందికి సులభంగానే అర్థమయింది–పోలీస్ స్టేషన్ దగ్ధం కాలేదు. కానీ, తూర్పు కనుమలలో పోలీసుల ప్రతిష్ట తొలిసారి బూడిదైంది.పెద్దవలస, రంపులఘాటీ వెళ్లే రోడ్డు వైపు తిరిగాడు రామరాజు. ముందే ఉన్నాడు జెండాధారి. అందరి ముఖాలలో విజయ భావన– వెల్లువలా. సాయంత్రపు గాలికి మరింతగా రెపరెపలాడుతోంది జెండా. 2 ఆగస్టు 23, 1922– మధ్యాహ్నం. కృష్ణదేవిపేటలో హఠాత్తుగా కలకలం. పితూరీ దండు ఏ క్షణాన్నయినా కృష్ణదేవిపేట మీద పడవచ్చు. కొన్ని నెలల క్రితం సంతలో గోకిరి ఎర్రేసు, కణ్ణిగాడు చెప్పిన మాట నిజమేనన్నమాట. మరో పితూరీ మొదలైంది. నాయకుడు శ్రీరామరాజే. ఆయనంటే ప్రత్యక్ష దైవం. కానీ పితూరీ అంటే భయం. ఫలితమే ఆ కలవరం.కొద్దిదూరంలో మాకవరంలోనే దండు ఉందని కబురు. చింతపల్లి స్టేషన్ను కొట్టిన తరువాత సేన రంపులఘాటీ నుంచి శరభన్నపాలెం వెళ్లిందట. దారిలో, నడింపాలెం దగ్గరగా ఘాటీ మీదే పహరా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కనిపిస్తే, వాళ్లని ఆపి, రెండు తుపాకులు, ఐదు తూటాలు కూడా లాక్కున్నారట. శరభన్నపాలెంలో ఉదయమే పెరుగు అన్నం పెట్టించాడట ముఠాదారు. ఇప్పుడు కృష్ణదేవిపేట వస్తున్నారట. అందరి నోటా అదే.మధ్య తరగతి కుటుంబాలు, చిన్న చిన్న ఉద్యోగులు, గ్రామాధికారులు తలా ఒక సంచీ పుచ్చుకుని ఇళ్లకు తాళం పెట్టి, చుట్టుపక్కల గ్రామాలలో బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. షేక్ మహమ్మద్ ఈసీబు బట్టల దుకాణం మూసేసి వెళ్లిపోయాడు. మరో చిన్న కిరాణా దుకాణం మూత పడింది. ఇలా వెళ్లిపోయిన వాళ్లలో భాస్కరుడిగారి కుటుంబం ఒకటి. ఊరి శివార్లలో రైతు ఇంటికి చేరుకుంది. ఏపుగా పెరిగిన గంటి చేల మధ్య ఉందా తాటాకుల ఇల్లు. ఆ స్థలం, ఆ పొలం గురించి అంతకాలం గ్రామంలో ఉన్న శ్రీరామరాజుకు తెలియదని భాస్కరుడుగారు ఎందుకు అనుకున్నారో అర్థంకాదు. కానీ అందరికీ గట్టి నమ్మకం– రామరాజు అరాచకాలు సాగనివ్వరు. అందుకే కొద్దిమంది ఊరి పొలిమేరకు వచ్చి ఎదురు చూస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలవుతోంది. అప్పుడే ఎండలో ఎర్రటి దుమ్ము దూరంగా. కొన్ని నిమిషాలకే ఆ మూడు సమూహాలు ఊరి వైపు రావడం కనిపించింది. ఆ దండుకు ముందే ఉన్నాడా యువకుడు– త్రివర్ణ పతాకంతో. దళంలో ఉద్రేకం లేదు, ఉత్సాహం తప్ప. దారిలో ఎవరినీ హింసించినట్టు సమాచారం కూడా లేదు. అందుకే ఇది పితూరీ దండు కాదు అని నిర్ధారించుకున్నారు కృష్ణదేవిపేట ప్రజలు.ఏరి స్వాముల వారు? ఎక్కడ? అందరిలోనూ ఇదే ప్రశ్న. ఆ సమూహానికి కొద్దిగా ముందు నడుస్తున్నారు పది మంది– ఖాకీ దుస్తులతో, చింతపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చినవి.గ్రామస్థులు నిటారుగా అయ్యారు. వారి భుజాల మీద తుపాకులు. నాటు తుపాకులు కాదు. పోలీసులు ఉపయోగించేవే. ఆ పది మంది కొంచెం దగ్గరగా వచ్చిన తరువాత పరికించి చూసిన వారికి కనిపించాడు రామరాజు.కొత్త అవతారాన్ని చూసినట్టుయింది. అందరికీ దిగ్భ్రాంతి. -
ఆకుపచ్చ సూర్యోదయం
అందరిలోనూ ఆవేశం పొంగింది. పనులు వదిలేసి గబగబా గుర్రం చుట్టూ మూగారు. ‘‘దొరా! ఏంటిది?! సంపేత్తారా మనుసుల్ని....!?’’ గట్టిగా అరిచిందా యువతి మొదట.ఆమెను కిష్టయ్య ఏదో అనబోయాడు. అప్పుడే గిరిజనులంతా ఒక్కసారి గొంతెత్తారు. ‘‘దొరా! ఏంటీ అన్నాయం? ఇడిచిపెట్టు... సచ్చిపోతాడు....!’’ తలొక మాటగా అన్నారు. అవేం పట్టించుకోకుండా ఉరుముతున్నట్టు అన్నాడు బాస్టియన్, ‘‘ఎవత్తిరిదే!’’కిష్టయ్య చెప్పాడు, ‘‘ఆడిపెళ్లాం దొర!’’గుర్రం డొక్కలో తన్నాడు విసురుగా, బాస్టియన్. ఒక్క గెంతు గెంతి పరుగు లంఘించుకుంది గుర్రం.ఆ ఊపుకి నేల మీద పడబోయాడు ఎర్రేసు. మెడ నరాలన్నీ కలుక్కుమన్నాయి. గుర్రం జీనులో చేతికందిన పట్టీని పట్టుకుని నిలదొక్కుకున్నాడు. తట్టలూ, పారలూ, గునపాలూ పెట్టుకునే ఆ మామిడి చెట్టు అక్కడి దాదాపు వంద మీటర్ల దూరంలో ఉంది. చిరతపులి లేగదూడను లాక్కుపోతున్నట్టు పరమ కర్కశంగా లాక్కుపోతున్నాడు ఎర్రేసుని బాస్టియన్.కెవ్వున అరిచి గుర్రం వెనక పరుగు తీసింది ఎర్రేసు పెళ్లాం. ðlనకే పరుగుతీశారు కూలీలందరూ. ‘‘దొరా..... ఆపు దొరా.......’’ ఎర్రేసు పెళ్లాం ఆక్రందన. ‘‘తప్పు కాయి దొరా! అన్నాయం దొరా......!’’ ఓ నడివయసు స్త్రీ విన్నపం.‘‘అయ్యో... అయ్యో... అదిగో, మాయ గుర్రం తొక్కేస్తంది కాళ్లు....!’’ ఓ యువతి అంది ఆ దృశ్యాన్ని చూడలేనట్టు. ‘‘సచ్చిపోయాడు దేవుడోయ్! దొరా దణ్ణం పెడతాను ఒదులు దొరా....!’’ అరుస్తోంది ఎర్రేసు భార్య. ‘‘ఇదన్నాయం.. ఇదన్నాయం. ఆడు సచ్చిపోతే మేం ఊరుకోం... ఇదే చెప్పడం....’’ పెద్ద గొంతుతో అన్నాడు ఓ యువకుడు. గుర్రం మామిడిచెట్టు దగ్గరకొచ్చి ఆగింది.తటాల్న వదిలాడు తుండుగుడ్డని బాస్టియన్. ఒక్కసారిగా కిందపడి దొర్లాడు ఎర్రేసు. రెండు పాదాలు కొట్టుకుపోయి రక్తం ఉబికి, ఎర్ర కంకర దుమ్ముతో కలుస్తోంది. ‘‘తీసుకెళ్లు... ఇక్కడున్నట్టుగా రావాలి, సాయంత్రానికి!’’ అరిచాడు బాస్టియన్, క్రౌబార్లని చూపుడు వేలితో చూపిస్తూ. అప్పటికే నాలుగైదు అడుగుల దూరంలో వచ్చి నిలబడి ఉన్నారు అడవిబిడ్డలు. అందరిలోనూ ఆవేశం. అందరికంటే ముందే కనిపిస్తోంది ఎర్రేసు భార్య. చటుక్కున గుర్రం దిగి, వడివడిగా నడిచి వెళ్లి ఆమె చెంప మీద బలంగా కొట్టాడు బాస్టియన్.అలాగే నేల మీద పడిపోయిందామె.‘‘ఏంట్రా.... దండెత్తుకొచ్చారు? ఫితూరీయా? రండి, తిరగబడండి! అన్నాయమా? ఊరుకోరా?! ఏం చేస్తార్రా! ఏం చేస్తార్రా...... ’’ అంటూ చర్నాకోల తీసుకుని గొడ్లను బాదినట్టు బాదడం మొదలుపెట్టాడు బాస్టియన్, బండబూతులు తిడుతూ. ఓ కట్టె తీసుకుని బాస్టియన్కు తోడయ్యాడు కిష్టయ్య. దూరంగా నిలబడి తమాషా చూస్తున్నాడు విలియం. రాత్రి నుంచీ మండుతున్న నెగళ్లు శాంతిస్తున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణకు వేస్తారవి. రోడ్డు పనికొచ్చిన వాళ్లంతా అక్కడే గూళ్లు కట్టుకుని ఉన్నారు. ఎప్పుడో పోడు కోసం చదును చేసిన స్థలం. నెగళ్లు చల్లారక ఆ గూళ్ల పక్కనే చిన్న చిన్న రాళ్లతో పేర్చిన పొయ్యిలు రాజుకోవడం మొదలవుతోంది, చిరు జ్వాలలతో. కోడిజాము వేళ కనిపించే దృశ్యం అదే అక్కడ. నెగడు నుంచి ఒక కొరకంచె తీసుకుని చితుకులు వేసి ఉన్న ఆ పొయ్యిలో పెట్టి ఊదడం మొదలు పెట్టింది సన్యాసమ్మ. పొయ్యి రాజుకున్నాక, లేచి వెళ్లి తన గూడులో ఉన్న కుండని తీసుకువచ్చి పొయ్యి మీద పెట్టి, నీళ్లు పోసింది. దాని మీద చట్టి పెట్టింది.బుగ్గిమంచుతో చల్లగా ఉంది వాతావరణం.ఆమె నడుస్తుంటే ఒక రాజసం ఉంటుంది. అందుకు ఆమె పొడవు కూడా ఒక కారణం. మహారాణి నడుస్తున్నట్టే ఉంటుంది. మగవాడితో సమంగా పని చేయగలదని పేరుంది. కొద్దిసేపట్లోనే ప్రతి గూడుకు పక్కన పొయ్యిలు మండటం మొదలైంది. మగవాళ్లలో కొందరు లేచి కూర్చున్నారు. ఇంకొందరు ఇంకా పడుకునే ఉన్నారు, గొంగళ్ల కింద. నీళ్లు మరుగుతున్న శబ్దం వస్తే, గూడు లోపలి నుంచి బియ్యం పోసి ఉంచిన చాట తెచ్చి అందులో ఒంపింది. కొంచెం దూరంగా నిలబడి వేప్పుల్ల నములుతున్నాడు ఆమె భర్త లచ్చన్న దొర.‘‘చూస్తా ఉండు!’’ అని చెప్పి గూడు లోపల కూర్చుని ఆముదం తలకు రాసుకుని కొప్పు చుట్టుకుంది. అన్నం వార్చి, తరువాత మూకుడు పెట్టి, సొరకాయ బుర్రలో ఉంచుకున్న నూనె పోసి పనస గింజలు వేయించింది. మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇంకొన్ని గింజలు కూడా వేయించింది. వెలుగు వస్తుండగా అంతా బయలుదేరారు పనికి. ఐదురోజులు గడిచాయి. అప్పటికే లంబసింగి ఊరి శివార్లకి వచ్చేసింది రోడ్డు. ఆరోరోజు పని మొదలు పెడుతున్నారు.చెట్లు కొట్టేసిన ఆ నేల మీద గొలుసులతో కొలతలు వేస్తున్నారు.మైదాన ప్రాంతాలలో కరణాలు ఉపయోగించే కొలత గొలుసే అది. ఒక కొస కిష్టయ్య, రెండో కొస పిళ్లై పట్టుకుని. నేల మీద గుర్తులు పెడుతున్నారు. పది గొలుసుల దూరం అంటే ఒక ఫర్లాంగు. ‘‘ఇదిదా కట్ళై. అంటే... అదేమబ్బా? ఆ... ఆ .. కొలత. పత్తు గొలుసుల దూరం. సమయం నాన్గు దినములు.’’ గట్టిగా అరిచి చెప్పాడు పిళ్లై. రోలర్ నడుపుతున్నాడన్న మాటే గానీ, విలియం దృష్టంతా సన్యాసమ్మ మీదే ఉంది.అది గమనించాడు బాస్టియన్.పక్కనే నిలబడి ఉన్న కిష్టయ్యతో అన్నాడు బాస్టియన్.‘‘ఏంట్రా కిష్టయ్య! ఆ డ్రైవర్గాడు ఇందాకటి నుంచి అలా చొంగ కార్చేసుకుంటన్నాడేంటి దాన్ని చూసి?’’‘‘సన్యాసమ్మంటే ఆడికి మహా మోజు. కళ్లు తిప్పుకోలేకపోతున్నాడు.’’ అన్నాడు కిష్టయ్య.కొంచెం దూరంగా కనిపిస్తోంది సన్యాసమ్మ.‘‘ఏంట్రా! బంతిపువ్వులా మెరిసిపోతంది?’’ చాలా ఆత్రంగా అన్నాడు బాస్టియన్.‘‘రాత్రే ఎన్నెల్లో నిలబడి..... సుబ్రంగా... తానం అదీ చేసింది దొరా!’’ అన్నాడు కొంటెగా. ‘‘అమ్మ ఎదవా! చూసావేంట్రా? ఏరా ఇది పడుకోదంటావా?’’ అన్నాడు బాస్టియన్ ఆబగా.‘‘కష్టం దొరా!’’ అన్నాడు కిష్టయ్య. ఇంకా అడుగులు పడుతుండగానే ఒక్క ఉరుకుతో గుర్రం దిగి, గప్పీ దొర బంగ్లా మెట్ల వైపు పరుగులాంటి నడకతో వెళ్లాడు బాస్టియన్. పది మెట్లు ఎక్కితే ముందు ప్యూన్ల క్వార్టర్సు కనిపిస్తాయి. కుడి పక్కదాంట్లోనే ద్వారం కిష్టయ్య ఉంటున్నాడు. ఎడం పక్క క్వార్టర్సులో ఓవర్సీర్ సంతానం పిళ్లై ఉన్నాడు. కిష్టయ్య ఉన్న క్వార్టర్సులోకి దూరాడు బాస్టియన్. సాయంత్రం ఐదు గంటలవుతోంది. చల్లగా ఉంది వాతావరణం. తీరా లోపల ఎవరూ లేరు. కొద్దిగా చీకటిగా ఉంది. హతాశుడైపోయాడు.‘ఈ కిష్టిగాడు అది వచ్చేసిందని చెప్పాడు! ఏమైంది?’ అనుకున్నాడు బాస్టియన్, తనలో.గదిలో ఒక నులక మంచం, ఒక మూలగా ఒక నీళ్ల కుండ. ఆ మంచం మీదే కూర్చున్నాడు బాస్టియన్. అసలు పెద్ద కుట్ర పన్ని, ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప దానితో పొందు సాధ్యం కాలేదు. పేరు తలచుకోగానే ఒళ్లంతా తిమ్మిరెక్కిపోతుంది బాస్టియన్కి. అదో నల్లకలువల గుట్ట. కొండసంత గ్రామంలోనే ఆమెను చూశాడు బాస్టియన్. పేరు డోలా లక్ష్మమ్మ. ఆ ఊరుదే. మొగుణ్ణి వదిలేసి ఒంటరిగా ఉంటోందన్న విషయం బాస్టియన్ను మరీ తొందర చేసింది. మొదట ఒక ఘాట్ రోడ్డు పనికి ఆమె వచ్చేటట్టు చేశాడు బాస్టియన్. అక్కడ మేస్త్రి రామమూర్తికి, సంగతి చెప్పి ఉచ్చులోకి దించే బాధ్యత అప్పగించాడు. ఇవేమీ తెలియని లక్ష్మమ్మ ఓ రోజున వచ్చి, ‘మేస్త్రి రెండు రూపాయలు కావాలి. ఇంకోసారి రోడ్డు పనికి వచ్చి తీర్చుకుంటాను’ అని మొరపెట్టుకుంది. బాస్టియన్ అనుమతి తీసుకోమని చెప్పి పంపాడు. పది పైసలు కూడా వదలని బాస్టియన్ రెండు రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు. అదే ఆమె పాలిట శాపమైంది. ఆ రెండు రూపాయలు అడ్డంపెట్టుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. కొంతకాలంగా ఆమె బాస్టియన్ ఇలాకాగా ప్రసిద్ధి. గుమ్మంలో వెండి కడియాల చప్పుడైంది. లోపలికి వచ్చి తలుపులు వేస్తోంది లక్ష్మమ్మ.అమాంతం వెళ్లి కౌగిలించుకోబోయాడు బాస్టియన్. ‘‘ఏంటి! ఎలుగ్గొడ్లా పడిపోతన్నారు? ఓ పాలాగండి!’’ అంది చనువుగా చిరాకు పడుతూ. ‘‘ఆగలేనే. నన్నాపకే... నీ కాళ్లు పట్టుకుంటాను!’’ అన్నాడు వంగుతూ.‘‘ ఒక్కసారి ఆగండి!’’ ‘‘ఎందుకు?’’ అన్నాడు బాస్టియన్.‘‘కిష్టయ్య వస్తాడు. ఆడూ చూస్తాడని!’’ అంది నవ్వుతూ.‘‘ఇప్పుడు ఆడెందుకు?’’ అన్నాడు చురచుర చూస్తూ.‘‘కౌజు పిట్ట కూర, చేపల పులుసు అట్టుకుని రమ్మన్నాను కిష్టయ్యని.’’ అంది, మంచం మీద దభీమని కూర్చుంటూ. ఆ ఏర్పాటుకు కరిగిపోయిన బాస్టియన్, ‘‘ఒక్క ముద్దు!’’ అంటూ మోటుగా దగ్గరగా తీసుకుని చుంబించాడామెని.అప్పుడే బంగ్లా బయట వినిపించింది కిష్టయ్య గొంతు. ఎవరి మీదో అరుస్తున్నాడు. ఓ నాలుగైదు నిమిషాల తరువాత తలుపు తోసుకుని వచ్చాడు కిష్టయ్య. అన్నం క్యారియర్, ఆకులతో మూతులు కట్టిన కూర, పులుసు గిన్నెలు అక్కడ పెట్టి వేగంగా వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు కిష్టయ్య. కానీ ఓ మాట గుర్తుకొచ్చి ఆగాడు.‘‘ఇదిగో లచ్చి! ఆ మూల ఉంది చూడు, గొంగడి. అది మంచం మీదేసుకుని వొణ్ణం తినండి. కింద ఎలగ్గొద్దుల కంపు. మంచం మీదే అలాగే కంచాలు పెట్టీకు. ఎలకలు కొట్టీగలవు.’’ అనేసి వెళ్లిపోయాడు. ఆ గొంగడి అలా ఉపయోగపడుతున్న సంగతి ఇప్పుడే కిష్టయ్యతో తిట్లు తిని వెళ్లిపోయిన మనిషికి తెలియదు. అతడు మూగయ్య. ఇంకా మంచు పడుతూనే ఉంది. చలి తగ్గలేదు. చిన్నాపెద్దా అంతా ఏదో ఒకటి శరీరం మీద కప్పుకుని ఉన్నారు. మూగయ్య ఒంటి మీద మాత్రం చిన్న చీర పేలిక.ఇంకో రెండు రోజులే పని. కానీ ఈ చలి సంగతేమిటి? ఈ రెండు రోజులే కాదు, శీతాకాలం ఇంకో ఇరవై రోజులైనా ఉంటుంది. వచ్చే సంవత్సరం మళ్లీ చలికాలం వస్తుంది. గొంగడి లేకుండా ఎలా? ముక్కు కారిపోతోంది. తలంతా భారం. గెడ్డం పెరిగిపోయి, కొద్దిగా జ్వరంతో ఉన్నాడు మూగయ్య. అప్పుడే వచ్చాడు పనిలోకి. ఓ చెట్టు కింద రోడ్డు రోలర్ ఫైర్మ్యాన్తో మాట్లాడుతున్నాడు కిష్టయ్య. ‘‘కిష్టయ్య!’’ భయం భయంగా పిలిచాడు మూగయ్య, దగ్గరగా వెళ్లి.‘‘ఏంట్రా?’’ గట్టిగా అరిచాడు కిష్టయ్య.రెండు చేతులూ జోడించి, దాదాపు కళ్లల్లో నీళ్లతో సైగ చేశాడు మూగయ్య, తన గొంగడి ఇమ్మంటూ. ‘‘గొంగడి.....! ఛీ... మాపటేల రా. పట్టుకుపో! శనొదిలిపోతది. నీ....’’ పెద్ద బూతు మాటతో అన్నాడు కిష్టయ్య. ఇంకొక్క రోజు. మళ్లీ నెల రోజుల పాటు ఈ బండపాటు ఉండదు. ఉంటే తిందాం, లేకపోతే పస్తులుందాం అన్నట్టు వడివడిగా పని చేస్తున్నారు. మధ్యాహ్నమయింది. ఇంత వరకు బాస్టియన్ ఒక్కమాట అనలేదు. ఇది మరీ విచిత్రంగా అనిపిస్తోంది వాళ్లకి. చిట్రాళ్లగొప్పు నుంచి కొత్తరోడ్డు దాదాపు గప్పీ దొర బంగ్లా దగ్గరికి వచ్చేసింది.గíప్పీదొర బంగ్లాకు అవతల ఇంతకు ముందు వేసిన రోడ్డుతో కలిపితే డౌనూరు దాకా రోడ్డు నిర్మాణం పూర్తయినట్టే. గప్పీదొర బంగ్లాకి కొంచెం ఇవతలే ఉంటుందా రాయి. చాలా వరకు బద్దలు కొట్టినా కొంత అడ్డం వస్తుందనిపించింది పిళ్లైకి. అందుకే దానిని ఇంకొంచెం బద్దలు కొట్టమన్నాడు. పైగా ఇద్దరు మగ మనుషులకి సమానం, నువ్వే చేసెయ్ అని సన్యాసమ్మకి పురమాయించాడు. దానితోనే రెండు గంటల నుంచి పోరాడుతోందామె. పిళ్లై చూపించిన గుర్తు దగ్గరకు రావడానికి ఇంకో అరగంట పడుతుంది. ఒకసారి వచ్చి బాస్టియన్ చూసి వెళ్లాడు. ఆమె సుత్తితో బలంగా మోదుతున్నప్పుడు కదిలే ఆ గుండెల్ని చూస్తూ కాలక్షేపం చేశాడు. ఏదో రకంగా ఆమెను తాకాలి. అదే అతడి దుర్బుద్ధి.ఏమైందో తెలియదు, ఆ దెబ్బ చాలా గట్టిగా వేసింది సన్యాసమ్మ.అరచేయంత రాతి పెచ్చు ఊడి పడింది. దానితో పాటు శానం కొస కూడా అంగుళం మేర విరిగింది. ‘‘ఒళ్లు తెలియడం లేదే లంజా!’’ ఒక్క అరుపు అరిచాడు బాస్టియన్. ఆమె ఇటు తిరిగే లోపునే వీపు మీద బలంగా తన్నాడామెని, ఒళ్లు తెలియని కోపంతో. ముఖం వెళ్లి ఆ పెద్ద రాయికి తగిలింది బలంగా. తరువాత అప్పటిదాకా కొట్టిన రాళ్ల మీద బొక్క బోర్లా పడిపోయి కెవ్వు మంది సన్యాసమ్మ. ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు ‘‘ఆ క్రౌబార్లని బాగు చేయించాం. మళ్లీ ఇదా? బుద్ధిలేదా?’’ అప్పటికి ఆమె గెడ్డం, రెండు పెదవులు పగిలి, పళ్లు కూడా కదిలి నోటి నుంచి ధారగా స్రవిస్తోంది రక్తం. పాకుతున్న బిడ్డలాగా మోకాళ్ల మీద, అరచేతుల మీద ఆనుకుని నేల మీద ఉందామె. నోట్లో నిండుతున్న ఉప్పటి, వెచ్చటి రక్తాన్ని కాండ్రించి, కాండ్రించి ఉమ్మేస్తోంది– ఏడుస్తూ, దగ్గుతూ, పొలమారుతున్న గొంతుతో. పక్కనే నీళ్లు చల్లుతున్న కొండమ్మ చటుక్కున వచ్చి, ‘‘ఏంటి బాబూ ఇది! సచ్చిపోతాది. ఏంటిది? చాల్లెండి!’’ అంది గట్టిగా. తన శరీరం పెడుతున్న బాధతోనా? లేకపోతే, తన శరీరాన్ని ఇంతగా గాయపరిచిన అవతల మనిషి మీద కసితోనా– అర్థం కాలేదు బాస్టియన్కి. సన్యాసమ్మ కుడి చేతి వేళ్లు సుత్తి పిడి చుట్టూ బిగుసుకుంటూ ఉంటే అతడు రెండడుగులు వెనక్కి వేశాడు. సన్యాసమ్మ అక్కడే గొంతుక్కూర్చుని నోట్లో రక్తాన్ని కాండ్రించి ఉమ్ముతూనే ఉంది. దూరంగా ఆమె భర్త లచ్చన్న.... నిస్సహాయంగా చూస్తూ.రేపు ఉదయం బియ్యం, కూలీ డబ్బులు తీసుకుని సొంతూళ్లకి వెళ్లిపోతామన్న సంగతి చాలా ఆనందాన్ని కలిగిస్తోంది వాళ్లకి.ఓ నెగడు ముందు కూర్చుని ఉన్నాడు మూగయ్య. అతడిలో మాత్రం ఏ భావమూ లేదు.అక్కడికే వచ్చాడు శనోరం ఊరు యువకుడు కంటందొర.‘‘గొంగడి తెచ్చుకున్నావా? ఈ రోజైనా ముసుగెట్టి హాయిగా పడుకో!’’ అన్నాడు, కంటందొర.ఏమీ మాట్లాడకుండా చలి కాచుకుంటున్నాడు మూగయ్య.‘‘ఏంటి మాట్లాడవు? కిష్టయ్య ఇచ్చాడా లేదా గొంగడి!’’ ‘‘ఇచ్చాడ్రా!’’ అన్నాడు మూగయ్య, బాగా జలుబు చేసిన గొంతుతో. వెంటనే లేచి వెళ్లి తన గూడులో పెట్టుకున్న గొంగడి తెచ్చి అతడి చేతికి ఇచ్చాడు మూగయ్య. మూటలా చుట్టేసి ఉంది.‘‘మరి కప్పుకో. ఉండు నేను కప్పుతాను.’’ అంటూ విప్పాడు గొంగడిని. తాటికాయలు... ఇంకా చెప్పాలంటే పనసకాయలు మూట కట్టినా ఉండవు. ఎలుకలు కొట్టేశాయి .ఎవరి చేతిలో పడతాయి డబ్బులు? ఎవరి సంచిలో ఎంత బియ్యం పడుతుంది? వాళ్లందరి ముఖంలోను ఉత్కంఠ. గప్పీ దొర బంగ్లాకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూలీలంతా కూర్చుని ఉన్నారు. అరుగు మీద వేసిన కుర్చీలో కూర్చుని ఉన్నాడు బాస్టియన్. ఆ బంగ్లా మెట్లలో ఓ మెట్టు మీద కూర్చుని మస్తర్లు పరిశీలిస్తున్నాడు పిళ్లై. ఇంకో రెండు మెట్ల కింద కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు కిష్టయ్య. ‘‘గారంగి లింగాలు ’’ నెమ్మదిగా చదివాడు పిళ్లై. లింగాలు అన్ని రోజులూ రాళ్లు మోశాడు. ‘‘లింగాలు! నీకు పని అబ్బలేదురా! నీకు మొత్తం కూలీ ఎనిమిది రూపాయలు. పది కుంచాల బియ్యం కొలిచాం. ఇంక నాలుగు రూపాయలు కూలీ. అది మాత్రం నీకు ఇవ్వొద్దన్నారు దొరవారు.’’ అన్నాడు పిళ్లై. ‘‘ఒక్క రూపాయి....’’దీనంగా అడిగాడు లింగాలు. ‘‘నోర్మూసుకుని పో’’ మెడ పట్టి గెంటినంత పని చేశాడు కిష్టయ్య.అప్పటికే ఇంకో పేరు పిలుస్తున్నాడు పిళ్లై ‘‘కారంగి నాగులు, మర్రిపాలెం’’ లేచి వెళ్లాడు నాగులు.‘‘బియ్యం ఎంత కొలిచాం;’’ అడిగాడు పిళ్లై.‘‘నాకేటి తెలుసు దొరా!’’‘‘కొలిచాం కదా! నువ్వు పట్టుకెళ్లావ్ కదా!’’ అన్నాడు కలం గాల్లో ఊపుతూ, పిళ్లై. ‘‘ఔను దొరా, కొలిసారు.’’ అంగీకరించాడు నాగులు. ‘‘నీకు వారం రోజుల కూలీ ఇవ్వాలి. ఇక్కడ రాసుకున్నాం. వచ్చేసారి చేసినప్పుడు సర్దుతారు దొరవారు. బియ్యం తీసుకుని వెళ్లిపో!’’ అన్నాడు పిళ్లై.కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి నాగులికి. తరువాత పిలిచాడు పిళ్లై , ‘‘కొండమ్మ!’’ ‘‘పిట్టల చిన్నిగాడి పెల్లాం, కొండమ్మ’’ గట్టిగా అరిచాడు కిష్టయ్య. ‘‘దండాలు. మొన్న పనిలో తొమ్మిదణాలు రావాలి బాబూ!’’ అంది వినయంగా.‘‘ఏమే, మాకు తెలీదా! నాల్రోజులు కూలీ చేసేటప్పటికే లెక్క తెలిసిపోయిందీళ్లకి!’’ వ్యంగ్యంగా అన్నాడు కిష్టయ్య. ఆ తొమ్మిదణాలు, ఇప్పుడు ఇవ్వవలసిన ఇంకో తొమ్మిది అణాలు– అబ్బో చాలా పెద్ద మొత్తం. ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తున్నాడు పిళ్లై. ఆమె అలా అడగడం కలసి వచ్చింది.‘‘ఏమే, నువ్వు చింతపల్లి పనిలో పారొకటి తిరిగి ఇవ్వలేదని కిష్టయ్య చెప్పాడు. పోయిన సర్కారు వారి పారకి డబ్బులు నువ్వే ఇవ్వాలి! నీ కూలీ దానికి చెల్లు’’ అన్నాడు పిళ్లై.కొండమ్మ దాదాపు ఏడుస్తూ అంది, ‘‘సత్తె పెమానం. నాకేటీ తెల్దు దొర! ’’ అంది.‘‘లంబసింగి పనికి వస్తావ్ కదా! అప్పుడు చూద్దాం. పో.’’ అన్నాడు పిళ్లై. అడుగు పడలేదామెకి. ‘‘పొమ్మంటే పోవేమే!’’ గట్టిగా అరిచాడు బాస్టియన్. ఇంతకాలం కష్టాలు కలసి తిన్నా, కలసి దెబ్బలు తిన్నా, కలసి కన్నీళ్లు కార్చినా ఆ క్షణంలో నాలుగు రూపాయలు తీసుకున్నవాడు మూడు రూపాయలు తీసుకున్నవాడికి పరమ శత్రువులా కనిపించాడు. ఈ ఇద్దరూ రెండు రూపాయలు తీసుకున్నవాడికి ఆగర్భ శత్రువుల్లా కనిపిస్తున్నారు. ఎవరి దగ్గర ఎవరూ వీడ్కోలు తీసుకోవడం లేదు. నిరాశగా, నిస్పృహతో, జీవచ్ఛవాల్లా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచిపోతున్నారంతా. -
ఆకుపచ్చ సూర్యోదయం
లంబసింగి–చింతపల్లి రోడ్డు ఈరోజు యారోజు ఏమిటి– పువ్వుల రోజు/లేలే లేల లేలమ్మారో– ఓలే లేల లేల ....... భూమిదేవికి కట్టిన కోక – ఏమిటి పూలకోక?/భూమిదేవికి కట్టిన కోక– బూరుగుపూలకోక! హఠాత్తుగా ఆగిపోయింది పాట– కర్ణకఠోరమైన ఆ శబ్దానికి. గుప్పుమంటూ ఆ పనసచెట్టు ఆకుల మధ్యకు చొరబడింది – నల్లటి, దట్టమైన పొగ. ఒక్క లిప్తలోనే ఖయ్యమని చెవులు చిల్లులు పడేటట్టు ఇంకోచోట నుంచి తెల్లటి ఆవిరి. ఆ రెండు శబ్దాలతో ఆ కొండలన్నీ ప్రతిధ్వనించాయి. ఆకాశమంతా పక్షుల కలకలం. పాట ఆపేసిన రోడ్డు పని కూలీలంతా అటు తిరిగారు. ఏవ్లింగ్ అండ్ పోర్టర్ కంపెనీ కెంట్ ఇంగ్లండ్ సంస్థ తయారుచేసిన స్టీమ్ రోడ్ రోలర్ అది. దాదాపు పన్నెండు అడుగుల ఎత్తు. ఇంకో పన్నెండు అడుగుల పొడవు. ఏనుగులాగే ఉంది. వెనుక రెండు చక్రాలు, మనిషెత్తులో. ముందు నాలుగడుగుల ఎత్తు రోలర్. ఆకుపచ్చ, బూడిద రంగులలో ఉంది మొత్తం రోలర్. మన్యంలో నాలుగేళ్లుగా రోడ్డు పనులు సాగుతున్నా, ఈమధ్యనే ఇరవై వేల రూపాయలు పోసి కొన్నారు. స్టీరింగ్ కిందే ఉంది గుండ్రటి మీటర్. పక్కనే వెదురు చిగుళ్ల మాదిరిగా మీటలు. వాటిలో ఒక మీటనే మళ్లీ ఒత్తాడు అల్ఫ్ బాస్టియన్, సరదా తీరక. ముందుకంటే భీకరంగా శబ్దించింది ఇంజన్. ‘‘దీనమ్మ! అంతా రైలింజన్ లాగే!’’ అన్నాడు బాస్టియన్ తెలుగు బూతు పదాన్ని ఇంగ్లిష్ వాక్యానికి జోడించి, విశాఖపట్నం నుంచి వచ్చిన రోలర్ డ్రైవర్ విలియంతో. ‘‘ఇదీ ఆవిరితోనే కదా నడిచేది!’’చిరాకుగా మొహం పెట్టి అన్నాడు విలియం, ఇంగ్లిష్లో. మొదటిసారే అలా ఆ మీట నొక్కినందుకు ఒళ్లు మండింది. అక్కడితో ఆగకుండా మరోసారి నొక్కాడు బాస్టియన్. ఆ కోపాన్ని రోలర్ ఫైర్మ్యాన్ మీద చూపించాడు విలియం. ‘‘ఏరా! డాగ్లా అరుస్తావ్. బొగ్గు కొట్టడానికి ఇంతసేపా?’’అన్నాడు వచ్చీరాని తెలుగులో. అసలు బాస్టియన్ ప్రవర్తనే విలియంకి వికృతంగా అనిపిస్తోంది. నోరు విప్పితే బూతులు. విలియం రోలర్ డ్రైవర్. కానీ ఇంగ్లిష్ వాడు. బాస్టియన్ దొరతనంలో ఉన్నతోద్యోగి. కానీ మద్రాసీ. అందుకేనేమో పెద్దగా ఖాతరు చేయడం లేదు విలియం. సుత్తితో మరింత వేగంగా కొట్టడం మొదలుపెట్టాడు రోడ్డురోలర్ ఫైర్మ్యాన్. రాక్షసబొగ్గును ముక్కలు చేసి, రోలర్ కొలిమిలో వేయడం, కట్టెలు వేసి వెలిగించడం అతడి పని. ఫైర్మ్యాన్తో పాటు క్లీనర్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ విశాఖపట్నం వాళ్లే. విలియం తిట్లు బాస్టియన్కి ఎక్కడో తగిలాయి. కోపాన్ని దిగమింగుకుంటూ అటు తిరిగాడు విసురుగా. సరిగ్గా దొరికారు కూలీలు. వాళ్ల మీద చూపించాడు, తన ప్రతాపాన్ని. ‘‘దొంగనాకొడకల్లారా! క్షణం అటు తిరిగితే ఇంక పని ఎగదొబ్బీడమే! బయటోళ్లని ఎందుకు పిల్చుకురావటమని నేనాలోచిస్తా ఉంటే, ఇక్కడ ఇదీ ఈళ్ల వరస. ఏమే, అడివి ముండా! నీకు వేరే చెప్పాలా! కదులు.’’ అంటూ భుజం మీదే ఉన్న కొరడా ఝళిపిస్తూ వాళ్ల వైపు పరుగెట్టాడు. ‘‘అప్పగించింది ఇరవై గొలుసుల దూర ం, ఐదురోజుల గడువు. రెండు రోజులు అయిపోయాయి. పదడుగులు పడలేదు రోడ్డు. ఒరేయ్! ఇప్పుడే చెబుతున్నా... పని పూర్తికాలేదో... కూలీగీలీ దేవుడెరుగు... తోళ్లు తీసేస్తాను చెత్తనాకొడకల్లారా!’’ రంకెలు వేశాడు బాస్టియన్. ఆ వీరంగంతో పది నెలల తమ్ముణ్ణి ఎత్తుకుని అక్కడే నిలబడి రోలర్ శబ్దాన్ని వింటూ, దాని పొగని వింతగా చూస్తున్న ఆ నాలుగేళ్ల కొండవాళ్ల పిల్ల బెదిరిపోయి దూరంగా పారిపోయింది, ఆయాసపడుతూ. ఐదు నిమిషాల తరువాత మళ్లీ అరిచాడు బాస్టియన్, ‘‘ఒరేయ్ కిష్టయ్యా!’’ ఏ మూలన ఉన్నాడో, చటుక్కున ప్రత్యక్షమయ్యాడతడు. పూర్తి పేరు ద్వారం కిష్టయ్య. బాస్టియన్ దగ్గర బంట్రోతు. ఖాకీ నిక్కరు, పొట్టి చేతుల చొక్కా వేసుకుని ఉంటాడు. వయసు ముప్పయ్ లోపే. అప్పుడే బట్టతల వచ్చేసింది. అతడి అరిచేతులు, పాదాలు ఒక్కసారి చూసినా మరపునకు రావు. బండగా – ఏదో చతుష్పాద జంతువు అవయవాలు గుర్తుకు తెస్తాయి. తనకి అప్పగించిన ప్రధాన బాధ్యత అదే అన్నట్టు కీచుగొంతుతో అరుస్తూ, వీలైనప్పుడల్లా చేయి చేసుకుంటూ ఉంటాడు, కొండవాళ్ల మీద. ‘‘చూడ్రా! ఆ గుర్రానికి నీళ్లు పట్టు.’’ అప్పుడే వచ్చాడు సంతానం పిళ్లై. ‘వణక్కం’ అంటూ. అతడు తమిళుడు. రోడ్డు పని దగ్గర ఓవర్సియర్. కొన్ని తమిళ పదాలు దొర్లినా తెలుగు బాగానే మాట్లాడతాడు. ‘‘మస్తరు చూశావా?’’ అడిగాడు బాస్టియన్. ‘‘ఆమ... పొద్దున్నే చూసి పూడ్చినాను దొర.’’ అన్నాడు ఎక్కడ లేని వినయం ప్రదర్శిస్తూ. ‘‘అంతా ఉన్నారా?... ఎవడైనా....’’ ‘ఎక్కడకి పోతారు దొరా?! ’’ అన్నాడు గుర్రం కళ్లెం విప్పుతున్న కిష్టయ్య. ‘‘పది ముషమ్ల (మూరలు) దూరం.... రొంబ నిమ్మిదిగా పని చేస్తుంటిరి’’ పెదవి విరుపుగా అన్నాడు పిళ్లై. ‘‘తోళ్లు తీసి పని చేయించండి. ఏం ఊరికే చేస్తున్నారా, నా కొడుకులు! కూలి దొబ్బడం లేదా!’’ అరిచాడు బాస్టియన్. ఇలాంటి తిట్లు సర్వసాధారణం. అయినా పని వదిలిపోరు. పారిపోతే పర్యవసానం ఎలా ఉంటుందో చూస్తున్నారు కూడా. నీళ్లు మోసుకొస్తున్న ఆ లింగేటి మూగయ్య పారిపోయే దుస్సాహసం చేసి, ఫలితం అనుభవిస్తున్నవాడే. అడవిదున్న ఉదరంలా ఉంది ఆ తోలు తిత్తి. నిండా నీళ్లు నింపుకుని అంచె టపా మాదిరిగా మోస్తున్నారు నలుగురు వంతున. ఐదారు అడుగుల బలమైన వెదురు బొంగుకు తలిగించారు తిత్తిని. నాలుగు కిలోమీటర్ల అవతల, నర్సీపట్నం వైపు ఉన్న లంబసింగి నుంచి వస్తున్నాయి నీళ్లు. అక్కడ గప్పీ దొర బంగ్లాకి కొంచెం అవతలే ఉన్న నూతి నుంచి కొందరు నీరు తోడి ఈ తోలుతిత్తులు నింపుతూ ఉంటే, అర కిలోమీటరుకు ఒక బృందం వంతున మోసుకువస్తున్నారు, ఈ కొండగ్రామం చిట్రాళ్లగొప్పుకి. గుర్రం కళ్లెం పట్టుకుని ఎదురైన ద్వారం కిష్టయ్యను చూసి ఆగాడు మూగయ్య. మిగిలిన ముగ్గూరూ కూడా ఆగవలసి వచ్చింది. ‘‘కిష్టయ్య...కిష్టయ్యా! ఓపాలి ఆగు..... దండవెడతాను. నా గొంగడి ఇచ్చేయ్ బాబు! ఎలాగూ ఈసారిచ్చే కూలిలో తగ్గించుకుంటారు కదా! నీ కాళ్లకి దణ్ణం!’’ అన్నాడు దీనంగా. భుజం మీద బరువుతో మాట కష్టంగా వచ్చింది. గూడెం ప్రాంతంలోనే వీరముష్టిపేట గ్రామం మూగయ్యది. యాభై ఏళ్లు. కానీ అరయ్యేళ్ల వాడిలా ఉన్నాడు. కిష్టయ్య అన్నాడు, ‘‘నిన్ననే కదరా గుర్తు చేశావ్! మాకు ఏరే పనేంలేదా, నీ చింకి గొంగడి గోల తప్ప?’’ ‘‘చింకిది కాదు, కొత్తది కిష్టయ్యా!’’ అన్నాడు మూగయ్య. ‘‘నోర్మూస్కో. నీ గొంగడి ఊర్కే లాక్కున్నానా ఏంట్రా? అయినా ఒరే, దొరతనమోరి సొమ్ము అలా గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళిపోతే తప్పుకదరా! బేస్టీన్దొర మంచోడు కాబట్టి ఇప్పుడిచ్చే కూలిలో తగ్గించుకోవడానికి ఒప్పుకున్నాడు. లేకపోతే ఈపాటికి నర్సీపట్నం సబ్ జైల్లో కూకునేవోడివి.’’ ‘‘తప్పు కాయి కిష్టయ్య! పెద్దోణ్ణి. ఇక్కడ చలి బాద నీకు తెలుసు కదా!’’ చేతులు జోడించి మళ్లీ అడిగాడు మూగయ్య. ‘‘ఔన్రోయ్! ఇస్తాలే. రాత్రికి కదా! మాపటేలకే వచ్చెయ్రా!’’ నిర్లక్ష్యంగా చెప్పేసి గుర్రంతో ముందుకు నడిచాడు కిష్టయ్య. నీటిబుంగలతో అక్కడ నిలబడి ఉన్నారు ఆడకూలీలు. తిత్తి తాడు వదులు చేసి, నీళ్లన్నీ బుంగలలో నింపేసి మళ్లీ వెనుదిరిగింది మూగయ్య బృందం, ఆలస్యం చేయకుండా. చింతపల్లి, లంబసింగి ప్రాంతాలని చలిగూడెం, పులిగూడెం అంటారు. నిత్యం పగలూ రాత్రీ చలే. చీకటి పడితే పులుల బాధ. మూగయ్యది ప్రస్తుతం దారుణమైన చలిబాధ. చిట్రాళ్లగొప్పు రోడ్డు పని మొదలైన రోజున, అంటే మొన్న– కిష్టయ్య ఎదురుపడగానే మొదట అడిగింది గొంగడి గురించే. అప్పటికి ముప్పయ్ మూడు రోజుల క్రితం కూడా నర్సీపట్నం–చింతపల్లి రోడ్డు ఒక దశ కొంతపని జరిగింది. ఆ సమయంలోనే మూగయ్య గొంగడి లాక్కున్నారు. నిజం చెప్పాలంటే దొరతనం తాకట్టు పెట్టుకుంది, ఆ గొంగడిని. మనిషికి రోజుకి ఆరు అణాల (అణా= ఆరు పైసలు) కూలీ అని చెప్పారు. రోజులను బట్టి పద్నాలుగు కుంచాల వరకు బియ్యం ఇస్తామని చెప్పారు. ఎన్ని రోజులైనా పని జరిగే చోటే ఉండాలి. గ్రామ మునసబులూ, ముఠాదారులూ మొదట్లో పోటీలు పడి రోడ్డు పనికి మన్యప్రజలని సమీకరించే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు అందరికీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఈ రోడ్డు పని ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. ఇప్పటికి ఇక్కడ పని ఆపేస్తున్నామనీ, ఇప్పుడిచ్చే కొంత బియ్యం, కూలీ తీసుకుని వెళ్లి, మళ్లీ మొదలు పెట్టినప్పుడు రావాలనీ చెప్పారు, నెల క్రితం వచ్చినప్పుడు. కానీ, కొందరికి డబ్బులు బకాయి పెట్టారు. ఇంకొందరికి బియ్యం బకాయి పెట్టారు. అప్పుడే నాలుగు కుంచాలే తీసుకోవలసిన మూగయ్య సంచిలో పొరపాటున ఐదు కుంచాలు కొలిచాడు కిష్టయ్య. అది ఇద్దరూ గమనించలేదు. తప్పు కిష్టయ్యదే. చివరికి ఎవరో చెప్పారు, మూగయ్య సంచిలో ఒక కుంచం అదనంగా పడిన సంగతి. అతడి గురించి వెతికితే కనిపించలేదు. చడీచప్పుడూ కాకుండా పని వదిలేసి మూగయ్య తన ఊరు వెళ్లిపోయాడు. రెండోరోజుకే మూగయ్య ఇంటికి వచ్చాడు బారిక– బేస్టిను దొర గప్పీదొర బంగ్లాకి రమ్మన్నాడన్న కబురు పట్టుకుని. నాకేం తెలియదన్నాడు మూగయ్య. పైగా తప్పు నీదైతే నేనేం చేస్తాను అన్నాడు ఎదురు తిరిగి. బంగ్లా స్తంభానికి కట్టేసి, బాస్టియన్ ఆదేశంతో కొరడా అందుకున్నాడు కిష్టయ్య. ఒక కర్ర తీసుకుని పిళ్లై దాడిచేశాడు. పిళ్లై కర్రకి తగులుకున్న గొంగడి ఊడొచ్చింది. కిష్టయ్య గావంచా లాగేశాడు. నగ్నంగా ఉన్న మూగయ్య దెబ్బల బాధతో, గావంచా అయినా ఇవ్వమనీ, లేదా చిన్న గోచి గుడ్డయినా ఇవ్వమని, కూలి చేసి గొంగడి తీసుకుంటానని రోదిస్తూ కాళ్లా వేళ్లా పడ్డాడు. చివరికి గావంచా ఇచ్చి, గొంగడి మాత్రం గప్పీ దొర బంగ్లాలో పడేశాడు కిష్టయ్య. === అది లంబసింగి రోడ్డు నిర్మాణం పని. కాలుతున్న అడవిని అర్పుతున్నంత వేగంగా, అంటుకున్న గుడిసెల మంటలార్పుతున్నంత వడివడిగా కదులుతున్నాయి కూలీల కాళ్లూచేతులూ. నూట నలభై ఒక్క మంది కూలీలు. ఆడవాళ్లు యాభయ్ మంది వరకు ఉంటారు. అంతా విశాఖ మన్యవాసులే. చాలామంది మగవాళ్ల మొలలకు చిన్న గుడ్డ తప్ప మరేమీ లేదు. ఆడవాళ్లు సంప్రదాయకంగా చీర ధరించి ఉన్నారు. దాదాపు ఎవరికీ జాకెట్లు గానీ, కాళ్లకు చెప్పులు గానీ లేవు. అక్కడక్కడ కొద్దిమంది తప్ప అందరూ ఎముకల గూళ్లని చెబితే అతిశయోక్తి కాదు. చింతపల్లి–చిట్రాళ్లగొప్పు రోడ్డు పని పూర్తయింది. ఇప్పుడు చిట్రాళ్లగొప్పు గ్రామ శివార్ల నుంచి ఈ దశ రోడ్డు పని మొదలైంది. === పేగులు లుంగ చుట్టుకుపోతున్నాయి. ఒంటికి పట్టిన కంకర దుమ్ము, కాళ్లూ చేతులూ కడుక్కోవడం మరిచిపోయినట్టే ఉన్నారంతా. ఆకలి... నాలుగు ముద్దలు తినడానికి వడివడిగా నడుస్తున్నారు ఆ మామిడిచెట్టు దగ్గరకి. ఏదో ఒక మిషతో మధ్యాహ్నం భోజనం ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు కిష్టయ్య, పిళ్లై. చివరికి పని భారంతో పెద్దవాళ్లు, వయసు చేత పిల్లలు నకనకలాడిపోతున్నారు మెతుకుల కోసం. నిత్యం ఇదే తంతు. కొండమ్మ వడివడిగా వచ్చింది. మొగుడు ఇంకా రాలేదు. అయినా అతడి కోసం చూడదలుచుకోలేదు తీరా అక్కడి దృశ్యంతో నిశ్చేష్టురాలైపోయిందామె. అన్నం ముంతలు రెండో మూడో పగలగొట్టినట్టు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా ఎండుటాకుల మీద మెతుకులు, చిందరవందరగా. తను తెచ్చుకున్న ముంత పెట్టిన చోటు చూసింది కొండమ్మ. అక్కడ లేదు. ముంతలని కొద్దిదూరం వరకు అలమబండలు (కొండముచ్చులు) లాక్కుపోయిన సంగతి అర్థమయింది. ఆ ప్రదేశమంతా ఎండుటాకుల మీద అన్నం మెతుకులు కనిపిస్తున్నాయి. ఆ అన్నం తన ముంతలోదే. ఉదయం కలిపి తెచ్చుకున్నది. కళ్లంట నీళ్లు ఉబికాయి ఒక్కసారిగా. దూరంగా కనిపిస్తున్న ఆ ముంత దగ్గరగా నడిచిందామె. అక్కడే మరో చెట్టుకింద దట్టంగా ఉన్నాయి మొతుకులు. వేయించిన పనస గింజలు కలిపిన మెతుకులు– ఎర్ర టి కారం అంటిన తెల్లటి మెతుకులు. నోట్లో నీరు ఊరిపోయింది. నేల మీద ఉన్న రెండు ఎండుటాకులని చేతుల్లోకి తీసుకుంది కొండమ్మ. వాటినిండా మెతుకులు, చిన్న చిన్న ఇసుకరేణువులతో కలసి. ఆ ఇసుకని ఓపిగ్గా ఊదుకుంటూ వాటిలోని మెతుకులని నోట్లో ఒంపుకుంటోందామె. ‘‘తిన్నది చాలు... రండి...రండి!’’ అప్పటికే అక్కడ కిష్టయ్య అరుస్తున్నాడు. ‘‘లోతుగడ్డనున్న.....’’ రెండు చేతులతో ఎత్తి పట్టుకున్న గునపాన్ని బలంగా నేలలోకి దింపుతూ పెద్ద గొంతుతో అన్నాడా అడవిబిడ్డ, ఆ పదం. ‘‘వీరభద్రుడా!......’’ రోడ్డు పనిలో ఉన్న దాదాపు నూట నలభయ్ మంది కూలీలు అన్నారు ముక్తకంఠంతో. ఆ గునపాన్నే పైకి లాగి మళ్లీ పోటు వేయడానికి ఎత్తి అన్నాడు అతడే, ‘‘లంబసింగినున్న.....’’ ‘‘బాలరాకాసమ్మ....’’ అన్నాయి జనం గొంతులు. విశాఖమన్యంలో వినిపించే కొండరెడ్ల పాట. వివశులైపోతారు అడవిబిడ్డలు ఆటన్నా, పాటన్నా. కానీ ఇప్పుడు ఆ పాట వాళ్ల గొంతుకలలో సహజంగా పలకడం లేదు. ఈ కష్టం నుంచి నీ బిడ్డలని కాపాడకుండా ఏమిటీ తాత్సారం? అన్న ఆక్రోశం ఆ లయకు తోడైనట్టుంది. ఆ గిరిజనుడే అందుకున్నాడు పాట. రెండో పదం జనమంతా కలసి అంటున్నారు....... ‘‘బోడికొండనున్న ...’’ – ‘‘శాంబరమ్మ...’’ ‘‘మాడుగులనున్న ....’’ – ‘‘మత్స్యకంబేరమ్మ....’ ‘‘కొండకంబేరున్న...’’ – ‘‘నీలకంఠుడా!’’ ‘‘దమ్మము సావడి....’’ – ‘‘ మనము చేరవాలె....’’ ‘‘ఎటు వెళ్లినారో.....’’ – ‘‘పంచపాండగూలు....!’’ పాట అర్థం కాకున్నా, అందులోని లయనీ, ఆ లయకు తగ్గట్టు వేగంగా కదులుతున్న కొండజనాన్ని తదేకంగా శ్రద్ధగా గమనిస్తున్నాడు రోలర్ డ్రైవర్ విలియం. పనిలో వేగం అతడిని విస్తుపోయేటట్టు చేస్తోంది. ఎక్కడి నుంచో మరి, అప్పుడే వచ్చాడు బాస్టియన్. అడుగులో అడుగు వేస్తూ నడుస్తోంది గుర్రం– నిర్మిస్తున్న రోడ్డుకు ఒక పక్కగా. అంతే వాళ్ల గొంతుల్లో ఊపు తగ్గిపోయింది. పనిలో మాత్రం అదే వేగం. అదే నచ్చదు బాస్టియన్కి. శరవేగంగా సాగాలంటాడు. ఈ 1922 సంవత్సరాంతానికల్లా మన్యంలో రోడ్లన్నీ సిద్ధమైపోవాలి. శారీరక శ్రమనే కాదు, గాయాల సలుపుని కూడా ఆ పాట మరిపింపచేస్తోంది. పది రెట్ల శక్తిని ఇస్తోంది. కొందరు తట్టలతో తెచ్చి ఎర్ర కంకర చిమ్ముతుంటే, ఆ కంకర మీద కడవలతో, బుంగలతో నీళ్లు తెచ్చి అరచేతిని అడ్డం పెట్టి లాఘవంగా తడుపుతున్నారు కొందరు. మరుక్షణంలో దిమ్మెసాలు వచ్చి నర్తిస్తున్నాయి. ఒకచోట నిలిపాడు గుర్రాన్ని బాస్టియన్. కాస్త పరిశీలనగా చూసిన తరువాత అర్థమైంది అతడికి, ఆ లోటు. కొండవాళ్లు వంకర గునపాలని పిలుచుకునే క్రౌబార్లు ఇరవై వరకు తెప్పించాడు బాస్టియన్. ఒక కొస ఒంపు తిరిగిన గద్ద ముక్కులా ఉంటుంది. రెండో వైపు అర్థచంద్రాకారపు బద్ద ఉంటుంది. వాటితో రాళ్లను పెళ్లగించే పని నలుగురైదుగురే చేస్తున్నారు. ‘‘కిష్టయ్యా!’’ అరిచాడు బాస్టియన్, గుర్రం మీద నుంచే. ఏ మూల నుంచో వచ్చి నిలబడ్డాడు కిష్టయ్య. ‘‘ఏరా! క్రౌబార్లు ఇంకలేవా?’’ ‘‘మిగిల్నియ్యి పాడైయ్యాయి కదా దొర!’’ అన్నాడు కిష్టయ్య. ‘‘రెండ్రోజులైంది చెప్పి, ఇంకా బాగుచేయించలేదా? ఆడెవడికో చెప్పాం.... మర్రిపాలెం వాడెవడో......!’’ పేరు గుర్తుకు రాలేదు బాస్టియన్కి. గుర్తు చేశాడు కిష్టయ్య, ‘‘ఎర్రేసు దొర, బూతా ఎర్రేసు.’’ ‘‘పిలు, చెత్త నాకొడుకుని!’’ పళ్లు నూరుతూ అరిచాడు బాస్టియన్. ఓ చోట గొప్పు తవ్వుతున్న ఎర్రేసుని గమనించి, చేతులు ఊపి రమ్మని సైగ చేశాడు కిష్టయ్య. పాట ఆగిపోయింది. ప్రతి అడవిబిడ్డ గుండె కీడు శంకించింది. చేతిలో పలుగుని అక్కడే నేలకు గుచ్చి, తలకు చుట్టుకున్న తుండుగుడ్డ విప్పుకుని మెడలో దండలా వేసుకుంటూ గబగబా వచ్చాడు బూతా ఎర్రేసు భయపడుతూనే. పాతికేళ్లుంటాయి. బలంగానే ఉన్నా, డస్సిపోయి కనిపిస్తున్నాడు. అతని రెప్పల చివరి వెంట్రుకల మీద, మాసిన గడ్డం మీద కూడా కంకర దుమ్ము. దీనితో మరీ నీరసంగా కనిపిస్తున్నాడు. ‘‘నీయమ్మ....! వంకర గునపాలు ఎందుకు పట్టుకెళ్లలేదురా? ఎవరి చంక నాకుతున్నావ్?’’ ఉరిమాడు బాస్టియన్. ‘‘పొద్దున్న కూడా అడిగాను దొర. రేప్పోవచ్చులే అన్నాడు కిష్టయ్య.’’ విషయం చెప్పాడు తడబడుతూ ఎర్రేసు. ‘‘నన్నెప్పుడడిగావురా? దొర చెప్పాక, నన్ను అడగడం దేనికిరా? చెప్పు తీసుక్కొడతాను నాయాలా!’’ అడ్డంగా బొంకాడు కిష్టయ్య. సర్రున గుర్రం దిగి, ఎర్రేసు మెడలోని తుండు గుడ్డ రెండు కొసలను తటాల్న అందుకుని, మళ్లీ అంతే వేగంతో గుర్రం ఎక్కాడు బాస్టియన్. బలంగా లాగడంతో కెవ్వున అరిచాడు ఎర్రేసు. అప్పటికే అతడి పీక∙గుర్రం మెడకు తాసుకుపోయింది. ఉరికొయ్యకు వేలాడుతున్నట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.‘‘ఎక్కడున్నాయిరా ఆ క్రౌబార్లు?’’గట్టిగా అడిగాడు బాస్టియన్. ఇది ఇంతకు దారి తీస్తుందన్న సంగతి కిష్టయ్య కూడా ఊహించలేదు. అందుకే తడబడిపోతూ అన్నాడు. ‘‘అక్కడే దొర.... మన సామాన్లన్నీ పెడతాం కదా... ఆ మామిడి చెట్టు కిందే ....!’’ ‘‘చల్...!’’ గుర్రాన్ని అదిలించాడు బాస్టియన్. ఆ ముఖంలో ఏదో కసి. గుర్రం కదలబోతోంది..... -
ఆకుపచ్చ సూర్యోదయం
‘‘ఇదిగో రాజులబ్బాయ్! తమరికి సర్కారు వారు రాసిచ్చిన భూమి ఇదే. యాభయ్ ఎకరాలు. సీలేరు ఒడ్డు. నక్క తోకని తొక్కి వచ్చావ్! అదే తూర్పు. తాసీల్దారుగారి మేలు జన్మలో మరచిపోకూడదు. ఆ దిబ్బ మీదే ఇల్లు కడతాం. ఇల్లంటే ఓ పాక. అది పడమర. అక్కడ ఆ తాటితోపే సరిహద్దు. నేను ముందే చెబుతున్నాను. నాకు పితూరీలూ, సభలూ అంటే సరిపడవు. ఇందులో ఎంత దున్నుతావో ఆలోచించుకో. అప్పటిదాకా అన్నీ మేమే పంపుతాం. అన్నట్టు నీకు తల్లిగారు, తోడబుట్టినోడు ఉన్నారంట కదా! ఆళ్లని ఎప్పుడు తీసుకొస్తావు? తాదూర సందులేదు గానీ, మెడకో డోలంట! సరే, జన్మ అన్నాక అమ్మా అయ్యా, అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్లూ ఉండకపోరు. కానీ భారం మన మీదున్నప్పుడు మొయ్యాలి కదా! అందుకంటన్నాను.’’పుల్ల విరిచి పొయ్యిలో పెట్టిన రీతిలో అంతా చెప్పేశాడు దుచ్చర్తి ముఠాదారు చెక్కా లింగందొర. లింగందొర రంప రాజ్యంలో గొప్ప ప్రభుభక్తి పరాయణుడు. ముందురోజు మధ్యాహ్నమే నర్సీపట్నం పోలీసులు తీసుకువచ్చి ఫజులుల్లాఖాన్ ఆదేశం మేరకు దుచ్చెర్తిలో లింగందొరకి అప్పగించారు శ్రీరామరాజుని. ‘‘గిల్లితే పాలుగారేలా ఉన్నాడు, ఈ కుర్రోడి గురించేనా మీరు ఇంత హైరానా పడతన్నారు?’’ అని పోలీసులని లింగందొర వెక్కిరించాడు కూడా. ఎప్పుడొస్తాడో తెలియదు, వచ్చి ఒకసారి చూసి పోతుంటాడతడు గుర్రం మీద వచ్చి.పదిరోజుల తరువాత యాభయ్ ఎకరాలకి శాశ్వత పట్టా తెచ్చి చేతిలో పెట్టాడు లింగందొర. పదిహేను రోజుల తరువాత పాక కూడా సిద్ధం చేయించాడు. పైడిపుట్ట నుంచి అడ్డతీగెలకు మూడుమైళ్లు. నిత్యం వెళ్లి పోలీసు స్టేషన్లో సంతకం చేసి రావాలి. ఆ దారిలో వెళుతున్నప్పుడూ అంతే, అప్పుడప్పుడు ఒక కానిస్టేబుల్ తనని వెంటాడడం గమనించాడు రామరాజు. తల్లినీ, తమ్ముడినీ పైడిపుట్ట పంపవలసిందని కృష్ణదేవిపేట ఉత్తరం రాశాడు రామరాజు. ఆ రోజు సాయంత్రం రామరాజును వెతుక్కుంటూ నది దగ్గరకు వచ్చింది సూర్యనారాయణమ్మ.వేసవి. నదిలో తెల్లటి ఇసుక తిన్నె మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు రామరాజు.తమ్ముడు సత్యనారాయణరాజు నత్తగుల్లలు ఏరుతున్నాడు దూరంగా.‘‘రా అమ్మా!’’ అన్నాడు రామరాజు. ఆమె వచ్చి కొడుకుకు దగ్గరగా కూర్చుంది.పది నిమిషాలు మౌనంగా ఉండి తరువాత అందామె.‘‘చిట్టిబాబూ! ఈ కొండ్ర నీకు ఎందుకిచ్చారో నాకైతే అర్థం కావడంలేదు. ఈ భూమితో నిన్ను రైతుని చెయ్యాలనుకుంటున్నారో, ఖైదీని చేయాలని అనుకుంటున్నారో తెలియడం లేదు. ఇంకొకటి చెప్పనా! తమ్ముడు ఇలాగే ఉంటే రేపన్ననాడు ఏం చేస్తాడు? వాడూ నాలుగు అక్షరాలు నేర్చుకోవాలి. మనం ఏ నరసాపురమో, భీమవరమో– నీకు నచ్చే చోటికి– వెళ్లిపోదాం, ఆలోచించు నాన్నా!’’ ‘‘నిజమేనమ్మా! పైడిపుట్ట నాకు గోడల్లేని కారాగారమే.’’ అన్నాడు రామరాజు.‘‘అయితే, ఆలోచించావన్నమాట. తుని, మోగల్లు ఎక్కడికైనా సరే. వెళ్లిపోదాం మరి!’’ అన్నదామె, ఆర్తిగా.‘‘అక్కడికి నేనెలా రాగలనమ్మా! ఇది చూడు! నిన్న ప్రవహించిన నదికి జాడ కదా! ప్రవాహం లేకపోయినా కంటికి కనిపిస్తూనే ఉంది నది. నిన్నటి ప్రవాహం అలికిడి చెవులలో మిగిలే ఉంటుంది. నా జీవితమూ అంతే. దద్దాకీ, చుట్టాలకీ ఇప్పుడు నామీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందో నేను ఊహించగలను. తమ్ముడి చదువు ముఖ్యం. నువ్వు వెళ్లు. నేను నేపాలు యాత్రకి వెళ్లాలని అనుకుంటున్నాను.’’ అన్నాడు రామరాజు. నిలువెల్లా వణికిపోయింది ఆ మాట విని, ఆమె.‘‘మళ్లీ యాత్రలేమిటి నాయనా? సంపాదించిన పుణ్యం చాలకా? ఇంక నన్ను బాధ పెట్టకురా!’’ ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ అన్నది సూర్యనారాయణమ్మ. ‘‘నిన్ను బాధ పెట్టాలని నేను ఏనాడూ అనుకోనమ్మా! పరిస్థితులు అలా వస్తున్నాయి. అందుకు నన్ను క్షమించమ్మా! ఈ నిఘా, ఈ పరోక్ష కారాగారం మనకొద్దు. మీరు ముందు వెళతారు. నేను నేపాలు యాత్ర తరువాత వస్తాను.’’ అన్నాడు రామరాజు.‘‘చిట్టిబాబూ! నన్ను వదిలిపోకు నాన్నా!’’ అంది దాదాపు ఏడుస్తూ.‘‘వెళ్లనమ్మా! కానీ నేను అక్కడికి వస్తే నీకు కొత్త కష్టాలు తప్పవు. తమ్ముడి చదువూ సాగదు. నా పేరు చెబితే ఏ బడిలో చేర్చుకుంటారు చెప్పు! నేను వెళ్లేది నేపాలు యాత్రకే!’’ అన్నాడామె చేతులు పట్టుకుని.బావురుమందా తల్లి హృదయం. అది విని తమ్ముడు వచ్చాడు గబగబా. తల్లిని ఓదార్చడం రామరాజు వల్ల కాలేదు. తన కారణంగా ఒక అమాయకురాలికి, ఒక సాధారణ గృహిణికి వచ్చిన కష్టంతో అతడికి కన్నీళ్లొచ్చాయి. పరిస్థితుల మీద ఆగ్రహం కలిగింది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పది నిమిషాలకి ఏదో నిశ్చయానికి వచ్చినట్టు లేచి నిలిచిందామె. 6 ‘మీకు కల్పించగలనన్న వాతావరణం నేను కల్పించలేకపోయాను. అందుకు క్షంతవ్యుణ్ణి. పోలీసు నిఘా నేనూహించింది కాదు. సరే, నీ కోరిక మేరకే, నిన్ను ఇంటర్న్మెంట్ నుంచి విడుదల చేస్తున్నాను. నీవు నేపాల్ యాత్రకు వెళ్లు. గండకీ నది నుంచి సాలగ్రామాలు తెచ్చుకోవాలన్న నీ ఆకాంక్షకి నేను అడ్డు చెప్పలేను. చెప్పే హక్కు నాకు లేదు.’ అని చెప్పి అనుమతిపత్రం రాసిచ్చాడు ఫజులుల్లా. ఆ పత్రం ఇస్తూ కళ్లలోకి చూశాడు ఫజులుల్లా ఖాన్. ఆ కళ్లు నిజం చెప్పడంలేదనిపించింది. 7 పైడిపుట్ట వచ్చి మూడు మాసాలు పూర్తవుతున్నాయి అంతే. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్న తన ఆకాంక్ష తల్లి నోటి నుంచి కూడా వినిపించాక తనను ఎవరో నడిపిస్తున్నారన్న భావన కలిగింది రామరాజుకి. ఆ రోజు హఠాత్తుగా విన్న వార్తతో అది మరింత బలపడింది.అడ్డతీగెలకు ఐదు మైళ్ల దూరంలోనే ఉంది తిమ్మాపురం. అక్కడున్న ప్రభుత్వ అతిథి గృహంలో ఫజులుల్లా ఖాన్ జూలై 27న హఠాత్తుగా చనిపోయాడు. ఒక పక్క అలాంటి మనిషి కన్నుమూయడం బాధాకరంగానే ఉంది. మరో పక్క ఇక తను స్వేచ్ఛాజీవి. ఆ విషయం మాత్రం తెలియని ఆనందాన్ని నింపుతోంది. lముందు ఎద్దుల బండి వెళుతోంది. వెనకే రామరాజు గుర్రం మీద అనుసరిస్తున్నాడు. అది చెక్కా లింగం దొర గుర్రాలలో ఒకటి.పృష్ఠం మీద సెగగడ్డ విపరీతంగా బాధ పెడుతోంది మూడురోజుల నుంచి. కొద్దిగా జ్వరం కూడా ఉంది. కానీ ఆ బాధ తల్లి గమనించకుండా జాగ్రత్త పడుతున్నాడు. సత్యనారాయణరాజు మాత్రం బండిలో నిద్రపోతున్నాడు. వేటమామిడి వచ్చింది. గుర్రం దిగి తల్లి దగ్గరకి వచ్చి కాళ్లు రెండూ స్పృశిస్తూ దణ్ణం పెట్టాడు రామరాజు. కంట తడి పెట్టలేదు సూర్యనారాయణమ్మ. ‘‘ఈ తల్లి బతికే ఉందని గుర్తుంచుకో తండ్రీ! క్షేమసమాచారాలు తెలియచేస్తూ ఉండు చాలు!’’ అన్నదామె. కొడుకును కంటి నిండా చూసుకుని మళ్లీ బండెక్కిందామె. అది రాజమండ్రి దిశగా కదిలిపోయింది.రామరాజు గుర్రం వెనుదిరిగింది. రెండు నిమిషాలకే పృష్ఠం మీద కురుపు చితికింది. ఇంతకాలం బాధించిన ఆ సలుపు చేత్తో తీసి పక్కన పెట్టినట్టయింది. 8 ‘కిన్నెరల వాగు దగ్గర!’’ ఆ వచ్చినవాడు చెప్పాడు ఎండు పడాలుకి. ‘‘మొదట గుర్రం నడుముకు అంటుకున్న రక్తాన్ని కడిగాడు. అతడికి ఎడమవైపున నడుం నుంచి కాలి దాకా పంచంతా రక్తమే. అది కూడా కడుగుతున్నాడు. ఏదో గాయం కాబోలు!’’ ఇంకొంచెం వర్ణించాడతడు. ‘‘నడు చూద్దాం!’’ గొంగళి కప్పుకుని ఆ వచ్చినవాడి వెంటే వెళ్లాడు పడాలు. అతడు పడాలు మనిషే. అప్పుడే తెల్లవారుతోంది. వర్షాకాలం కారణంగా నిండుగా పారుతున్న కిన్నెరలవాగు నీళ్లు సంజకెంజాయలో ఎర్రగా ఉన్నాయి. ఆగంతకుడు స్నానం కూడా పూర్తి చేసినట్టున్నాడు. సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నాడు. గుర్తు పట్టలేకపోయాడు ఆ మనిషిని. అడుగులో అడుగు వేసుకుంటూ వాగు గట్టు దాకా వచ్చి నిలబడ్డాడు పడాలు. నెమ్మదిగా అన్నాడు, ‘‘ఎవరు?’’అతడు తిరిగి చూశాడు. వెంటనే మూడుసార్లు దోసిలితో నీళ్లు వదిలి గట్టు మీదకు వచ్చాడు. సరాసరి పడాలు ఎదురుగానే నిలబడి అడిగాడు, ‘‘బాగున్నారా పడాలు గారూ!’’ఒక్క లిప్త ఆలస్యమైనా చటుక్కున గుర్తు పట్టాడు పడాలు, ఆ గొంతు.‘‘స్వామీ! మీరా!? మీరు... మీరు ఇక్కడ....?’’ అన్నాడు పడాలు, రెండు చేతులు జోడించి, విస్మయంగా. ‘‘ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాను. ఎందుకు రావాలో అందుకే వచ్చాను.’’ అన్నాడు రామరాజు, నడుమకు కట్టుకున్న అంగవస్త్రం తీసి పిడుస్తూ. ‘‘ఏదైనా దెబ్బ తగిలిందా స్వామీ! కులాసాగానే ఉన్నారు కదా! రక్తం కడుక్కున్నారట....’’ అన్నాడు ఆందోళనగా పడాలు. తన పొడవాటి జులపాలను పిడిచిన గుడ్డతోనే తుడుచుకుంటూ అన్నాడు రామరాజు. ‘‘అదే పడాలు గారూ! వేధించి వేధించి, అర్ధరాత్రి చితికింది.. వ్రణం. ఎంత హాయిగా ఉందనుకున్నారిప్పుడు. ఆ జ్వరం, ఆ సలుపు అన్నీ పోయాయిప్పుడు.’’ ∙వారం రోజుల తరువాత లింగందొరని ఒక యువకుడు కలసి, తనను శ్రీరామరాజు పంపించాడని చెప్పి, గుర్రాన్నీ, ఒక లేఖనీ అప్పగించాడు. లేఖ తెరిచి చూశాడు లింగందొర. పైడిపుట్ట 14–6–1922 మహారాజశ్రీ దుచ్చర్తి ముఠాదారు శ్రీ చెక్కా లింగం దొరగారికిఅల్లూరి శ్రీరామరాజు వ్రాయు లేఖార్థములునేను నేపాళము వెళ్ల నిశ్చయించితిని. కావున, ఈ సంవత్సరం నాకు పైడిపుట్టలో 50 ఎకరములకు ఇప్పించిన శాశ్వతపు పట్టా మాయమ్మయ్యగారు వెళ్లేటప్పుడు పుస్తకములలో పెట్టుకుని వెళ్లిపోయినారు. నాకా భూమితో ఏ జోక్యము లేదు. మీ ఇష్టం వచ్చినవారికి ఈయవచ్చు. ముందు ఎప్పుడూ నేనా భూమి విషయమై ఏ తగాయిదాయున్నూ చేయను. మీరు నాకిప్పించిన పట్టా నా వద్ద ప్రస్తుతము లేనందున ఈ యుత్తరము వ్రాయడమైనది.చిత్తగించవలెనుశ్రీ అల్లూరి శ్రీరామరాజు‘అసలేంటి ఈ కుర్రోడు?’ అనుకుంటూ ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు లింగందొరకి. నలభై నిమిషాల తరువాత అప్పుడే హఠాత్తుగా మోగింది, కేడీపేటలో వైర్లెస్.‘‘హలో... కొయ్యూరు క్యాంప్... కొయ్యూరు క్యాంప్... ’’ ఎవరో కానిస్టేబుల్ గొంతు.‘‘హలో... హలో... కేడీపేట క్యాంప్. ఏరా బాస్టర్డ్స్! రామరాజుని అరెస్టు చేసేశామని ఒళ్లు తెలియడం లేదా? ఎక్కడ చచ్చారు? ఓవర్!’’ అరిచాడు ఫర్బీస్.‘‘అందర్నీ బయటే కాపలా ఉండమని చెప్పారు మేజర్ దొరవారు.’’ అన్నాడు అవతల కానిస్టేబుల్.‘‘వాడొకడు. ఎవరిమాటా వినడు.’ మనసులోనే అనుకున్నాడు ఫర్బీస్‘‘సరే, నర్సీపట్నం నుంచి ఈవ్లింగ్ చెప్పిన సమాచారం కొయ్యూరు క్యాంప్ అధిపతికి చేరిందా? లేదా?’’ స్పష్టంగా, పట్టిపట్టి అడిగాడు ఫర్బీస్. ‘‘తెలియదు దొర!’’ అన్నాడు అవతల కానిస్టేబుల్. ‘‘గోటూ హెల్! గొంతు పగిలేటట్టు అరిచాడు ఫర్బీస్. ఆరవ అధ్యాయం‘‘మన పోరాటం మొదలైంది!’’ శబరికొండ మీద ప్రకటించాడు రామరాజు. ‘‘తొలి అడుగు వేయడానికి ముందే గుర్తించవలసిన కొన్ని వాస్తవాల గురించి మననం చేసుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం.’’ మళ్లీ రామరాజే అన్నాడు.ఈ మాటతో ఉప్పొంగిపోయారు అక్కడ ఉన్న అరవై డెబ్బయ్ మంది. ఇప్పుడు వాళ్లంతా చూస్తున్న శ్రీరామరాజు, కృష్ణదేవిపేటలో చూసిన ఆ యోగి కాదు. యుద్ధభూమిలో ఆయుధం పట్టి నిలిచిన యోధునిలా కనిపిస్తున్నాడు. 19–8–1922... రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం. ఉదయం రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి అందరితో కలసి పూజలు చేశాడు రామరాజు. వంద కలశాలతో నీళ్లు తెప్పించి అభిషేకం చేయించాడు. చివరిగా పూజ కోసం వచ్చిన పెద్దలనీ, ఉద్యమంలో భాగస్వాములు కాబోతున్నవారినీ ఒకచోట సమావేశపరిచాడు. ఆ కొండ గ్రామం రచ్చబండ దగ్గర కూర్చున్నారంతా. అవసరమైతే ఉపయోగపడతాయని తెచ్చిన ఐదారు లాంతర్లు చప్టాలా ఉన్న పెద్ద రాయి మీద మసక వెలుతురునిస్తున్నాయి. నక్షత్రాలు మసకబారిపోయాయి, ఆ శ్రావణమాసపు వెన్నెల ఆకాశంలో. మనుషులు వినడం సాధ్యంకాని సంగీతమేదో అడవికి వినిపిస్తున్నట్టుంది వెన్నెల. కొద్దిగా అవతల కనిపిస్తున్న ఆ లోయ గుండె నిండా వెండి వెలుతురు బిందువుల కుంభవృష్టి. స్పర్శకు అందని, ఆకృతికి అతీతమైన మహాశిల్పంలా మలిచి అడవి అందాన్ని ఇంకా ఇంకా పెంచుతోంది వెన్నెల. గాం సోదరులు, ఎండు పడాలు, గోకిరి ఎర్రేసు, మోదిగాడు, కణ్ణిగాడు, పనసల కణ్ణయ్య పడాలు, గోలిసింగి సన్యాసి, కాకూరు లచ్చమయ్య, కొర్రాబు లింగయ్య, సెగ్గి ఎర్రయ్య, బోనంగి పండుపడాలు, రీమల సన్యాసి, సుంకరి పోతయ్య, సరిబాల పరదేశి, కాకూరు గంగడు, కాకూరి బాలయ్య, కొటికల బాలయ్య ... ఎందరో రామరాజు ఇంకా ఏం చెబుతాడోనని ఎదురు చూస్తున్నారు. నిశ్చలమైన స్వరంతో చెబుతున్నాడు రామరాజు. ‘‘ఇంకా మిన్నకుంటే మహా ద్రోహమే అవుతుంది. గండకీ నదిలో సాలగ్రామాల కోసం నేపాళం వెళతానన్న మీరు ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమం ఎందుకు ఆరంభిస్తున్నారు? అని అడిగారు కూడా లక్ష్మయ్య గారు, ఉదయం పూజ వేళ. ఈ పరిస్థితులలో భారతీయుడన్నవాడు తిరుగుబాటు చేయకుండా ఉంటాడా?! ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం?! తిరగబడకపోయినా నీ నేలలో నీవు తిరుగుబాటుదారుడవే అవుతున్నావు. నీ ఆకలికేక వాళ్ల దృష్టిలో అలజడి కోసం నినాదం. ఇంక తిరుగుబాటుకు వెనకడుగెందుకు? పోరాటం భుజాలకెత్తుకుని పుట్టిన తరం మనది. ‘‘ఆకలితో, భయంతో చచ్చిపోవడం ఎందుకు? ధైర్యంగా ఉద్యమమే చేద్దాం! మన ఉనికిని కాపాడుకుందాం! ఉద్యమం అంటే భవ్యమైన భవిష్యత్తును గర్భంలో మోస్తున్న సంక్షుభిత వర్తమానమే. ‘‘ఎంతో రక్తపాతం తరువాత మళ్లీ సాహసించి ఇంకో పోరుకు సిద్ధమవుతున్న మన్యం చాలా విషయాలు గమనించాలి. నిన్నటి లాగరాయి అలజడి సమయంలో ఏం జరిగిందో, చివరికి ఏమైందో కూడా తెలుసు. అది గుర్తుకు తెచ్చుకుంటూ, రేపు మనం ఎలా అడుగేయాలో నేర్చుకుందాం. అంతా కలసి అడుగులో అడుగు వేయాలి. అంతా కలసి గొంతు విప్పాలి. అందుకే మీ గొంతులు గంధకపు గనులు కావాలి. మీ గుండెల్లో, గొంతుల్లో తరతరాల నుంచి గూడుకట్టుకుని ఉన్న మౌనాన్ని కొండలలో వదిలి, కొండగాలితో మీ ఊపిరి తిత్తులను నింపుకోండి. మనందరి ఉమ్మడి శ్వాసే ఉద్యమ రూపం దాల్చాలి. ‘‘మనం ఆరంభించే ఈ కొత్త ఉద్యమంలో పాల్గొనేవారు కొన్ని నియమాలు పాటించాలి. అవి చెబుతాను. బ్రహ్మచర్యం పాటించాలి. దుర్వ్యసనాలు వదలాలి. స్త్రీలను తల్లుల్లా చూడాలి. ఇది ప్రజల కోసం ఉద్యమం. ఉద్యమకారుల పోషణ బాధ్యత ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవాలి. ఇందులో బలవంతం మాత్రం లేదు.’’ఒక్క క్షణం ఆగాడు రామరాజు.‘‘సామీ! బేస్టీను అనే రాక్షసుడి కతేమిటి?’’ అడిగాడు కొటికల బాలయ్య, ఇక ఉండలేనట్టు.ఆ గొంతు నుంచే వినిపించినా, మౌనంగా ఉన్న చాలా మంది పెదవుల మీద ఉన్నదీ అదే ప్రశ్న. ‘‘మీ ఆక్రోశం అర్థమైంది. బాస్టియన్ అధికార మదం గురించి నాకూ తెలుసు. కానీ ఒక ఉద్యోగి చేసిన దుర్మార్గాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం మనం ఉద్యమం మొదలుపెట్టడం లేదు. ఏ ఉద్యోగినైనా చంపడం ఏమంత కష్టం? కానీ దానివల్ల ప్రయోజనం ఎంత? ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో నా పినతండ్రి ఓ ఉద్యోగి. వారి దృష్టిలో నేను రాజద్రోహిని. మేమిద్దరం ఎంత ద్వేషించుకున్నా, మాలో ప్రవహించే ఒకే రక్తం మాటేమిటి? అలాగే భారతీయులంతా. కానీ నేను ఒక చెంప కొడితే మరో చెంప చూపమని మాత్రం చెప్పడం లేదు. ఆయుధం పట్టమంటున్నాను. కానీ మన చేతి ఆయుధం ప్రభుత్వం పంచన చేరిన భారతీయులని శత్రువులుగా చూస్తూ, వారి మీద గురిపెట్టడానికి కాదు. మనం ఏ కోశానా భారతీయుడన్నవాడిని ద్వేషించం. మన శత్రువు తెల్లవాడు.’’ వివరించాడు రామరాజు.ఎవరూ మాట్లాడలేదు. రెండు రోజుల తరువాత కలుసుకోవాలని నిర్ణయించి అంతా వెళ్లిపోయారు.ఆ ఊరి మునసబు ఇంటి దగ్గర దిగబెట్టిన గంతన్నతో అన్నాడు రామరాజు. ‘‘బాస్టియన్ రోడ్డు పనిలో ఎంత అమానుషంగా ప్రవర్తించాడో నాకూ తెలుసు. ఇప్పుడు ఆ రోడ్డు ఉద్యమానికి బాటలు పరిచింది. ఇలాంటి సమయంలో ఆ బాస్టియన్ అనే వాడిని చంపేస్తే మనవాళ్ల ఆవేశం ఇక నిలబడదని నేను చెప్పగలను. ఆవేశం చల్లారితే ఇక ఉద్యమం ఎక్కడిది?’’ అన్నాడు రామరాజు. ‘‘సత్యమే చెప్పారు. సెలవు.’’ అని వెళ్లిపోయాడు గంతన్న.ఒంటరిగా కూర్చున్నాడు రామరాజు. నిద్ర రావడం లేదు. తనే కాదు, అక్కడకొచ్చిన వారంతా కూడా నిద్రకు దూరమయ్యారు.ఆ రోడ్డు వారి కళ్లల్లో కదలాడుతోంది–పచ్చటి మన్యం మీద ఎప్పటికీ చెరగని నెత్తుటి వాక్యంలా. రోదనను నింపుకున్న ఆ చిక్కటి ఎర్రధూళి గానం చేస్తోంది – కొండవాళ్ల గుండెల్లో మానని గాయం గాథ.... -
ఆకుపచ్చ సూర్యోదయం
విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ పట్టణాలలో ప్రసంగాలు ఇచ్చి రాజమండ్రి వచ్చిన బిపిన్బాబు ఆరు రోజులు ఉన్నారు. ఆ పట్టణాలలో మాదిరిగానే ఇక్కడ కూడా వేర్వేరు చోట్ల సభలు ఏర్పాటయ్యాయి. బ్రహ్మ సమాజం గురించి, స్వదేశీ ఉద్యమం గురించి, విదేశీ వస్తు బహిష్కరణ గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉర్రూతలూగిపోయారు జనం. ఆ రోజు ఆఖరి సభ. ఎండ తీవ్రత తగ్గి గోదావరి మీద నుంచి చల్లని గాలి వీచడం మొదలైంది. వేసవి కాబట్టి చిన్న చిన్న మేటలు వేసింది గోదావరి. తీరానికి రెండు ఫర్లాంగుల ఇవతల ఇన్నీస్పేటలోనే, నదికేసి ముఖం పెట్టి నిర్మించారు విశాలమైన వేదిక. కౌతా రామశాస్త్రి వేదిక మీద నిలబడి ప్రార్థనా గీతం పాడుతుండగా శ్రీరామరాజు చేయి పట్టుకుని, సభా వేదికకు దగ్గరగా రాగలిగాడు వెంకటరామరాజు. ‘‘వందేమాతరం... మాతరం... సుజలాం సుఫలాం.. మాతరం...’’బిపిన్బాబు, ముట్నూరి కృష్ణారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గున్నేశ్వరరావు ఇంకా ఎందరో వేదిక మీద ఉన్నారు. ముట్నూరి కృష్ణారావుగారు పరిచయం చేసిన తరువాత ఉపన్యసించడం కోసం బిపిన్చంద్రపాల్ లేచి నిలబడ్డారు. ఆ వెంటనే బాలభారతి సమితి సభ్యుడొకరు చిలకమర్తి వారిని చేయి పట్టుకుని ఆయన పక్కన నిలిపాడు. ‘‘ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారు. ఇంకో రెండు పాటలు పాడతారా?’’అమాయకంగా అడిగాడు శ్రీరామరాజు.‘‘లేదు. పాల్గారు ఇంగ్లీషులో మాట్లాడితే, అదే మనకి తెలుగులో చెబుతారు పంతులుగారు.’’ చెప్పాడు వెంకటరామరాజు.‘‘ఇంత సుందరమైన గోదావరి ఒడ్డున ఈ సాయంకాలం నేను చెప్పేది వినడానికి దయతో వచ్చిన రాజమండ్రి పౌరులారా! వందేమాతరం!’’ అంటూ ఉపన్యాసం ప్రారంభించారు పాల్. వెంటనే చెవియొగ్గి వినడం మొదలుపెట్టారు– అన్ని వేల మంది కూడా. ‘‘మీరంతా చూపిస్తున్న ఈ ఆదరణ, ఇస్తున్న ఈ గౌరవం ఒక వ్యక్తిది కాదు. ఒక దృక్పథానిది. ఒక ఆలోచనది. ఒక ఆచరణది. అవే – స్వదేశీ, జాతీయ విద్య, విదేశీ వస్తు బహిష్కరణ.... భారతజాతి ముక్తకంఠంతో నినదించగలదన్న గొప్ప సత్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి తెలిసేటట్టు చేస్తున్న శ్రేణుల ముందు నిలబడి మాట్లాడుతున్నానని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ‘‘బెంగాల్ను విభజిస్తున్నట్టు 1905 ఆగస్ట్ 7న కర్జన్ ప్రకటించగానే మేమంతా– బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, అరవింద్ ఘోష్, లాలా లజపతిరాయ్, చిత్తరంజన్ దాస్– యాభైవేల మందితో కలసి గంగా స్నానం చేసి ఈ దుశ్చర్యను ఆపుతామని ప్రతిజ్ఞ చేశాం. మన జాతి మహాకవి రవీంద్రనాథ్ టాగోర్ ఇప్పుడు ఈ మహోద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న ఆ గీతానికి బాణీ కట్టారు. ఆ క్షణాలు ఇప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి– ఈ పవిత్ర గోదావరి నదినీ, ఈ జనసాగరాన్నీ చూస్తుంటే.’’ బెంగాల్ యాస కూడా ఆయన ఉపన్యాసానికి ఒక సొగసును తెచ్చింది. ఉపన్యాసంలోని ప్రతి అంశాన్ని అంతే కవితాత్మకంగా అనువదిస్తూనే పాల్గారి ఉపన్యాస నైపుణ్యాన్ని ఆస్వాదించారు చిలకమర్తి. తెలియకుండానే రెండు గంటలు గడిచిపోయాయి.చీకట్లు ముసురుకుంటున్నాయి. వేదిక మీద సిద్ధంగా ఉంచిన నాలుగు నిలువెత్తు దీపపు సెమ్మెలలోని ఒత్తులను ఎవరో వచ్చి వెలిగించారు. పైన వెన్నెల కురిపించడానికి చంద్రుడు తొందరపడుతున్నాడు.జాతీయ విద్య అవసరం, విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమాలను ఒక ఉద్యమంగా నిర్వహించవలసిన అవసరం గురించి చివరిగా చెప్పారు బిపిన్బాబు. వినమ్రంగా నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు.చప్పట్లు మారుమోగాయి. ఇంతలోనే తన గొంతు సవరించుకున్నారు చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు. కొన్ని సెకన్ల తరువాత మళ్లీ నిశ్శబ్దం. ‘‘ఈ భరతఖండమే ఒక బందిఖానా అని నేను రాశాను. కాదు, కాదు... అమ్మవారే నా చేత ఒక కఠిన వాస్తవాన్ని పలికించింది. బిపిన్బాబును చూస్తుంటే జైలులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఝంఝామారుతం గుర్తుకు వస్తోంది. ఈ బందిఖానాలోనిదే మరో బందిఖానాలోకి ఈ ఝంఝామారుతాన్ని మళ్లించకుండా ఆంగ్లజాతి ఉండలేదు. సోదరులారా! ఇంగ్లిష్ జాతి భారతదేశాన్ని డొల్ల చేస్తోంది. కానీ తెల్లజాతిది న్యాయబుద్ధి అని మనలో చాలమందికి ఇప్పటికీ ఓ గుడ్డినమ్మకం. వాళ్లదా న్యాయం? వనరులు ఇక్కడివి. వస్తూత్పత్తి అక్కడ. అందుకు ఇచ్చే వేతనాలూ, కూలీ డబ్బులూ అక్కడి వాళ్లకే. వాటి అమ్మకాలు మాత్రం ఇక్కడ. లాభాలు మాత్రం మళ్లీ అక్కడికే. ఆవు మనది. గ్రాసమూ మనదే. పాలు మాత్రం వాళ్లకి!’’ అంటూనే ఒక పద్యం అందుకున్నారాయన, రాగయుక్తంగా: ‘‘భరతఖండంబు చక్కని పాడియావు హిందువులెల్ల లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి!’’ చిన్నగా రాగం తీసి, రెండు చేతులు జోడించారు లక్ష్మీనరసింహం ‘సెలవు’ అన్నట్టు. 2 జైలు ప్రాంగణమంతా చిమ్మచీకటి, నిశ్శబ్దం. సెల్ మధ్యలో రామరాజు, నిద్రకు దూరమై. దూరం నుంచి గంట వినిపించింది. అప్పుడర్థమైంది– వేకువ ఐదుగంటలైంది. ఖైదీలంతా స్నానాదికాల పనిలో పడ్డారు.తెచ్చుకున్న చిన్న సంచిలో నుంచి కుంకం తీసి బొట్టు పెట్టుకుంటూ ఉంటే, పెద్ద సీమవెండి గ్లాసుతో పాలు పట్టుకొచ్చి వినయంగా నిలబడ్డాడు, ఒక ఉద్యోగి.కింద పెడుతూనే అన్నాడు, ‘‘బాబుగారూ! తమ కోసం కృష్ణదేవిపేట నుంచి ఎవరో వచ్చారు. ఇక్కడికి తీసుకురమ్మంటారా? ’’ ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు రామరాజు. ‘‘నేనే వెళతాను.’’ చెట్టు కింద కనిపించారు ఆ ఇద్దరు. చర్నాకోల చంకలో పెట్టుకుని జైలు ప్రాంగణాన్ని వింతగా పరికిస్తున్నాడు నారాయణమూర్తి. చెట్టు మొదలు చుట్టూ గుండ్రంగా కట్టిన అరుగును ఆనుకుని, తలొంచుకుని నిలబడి ఉన్నారు, చేతులు కట్టుకుని– భాస్కరుడు.‘‘నమస్కారం అన్నయ్యగారు!’’ దగ్గరగా వెళ్లి పలకరించాడు రామరాజు.‘‘నమస్కారం. రాజుగారూ!’’ ప్రతి నమస్కారం చేసి, ఒక్క నిమిషం పాటు మాట్లాడలేకపోయాడు భాస్కరుడు. తరువాత కొంచెం బాధగానే అన్నాడాయన, ‘‘మిమ్మల్ని ఈ స్థితిలో చూడవలసి వస్తుందని అనుకోలేదు. ఘటన కాబోలు!’’ అన్నాడు భాస్కరుడు గారు. కొండవాళ్ల కోసం ఫితూరీ లేవదీయబోతున్నాడని శ్రీరామరాజు మీద వదంతులు వచ్చినప్పటి నుంచి భాస్కరుడి గారి మనసులో కల్లోలం రేగుతూనే ఉంది. ‘‘ఇంకో రెండు రోజులలో వదిలి పెడతారనే అనుకుంటున్నాను.’’ అన్నాడు రామరాజు.‘‘శుభం. కానీ మీ అమ్మగారు, మా అమ్మ చాలా కలవరపడుతున్నారు.’’ అన్నాడు భాస్కరుడు.ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. తరువాత అడిగాడు రామరాజు. ‘‘ఏమిటి విశేషాలు!’’ ‘‘మీరు విడుదలవుతున్నట్టు శుభవార్త చెప్పారు గానీ, నేను మాత్రం మీకు ఎంత మాత్రం రుచించని, ఇంకా చెప్పాలంటే, అమంగళమైన వార్తే తెచ్చాను.’’ అన్నారు భాస్కరుడు. ‘ఏమిట’న్నట్టు చూశాడు రామరాజు. ‘‘మీరు జైలుకు వచ్చాకా చాలా పరిణామాలు జరిగిపోయాయి. ఫిబ్రవరి మూడో తేదీన మిమ్మల్ని తీసుకువచ్చారు కదా! ఆ రోజు సాయంత్రమే మాకు ఫిబ్రవరి ఒకటో తేదీ ఆంధ్రపత్రిక చేరింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్టు చేసిన వారందరినీ వారంలోగా విడుదల చేయకపోతే పన్నుల నిరాకరణ, శాసనోల్లంఘన మొదలవుతుందని గాంధీ ప్రభుత్వానికి తుది హెచ్చరిక ఇచ్చారన్న వార్త చదివాం.’’ ‘‘మంచి మలుపే కదా అన్నయ్యగారూ!’’ అన్నాడు రామరాజు. ‘‘కానీ ఫిబ్రవరి పన్నెండో తేదీ ఆంధ్రపత్రిక, రెండు రోజులు ఆలస్యంగా నిన్ననే వచ్చింది. అందులో వార్త చదివి, ఇక మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఇవాళ వేకువనే బండి కట్టుకుని వచ్చాం!’’ అన్నారాయన.‘‘పన్నెండో తేదీన ఏమైంది?’’ అడిగాడు రామరాజు.‘‘గాంధీగారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు.’’‘‘ఏమిటి?’’ తాను విన్నది నిజమేనా అన్నట్టు పలికాడు రామరాజు. ఏదో శూన్యంలోకి తను, తనలా ఎందరో వెళుతున్న భావన.‘‘మరి పన్నుల నిరాకరణ, శాసనోల్లంఘన...!’’ వాటి సంగతి ఏమిటన్నట్టు గొప్ప అశాంతితో అడిగాడు రామరాజు, ఒక నిమిషం తరువాత. ‘‘సహాయ నిరాకరణోద్యమం నిలిచిపోయిందంటే, అవి రెండు మొదలుకావడం లేదనే కదా!’’ అన్నాడు భాస్కరుడు.తుపాను మొదలవుతోంది రామరాజు మనసులో.‘‘ఎందుకు నిలిపివేశారాయన?’’ ఆ మాటలో కొంచెం అసహనం, ఇంకెంతో బాధ.‘‘ఆయన చూపించిన అహింసా పథం నుంచి ఉద్యమం పక్కకు తప్పుకుందట!’’‘‘అదెలా!’’‘‘చౌరీచౌరా మూకుమ్మడి హత్యాకాండ. అది గాంధీని కలచివేసిందట.’’ అంటూ ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తల వివరాలు ఇచ్చారు భాస్కరుడు. 3 మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతం. అదే ఆలోచిస్తున్నాడు రామరాజు, సెల్లో దిగాలుగా. భాస్కరుడుగారు తెచ్చిన వివరాలు కళ్ల ముందు కదులుతున్నాయి.ఉద్యమం చేస్తే చర్యలు తప్పవని ప్రకటించాడు వైస్రాయ్ రీడింగ్. ‘సూరత్ జిల్లా బార్డోలీలో పన్నుల నిరాకరణోద్యమం ఆరంభిస్తున్నాం.’ అంటూ ఫిబ్రవరి 1, 1922న వైస్రాయ్కి రాశారు గాంధీగారు. సరిగ్గా మూడోరోజునే, అంటే ఫిబ్రవరి 4న చౌరీచౌరా ఘటన జరిగింది. మధ్య పరగణాలలో గోరఖ్పూర్ దగ్గరే ఉంది ఆ చిన్నపట్టణం చౌరీచౌరా. మద్యం అమ్మకాన్ని నిరసిస్తూనూ, పెరిగిన ధరలు తగ్గించాలని కోరుతూనూ ధర్నా చేశారు సత్యాగ్రహులు. పోలీసులు వచ్చారు. గుంపు చెదరగొట్టడం పేరుతో ప్రజలను చావగొట్టారు.ఇందుకు నిరసనగా సత్యాగ్రహులు పోలీసు స్టేషన్ ముందు ధర్నా ప్రారంభించారు. ఈసారి కాల్పులు జరిపారు పోలీసులు. జనం తిరగబడ్డారు. పోలీసులు వెనక్కితగ్గి పోలీసు స్టేషన్లోనే దూరి తలుపులు బిడాయించుకున్నారు. కడుపు మండిపోయి ఉన్న సత్యాగ్రహులు స్టేషన్ భవనానికి నిప్పు పెట్టారు. 22 మంది పోలీసులు చనిపోయారు. భారతదేశం నాగరికమైన పంథాలో సత్యాగ్రహం చేసే స్థితికి చేరలేదు. కాబట్టి సహాయ నిరాకరణోద్యమం నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు గాంధీగారు. చౌరీచౌరాలో సత్యాగ్రహుల కారణంగా జరిగిన హింసాకాండకు పరిహారంగా ఐదు రోజుల నిరాహార దీక్ష చేశారు గాంధీగారు. దేశం నిర్ఘాంత పోయింది. అశాంతిగా ఉంది రామరాజుకి ఇక జైలు గోడల మధ్య ఉండడం అసాధ్యమనిపించింది తొలిసారి.కాదు, వాటిని బద్దలుకొట్టాలని అనిపిస్తోంది. అశాంతి.... గుండె నిండా అశాం 4 మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతం. రామరాజు ఉన్న సెల్ దగ్గరకి వచ్చి చెప్పాడు సెంట్రీ, ‘‘అయ్యా! తమర్ని పోలవరం డిప్యూటీ తహసీల్దార్ దొరవారు పిలుచుకురమ్మన్నారు.’’ సెంట్రీ వెంటరాగా జైలర్ గదివైపు నడిచాడు రామరాజు– అన్యమనస్కంగానే.రో పదడుగుల దూరంలో ఉంది ఆ గది. ఆ రాతి కట్టడంలో ప్రతిధ్వనిస్తూ, అక్కడికి కూడా వినిపిస్తోంది ఖళ్ ఖళ్ మంటూ దగ్గు. ఒళ్లు జలదరిస్తోంది. లోపల ఒక్కరే ఓ కుర్చీలో కూర్చుని ఉన్నారు ఫజులుల్లా ఖాన్, నోటికి అడ్డంగా చేయి పెట్టుకుని దగ్గుతూ.గుమ్మం దగ్గర అలికిడికి ఇటు తిరిగిన ఫజులుల్లా లోపలికి రమ్మన్నట్టు సైగ చేశాడు, ఇద్దర్నీ, దగ్గుతూనే. చాలా తీవ్రమైన దగ్గు.. సెంట్రీ గబగబా వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చాడు.ఒక నిమిషం తరువాత గాని దగ్గు తగ్గలేదు. అప్పుడు నీళ్లు తాగారాయన. ఐదు నిమిషాల తరువాత తేరుకున్నారు. ‘‘నాలుగు రోజుల నుంచి ఏమీ బాగుండడం లేదు రామరాజు గారూ! దగ్గూ, ఆయాసం. అన్నట్టు మీరు వైద్యం చేస్తారట. నాకేదైనా మంచి మందు చెప్పకూడదు!’’ అన్నారు నవ్వుతూ. మాటలో ఇంకా ఆయాసం ఉంది.‘దానికేం భాగ్యం తహసీల్దారు గారూ! కానీ మాదంతా మూలికా వైద్యం.’’ అన్నాడు రామరాజు.‘‘అది నా ఒంటికి సరిపడదులెండి! మాదంతా ఇంగ్లిషు వైద్యం’’ అన్నారాయన, చివరి రెండు పదాలు ఒత్తి పలుకుతూ. ఖాళీ నీళ్ల గ్లాసు సెంట్రీకి అందిస్తూ, ‘‘ఇంక నీవు వెళ్లు!’’ అన్నారాయన.‘‘రామరాజు గారూ! మీరొక అర్జీ రాసివ్వండి. ఇలాగే!’’అంటూ కూడా తెచ్చుకున్న బ్యాగులో నుంచి కాగితాల బొత్తి ఒకటి తీసి రామరాజుకు ఇచ్చాడాయన.అదో దరఖాస్తు.తాను పేదవాడిననీ, సేద్యం చేసుకుని ప్రశాంతంగా బతకదలిచాననీ, అందుకు కొంత భూమి కేటాయించవలసిందనీ ఏజెన్సీ కమిషనర్కు పెట్టుకునే అర్జీ నమూనా. చదివి ఇచ్చేశాడు రామరాజు. ‘‘ఇది మీకు రుచించేది కాదని తెలుసు. నిజమే. మీ మీద నాన్ కోఆపరేటర్ ఆరోపణలు వచ్చాయి. కానీ ఒక్క రుజువూ దొరకలేదు. అయినా మిమ్మల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఊరికే వదిలేస్తుందని అనుకోకండి. మిమ్మల్ని వదలకుండా నిఘా వేసి ఉంచే బాధ్యత ప్రభుత్వం ఎవరికి అప్పగించిందో తెలుసా? నాకే.’’ అంటూ నవ్వారాయన. ‘‘పైడిపుట్ట అని, వినే ఉంటారు మీరు. అడ్డతీగెలకి మూడు మైళ్లు. అక్కడ మీకు మంచి భూమి ఇప్పిస్తున్నాను. రోజూ అడ్డతీగెల పోలీసు స్టేషన్లో సంతకం చేయడం, సేద్యం చేసుకోవడం. ఈ లక్ష్మణ రేఖ తప్పితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. దీనిని బెదిరింపుగా తీసుకోకండి. మీ మేలుకోరి నేను చేస్తున్నపని.’’ అన్నాడు ఫజులుల్లా. తనకు తెలియకుండానే పెద్దగా నిట్టూర్చాడు రామరాజు. రెండు నిమిషాలు మౌనం. అప్పుడు అన్నాడు ఫజులుల్లా. ‘‘రామరాజుగారు! మీ బాధ నాకు అర్థమవుతోంది. ఈ పురాతన దేశం ఇప్పటికైనా ఒక మార్పుకు సిద్ధపడుతోంది. మీ ఆవేశం మీద నీళ్లు చల్లడం నా ఉద్దేశం కాదు. బిపిన్చంద్రపాల్ రాజమండ్రి వచ్చిన తరువాత కందుకూరి వీరేశలింగం అంతటివాడు చెప్పినట్టు, ఇవాళ దేశంలో పెల్లుబుకుతున్న ఆవేశాన్ని ఆకతాయి మూకల అల్లరిగా నేను చెప్పను. మీ ఆవేశాన్ని సమయం వచ్చినప్పుడు వినియోగించండి! అప్పటిదాకా మౌనం వహించండి! ’’రెండు నిమిషాలు మౌన. ‘‘రామరాజుగారు! మీ క్షేమం కోరేవాడిని. అర్జీ రాయండి!’’ గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్లీ ఆయనే అన్నారు.‘‘బాబూ రామరాజు! అసలు ఈ తరానికీ, ఈ వయసు వారికీ ఈ కాలం ఏదో ప్రత్యేకతను ప్రసాదించింది. వీళ్ల చైతన్యం వేరు. మీరు మోహన్దాస్ గాంధీ నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారో నాకు తెలియదు. అహింస. ఈ మాట విన్న తరువాత దేశంలో వచ్చిన చైతన్యం వైవిధ్యంగా ఉంది. ఇందుకు ఒక్క రుజువు చూపిస్తాను. భగవంతుyì ని ఊరేగించే రథాలలో గాంధీగారి బొమ్మ పెట్టమని అడుగుతున్నారు ఉద్యమకారులు. ఈ విశాల దేశంలో మారుమూల ప్రాంతాలు ఏవీ అని చూసుకుని ఒక పది కుగ్రామాలు ఎంచుకుంటే, అందులో అంతర్వేది ఒకటి. ఆ మారుమూల సముద్రతీర గ్రామంలో ఏం జరిగిందో తెలుసా? ది హిందూ లాంటి పేపరు ఆ వార్తని కవర్ చేసింది. చదువుతుంటే మీరే గుర్తుకొచ్చారు.’’ బ్యాగులో నుంచి తీసి ఇచ్చాడు మడత పెట్టి ఉన్న ఆ న్యూస్పేపర్.లోపల పేజీలలో ఒక చోట ఉంది వార్త. ఫిబ్రవరి 13, 1922 నాటి సంచిక అది. వార్త మాత్రం పదో తేదీ డేట్లైన్తో ఉంది.‘రథం లాగడానికి ప్రజలు ఎందుకు నిరాకరించారు? ’ స్వకీయ విలేకరి ధవళేశ్వరం, ఫిబ్రవరి 10: అంతర్వేది పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన ఒక గ్రాడ్యుయేట్ టీచర్ ఈ విలేకరికి చెప్పిన సమాచారమిది. ఏటా ఏకాదశి రోజున అక్కడ జరిగే రథోత్సవం ఈ ఏడు జరగలేదు. అంతర్వేది మహా పుణ్యక్షేత్రంలో రథం కదలకుండా నిలిచిపోయిన ఏకైక సంవత్సరం చరిత్రలో బహుశా ఇదే. గత ఏడాది ప్రజల అభ్యర్థనను అధికారులు మన్నించారు. గాంధీ చిత్రపటాన్ని అలంకరించి రథోత్సవం జరుపుకోవడానికి అనుమతించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ ఉపా«ధ్యాయుడు చెప్పిన మరో అంశం– ఈ ఉత్సవానికీ, రథం మీద దేవునితో పాటు గాంధీ పటం కూడా ఉండాలన్న ఆశయానికీ, కాంగ్రెస్ వాదులకీ ఏమీ సంబంధం లేదు. ఒక మతానికి చెందిన ఈ ఉత్సవంలో రథం లాగడం గురించి కాంగ్రెస్ కార్యకర్తలు జోక్యం చేసుకోరాదని పార్టీ తీర్మానం చేసింది. ఏది ఏమైనా, తాము కోరుకున్నట్టు గాంధీ చిత్రపటాన్ని రథం మీద అలంకరించడానికి అధికారులు నిరాకరించడంతో, రథాన్ని లాగడానికి భక్తులు కూడా నిరాకరించారు. పోలీసులు, సహాయవాదులు రథం లాగ వలసిందని ప్రజలను ముందుకు నెడుతూ బలవంత పెట్టగా ఘర్షణ కూడా జరిగింది. ఎంఎల్సీ దివాన్ బహదూర్ డి. శేషగిరిరావు మాటను కూడా భక్తులు పట్టించుకోలేదు.’’వార్త చదవడం ముగియడంతోనే ఆలోచనలో పడినట్టు కనిపించాడు రామరాజు.‘‘రామరాజు! గమనించవలసిన అంశం ఏమిటంటే– చిత్రపటం అలంకరించనందుకు అంతర్వేది రథం ఆగిపోవడం కాదు. గాంధీని ముందు పెట్టుకుని స్వరాజ్య ఉద్యమం జగన్నాథ రథంలా కదలడం. ఎమ్కే గాంధీ ఈ దేశ ప్రజలను ఏకం చేస్తున్నాడు. విను, అతడి మార్గం మంచిది.’’ అన్నాడు ఫజులుల్లాఖాన్. రాజమండ్రికి దిగువన ఉన్న ధవళేశ్వరం పేరు వినగానే రెండు పాయలుగా చీలే గోదావరి గుర్తుకు వస్తున్నది రామరాజుకి. ఇప్పుడూ అదే గుర్తుకు వస్తోంది. అయితే ఇది వేరు. గోదావరి పాయలకు బదులు ఒక ఆలోచనా ధార చీలి ప్రవహిస్తున్నట్టు కనిపిస్తోంది. గాంధీగారు చూపించినదే మార్గమా? అదొక్కటే పోరాటమా? వేరే మార్గాలు కూడా ఉన్నాయి. ఇది నిజం.పెన్ను, కాగితం తీసి ఎదురుగా పెట్టాడు ఖాన్. క్షణం తరువాత కలం చేతిలోకి తీసుకున్నాడు రామరాజు. -
ఆకుపచ్చ సూర్యోదయం
గూడెం తాలూకా కార్యాలయం. క్యాంప్: కృష్ణదేవిపేట., తేదీ 29–1–1922. రంప అసిస్టెంట్ కమిషనర్ వారి సముఖమునకు! సరైన ఆధారాలు లేకున్నా అల్లూరి రామరాజు తిరుగుబాటు లేవదీయనున్నాడని పుకార్లు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీనితో కృష్ణదేవిపేట మొత్తం రాత్రంతా పోలీస్స్టేషన్ దగ్గరే గడిపింది. 28వ తేదీ రాత్రి కూడా ప్రజలు పోలీస్స్టేషన్ దగ్గర లేదా పొలాలలో పడుకున్నారు. ఈ ఉదయం నేను ఎ. రామరాజును ఇంటర్వూ్య చేశాను. అయితే తాను సహయ నిరాకరణవాదిని కానని ఆయన చెప్పాడు. తాగుడుకు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం చేస్తున్నానని అన్నాడు. ఇవన్నీ వదంతులేనని ఈ రగడ సద్దుమణిగే దాకా తాను నర్సీపట్నం వెళ్లిపోతానని కూడా చెప్పాడు. ఇప్పటి పరిస్థితినిబట్టి పెద్ద ప్రమాదమేదీ ఉందని చెప్పను. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోలీసుల సాయంతో ఏ పరిణామాన్నయినా ఎదుర్కొనగలనని మనవి చేస్తున్నాను. – అల్ఫ్ బాస్టియన్. ఆ స్టేట్మెంట్ ఫజులుల్లాకి ఇస్తూ అన్నాడు స్వైర్, ‘‘నువ్వు కూడా ఇలా రాస్తావని అనుకోలేదు.’’ ‘‘ఆ మాటేమోగానీ, మీరు ఇలా తిరుగు టపాలోనే విచారణకి వస్తారని నేనూ ఊహించలేదు.’’ అన్నాడు స్టీవర్ట్.‘‘చూడు స్టీవర్ట్! మునసబు పంపిన నివేదికలో ఫిబ్రవరి ఒకటో తేదీన ఫితూరీ మొదలవుతోందంటూ వదంతి పుట్టిందని రాశాడు. ఆ ఫిబ్రవరి ఒకటో తేదీనే ఎం.కె.గాంధీ తన సహాయ నిరాకరణోద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు చెప్పాడు గుర్తులేదా?. ఈ రెండింటికీ అంతుపట్టని సంబంధం ఉందేమోనని అనుమానించాను.’’ అంటూ మనసులో మాట చెప్పాడు స్వైర్, గొంతు తగ్గించి.‘‘నిజమే సుమా!’’ అన్నాడు స్టీవర్ట్. ‘‘ఒక్కటి గుర్తుంచుకోండి. ఫజులుల్లాఖాన్, బాస్టియన్– మీరు కూడా వినండి. అవసరమైతే, ఇంకో ఫిర్యాదు ఏది వచ్చినా, కృష్ణదేవిపేటలో ఏ నినాదం వినిపించినా ఈ యువకుడిని మరుక్షణం నర్సీపట్నం పంపండి!’’ కటువుగానే అన్నాడు స్వైర్. 9 ఎక్కడ నుంచి వచ్చిందో ఆ ఆవేశం– మళ్లీ భారతదేశమంతా ‘గాంధీజీకి జై’ అంటూ ముక్త కంఠంతో నినదించింది. కృష్ణదేవిపేటలో కూడా ఊహించని పరిణామం. ఫిబ్రవరి 1, 1922.. ఆ మధ్యాహ్నానికే నర్సీపట్నం నుంచి జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని ఆ రోజు నుంచి మరింత ఉధృతం చేయబోతున్నట్టు గాంధీగారు ముందుగా చేసిన ప్రకటనకు తగ్గట్టే ఉంది దేశంలో వేడి. ‘‘తూర్పు కనుమల వాకిలిలో గాంధీగారి సహాయ నిరాకరణోద్యమనాదం వినిపించడం అపూర్వమే! ఆ ఉద్యమం ఇంత దూరం వచ్చిందంటే, గాంధీగారు దేశప్రజల హృదయాలకు ఎంత చేరువయ్యారో కదా!’’ దాదాపు వివశత్వంతో అన్నాడు శ్రీరామరాజు, తన పక్కనే నిలబడి ఉన్న అల్లిపూడి కరణం రాళ్లపల్లి కేశన్నగారితో. ఆయన కరిణీకం వదిలేసి ఈ ప్రాంతంలో ఉద్యమం నడుపుతున్నాడు. నర్సీపట్నం నుంచి, ఇతర గ్రామాల నుంచి వచ్చిన జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు అరవై మందికి పైగానే ఉన్నారు. అంతా తెల్లటి ఖద్దరు దుస్తులలో ఉన్నారు. భుజాల మీద జాతీయ కాంగ్రెస్ త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. వారపు సంత జరిగే చోట ఏర్పాటు చేసిన బహిరంగ సభ అప్పుడే పూర్తయింది. సభాస్థలి నుంచి వారంతా బస చేసిన గ్రామచావడి దగ్గరకి వెళుతున్నారు– నినాదాలు చేసుకుంటూ. ‘‘గాంధీజీకి....’’; ‘‘జై!’’‘‘స్వదేశీ.....’’; ‘‘మన ఆశయం, మన ప్రాణం!’’‘‘స్వదేశీ విద్య....’’;‘‘అసలైన విద్య!’’ఆ నినాదాలు ఉద్వేగానికి గురి చేస్తున్నాయి. ‘‘విదేశీ వస్త్రాలు....’’;‘‘మనకొద్దు!’’ ‘‘మన చేనేత....’’;‘‘మన సంపద, మనకి గౌరవం’’ ‘‘ఖలీఫాను’’; ‘‘పునరుద్ధరించాలి!’’ ‘‘వందేమాతరం.....’’;‘‘మనదే రాజ్యం!’’ కృష్ణదేవిపేట అంతా ఉద్యమ నినాదాలతో మారుమోగిపోతోంది. రెండో తేదీ.... తెల్లవారగట్ట ఐదుగంటలకే ఊరంతా లేచి కూర్చుంది. మామూలుగా ఆ వేళకు పక్క దిగని కుర్రాళ్లు కూడా లేచిపోయారు. చిరు చలిలో వీధులన్నీ నగర సంకీర్తనతో మారుమోగుతున్నాయి. అంతా ఖద్దరు వస్త్రాలు ధరించి, జెండాలతో ఆ చిరుచలిలోనే అప్పటికే పాటలు పాడుతూ తిరుగుతున్నారు. ఏడున్నర గంటలకు మళ్లీ సభ. నగర సంకీర్తన తరువాత అక్కడికి ఊరేగింపుగా వెళుతూ పాట అందుకున్నారు.‘మాకొద్దీ తెల్లదొరతనము– దేవ... మాకొద్దీ తెల్లదొరతనము. మా ప్రాణాలపై పొంచి– మానాలు హరియించె.. మాకొద్దీ తెల్లదొరతనము పన్నెండు దేశాలు–పండుచున్నాగాని పట్టెడన్నమె లోపమండి! ఉప్పు! ముట్టుకుంటే దోషమండి నోట! మట్టికొట్టిపోతాడండి అయ్యొ! కుక్కలతో పోరాడి–కూడు తింటామండి....... !!మాకొద్దీ!! మద్రాసు ప్రెసిడెన్సీలో చాలా గ్రామాలని ఈ గేయం ఉర్రూతలూగిస్తోంది. స్టెన్సిల్స్ తీసి అమ్ముతున్నారు అణాకి. కళ్ల ముందు జరుగుతున్న చీరాల–పేరాల ఘటన, పల్నాడు, పెదనందిపాడు పన్నుల సత్యాగ్రçహం అన్నీ ఆ గేయంతో పరిచయం చేసేశాడు కవి. అంతలోనే పోలీసులు వస్తున్నట్టు కబురు. కార్యకర్తలు హడావుడిగా సామాను సర్దుకుని నర్సీపట్నం వెళ్లిపోయారు. 10 మూడో తేదీ ఉదయం ఎనిమిదిగంటల వేళ... ఫజులుల్లా ఖాన్ ఆరుగురు పోలీసులతో హఠాత్తుగా రామాలయం దగ్గరకు వచ్చి, రామరాజును తీసుకుని వెంటనే రావలసిందని మునసబుకు కబురు పెట్టాడు. పోలీసులను పంపించి గ్రామ పెద్దలను కూడా అక్కడకు రప్పించారు.‘‘ఆర్డర్ చూపించు!’’ అప్పుడు ఆదేశించాడు ఫజులుల్లాఖాన్. భాస్కరుడికీ, స్వామినాయుడికీ, రామరాజుకీ ఆర్డర్ నకళ్లు ఇచ్చాడు కానిస్టేబుల్. ‘‘రామరాజుగారూ! ఏమిటిది?’’ అన్నాడు స్వామినాయుడు కంగారు పడుతూ.‘‘రంప ఏజెన్సీ సబ్ డివిజినల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వారి ఆదేశం. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం కృష్ణదేవిపేట గ్రామంలో 144వ సెక్షన్ విధించారు.’’ అన్నాడు రామరాజు, ఏమీ ఆశ్చర్యపడకుండా.‘‘రామరాజుగారు! మిమ్మల్ని నిర్బంధంలోకి తీసుకుంటున్నాం. అయితే ఇది అరెస్టు కాదు. ఇంటర్న్మెంట్. పొలిటికల్ సస్పెక్ట్గా తీసుకురమ్మని ఆదేశం. మాతో నర్సీపట్నం రావాలి!’’ అన్నాడు ఫజులుల్లా ఖాన్. ∙∙l‘‘హలో... నర్సీపట్నం హెడ్క్వార్టర్స్... ఓవర్...!’’ ఆ గొంతు విని, చటుక్కున ముందుకు వచ్చాడు ఫర్బీస్.‘‘హలో.... హలో...కేడీపేట క్యాంప్.....ఈవ్లింగ్... నువ్వేనా? హలో... ఏమిటి? ఇక్కడ నుంచి ఆ సమాచారం పంపేందుకు ప్రయత్నించమంటావా? ఓవర్’’ అన్నాడు ఫర్బీస్. ‘‘అదే మంచిది. చూడు, రామరాజుని మంపలో అరెస్టు చేశారు. అక్కడ నుంచి నేరుగా కేడీపేట తీసుకువచ్చి స్పెషల్ ఆఫీసర్కే అప్పగించాలి. ఈ ఆదేశంలో ఒక్క అక్షరం మారకూడదు. ఈ విషయమే కొయ్యూరు వాళ్లకి కచ్చితంగా చెప్పాలి. ఓవర్.’’ ∙∙l ఐదవ అధ్యాయం 1 నర్సీపట్నం సబ్ జైలులో రెండో నంబర్ సెల్. త్రయంబకేశ్వరం పేరు చెప్పగానే స్వేనీ ముఖంలో పోటెత్తిన కంగారూ, ఫజులుల్లాlమాటలలో వచ్చిన ఆటుపోట్లూ పదే పదే గుర్తుకు వస్తున్నాయి రామరాజుకి. గోదావరి పుట్టిన ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లానంటూ తను ఇచ్చిన వాగ్మూలం ఆ ఇద్దరు బ్రిటిష్ సేవకులను కొంచెం కూడా నమ్మించదని రామరాజుకు తెలుసు. అదీ ఆ స్థల మహత్యం. నాసికా త్రయంబకం .... త్రయంబకేశ్వరం.... రాజమండ్రిలో తండ్రి నడిపిన స్టూడియోలో మాయాలాంతరు బొమ్మలు చెప్పిన కథలలోనే మొదటిసారి ఆ పేర్లు విన్నాడు రామరాజు. ఓ పచ్చటి కొండ, దాని మీద నుంచి జారే నాలుగైదు ధారలు. అదే గోదావరి. ఆ సన్నటి ధార రాజమండ్రి చేరేసరికి అఖండ గౌతమిగా, మూడు మైళ్ల వెడల్పుతో విశ్వరూపం దాలుస్తుందని అప్పుడే విన్నాడు రామరాజు. అక్కడ నుంచి దిగువకు ధవళేశ్వరం వెళ్లి, పాయలుగా చీలి, అందులో ఒకటి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుందని కూడా తెలుసుకున్నాడు. సెల్ అంతటా చీకట్లు ఆవరించుకున్నాయి. ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. అర్ధరాత్రి దాటింది.జూన్లో కృష్ణదేవిపేట నుంచి బయలుదేరిన రామరాజు వర్షాలు ముమ్మరమయ్యే నాటికి త్రయంబకం చేరుకున్నాడు. జ్ఞాపకం వెంట జ్ఞాపకం మాయలాంతరులోని దీపంలా జ్వలించడం మొదలుపెట్టాయి. ఏవేవో దృశ్యాలు కదిలిపోతున్నాయి. దృష్టిపథంలో వీటన్నిటినీ అధిగమిస్తూ, నిన్న మొన్నటి తన త్రయంబక యాత్రాస్మృతి ఒక వరదలా ముంచెత్తుతోంది......నిత్యం వేకువనే గోదావరి జన్మస్థలం బ్రహ్మగిరి ముందే నిలబడి చేతులెత్తి నమస్కరించేవాడు రామరాజు. త్రయంబకేశ్వరం అడుగడుగూ ప్రకృతి సౌందర్యమే. అక్కడక్కడ రుద్రాక్ష చెట్లు సహా, రకరకాల మహావృక్షాలు. వాటి మధ్య ఎన్నో తీర్థాలు. ఆ తీర్థాల ఒడ్డునే రమణీయ శిల్పకళతో ఎన్నో ఆలయాలు. వాటన్నిటికీ తలమానికంగా ఉంటుంది నల్లని రాతితో కట్టిన త్రయంబకేశ్వరాలయం. గౌతముడు తన కోసం గోదావరిని అక్కడ ఆపాడని స్థలపురాణం. గోదావరి సరే, రామలక్ష్మణ తీర్థం, గౌతమ తీర్థం, విశ్వనాథ తీర్థం, బిల్వతీర్థం, ఇంద్రతీర్థం, నీలాంబరతీర్థం, ప్రయాగ తీర్థం... ఇంకా ఎన్నో! వీటిని చుట్టుకుని ఎన్నెన్నో స్థలపురాణాలు, గాథలు, కథలు! రామరాజుకు బస ఏర్పాటు చేసిన క్షేత్రోపాధ్యాయుడు (అక్కడి పురోహితులని క్షేత్రోపాధ్యాయులంటారు. వారికి పెద్ద పెద్ద ఇళ్లుంటాయి. వాటిలో భక్తులకు బస కల్పిస్తారు) అవన్నీ చెబుతూ ఉండేవాడు. బ్రహ్మగిరి, హరిహరగిరులకు ప్రదక్షిణలు చేస్తున్నా, పాండవుల గుహలు, జైనుల మందిరాలు తిరుగుతున్నా ఎన్నో పురాణ కథలు చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. తనువు పులకరింప చేసే ఎన్నో శ్లోకాలు విన్నాడు. అన్నీ ఆ నేల ప్రాశస్త్యాన్ని చాటేవే! ఆ మంత్రాలతో పాటే జనమంతా తరతమ భేదం లేకుండా వల్లించే మరో మంత్రం రామరాజు చెవులను తాకేది. అది – వందేమాతరం. మరో ఘట్టం వివరం కూడా తరచుగా అతడి చెవిని తాకుతూ ఉండేది.గోదావరికి బ్రహ్మగిరి జన్మనిచ్చినట్టు, అక్కడ వందేమాతర మంత్రానికి జన్మనిచ్చినది ఆ ఘట్టమే. పదిహేనేళ్ల క్రితమే జరిగిన ఆ ఘట్టంలో తన వంతు నిర్వహించిన పాత్రను చూసుకుని త్రయంబకం కూడా గర్వపడుతూ ఉంటుందనిపిస్తుంది ..... ఆగస్ట్ 26, 1906. బాలగంగాధర తిలక్ నాసిక్ వచ్చాడు. అంతకు ముందుటేడు జరిగిన బెంగాల్ విభజనలో శ్వేతజాతి పాలకులు ఎంత ద్రోహబుద్ధిని ప్రదర్శించారో చెప్పడానికే వచ్చాడు. అప్పుడే ఆవిర్భవించింది అభినవ్ భారత్ సంస్థ. విభజనతో జ్వలించిన ఆగ్రహాన్ని ఉద్యమరూపంలోకి మార్చే ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో చాలామంది నాసిక్కు తూర్పు దిశగా ఉన్న ఔరంగాబాద్ లేదా దేవగిరి కేంద్రంగా పనిచేస్తున్న మిత్రమేళా అనే రహస్య సంస్థ సభ్యులే. మిత్రమేళా ఆశయం అందరికీ తెలుసు– కన్నుకు కన్ను. తెల్లజాతి విషయంలో ఇదే సత్యం. అనుసరణీయం. చేయవలసింది యుద్ధం. అందుకు ఆయుధాలను సేకరించాలి. భారత్ను చెరబట్టిన బ్రిటిష్ పాలకుల మీద ఎక్కుపెట్టాలి. ఈ కార్యక్రమం, ప్రణాళికల వెనుక ఉన్నవారు ముగ్గురు సోదరులు. వారిలో పెద్దవాడు చదువుకోసం ఇంగ్లండ్ వెళ్లిపోతున్నప్పుడు, 1906 జూన్లో ఒక రహస్య ప్రదేశంలో, మారుమూల తీసుకున్న ఫొటో. ఇప్పటికీ నాసిక్, త్రయంబకాలలో చాలా ఇళ్లలో కనిపిస్తుంది. రామరాజు బస చేసిన క్షేత్రోపాధ్యాయుడి ఇంట్లో కూడా ఉంది. తమ నాయకుడి చుట్టూ నిలబడి మిత్రమేళా సభ్యులు కొందరు తీయించుకున్న ఫొటో అది. వారి చేతులలో శివాజీ మహరాజ్ చిత్రపటాలు, వాటి కింద వందేమాతరం నినాదం. ఆ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్. నాసిక్ కలెక్టర్ జాక్సన్ అణచివేత మొదలుపెట్టాడు. అభినవ్ భారత్ సభ్యులంటే చాలు చిత్రహింసలతో జీవచ్ఛవాలను చేయించాడు. సహజంగానే ఇతడు మిత్రమేళాకు లక్ష్యంగా మారి, చావును ముందుకు తెచ్చుకున్నాడు.డిసెంబర్ 21, 1909.... ఆ రోజు అనుకోకుండా జరిగిపోయింది. నాసిక్లోనే విజయానంద నాటకశాలలో శారద అనే నాటకం చూస్తున్నాడు జాక్సన్. అనంత్ కన్హేరే అనే మిత్రమేళా సభ్యుడికి ఈ సంగతి తెలిసింది. నాటకశాలకు వెళ్లి రివాల్వర్తో కాల్చేశాడు. కన్హేరే సహా ముగ్గురిని ఉరి తీశారు. ‘మరి... నేను అఖండంగా దర్శనమిచ్చే రాజమండ్రి తీరంలో చిన్నతనంలో నువ్వు కూడా చూసిన ఆ ఘట్టం గుర్తు లేదా ఏమిటి!’ అని అప్పుడప్పుడు నదీముఖం నవ్వుతూ అడిగిన ట్టనిపించేది. అప్పుడు ఆ ఘటనల గురించి ఆ జలపాతంతో మాటామంతీ జరిపేది తన బాల్యం.......... ‘వందేమాతరం’ అంటూ తెలుగు, దేవనాగరి, ఉర్దూ లిపులలో రాసిన ఆ బ్యానర్ గోదావరి గాలికి రెపరెపలాడడం ఇప్పటికీ గుర్తే, రామరాజుకి. ఆ ఇన్నిస్పేటలోనే జవ్వాదివారి కొట్లలో ఉంది వెంకటరామరాజు ఫొటో స్టూడియో. ఆ రెండు రోజులు శ్రీరామరాజు అక్కడ జరిగిన ఏర్పాట్లన్నీ కన్నార్పకుండా చూశాడు.‘19–4–1907– రాజమండ్రి’ఆ అంకెలూ, ఆ ఇంగ్లిష్ అక్షరాలూ చూసేసి, డబ్బు తీసుకుని దాదాపు విసిరేస్తున్నాడు అతడు టికెట్లు. అన్నీ ప్లాట్ఫారమ్ టికెట్లే. ఒక్కసారిగా వచ్చి పడ్డారు జనం. రాజమండ్రి రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్లో కూర్చున్న ఆ తెల్లజాతి ఉద్యోగికి సంభ్రమంగా ఉంది. భయంగా కూడా ఉంది. ఎవరో గత రాత్రి స్టేషన్ లోపలి గోడల మీద తాటికాయలంత ప్రమాణంలో; తెలుగు, ఇంగ్లిష్లలో ఆ నినాదాలు అందంగా లిఖించారు– ‘వందేమాతరం’... అంటూ. తోసుకు తోసుకు వస్తున్నారు జనం. అన్నీ ప్లాట్ఫారమ్ టికెట్లే. కిటకిటలాడిపోతోంది ప్లాట్ఫారమ్. స్టేషన్ బయట ఇంకో రెట్టింపు జనం.రైళ్లు వచ్చి ఆగే చోటకు కొంచెం ఇవతల నిలబడి ఉన్నారు రాజమండ్రి ప్రముఖులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు, స్టేషన్లో. తనకు ఎదురుగా చేతులు జోడించి సవినయంగా నిలబడి ఉన్న ఆయన భుజాలు ఆప్యాయంగా రాస్తున్నారు– పంచె, చొక్కా, పైన నల్లని కోటుతో, తల మీద తెల్లని తలపాగాతో ఉన్న ఆ పెద్దాయన. తెల్లటి బొద్దు మీసాలు హుందాతనం ఇస్తున్నాయి. వారే చిలకమర్తి లక్ష్మీనరసింహంపంతులుగారు. అప్పటికే చూపు పోయిందాయనకి. చేతులు జోడించి నిలబడి ఉన్న వారే సత్యవోలు గున్నేశ్వరరావు. రాజమండ్రి కరణం. ఇంతకాలం జాతీయోద్యమానికి రహస్యంగా అండదండలు ఇచ్చినవారే కరణంగారు. ఇప్పుడు బాహాటంగా ముందుకు వచ్చారు. ఆ ఇద్దరికీ కొంచెం దగ్గరగా నిలబడి ఉన్నాడు, ఓ యువకుడు. పేరు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. రాజమండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో విద్యార్థి. విద్యార్థి నాయకుడు. గాడిచర్ల వెనుకే దండ పట్టుకుని మరో యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు మునగాల రాజా నాయని వెంకటరంగారావు. కౌతా శ్రీరామశాస్త్రి, దంటు సుబ్బావధాని, డాక్టర్ బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యం, యర్రమిల్లి జగ్గన్నశాస్త్రి, గోటేటి వెంకటరావు... అంతా అక్కడే ఉన్నారు. వారంతా మొన్న డిసెంబర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల కోసం కలకత్తా వెళ్లివచ్చినవారే. వందేమాతర గేయాన్ని జాతీయగీతంగా స్వీకరించాలని, స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని ఆ సభలో చేసిన తీర్మానాలు ఉద్యమిస్తున్న భారతీయులకి కొత్త రక్తాన్ని అందించినట్టయింది. చిలుకూరి వీరభద్రరావుగారు ఏదో చెబుతుంటే బాలభారతి సమితి నాయకులు టంగుటూరి శ్రీరాములు, గంటి లక్ష్మన్న, కంచుమర్తి రామచంద్రరావు వంటి వారు దీక్షతో వింటున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బాలభారతి సమితి సభ్యులు కొందరు కలకత్తా జెండాలు పట్టుకుని నిలబడ్డారు. కొందరి చేతులలో ప్లకార్డులు. కలకత్తా జెండా–దీర్ఘచతురస్రాకారంగా, మూడు రంగులతో రూపుదిద్దుకుంది. పైన ఎరుపు. ఈ భాగంలోనే సగం విచ్చుకున్న ఎనిమిది పద్మాలను వరసగా చిత్రించారు.మధ్యన పసుపు వర్ణం. దీని మీదే దేవనాగరి లిపిలో నల్లటి రంగుతో ‘వందేమాతరం’ అని రాశారు.కింది భాగంలో ఆకుపచ్చ రంగు. ఎడమవైపున సూర్యుడి బొమ్మ, కుడి వైపున చంద్రవంక ముద్రించారు. నిరుడు కలకత్తాలో పార్సీ బగాన్ స్క్వేర్లో ఆవిష్కరించారు. అందుకే కలకత్తా జెండా అంటున్నారు. అప్పుడే దూరంగా రైలుకూత వినిపించింది. రెండు నిమిషాల తరువాత స్టేషన్లోకి దూసుకొచ్చింది రైలు. అంతా అటు పరుగు తీశారు. తెల్లటి పంచె, లాల్చీ, తలపై తెల్లటి పాగా ధరించిన ఆ ధీర గంభీర వదనుడు మొదట కింద అడుగుపెట్టారు. ఆయన ముట్నూరి కృష్ణారావు. కృష్ణాపత్రిక ఎడిటర్. వెంటనే వెనుదిరిగి, దిగుతున్న ఆ వ్యక్తికి చేయి అందించారు. పేరు కృష్ణారావే అయినా, రథం దిగుతున్న గీతాచార్యుడికి చేయి అందిస్తున్న అర్జునుడిని గుర్తు చేస్తున్నారు ముట్నూరి వారు. ఆ చేతిని ఆప్యాయంగా అందుకుని, చిరునవ్వుతో కిందికి దిగారా వ్యక్తి∙కూడా. సన్నటి పొడవైన మనిషి. ఆపాదమస్తకం బెంగాలీ ముద్ర. మధ్య పాపిడి, కళ్లకి నాజూకైన గుండ్రటి సులోచనాలు, తెల్లటి పంచె, లాల్చీ, పైన వల్లెవాటుగా వేసుకున్న కశ్మీర్ శాలువా. ఆయన బిపిన్ చంద్రపాల్. ఆయనను చూడగానే ఒక్క పెట్టున నినాదాలు వినిపించాయి ‘వందేమాతరం’ అంటూ. రైలు ఇంజన్ శబ్దం చిన్నబోయేటట్టుæ మారుమోగుతూనే ఉన్నాయి నినాదాలు ‘‘వందేమాతరం....’’, ‘‘వందేమాతరం....’’, ‘‘వందేమాతరం....’’ -
ఆకుపచ్చ సూర్యోదయం
రామరాజు ఫితూరీ చేస్తాడా? ఆయుధాలు వస్తాయని ఆయన స్వయంగా చెబుతున్నాడా? కంతారం మొఖాసాదారు కొటికల బాలయ్య సహకరిస్తున్నాడా? కృష్ణదేవిపేటతో పాటు, చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం ఇవే ప్రశ్నలు. సూర్యనారాయణమ్మకు ఇదేమిటో మొదట ఏమీ అర్థం కాలేదు. అందుకే మిన్నకుండిపోయారు.భాస్కరుడు, చింతల స్వామినాయుడు, లగుడు సత్యనారాయణ వంటి గ్రామ పెద్దలంతా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆధ్యాత్మికవాది. ఊళ్లో జాతీయ కాంగ్రెస్ సభ జరిగినా ఆయన మాట్లాడలేదు. అలాంటి శాంత స్వభావుడు.. ఫితూరీ లేవదీస్తాడా? ‘ఇదంతా ఏమిటి బాబయ్యా!’ అని ఆరా తీసి వస్తానంటూ సోమమ్మ గారు బయలుదేరితే భాస్కరుడే ఆపేశాడు. అవన్నీ వదంతులేనమ్మా అని నచ్చ చెప్పాడు. నిజంగా వదంతులే అయితే బాగుండుననిపిస్తోంది అందరికీ. దానికి తోడు రామరాజు ఆ రోజంతా శ్రీరామవిజయరామ నగరం నుంచి ఊళ్లోకే రాలేదు. అయినా హోరెత్తుతున్న ఆ వదంతి ఆయన దాకా వెళ్లిపోయింది. అందుకు కారణం కొటికల బాలయ్య. ఉదయం పదిగంటల ప్రాంతంలో ఆయాస పడుతూ వచ్చాడు బాలయ్య– కంతారం మొఖాసాదారు. ‘‘స్వామీ! దండాలు. మా దాకా రానేలేదు. ఊరంతా కోడై కూస్తంది! అయినా ఫరవాలేదు.’’ అన్నాడు సంతోషంగా. ‘‘ఎందుకు?’’ అన్నాడు రామరాజు. ‘‘మళ్లీ ఫితూరీ జరగబోతోందట.......’’ ‘‘ఎక్కడ? ’’ ‘‘కృష్ణదేవిపేటలోనే. తమరు లేవదీస్తన్నారట!’’ అన్నాడు బాలయ్య. ఖిన్నుడైపోయాడు రామరాజు. ‘‘ఎవరు చెప్పారు?’’ అసహనంతో అడిగాడు. ‘‘ఊర్లో అనుకుంటున్నారు. తమర్ని దర్శించుకోవాలని వచ్చాను. అంతా నాకేసే అనుమానంగా చూశారు. ఏమైందయ్యా అని అడిగాను. ఒకాయన చెప్పాడు. స్వామీ! మా కష్టాలు తీర్చడానికి వచ్చావా?’’ అన్నాడు బాలయ్య రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ. ‘‘కాదు బాలయ్యా! ఫితూరీలతో, హింసతో సాధించలేం. గాంధీగారు అదే చెబుతున్నారు. హింసామార్గం మంచిది కాదు. అదంతా వదంతి.’’అన్నాడు రామరాజు.ఇంతలోనే ఆదరాబాదరా వచ్చాడు స్వామినాయుడు.‘‘నాయుడు గారూ! నమస్కారం.’’ అన్నాడు రామరాజు.‘‘నమస్కారం!’’ అంటూనే, ఏదో చెప్పబోయి బాలయ్యని చూసి ఆగిపోయాడు. తరువాత ‘‘ఒక్కసారి లోపలికి దయచేయండి!’’ అంటూ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్లాడు నాయుడు. ‘‘తమరేంటి? ఫితూరీ ఏంటి? ఏంటి బాబూ ఇదంతా! నమ్మవలసిందేనా!’’ అన్నాడు ఆందోళనగా రామరాజు రెండుచేతులు పట్టుకుని. నాయుడి చేతులలో నుంచి తన చేతులు విడిపించుకుని, వాటిని జోడించి స్థిరంగా అన్నాడు రామరాజు, ‘‘మీ అంతరాత్మ ఏం చెబుతోంది. ఈ రామరాజు ఫితూరీ లేవదీస్తాడని చెబుతోందా!’’‘‘లేదు.’’ అన్నాడు నమ్మకంగా నాయుడు.‘‘నా ఆంతరాత్మ సాక్షిగా నేనూ చెబుతున్నాను. అలాంటిదేమీ లేదు.’’ అన్నాడు రామరాజు. ‘‘సంతోషం.’’ అంటూ తృప్తిగా అక్కడ నుంచి బయటకు నడుద్దామని గుమ్మం వైపు తిరిగాడు నాయుడు. మునసబు లగుడు సత్యనారాయణ కంగారుగా వస్తూ కనిపించాడు. అతడిని నాలుగు అడుగుల అవతలే నిలిపేసి, బయటకు తీసుకెళుతూ అన్నాడు నాయుడు. ‘‘ఏం లేదులే మునసబు. ఎవరో పుకారు పుట్టించాడు. రాజుగారి మనసు బాధ పెట్టొద్దు.’’ అన్నాడు. ఇద్దరూ గ్రామం వైపు వెళ్లిపోయారు. ‘‘స్వామీ! చేతులెత్తి మొక్కుతున్నా. మా కొండోళ్ల బాధలు తీర్చు. కొండోళ్లు మొత్తం నీ ఎనక నడుస్తాం. నేలతల్లి మీద ప్రమాణం. గాంధీగారు చెప్పేదేంటో మా దాకా రాదు స్వామీ! ’’ అన్నాడు బాలయ్య. కొన్ని గంటల పాటు కొండవాళ్ల ఇక్కట్ల గురించి కథలు కథలుగా చెప్పాడు.మౌనంగా ఉండిపోయాడు రామరాజు. నిరాశగా వెళ్లిపోయాడు బాలయ్య. 6 ఫితూరీ భయం భళ్లుమంది. కృష్ణదేవిపేటలో పెద్ద పెద్ద కుటుంబాల వారు సాయంత్రం ఆరుగంటలకే తలుపులు బిడాయించారు. కొందరు రాత్రి భోజనాలు ముగించుకుని, ఇళ్లకి తాళాలు బిగించి, ఊళ్లో పోలీసు స్టేషన్ దగ్గరకు వచ్చేశారు. కునికిపాట్లు పడుతూ గడిపారు, తెల్లవార్లు. దీనికి సంబంధించిన ఒక నివేదిక నర్సీపట్నంలో ఉండే ఏజెన్సీ కమిషనర్ స్వైర్కు ఆగమేఘాల మీద చేరిపోయింది. సాక్షాత్తు గ్రామ మునసబు లగుడు సత్యనారాయణే పంపాడు. 27–1–1922న రహస్యంగా పంపిన నివేదిక అది. గ్రామంలో జరిగే ఏ ముఖ్య పరిణామమైనా మునసబు నివేదించవలసిందే. ‘ఏజెన్సీ లక్ష్మీపురం (కృష్ణాదేవిపేట గ్రూపు)గ్రామ మునసబు లగుడు వ్రాయించిన స్టేట్మెంట్–కృష్ణదేవిపేటలో పుట్టిన బలమైన రూమర్ను బట్టి నేను ఈ నివేదిక రాశాను. అల్లూరి రామరాజు కొంతమంది కొండవాళ్లతో కలసి అమావాస్య పోయిన పంచమినాడు (1–2–1922) పితూరీ లేవదీయబోతు న్నాడని గ్రామంలో అందరి నోటా వినిపిస్తున్నది. కానీ ఈ వదంతిని గురించి ఫలానా మనిషి చెప్పినాడని నేను స్పష్టంగా చెప్పలేను. మీ రోజులు దగ్గరపడ్డాయి. ఈ పెద్ద పెద్ద కొంపలు ఎలా ఉంటాయో చూస్తాం అని గత సోమవారం కృష్ణదేవిపేట సంతకు వచ్చిన గోకిరి ఎర్రేసు, గనర్లపాలెం, అనేవాడు నాతో అన్నాడు. రామరాజుగారు ఏదో చేయడానికి వాళ్లతో కలుస్తున్నాడని కూడా అతడు అన్నాడు. ఎర్రేసుది పిచ్చివాగుడని మేం అనుకునేవాళ్లం. వాడు వెర్రివాడిలాగా కనపడడు. మంచివాడిలాగా కూడా కనపడడు. అల్లూరి శ్రీరామరాజు పంచాయతీ కోర్టులు పెట్టి నీతిని బోధించేవారు. స్వదేశీ సిద్ధాంతాన్ని ఆయన ఆమోదిస్తారు. తాగుడు వగైరా మానవలసిందని బోధించేవారు. అంతే.... రామరాజుగారి ఇంటికి మేం వెళ్లినప్పుడు చింతల స్వామినాయుడు, కంతారం మొఖాసదారు కూడా ఉన్నారు. రామరాజు సహా అందరినీ అల్లర్లలో పాల్గొనవలసిందని కోరినట్టు బాలయ్య స్వయంగా చెప్పాడు. నన్ను, హనుమంతు గోపాలస్వామిని (కొంగశింగి మునసబు) చంపివేస్తామని ఎర్రేసు సంతలో అన్నాడని విన్నాము. ఎందుకంటే మేం ఎర్రేసుకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చామట. కింద సత్యనారాయణ సంతకం. పక్కనే తన సమక్షంలో రాసినట్టు ధ్రువీకరిస్తూ బాస్టియన్ సంతకం. 7 మరునాడు రాత్రి కూడా కొందరు పోలీసు స్టేషన్ దగ్గరే కాలక్షేపం చేశారు. ఇది రామరాజునీ, సూర్యనారాయణమ్మనీ కలచివేసింది. ఎవరైనా అడిగితే రాజుగారంటే నమ్మకమే గానీ, కొండవాళ్లతో ప్రమాదం అంటున్నారు. 29వ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం. గ్రామంలోకి వెళదామని రామరాజు తన కుటీరం నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా కనిపించిందా దృశ్యం.నెత్తి మీద టోపీతో, కోటేసుకుని ఉన్న అతడు గుర్రం మీద వస్తున్నాడు. ఎప్పుడూ చూడలేదు. సరిగ్గా ఇంటి దగ్గరకు వచ్చి, గుర్రం మీద నుంచే అడిగాడతడు. ‘‘శ్రీరామరాజు అంటే ....?’’ ‘‘నేనే!’’ అన్నాడు రామరాజు.నెమ్మదిగా గుర్రం దిగాడతడు. ఆ పరిసరాలన్నీ చూసి అన్నాడు ఇంగ్లిష్లో, ‘‘ఇక్కడ ఎవరూ లేరు!’’ ‘‘మా కుటుంబం ఒక్కటే ఉంటుంది. నేను, మా అమ్మ, తమ్ముడు. రాత్రి పూట కొందరు యువకులు వచ్చి ఇక్కడ చదువుకుంటారు.’’ అన్నాడు రామరాజు ఇంగ్లిష్లో.ఇంగ్లిష్తో రామరాజుని కంగారు పెట్టాలన్న తన వ్యూహం బెడిసికొట్టినందుకు ఖిన్నుడైపోయాడతడు. అప్పుడు సర్వసాధారణంగా తెలుగులో పరిచయం చేసుకున్నాడు.‘‘నా పేరు ఎ. బాస్టియన్. అల్ఫ్ బాస్టియన్. గూడెం డిప్యూటీ తహసీల్దార్!’’ అన్నాడు. ‘ఇతడా బాస్టియన్? ఈ మనిషేనా డిప్యూటీ తహసీల్దారు!’ మనసులో అనుకున్నా, ఆ ఆశ్చర్యాన్ని ఏమీ కనిపించనీయకుండా, ‘‘అలాగా! రండి. లోపల కూర్చోవచ్చు.’’ అన్నాడు రామరాజు.‘‘ఇక్కడైతే మాట్లాడరా!’’ అన్నాడు బాస్టియన్, కొంచెం పొగరుగా. తన మీద అర్జీలు పంపిన మనిషన్న కోపం ఆ మాటలో. ‘‘మీ ఇష్టం.’’ అన్నాడు రామరాజు. తలుపు చాటు నుంచి ఆందోళనగా చూస్తున్నారు సూర్యనారాయణమ్మ. ‘‘అసలు మీరెవరు?’’ అడిగాడు బాస్టియన్, సూటిగా.‘ఈ దేశవాసిని!’’ నిబ్బరంగా చెప్పాడు రామరాజు.‘‘ఉహు. మరి సువిశాల దేశంలో ఈ మూల, ఒక్కరే ఎందుకు ఉండడం?’’ అన్నాడు బాస్టియన్.‘‘నేను ఆధ్యాత్మిక చింతనాపరుడినని అనుకుంటున్నాను. అందుకే ఒక ప్రశాంత వాతావరణాన్ని ఆశిస్తూ ఉంటాను.’’ అన్నాడు రామరాజు, ఇంగ్లిష్లోనే. ‘‘ఊరికి ఇంతదూరంగా.. అడవి జంతువులు కూడా వచ్చే చోట.. ఒక్కరూ ఉండి ప్రభుత్వానికి అనుమానం కలిగిస్తున్నారని అనిపించడం లేదా!’’ దర్పంతో అన్నాడు బాస్టియన్. ‘‘నా మీద అనుమానం అవసరం లేదు. నేను ఎక్కువ కాలం భగవంతుడి చింతనలోనే ఉంటాను. మూలికా వైద్యం తెలుసు. ముహూర్తాలు పెడతాను. నా దగ్గరకి అందరూ వస్తారు. వెళతారు. అనుమానించవలసిందేముంది?’’ ‘‘మీరు మోహన్దాస్ గాంధీ నాన్ కో ఆపరేషన్ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారట.’’ ‘‘నేను గాంధీగారి అభిమానినే. అయితే నేను ఎవరి మార్గాన్నీ అనుసరించను. నా దృష్టి నాది.’’‘‘నా ప్రశ్న– మీరు సమర్ధిస్తున్నారా? ’’‘‘అదే చెబుతున్నాను. రాజకీయోద్యమం ఆయన మార్గం. నా మార్గం ఆధ్యాత్మిక చింతన.’’‘‘మీరు క్రైస్తవ మిషనరీలని అడ్డుకుంటున్నారు.’’‘‘ఔను. మాయమాటలు చెప్పి, క్రీస్తుదేవుడి ప్రవచనాలను అవమానిస్తున్నారు వాళ్లు. మత మార్పిళ్లకు సేవ అని పేరు పెడుతున్నారు.’’ ‘‘ మీకెందుకు? చూసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి.’’ కఠినంగా అన్నాడు బాస్టియన్.‘‘వారు నా ధర్మాన్ని కించ పరిచినప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతనాపరునిగా బదులివ్వడం నా ధర్మం.’’‘‘ఈ మధ్య మీరు ఎక్కడికో వెళ్లి వచ్చారట. ఎక్కడికి?’’ ‘‘నాసిక్.’’‘‘ఎందుకు?’’ కనుబొమలు ముడివేస్తూ అడిగాడు బాస్టియన్.‘‘గోదావరి జన్మించే చోటు. అక్కడకు వెళితే మోక్షం వస్తుందని మా నమ్మకం.’’ చెప్పాడు రామరాజు.‘‘రామరాజు గారు! ఇవాళ ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ స్వైర్ మిమ్మల్ని విచారించడానికి వస్తున్నారు. మేం పిలిచినప్పుడు రావాలి.’’ అన్నాడు బాస్టియన్.‘‘ఎవరు వచ్చి విచారించినా నా సమాధానం ఒక్కటే.’’ అంతే నిబ్బరంగా చెప్పాడు రామరాజు. ‘‘మీరు రావాలనుకుంటున్నారా? లేదా?’’ అసహనంగా ప్రశ్నించాడు బాస్టియన్.మౌనం దాల్చాడు రామరాజు. విసురుగా గుర్రం ఎక్కాడు బాస్టియన్. 8 బాస్టియన్ వెళ్లి రామరాజును కలుసుకోవడం సంచలనమైపోయింది. ఒక గంట తరువాత యథాప్రకారం వెళ్లి రామాలయం దగ్గర కూర్చున్నాడు రామరాజు. పోలీస్ సూపరింటెండెంట్ స్వైర్ శ్రీరామరాజును విచారించడానికి వస్తున్నాడని తెలిసిపోయింది. భయం భయంగానే అయినా ముప్పయ్ మంది వరకు గ్రామస్థులు రామరాజు దగ్గరకు వచ్చి మౌనంగా కూర్చున్నారు. భాస్కరుడు, చింతల స్వామినాయుడు, మునసబు ఎలాగూ ఉండాలన్నారు– స్వైర్ వచ్చేసరికి. ఈ ముగ్గురు, బాస్టియన్ గ్రామ చావడి దగ్గర వేచి ఉన్నారు. మూడు గుర్రాల మీద ఆ ముగ్గురు వస్తూ కనిపించారు. స్వైర్ గుర్రం ముందు నడుస్తోంది. ఏజెన్సీ కమిషనర్ ఎఫ్, డబ్లు్య. స్టీవర్ట్, పోలవరం డిప్యూటీ తహసీల్దార్ ఫజులుల్లా ఖాన్ల గుర్రాలు ఆ వెనుక నడుస్తున్నాయి. బాస్టియన్ కనిపించగానే గుర్రం ఆపాడు స్వైర్. ‘‘ఆ క్షత్రియ యంగ్మ్యాన్ ఉన్నాడా?’’ వెంటనే అడిగాడు స్వైర్, ఇంగ్లిష్లో. ‘‘ఉన్నాడు సార్! ముందు ఒక నిమిషం ఇక్కడ మాట్లాడుకుందాం. మునసబుగారు కొబ్బరి నీళ్లు ఏర్పాటు చేశారు.’’ అన్నాడు బాస్టియన్. ముగ్గురూ గుర్రాలు దిగారు. దొరలు ఇద్దరు కొబ్బరినీళ్లు తాగారు. ఫజులుల్లా మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఏదో జబ్బుతో బాధపడుతున్నట్టే ఉన్నాడు. తెల్లటి మనిషి ఫజులుల్లా. ఆజానుబాహుడు. సగం నెరిసిన దీర్ఘకేశాలు ఆయనవి. మరింత నెరిసింది గడ్డం. తెల్లని కోటు ప్యాంటులో దొరలాగే ఉన్నాడు. ‘‘సార్! అతడి పేరు రామరాజు. ఇంగ్లిష్ కూడా బాగా మాట్లాడతాడు. చదువుకున్నవాడే. ఆధ్యాత్మికవేత్తగా ఈ చుట్టుపక్కల వంద గ్రామాలలో మంచి పేరుంది. మనం అతడిని పిలిస్తే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జనం వేరే అర్థం చేసుకుంటారు. అదిగో రామాలయం. అక్కడే ఉన్నాడతడు. మనమే వెళితే సరి!’’ అన్నాడు బాస్టియన్. ‘‘అక్కడేనా! సరే వెళదాం. ఊరి పెద్దలు వచ్చారా?’’ అన్నాడు ఇంగ్లిష్లో స్వైర్. భాస్కరుడినీ, స్వామినాయుడినీ పరిచయం చేశాడు బాస్టియన్. అంతా అక్కడికి నడిచి వెళ్లారు. రామాలయం మెట్ల మీదే కూర్చుని ఉన్నాడు రామరాజు. అప్పటిదాకా అతడి చుట్టూ ఉన్నవాళ్లు రెండడుగులు వెనక్కి తప్పుకున్నారు. ‘‘దయచేయండి!’’ అన్నాడు రామరాజు. అంతే. అధికారులను చూసి నమస్కారం అనలేదు. కూర్చున్న చోటు నుంచి లేవలేదు. l1919 తరువాత యతులూ, సన్యాసులూ సాధువుల కార్యకలాపాల మీద ఒక కన్నేసి ఉంచమని రహస్య ఉత్తర్వులు జారీ అయినాయి. స్థానికుల మనోభావాలు దెబ్బతినని రీతిలో వాళ్లతో మెలగాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకేనేమో, అధికారులంతా బూట్లు విప్పేసి మండపంలోకి వచ్చి కూర్చున్నారు. మునసబు రామరాజుకు సంగతి చెప్పాడు లాంఛనంగా.వెంటనే అన్నాడు స్వైర్. ‘‘మీరు ఫితూరీ కోసం ప్రజలను ఉసిగొలుపుతున్నారా?’’‘‘లేదు. నేను ఆధ్యాత్మికవేత్తనని ముందే చెప్పాను. నా మతం గురించి చెబుతూ ఉంటాను.’’ చెప్పాడు రామరాజు‘‘మత ప్రచారమే అయితే, దేవుడి గురించీ, ధర్మం గురించీ చెప్పాలి. తాగుడు వద్దని ఎందుకు ప్రచారం?’’‘‘ధర్మం ప్రకారమైతే మద్యం హిందూ మతంలో నిషిద్ధం. దాదాపు సన్యాసి జీవితం గడుపుతున్న నేను ప్రజలు అధర్మవర్తనులైతే వారిని సన్మార్గంలో పెట్టాలి.’’ ‘‘పంచాయతీలు పెట్టడం, కోర్టులకు పోవద్దని చెప్పడం హిందూ ధర్మ ప్రచారమేనా?’’‘‘కోర్టులకు వెళ్లడం ధర్మమో, అధర్మమో; అక్కడ దొరికేది న్యాయమో, అన్యాయమో మీకు మాత్రం తెలియదా!’’ఇంగ్లిష్ అర్థమైన కొందరు ఈ జవాబుకు నవ్వేశారు.బాస్టియన్, స్టీవర్ట్ లోపల్లోపల మండి పడుతున్నా, రామరాజు ఆంగ్ల పరిజ్ఞానం, వాక్పటిమ వాళ్లని మంత్రముగ్ధులని చేస్తున్నాయి. ఫజులుల్లా ఖాన్ వినోదం చూస్తున్నాడు. ‘‘మీరు నాన్ కోఆపరేషన్ కార్యకలాపాలు చేపడుతున్నారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి.’’ అన్నాడు స్టీవర్ట్. ‘‘ఎలా చెబుతారు మీరు?’’ అన్నాడు రామరాజు, తీవ్రంగా.‘‘ఎంకె గాంధీని పొగడ్తలలో ముంచెత్తుతుంటే ఏమనాలి?’’‘‘గాంధీగారు ఆధ్మాత్మికత ఆధారంగా రాజకీయరంగాన్ని నిర్మిస్తున్నారు. అహింసను ప్రబోధిస్తున్నారు. అమాయక గిరిజనులకు కోర్టులంటే తెలియదు. అక్కడ వాళ్లకి న్యాయం జరిగిన దాఖలా ఒక్కటి కూడా లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లు. టెంకంబలి, చింతంబలి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. దీనికి తోడు మద్యం వ్యసనం. బతుకుల్లో నరకం చూస్తున్నారు. అలాంటి వాళ్లని తాగుడు మానెయ్యమంటే గాంధీగారిని సమర్థించడమా?’’ తీవ్రంగా ప్రశ్నించాడు రామరాజు. ‘‘పన్నులు చెల్లించవద్దని చెబితే అది సహాయ నిరాకరణ కిందకి రాదని ఎలా అంటారు? అన్నాడు స్వైర్.‘‘ నేను పన్నులు చెల్లించవద్దని ఏనాడూ ఎక్కడా చెప్పలేదే!’’ అన్నాడు రాజు.‘‘మరి విదేశీ వస్త్ర బహిష్కరణను సమర్థించారట. దానికేం చెబుతారు?’’ అన్నాడు ఫజులుల్లాఖాన్.‘‘అయ్యా! నేను విదేశీ వస్త్ర బహిష్కరణ గురించి ప్రచారం చేశానని ఎవరో చెబితే ఎలా నమ్మారు? దేశీయమైన గోచీ గుడ్డలకే నోచుకోని వాళ్లకి విదేశీ వస్త్రాలని బహిష్కరించమని ఏ మూఢుడైనా చెప్పే సాహసం చేస్తాడా?’’ అన్నాడు రామరాజు. కంగు తిన్నా, ఆ వాదనా పటిమ, వ్యంగ్యం ఫజులుల్లాను ఆకట్టుకున్నాయి. ‘‘రామరాజు గారూ! మీరు నాసిక్ వెళ్లివచ్చారని తెలిసింది. ఇప్పుడే ఎందుకు వెళ్లారు?’’ అడిగాడు స్టీవర్ట్.‘‘గోదావరి జన్మస్థలం హిందువులకి మహా పుణ్యక్షేత్రం. దర్శించుకుని వచ్చాను.’’ అన్నాడు రామరాజు.‘‘ఎవరికీ చెప్పకుండా వెళ్లారు. ఎందుకు? ’’‘‘¯lను యోగిని. ఒకరి అదుపాజ్ఞలలో, ఒకరి కనుసన్నలలో నడవలేను.’’‘‘అక్కడ ఎన్నిరోజులు ఉన్నారు? ఎవరిని కలిశారు?’’‘‘ఒక క్షేత్రపాలకుని ఇంటిలోనే కొన్ని రోజులు ఉన్నాను. నాకు తృప్తిని ఇచ్చేవరకు, నా ఆత్మ క్షాళనమైన భావన కలిగే వరకు ఉన్నాను.’’ అన్నాడు రామరాజు. ‘‘మీరు ఇక్కడ కాకుండా మరో చోటికి వెళ్లడానికి అభ్యంతరం ఏమైనా ఉందా?’’ అన్నాడు ఫజులుల్లా.‘‘ఎంతమాత్రం లేదు. అపోహలు అనవసరం. రాద్ధాంతాలు సద్దుమణగడం ప్రధానం’’ చెప్పాడు రామరాజు, నిస్సంకోచంగా. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇక లేద్దాం అన్నట్టు కళ్లతోనే సైగ సుకున్నారు.‘‘రామరాజుగారు! కృతజ్ఞతలు. మీ సహకారానికి ధన్యవాదాలు.’’ అన్నాడు స్వైర్, గుర్రం వైపు వెళుతూ.‘‘అంటే నేను సహాయ నిరాకరణవాదిని కాదన్నమాటే కదా!’’ అన్నాడు రామరాజు నవ్వుతూ. ‘‘నీ నివేదికను బట్టి వచ్చాను. ఈ కుర్రవాడు అంత ప్రమాదకారి కాదనే అనిపిస్తోంది.’’ నెమ్మదిగా అన్నాడు స్వైర్, మునసబుతో.‘‘చిత్తం. నా నమ్మకం కూడా అదే! కానీ ఊళ్లో వదంతి వచ్చింది. నా బాధ్యత మేరకు నివేదించాను!’’ అన్నాడు మునసబు.‘‘బాస్టియన్! నీ స్టేట్మెంట్ ఏది? అతడితో నీవు కూడా మాట్లాడావు కదా!’’ అడిగాడు స్వైర్.ఫైలులో ఉన్న తన స్టేట్మెంట్ తీసి అందించాడు బాస్టియన్. తెరిచి అక్కడే చదివాడు స్వైర్. -
ఆకుపచ్చ సూర్యోదయం
అంత మృదుస్వభావిలా కనిపించిన మదీనా, శిక్షకుడిగా మారాక యుద్ధం చేయిస్తున్న సేనానిని మరిపించాడు. చిన్న తప్పిదం చేసినా కొట్టినంత పనిచేశాడు. రెండు రోజులలోనే గన్ లోడ్ చేయడం, గురి పెట్టడం, పేల్చడం నేర్పేశాడు..... బాగా నేర్చుకున్నావు బాబయ్యా మర్దన! ఇంక చాలేమో! అంటున్నది సోమమ్మ. ఆ, చాలు చాలు.....’’ అన్నాడు రామరాజు తేరుకుని. ఏం బాబయ్యా పరధ్యానంగా ఉన్నారు?’’ హఠాత్తుగా అడిగింది సోమమ్మ. లోపల నుంచి ఉడికించిన చింతపండు గుజ్జు పట్టుకొచ్చి మంచం దగ్గర పెడుతూ అన్నాడు దాలినాయుడు, మామ్మా! వెంకటాచలం అయ్యవారు వచ్చారు, నిన్ను చూడ్డానికి! చాటింపేశారేంటి, బెణుకు సంగతి? రమ్మను పెద్దాయన్ని!అంది సోమమ్మగారు, నొచ్చుకుంటూ. మర్రి వెంకటాచలం గారు ఆ ప్రాంతంలో చాలా మర్యాద ఉన్న మనిషి. పదవీ విరమణకి దగ్గరగా ఉన్న ఉపాధ్యాయుడు. అంతా అయ్యవారనే పిలుస్తారు. ఊరు నాగాపురం. కృష్ణదేవిపేటకి పక్కనే. భాస్కరనాయుడికి ఆప్తుడు. దాలినాయుడు మరో ముక్కాలి పీట తెచ్చి వేశాడు, రామరాజుకు పక్కనే. నమస్కారం! ఓహో! రామరాజుగారి వైద్యమేనా! ఇంకేం? చిటికెలో నయమవదూ! అంటూ వచ్చి కూర్చున్నారు అయ్యవారు. భలేవారే! నా వైద్యానికి భయపడి రెండు రోజులు కబురే చేయలేదు! అన్నాడు రామరాజు, ఫిర్యాదు చేస్తున్నట్టు. అయ్యో! అదేం లేదు బాబయ్యా! చిన్న బెణుకు. అదే పోద్దని..! అన్నదామె నొచ్చుకుంటూ. ఉడికిన చింతపండు గుజ్జు తీసి చెమ్చాతో కొద్దిగా పాదం పైన రాశాడు రామరాజు. ఈ మాత్రం వేడి ఉండాలి! తట్టుకోగలవా అమ్మా! అడిగాడు రామరాజు. అలాగే, తప్పుతుందా బాబయ్యా! అన్నదామె, ఓర్చుకుంటూ. మరి కొంచెం గుజ్జు పూసిన తరువాత, హఠాత్తుగా తలెత్తి, కళ్లతో చూపిస్తూనే అడిగాడు రామరాజు ‘‘ఆ తుపాకీ ఎవరిది? మా మావగారి కాలం నాటిది!’’ మామూలుగా చెప్పిందామె. భాస్కరుడి గారి తాతగారు వేటాడేవారులెండి. తరువాత, ఒకటి రెండు సందర్భాలలో ఫితూరీదారులు ఇళ్ల మీద పడకుండా రక్షించింది కూడాను! అన్నారు అయ్యవారు. చాలా జరిగినట్టున్నాయి! మామూలుగానే అన్నాడు రామరాజు కూడా. మీరు రావడానికి ఒక్క సంవత్సరం ముందు, అంటే 1916లో కూడా మన్యంలో ఫితూరీ జరిగింది! అన్నారు అయ్యవారు. అటు మళ్లింది సంభాషణ. లాగరాయి ఫితూరీ అదే! ఈ ఊళ్లోనే ఉండేవాడు గరమండ మంగడు. చాలా అల్లరి చేశాడు. చిత్రంగా ఫితూరీలన్నీ పోలీసుల మీద కక్షతో మొదలై తరువాతే ఎటో నడిచేవి... భాస్కరుడిగారి తండ్రిగారూ, మా తండ్రిగారూ చెప్పుకుంటూ ఉండేవారు. అన్నారు వెంకటాచలం. మంగడి పేరు విన్నాను. ఎవరతడు? అడిగాడు రామరాజు.కొండవాడే. ఇప్పటివా ఈ గొడవలు. అటు రంప, ఇటు గూడెం కొండలు – తిరుగుబాట్లకి పోటీ పడుతున్నట్టు ఉండేవట అన్నారు అయ్యవారు. అప్పుడే గుండె గుభిల్లుమనే ఆ మాట గుర్తుకు వచ్చింది సోమమ్మగారికి. రామరాజు తల్లి కృష్టదేవిపేట వచ్చినప్పుడు చెప్పిన మాట– ‘ఈ పిల్లాడి ధోరణి ఇంకా ఎక్కడికి వెళుతుందో? ఉగ్రవాది అవుతాడని తునిలో జాతకం చెప్పారమ్మా! కంగారు పడుతున్నట్టు, వినరాని మాటలేవో విని భరించలేనట్టు హఠాత్తుగా అన్నారామె. బాబూ! ఇంకేదైనా మాట్లాడుకోండి! పితూరీలు... తిరుగుబాట్లు... ఆ ఊసులే వద్దు! ఆమె మాట వెనుక భీతి అక్కడ అందరి నోళ్లని కట్టేసింది. ఆ బూజు పట్టిన తుపాకీ కళ్ల ముందు కదిలితే చాలు... తూటా కంటే వేగంగా ఒక సమీపగతం దగ్గరకి దూసుకు వెళుతోంది ఊహ. కొండగాలి మోసుకొచ్చిన విప్లవ గీతమేదో చెవిలో దూకుతున్నట్టుంది. ఎంత విచిత్రం! జాతీయ చైతన్యంతో ప్రజలను ఐక్యం చేయడమే లక్ష్యంగా బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవిస్తున్న క్షణాలలోనే... కొండగ్రామాలకూ అలాంటి చైతన్యమే కావాలంటూ ప్రతి«ధ్వనించిందొక పెనుకేక. అడవి కాసిన అరుణోదయాలు మంచుతెర... మన్యం మీద మేలిముసుగులా. పగటి వేళలోనూ ఎముకలు కొరికేస్తోంది చలి పులి. అందరూ గొంగళ్ల కింద ముడుచుకుని ఉన్నారు. 1885, డిసెంబర్ మాసాంతంలో ఓ రోజు. అది సడక. మారుమూల కొండగ్రామం. అంత చలినీ కొద్దిసేపైనా మరచిపోయేటట్టు చే సి, కదలిక తెచ్చే ఘటన హఠాత్తుగా సంభవించింది. ఆ ఊరి రాకపోకలకి అదొక్కటే దారి. ఆ బాట వెంటే పై ఊరు వెళుతున్న సడక గ్రామ బారిక అడుగు వేయబోయి అలాగే నిలిచి పోయాడు. ఆ చిన్న కొండ పైనుంచి సడక గ్రామంలోకి తీసుకొచ్చే కాలిబాటలో ఒక రూపం అస్పష్టంగా. కళ్లు విప్పారించి చూశాడు బారిక. ఏదో ఆవహించిన మనిషిలా విసవిసా వస్తున్నాడా మనిషి. గుర్తు పట్టాలని మళ్లీ విప్పారించాడు కళ్లు. మంచుతో సాధ్యం కావడం లేదు. సన్నగా పొడవుగా ఉన్నాడా వస్తున్న మనిషి. లేత పసుపు రంగుపంచె కట్టుకుని, భుజాలæ నిండా నల్లటి గొంగడి కప్పుకున్నట్టు లీలగా తెలుస్తోంది. పొత్తిళ్లలో పసిబిడ్డను పట్టుకున్నట్టు రెండు చేతులలోను ఏదో మోస్తూ, అంత వేగంలోనూ జాగ్రత్తగా వేస్తున్నాడు అడుగులు. ఇంకా దగ్గరయ్యాడా మనిషి. నుదురంతా ఖాళీ లేకుండా దట్టంగా పసుపు. మధ్యగా నిమ్మకాయంత కుంకం బొట్టు– మంచుకి తడిసి చిన్నగా కారుతూ. బాగా పెరిగిన తెల్లటి జుట్టు, గెడ్డం వర్షంలో తడిసినట్టు ముద్దగా ఉన్నాయి. చివరికి అతడెవరో గుర్తుపట్టాడు బారిక. చలి మాట మరచి చేతులు జోడించి ఒక్కసారిగా ఉరికాడు, ముందుకి. ఆ మనిషికి ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కి, వినయంగా చేతులు కట్టుకుని నడవడం మొదలుపెట్టాడు, పక్కన. అతడు పక్క ఊరి శివసారి. అంటే పూజారి. వృద్ధుడు. పేరు సలాబి బోడడు. కొండదొర వర్గం. రెండు అరిచేతులలో పెట్టుకున్న ఆ వస్తువు – దండం. రెండడుగుల తెల్లకర్ర. పైన బండగా, పోను పోను పాము తోకలా సన్నగా ఉంది. నిండా పసుపు, కుంకం బొట్లు. చలికి బిగుసుకుపోయిన కొండచిలువ పిల్లలాగే ఉంది. మీ శివసారి ఇంటికి! ఆ ఒక్క మాటే అన్నాడు బోడడు. ఊళ్లోకి పరుగుతీశాడు బారిక. పది బారల దూరంలో ఇల్లు ఉందనగానే బారిక వేసిన కేక అక్కడ ప్రతిధ్వనించింది, మాలడు గారూ! రండి... రండి! ఇంట్లోనే ఉన్న మాలడు, సడక గ్రామ శివసారి, కంగారుగా బయటకు వచ్చాడు. పూర్తి పేరు పోతుకూరి మాలడు. 35 ఏళ్లుంటాయి. పొట్టిగా బలంగా ఉన్నాడతడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి పరవశించిపోయాడు. కొన్ని అడుగులు ముందుకు వేసి నిలబడ్డాడు మాలడు, చేతులు జోడించి. అతడికి ఎదురుగా వచ్చి ఆగాడు బోడడు. వెంటనే బోడడి పాదాల ముందు తల ఆన్చి మొక్కాడు మాలడు. రెండు చేతులలో దండం అలాగే ఉంచుకుని దీవించాడు బోడడు. గురుబ్రహ్మ, గురుర్విష్ణో, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః దుర్యోధన సంపద కలిగి, భీమన్న బలం కలిగి, అంటింది అమృతమై, ముట్టింది ముత్యమై, శత వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లు. పాడిపంటలు వర్ధిల్లుతూ, పూచిన పూవల్లా, కాచిన కాయల్లా, పున్నమి వెన్నెల్లా వెలగాలి. దీవెన తరువాత లేచిన మాలడు ఆ దండం అందుకోబోయాడు, మర్యాద పూర్వకంగా. ఇవ్వడానికి తిరస్కరిస్తున్నట్టు ఒక అడుగు వెనక్కివేశాడు బోడడు. ఉలిక్కిపడి, తన చేతులు వెనక్కి తీసుకుని, తొందరపాటుకు పరిహారమన్నట్టు రెండు చేతులతో లెంపలు వేసుకున్నాడు మాలడు. అప్పటికే సడక గ్రామంలో ఆడా మగా అంతా అక్కడి వచ్చారు. మునసబు ముర్ల బాలయ్య ఆ ఇద్దరికీ ఐదారడుగుల దూరంలో నిలబడ్డాడు చేతులు కట్టుకుని. ఏమిటి సెలవు? చేతులు మళ్లీ జోడిస్తూ అడిగాడు మాలడు. ఏం చెబుతాడో బోడడు అని అంతా ఎదురు చూస్తున్నారు, చెవులు రిక్కించి. రెండు నిమిషాల తరువాత, కళ్లు మూసుకుని నిశ్చలంగా అన్నాడు బోడడు, ‘‘నాకు దేవుడు కనిపించాడు! ఒక్కసారిగా మౌనం. మాలడినే కాక, గ్రామస్థులందరినీ కూడా ఉద్దేశించి చెబుతున్నట్టు చెప్పాడు బోడడు, ఆ దండాన్ని అలాగే పట్టుకుని. ఆ గొంతులో ఆవేదన, ఆవేశం. చింతలు పూస్తే చెడ్డకాలం... మామిళ్లు పూస్తే మంచికాలమని సామెత. కానీ ఇప్పుడు అంతా చెడ్డకాలమే. ఈ సమయంలో శుభవార్త చెప్పాడు దేవుడు. ఇవాళ అడవిబిడ్డ అడవిలో అడుగు పెడితే నేరం. కొమ్మ కొడితే రూపాయి జరిమానా. అడవిలో గొడ్డలి లేస్తే చాలు, కలప పన్ను. పంట మీద మొదలు పన్ను, కల్లు మీద చిగురు పన్ను... గంప పళ్లు తెచ్చుకుంటే అణా పన్ను. కావడి వేసుకుంటే రెండణాల పన్ను. భూమి మీద పన్ను. లేగదూడ మేస్తే పన్ను. ఇంటికోసం చిన్న దూలం కొట్టుకుంటే పన్ను. కట్టుబడి పేరుతో ముఠా మీదా పన్నే. అంతా పన్నుల రాజ్జెం. ఎప్పుడైనా ఉందా? ఇది సాగకూడదని దేవుడు చెప్పాడు. ఇందుకోసం మనం చేయవలసింది ఒక్కటే.... తెల్లోళ్ల జబర్దస్తు ప్రభుత్వం మీద పితూరీ ఎత్తాలి. నీ భూమి నీకు దక్కాలంటే బాణాలు అందుకోమన్నాడు, దేవుడు. మీ మాన్యాల మీద, మీ ఆడవాళ్ల మానాల మీద కన్నేసిన ఎర్రబుట్టలోళ్లని తరిమి కొట్టాలని దేవుడి సెలవైంది. మన తాతముత్తాలు ఈ నేల మీద పుట్టి, ఇందులోనే కలసిపోయారు. నీ కట్టె, నా కట్టె ఏ భూమిలో కలవాలి? అసలు ఈ అడవి తెల్లోడిదా? కాదు. మన దేవుడుది! తెల్లోడి దగ్గర తుపాకులు ఉండొచ్చు. కానీ మనకాడున్న విల్లంబులు గురి పెడితే విజయం మనదేనని దేవుడు చెప్పాడు. ఇదే శుభవార్త. ఈ అడవిలోనే తిరగాడుతున్న మన పెతర్లు (కాలం చేసిన తండ్రులు, అంటే ఆత్మలు) శపించకుండా ఉండాలంటే పితూరీ లేవదీయమన్నాడు దేవుడు. అని మౌనం దాల్చాడు బోడడు. ఆ మౌనాన్ని సంకేతంగా గుర్తించి మునసబు బాలయ్య, మాలడు ఆయన ముందుకు వెళ్లి నిలిచారు. పూజకు వేళయింది. మిగిలిన విషయం పున్నం రోజున మాట్లాడుకుందాం! అన్నాడు. అంటే సరిగ్గా వారం తరువాత. అప్పుడు అడిగాడు మాలడు, ఈ దండం.....?! ఇది మహిమ గల దండం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఐదుగురు వంతున మొక్కాలి, పంచపాండవుల్లాగా. చుట్టుపక్కల గ్రామాల వాళ్లూ రావాలి. అన్నాడు కళ్లకు అద్దుకుంటూ బోడడు. మళ్లీ బోడడే అన్నాడు. ఈ దండానికి గొప్ప కత ఉంది. నేను మళ్లీ పున్నానికే నోరు విప్పుతాను. అప్పుడు చెబుతాను. మాలడి ఇంటిలోనే ఒక మూల పీనె (అరుగు)ను వెంటనే పేడతో అలికించారు. దాని మీద పండగలలో దేవతల పీఠం కోసం వేసినట్టు నేరేడాకులు పరిచి ప్రతిష్టించారు దండాన్ని. పున్నమి వరకు బోడడు విరామం ప్రకటించడం ఓ వ్యూహం. ఈ ఏడు రోజులలో తన ఆశయం కనీసం పాతిక ముప్పయ్ గ్రామాలకు వెళ్లాలి. అదే జరుగుతోంది గూడెం కొండలలో. మహానదికీ, గోదావరికీ మధ్య ఉన్న తూర్పు కనుమలలో రంప, గూడెం ప్రాంతాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇందులో రంప– గోదావరి లోయ. గూడెం కొండల విలాసం – విశాఖ మన్యం. కొమ్మలన్నీ స్పష్టంగా కనిపించే మహా వృక్షం వంటిది రంపలోయ. ఇక్కడ 230 వరకు ఉన్నాయి గ్రామాలు. కోయలదే ఆధిపత్యం. మహా గుబురు వంటిది గూడెం. గూడెం కొండలు ఎలుగులు దూరని ఎర్రచిడుగులు. ఈ కీకారణ్యంలో 400కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ బగతలదే ప్రాబల్యం. సడక చుట్టూ ఉన్న గ్రామాలలో వృద్ధులంతా గొంతు సవరించుకున్నారు.రంపలోయ గాథలు, గూడెం కొండల కథలు గుండె లోతుల్లోంచి వచ్చాయి. ఆ మొదటి గాథే యువకులని రోమాంచితం చేసింది. రాజమండ్రి తాలూకా సరిహద్దుల నుంచి, మన్యంలో గొలుగొండ తాలూకా సరిహద్దుల వరకు ఉంది– యాభయ్ రెండు మైళ్ల రంప దేశం. 1798 నాటి గాథ... అడవంతా పచ్చదనం. ఆ వర్ష రుతువులో ఉరుము లేని పిడుగుల్లా రెండు కంపెనీల సిపాయీలు వచ్చి శిబిరాలు వేశారు. థక్.. థక్.. థక్..... ఉదయం, సాయంత్రం కొండ అంచుల మీద తుపాకులు, కత్తులు పట్టుకుని కవాతు చేయడం, గ్రామాలలోకి వచ్చి అలజడి చేయడం. కొత్తపల్లి, ఇందుకూరిపేట అనే మారుమూల గ్రామాల ప్రజలు ఈ పరిణామాలను చూసి చేష్టలుడిగిపోయారు. ఆ బలగాలు లెఫ్టినెంట్ మెక్లియోడ్ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. రంపకొండలు తమ జెండా కిందకి వచ్చిన సంగతిని అంత బీభత్సంగా ప్రకటించదలిచింది ఈస్టిండియా కంపెనీ. ఇది నచ్చలేదు అడవిబిడ్డలకి. అందుకే ఓ వేకువనే కొన్ని గ్రామాల కొండప్రజలు ఏకమై వచ్చి ఇందుకూరిపేట శిబిరం మీద దాడి చేశారు. ఆ తిరుగుబాటుకు నాయకుడే పండుదొర. అదొక నిరసన, అంతే. మళ్లీ ఆ ఏడాది ఆగస్టు 31న పురుషోత్తమపట్నం అనే ఊరు మీద కంపెనీ బలగాలు ఉపయోగిస్తున్న రేవులోనే... పండుదొర నాయకత్వంలోనే వాళ్ల మీద దాడి చేశారు ఫితూరీదారులు. కానీ, విల్లంబులతో పోరాడుతున్న కొండ ప్రజలని సులభంగానే మెక్లియోడ్ బలగం అణచివేసింది. కానీ ఆ హింస దారుణం. అది చూసే కొండలు మౌనం దాల్చాయి. అడవి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది.... దాదాపు పదిహేనేళ్లు.... 1813లో ఓ రోజు..... అప్పుడే వెలిసింది వాన. మట్టి గుబాళింపు, కొండలంతా. చినుకుల వల్ల కాబోలు ఆ నల్లగుర్రం మరింత నల్లగా కనిపిస్తోంది. వేగంగా వస్తోంది ఆ కొండగ్రామంలోకి. లంకణాలు చేసి చిక్కినట్టుగా ఉన్న ఆ మనిషి అడవి మేతతో బలిసి ఉన్న ఆ గుర్రం మీద వీరావేశంతో ఊగిపోతున్నాడు. అలంకారానికి ధరించే టెంగి గొడ్డలి మాత్రం వెండిలా మెరుస్తోంది. ఒక చేతిలో కళ్లెం, రెండో చేతిలో ఆ టెంగి గొడ్డలి. ఆ అశ్వికుని వెనుక రెండుమూడు వందల మంది ఉన్నారు. ఎక్కువ మంది చేతిలో విల్లంబులే ఉన్నాయి. నలుగురైదుగురి చేతిలో మాత్రం పాత తుపాకులున్నాయి. ఏ గ్రామంలో ప్రవేశించినా జనం సాగిలబడుతున్నారు. అతడు రంప జమిందారు లేదా మన్సబ్దారు రాజా రాంభూపతిదేవ్. నాలుగైదురోజులుగా తిరుగుతూ, ఈ గ్రామాలు ఇక నావి, నేనే పాలకుడిని అని వాటి పొలిమేరలలో నిలిచి ప్రకటిస్తున్నాడు. అవి ఒకప్పుడు అతడి వంశీకులు ఏలుబడిలోవే. అంతలోనే ఈస్టిండియా కంపెనీ బలగాలు రాంభూపతిదేవ్ను బంధించాయి. రాజమండ్రి తీసుకుపోయి, ఒప్పందానికి ఒప్పించాయి. దేవ్ ఈస్టిండియా కంపెనీ ప్రతినిధిగా ఉండడానికి అంగీకరించాడు. అతడు స్వాధీనం చేసుకున్న గ్రామాలకు అతడినే మొఖాసాదారుని చేయడానికి కంపెనీ అంగీకరించింది. దాదాపు ముప్పయ్ ఐదేళ్లు గడిచాయి. 1835, మార్చి నెల....ఎండలు ముదిరిపోతున్నాయి. భూదేవి పండుగ జరుగుతోంది, చాలా గ్రామాలలో. రంపదేశం ఆ సంరంభంలో ఉండగానే కబురు తెలిసింది. రాజా రాంభూపతిదేవ్ కన్ను మూశాడు. వారసుడు ఎవరు? అదో వేధించే ప్రశ్న. కారణం, దేవ్ మొదటి సంతానం– కూతురు. పేరు శ్రీజగ్గా అమ్మ. ఈడొచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఆమెకో పదమూడేళ్ల తమ్ముడు. ఇతడికి కూడా రాంభూపతిదేవ్ అనే పేరు పెట్టారు. కానీ అతడు రాజా రాంభూపతిదేవ్ అక్రమ సంతానం. ఏది జరగకూడదని మునసబులూ, ప్రజలూ కోరుకున్నారో అదే జరిగింది. ఈస్టిండియా కంపెనీ అధికారులు జగ్గా అమ్మనే తండ్రికి వారసురాలిగా మన్సబ్దార్ని చేశారు. ఓ ఆడదానికి ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టడం ఎలా? అదే ప్రశ్న. కానీ ఈ అసమ్మతిని గట్టిగా వినిపిస్తే ఆమె తమ్ముడిని మన్సబ్దారుని చేస్తారని శంక. ఇంకో ఎత్తు కూడా వేశారు. పోనీ పెళ్లైనా చేసుకోమని జగ్గా అమ్మని అంతా కోరారు. అల్లుడిని రంగం మీదకు తేవచ్చుననీ, ఈమెను పరదా వెనక్కి నెట్టేయవచ్చుననీ వారి ఆలోచన. ఈ ఒత్తిడి భరించలేక ఆమె తన తమ్ముడికి అనుకూలంగా మన్సబ్దారి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మహిళకు ఒంగి ఒంగి సలాములు చేసే పని తప్పిందనుకుంటే, ఇప్పుడు ఉంపుడుగత్తె కొడుకును సింహాసనం మీద కూర్చోబెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఒప్పుకోలేదు ప్రజలు. ఇంకో ఎత్తు వేశారు. శ్రీజగ్గా అవివాహిత. అదే ఆయుధమైంది. ఆమె మంచిది కాదని ప్రచారం మొదలైంది.మునసబులంతా కలసి అక్కాతమ్ముళ్లని రంపదేశం నుంచి బహిష్కరించారు. రాంభూపతి కంపెనీ అధికారులకి ఫిర్యాదు చేశాడు.పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు కంపెనీ మిందారీని తమ చేతుల్లోకి తీసుకుని పిల్ల రాంభూపతి మైనార్టీ తీరే వరకు జాగ్రత్తగా కాపాడతానంది. ఈ నిర్ణయమే నాలుగేళ్ల తరువాత చినికిచినికి గాలివానై ఫితూరీ దాకా వెళ్లింది. -
ఆకుపచ్చ సూర్యోదయం
ఒడ్డున నిలుచుని గంగానదిని చూస్తుంటే జీవిత గమ్యం దొరికినట్టనిపించింది. గంగ–అసి నదుల సంగమం దగ్గర ఉండే అసీ ఘాట్, దశాశ్వమేథ్ ఘాట్, సింధియా ఘాట్, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్, తులసీఘాట్, భోన్సలే ఘాట్.... ఎక్కడ నుంచి చూసినా గంగ ఈ దేశపు మహాద్భుతం అనిపించేది. నిత్యం ఒక ఘాట్లో స్నానం చేయడం, కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం.వారం తరువాత ఒక సంస్కృత పండితుడి దగ్గర చేరాడు రామరాజు. మనసుకు గొప్ప శాంతిని అందించింది కాశీ. చాలా కాలం ఉండాలి అనుకున్నాడు రామరాజు.కానీ ఆరునెలలు గడిచేసరికే మనసు మారిపోయింది. లక్నో, రాంపూర్ దాటి హరిద్వార్ చేరుకున్నాడు రామరాజు.తరువాత రిషీకేశ్. కొండల పాదాలను తడుపుతూ సాగుతూ ఉంటుంది. గంగ. ఆ ప్రవాహం వెంటే సాగిపోతూ ఉంటుంది ఆ యాత్ర. ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకు సాగుతూ ఉంటుంది ప్రయాణం. పిప్పల్కోట్, జోషీమ వరకు ఇదే దారి. అక్కడ నుంచి బదరీనాథ్. చైనా, టిబెట్ సరిహద్దులలోనే ఉంది. ఘడ్వాల్ ప్రాంతమది. మంచు నిండిన కొండలు... గోవిందఘాట్ నుంచి బదరీనాథ్కు తీసుకువెళ్లే ఆ 18 మైళ్ల ప్రయాణం దివ్యమైనది.బదరీనాథ్... పురాణాలలో చెప్పే బదరికాశ్రమం. అలకనంద తీరంలోని గొప్ప వైష్ణవక్షేత్రం. ఉపనిషత్తులకీ, బ్రహ్మసూత్రాలకీ భాష్యాలు అవతరించిన నేల. బదరీనాథుడి ఆలయం– శంకరభగవత్పాదులు నిర్మించినది. అందులోని జలం విష్ణుపాదాల నుంచి వచ్చినదని నమ్ముతారు. గుడికి కుడిపక్కనే బ్రహ్మకుండం. ఇది దాటి కుడి వైపున అలకనంద తీరం వెంటే యాభై గజాలు నడిస్తే, అంటే ఉత్తరాన ఉంది బ్రహ్మకపాలం. తిరుగు ప్రయాణంలో ఐదు నదుల నేల పంజాబ్ని దర్శించుకున్నాడు రామరాజు. అమృతసర్లో స్వర్ణాలయం కూడా చూశాడు. ఎక్కడ అడవులు ఉంటే అక్కడికే నడిచాయి అతడి పాదాలు. ఎక్కడ నది ఉంటే అటే పోయింది మనసు. నడుస్తూనే ఉన్నాడు. కానీ తృప్తి కలగడం లేదు. మళ్లీ ఆయన పాదాలు గోదావరి ఒడ్డుకు నడిచాయి. ఒక్క యాత్రతో మనసుని క్షాళనం చేయగల పుణ్యక్షేత్రాలు. ఒక్క స్నానంతో మనసుని క్షాళన చేసే నదీనదాలు. ఒక్క వీక్షణంతో జ్ఞానతృష్ణకు రెక్కలు తొడిగే కొండలూ కోనలూ. ఇది నా మహోన్నత దేశం. అయినా ఎందుకీ కరువు? అయినా ఏమిటీ అజ్ఞానాంధకారం? అయినా ఎలా వచ్చిందీ అనైక్యత? అన్నింటికి మించి మార్పుకోసం ఆరాటపడని జడత్వం ఏమిటి జాతి నిండా?పాపికొండల మీద నడుస్తుంటే హృదయం ఘోషిస్తోంది రామరాజుకి. తనకి జ్ఞానోదయం కల్పించమని గోదారమ్మని అడుగుతున్నట్టే ఉంది అతడి ముఖం. అన్వేషించమనే చెబుతోంది ఆటుపోట్ల గోదావరి. మళ్లీ నడక. మళ్లీ అన్వేషణ. ఎటో పోతున్నాడు. అదిగో! ఎవరో పిలుస్తున్నారు. ఎవరో తనని పిలుస్తున్నారు. ఔను. ఎవరో ఏదో పేరుతో పిలుస్తున్నారు.అది చిటికెల నారాయణమూర్తి గొంతు. ‘అయ్యా సాములోరు! ఆగండి! అటంతా అడవే స్వామీ. అదిగో అది మా అన్నగారిల్లు. రండి బాబు వెనక్కి రండి! మా ఇంట భిక్ష తీసుకుని వెళ్లండి......’ఇంకా ఈ ఊరి పేరు కృష్ణదేవిపేట అంటున్నాడతడు. అంతకు ముందు విన్నపేరే! తను ఆగిపోయాడు. చటుక్కున ఈలోకంలోకి వచ్చి పడ్డాడు రామరాజు. తను ఎక్కడ ఉన్నాడో అర్థమైంది. తెల్లవారినట్టుంది. గది బయట సోమమ్మగారు పిలుస్తున్నారు.‘‘బాబయ్యా! ఈ లాంతరు పట్టుకుని బయలుదేరు స్నానానికి.’’ 5 సీతను తీసుకుని అమ్మమ్మ అచ్యుతమ్మ వెళ్లిపోయింది. అది జరిగిన వారం రోజుల తరువాత.తనకు ఇచ్చిన ముందుగదిలో సాయంత్రం వేళ ఒక్కడూ కూర్చుని ఉన్నాడు రామరాజు. అప్పుడు వచ్చాడు భాస్కరుడు, ఏదో చెబుదామని. చూసీ చూడడంతోనే తనే ముందు అన్నాడు రామరాజు, ‘‘అన్నయ్యగారూ! ఒక్క విషయం!’’‘‘చెప్పండి!’’ అన్నాడు భాస్కరుడు.‘‘ఈ ఊరుతో నా అనుబంధం దైవనిర్ణయమనిపిస్తుంది నాకు. నా ఊరు, నేను ఉండవలసిన చోటు ఇదేననిపిస్తోంది. కానీ ఎల్లకాలమూ మీ ఇంటిలో ఉండడం భావ్యం కాదు. అమ్మ, తమ్ముడు కూడా ఇక నాతోనే ఉండిపోవచ్చు. నాకు కొద్దికాలం క్రితం కట్టినట్టే చిన్న ఇల్లు కట్టి ఇవ్వండి. కొంత భూమి కౌలుకి ఇప్పించండి! వ్యవసాయం చేయాలని ఉంది. నా బతుకు నేను బతకాలని ఉంది. ముఖ్యంగా ఏకాంతం కావాలి నాకు.’’ అన్నాడు రామరాజు.‘‘మీరూ, మీ కుటుంబం మాకు భారం కాదు. అయినా, మీ మాట సబబైనది. మీరు ఈ గ్రామంలోనే ఉండాలని మనసారా కోరుకుంటున్నవాడిగా, మీరు చెప్పినట్టే చేస్తాను. మీకు ఎంతో ఇష్టమైన తాండవ ఒడ్డునే ఆ ఏర్పాటు చేస్తాను. పడాల దిబ్బలు తెలుసు కదా! అవి మనకు తెలిసినవాళ్ల సొంత భూములే. అక్కడే మీరు ఉంటారు.’’ చెప్పాడు భాస్కరుడు.ఊరు సంబరం చేసుకుంది– ఆ వార్తతో. నీలకంఠేశ్వరస్వామి ఆలయం దాటి వెళితే చిన్న దిబ్బ నుంచి నది వైపు దిగుతున్నట్టు ఉంటుంది. అక్కడే చిక్కాలగెడ్డ అనే చిన్న ఏరు తాండవలో సంగమిస్తూ ఉంటుంది. ఆ ఎగుడుదిగుడు నేలనే పడాల దిబ్బలు అంటారు. వాటి మీదే వరి చేలు ఉన్నాయి. అందులో కొంత భూమి రామరాజు కౌలుకు తీసుకున్నాడు. రెండు చక్కని తాటాకు పాకలు నిర్మించి పెట్టారు గ్రామస్థులంతా కలసి. ఒకటి రామరాజు కుటుంబంతో ఉండడానికి. రెండు ఎప్పటి నుంచో రామరాజు కోరుతున్నట్టు గ్రంథాలయం కోసం, పఠన మందిరం కోసం. అవి పక్కపక్క కట్టిన పర్ణశాలల మాదిరిగా ఉన్నాయి. ఎదురుగా, ఏటి ఒడ్డున చెట్టు. పురాణాలలో వర్ణించే మున్యాశ్రమాలలా రూపుకట్టాయి. కొంచెం ముందే చిన్నగాదిగుమ్మి.వాటికి ముందు సోమమ్మగారు ఇచ్చిన నల్లటి ఆవును కట్టేశారు.ఇన్నాళ్లు నిర్మానుష్యంగా ఉన్న పడాల దిబ్బల ప్రాంతం ఇప్పుడు రమణీయమైన ప్రదేశమైంది. దానికే ఊరివారు శ్రీరామ విజయనగరం అని నామకరణం చేశారు. రామరాజు మీద పెంచుకున్న ప్రేమకు గుర్తు. 6 సూర్యనారాయణమ్మ మనసుకు గొప్ప ఊరట దొరికింది. 1918, జూన్ మాసాంతం – ఆ నెలలో కృష్ణాతీరం పరిస్థితి ఇదీ అంటూ ఆంధ్రపత్రిక ఇచ్చిన వార్తా కథనం వాళ్లందరినీ కలచివేసింది. గ్రేట్వార్ లేదా ప్రపంచ మహా సంగ్రామం ఫలితమంటూ ఇచ్చారా వార్తా కథనాలు. ‘ధరలు తగ్గించాలంటూ చల్లపల్లి ప్రజలు ఆందోళనలకు దిగారు. ఇందులో ఎవరి ప్రోద్బలం లేదు. రెండువందల మంది ఊరేగింపులో పాల్గొన్నారు. కొన్ని దుకాణాలను ఉద్యమకారులు దగ్ధం చేశారు. ‘ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడలలో కూడా ఇలాగే జనం ఉద్యమం చేపట్టారు. గుంటూరు ప్రాంతంలో బాపట్ల, వేటపాలెం, అమ్మనబ్రోలులో కూడా ఇలాగే ఆందోళనలు జరిగాయి. హాహాకారాలు మిన్నంటాయి. గోదావరి తీరంలోని పోలవరంలో కూడా అల్లర్లు జరిగినట్టు నివేదికలు వచ్చాయి.అసలు మద్రాసు ప్రెసిడెన్సీయే కరువుకాటకాలతో విలవిలలాడుతోంది.పేజీ తిప్పి, అక్కడ కనిపించిన ఇంకో వార్త చదువుకుంటున్నారు భాస్కరుడు. ‘ఈశాన్య భారత అడవులలో కుకీలు, చిన్లు అనే కొండవాళ్లు తిరుగుబాటు లేవదీశారని వార్తలు వస్తున్నాయి. పంజాబ్లో గదర్ పార్టీ విజృంభిస్తోందట. మలబార్లో మోప్లాలు తిరగబడుతున్నారట.’ 7 ‘‘సమిధలు స్వామీ!’’ ఆ మాటకు అటు తిరిగాడు రామరాజు.‘‘యాగం చేయిస్తాన్నారట. సంతలో చాటింపేశారు. అందుకే తెచ్చాం!’’ అన్నాడు గోకిరి ఎర్రేసు. చక్కగా కోసిన రావి చితుకుల మోపు ఉంది ఎర్రేసు నెత్తిమీద. ‘‘ఏ ఊరు నీది?’’ అడిగాడు రామరాజు ప్రసన్నంగా నవ్వుతూ. ‘‘గన్నర్లపాలెం స్వామీ! గోకిరి ఎర్రేసు అంటారు. కృష్ణదేవిపేట సంతకి కూడా వస్తుంటాను. ఆదినారాయణ బాగా తెలుసు!’’ అమాయకంగా అన్నాడు.భాస్కరుడు గారింటి అరుగు మీద కూర్చుని ఉన్నారు రామరాజు, భాస్కరుడు ఎదురెదురుగా, స్తంభాలకి జారపడి. చేతులు కట్టుకుని అక్కడే నిలబడి ఉన్నాడు ఆదినారాయణ.ఎర్రేసు వెనకే ఉన్నాడు బొంకుల మోదిగాడు, భుజం మీద కావడితో. మర్రి చితుకుల మోపు ఒకటి, రావి చితుకుల మోపు ఒకటి ఉన్నాయి కావడి తాళ్లల్లో. ఆ ఇద్దరి వెనుక కొంచెం దూరంలో నిలబడి ఉన్నారు మరో నలుగురు. అంతా కొండవాళ్లే. నెయ్యి, పుట్ట తేనె, మామిడాకులు మోయగలిగినన్ని తీసుకుని వచ్చారు. జూలై ముగుస్తున్నా తొలకరించలేదు ఆకాశం. విత్తనాలు పడలేదు. గ్రాసం లేక పశువులు పాడైపోతున్నాయి. బావులు లోతుకుపోయాయి. ఈ దుర్భిక్ష వాతావరణంలోనే వరుణ జపం, హోమం చేయిద్దామని రామరాజు సలహా ఇస్తే కృష్ణదేవిపేట ప్రజలంతా ఆనందంగా అంగీకరించారు. చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు, కొండవాళ్లని కూడా పిలవాలని చెప్పాడు రామరాజు. ‘‘సెలవు స్వామీ!’’ అన్నాడు ఎర్రేసు, ఎదురుగా వచ్చి. ‘‘ఎర్రేసూ! మీరంతా యాగానికి రావాలి.’’అన్నాడు రామరాజు. బ్రహ్మానందపడిపోయారు వాళ్లు. 8 ‘‘ఆంధ్రపత్రికలో ఏదో రాశారట. మిమ్మల్ని చప్పున తీసుకురమ్మన్నారు నాన్నగారు!’’ ఆవును కట్రాడుకు కట్టేస్తున్నాడు రామరాజు. అప్పుడే పరుగు పరుగున వచ్చారు, భాస్కరుడిగారబ్బాయి దాలినాయుడు, మరో కుర్రవాడు. అరగంటకి గ్రామచావడి దగ్గరకి చేరుకున్నాడు రామరాజు. ‘‘చూశారా రామరాజుగారూ! నెలా పదిరోజులు దాచిపెట్టారు ఈ వార్తని. వీళ్లు మనుషులేనా?’’ అన్నాడు మర్రి వెంకటాచలం. ఇప్పటిదాకా ఎంత ఆవేశపడి ఉంటాడో అతని మాట తీరే చెబుతోంది. ఆ వార్త భాగం మాత్రమే కనిపించేటట్టు ఆంధ్రపత్రికను మడిచి రామరాజు చేతికి ఇచ్చాడు భాస్కరుడుగారు. జూలై 12: 1919 అమృత్సర్లో అశాంతి ఇలాంటి దుర్ఘటన గురించి ఇంత ఆలస్యంగా పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నందుకు మొదట క్షమాపణలు కోరుతున్నాం. ఇలాంటి రక్తాక్షరాలకు ఈ పత్రికలో చోటు ఇవ్వవలసి వస్తుందనీ, వేలాదిమంది మనసులను గాయపరచవలసి వస్తుందనీ ఊహించలేదు.1919, ఏప్రిల్ 13వ తేదీ హిందూదేశ చరిత్రలో మరచిపోలేని రోజు. పంజాబ్లోని అమృత్సర్లో, స్వర్ణదేవాలయం పక్కనే ఉన్న జలియన్వాలాబాగ్ మైదానంలో శాంతియుతంగా సమావేశమైన పౌరుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. హర్మందిర్ సాహెబ్ దగ్గరే ఉన్న ఈ తోటలో జరిగిన కాల్పులలో 379 మంది చనిపోయారనీ, 1137 మంది గాయపడ్డారనీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంకె నిజం కాదనీ, చనిపోయినవారి సంఖ్య ఇంకా ఎంతో ఎక్కువ అని గాంధీగారికి సమాచారం అందుతోంది. మృతులలో 41 మంది బాలురు, ఆరువారాల శిశువు కూడా ఉన్నారని పంజాబ్ ప్రభుత్వమే ప్రకటించింది........ పెద్ద వార్త. పూర్తిగా చదవకుండానే కళ్లల్లో నీళ్లు నిండి కళ్లు అలుక్కుపోయాయి రామరాజుకి. ‘‘ప్రపంచ సంగ్రామంలో సహకరించినందుకు గాంధీగారికీ, పంజాబ్ ప్రజలకీ ఎంత గొప్ప కానుక ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం! నేను ఐదునదుల పంజాబ్ను దర్శించుకున్నాను. ఇప్పుడు తెల్లజాతి మరో నదిని పారించింది. అది నెత్తుటి నది’’అంటూనే అక్కడ నుంచి వెళ్లిపోయాడు, రామరాజు. ఆ రోజంతా తాండవ ఒడ్డున కూర్చుని బాధపడుతూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ కొన్ని ప్రశ్నలు పదునెక్కుతున్నాయి. అహింసతో హింసని నిరోధించడం వాస్తవిక ఆలోచనేనా? కానిస్టేబుల్ కుండలో నుంచి తీసి ఇచ్చిన నీళ్లు తాగుతున్నాడు ఫర్బీస్. అప్పుడే మోగింది వైర్లెస్. ‘‘హలో.... నర్సీపట్నం హెడ్క్వార్టర్స్...ఓవర్!’’పరిచయం కలిగిన గొంతు. మరింత ఉత్సాహంగా స్పందించాడు ఫర్బీస్. ‘‘హలో.... కేడీపేట క్యాంప్....హలో, ఈవ్లింగ్. నువ్వేనా!? గుడ్మార్నింగ్. ఓవర్.’’‘‘అభినందనలు!’’ అవతల అన్నాడు ఈవ్లింగ్. అడ్డతీగెల ఠాణా అధిపతి అతడు.‘‘నీక్కూడా. నర్సీపట్నంలో ఎవరున్నారు?’’ అడిగాడు ఫర్బీస్.‘‘సాండర్స్, మార్టిన్ ఇప్పుడే కేడీపేట బయలుదేరారు. స్పెషల్ కమిషనర్, జాన్ మద్రాస్ నుంచి రాబోతున్న ఫోన్ కాల్ కోసం చూస్తున్నారు. వీళ్లూ కేడీపేట బయలుదేరతారు.’’ చెప్పాడు ఈవ్లింగ్. స్పెషల్ కమిషనర్ వచ్చాక ఏజే హెపెల్ని ఆపరేషన్స్ కమాండర్గా తప్పించి జాన్ని నియమించాడు. ‘‘అన్నట్టు స్వేనీ గాడు నిన్ననే అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నాడు?’’ అన్నాడు ఫర్బీస్.‘‘స్పెషల్ కమిషనర్కీ, జాన్కీ చరిత్ర చెబుతున్నాడు.’’ అన్నాడు ఈవ్లింగ్.‘‘ ఇప్పుడా? ఎవరి చరిత్ర?’’ అంత ఉత్కంఠలోనూ ఆసక్తిగా అడిగాడు ఫర్బీస్.‘‘అదే, లాగరాయి ఫితూరీ, గరిమండ మంగడు... అంతకుముందు ద్వారబందాల చంద్రయ్య, కారం తమ్మనదొర–– ఇవన్నీ...గంట నుంచి. ఎప్పుడో క్లైవ్ చేసిన ప్లాసీ యుద్ధానికి ముందే చౌర్స్ అనేచోట కొండవాళ్లు తిరుగుబాటు చేశారట. అక్కడ అందుకున్నాడు. ఇక చూస్కో– ఖాశీలట, ఖోందులట, ఖోలీలట, సంతాల్స్ అట, ముండాలట, బీర్సా ముండా అట, కుకీలట – బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి, బొంబాయి ప్రెసిడెన్సీ మీదుగా తిప్పి, చివరికి కథని మద్రాస్ ప్రెసిడెన్సీ విశాఖ మన్యంలో లాగరాయికి తీసుకొచ్చాడు. అసలు స్పెషల్ కమిషనర్ రెండు రోజుల నుంచి హెపెల్ నివేదిక తెలుసుగా, అదే చదువుతున్నాడట. ఓవర్.’’ మూడవ అధ్యాయం గోడకు తగిలించిన ఆ వస్తువు మీద అనుకోకుండా పడింది రామరాజు దృష్టి.ఎప్పుడూ మూసి ఉండే ఆ గది తలుపు ఆరోజు బార్లా తీసి ఉంది. పాతసామాను పడేసే గది.కొండచిలువ మింగిన చిరుజంతువు ఆకృతి పొట్ట మీద లీలగా కనిపిస్తున్నట్టు ఉబ్బెత్తుగా ఉంది, ఆ గోడకి. అంత పొడవు ఉన్నా పట్టి పట్టి చూస్తే తప్ప తెలియడం లేదు. మట్టితో అలికిన గోడ. గోడ మీద నుంచి ఒక పొరలా బూజు, బూజు మీదుగా దట్టంగా దుమ్ము. తన ఒడిలో ఉన్న సోమమ్మ కుడి కాలు మర్దన చేస్తూనే మార్చి మార్చి చూస్తున్నాడు రామరాజు, ఆ గోడ కేసి. ‘‘ఇంకో నాలుగు చుక్కలు పొయ్యి!’’ పక్కనే ఉన్న దాలినాయుడితో అన్నాడు రామరాజు.కొబ్బరి నూనె సీసా ఒంచి వేశాడతడు, ఆమె పాదం మీద. తరువాత వంటింటి వైపు వెళ్లాడు.ఈసారి ఇంకాస్త బలంగా మర్దన చేసాడు రామరాజు. బాధని పంటి బిగువున అణుచుకుంటోంది సోమమ్మ.మొన్ననే బావి దగ్గర కాలు మడతపడిందామెకు. ఆ సంగతి ఆలస్యంగా తెలిసింది. వెంటనే శ్రీరామ విజయనగరం నుంచి వచ్చాడు రామరాజు. ఆ ఇంటికి వచ్చి ఇంతకాలమైనా ఏనాడూ లోపలికి రాలేదు. ఇప్పుడు సోమమ్మగారి కాలు బెణుకు వల్ల వచ్చాడాయన.రామరాజుకి చటుక్కున గుర్తుకొచ్చింది పాండవుల మెట్ట....... ఆ రోజు సింహాచలం వెళ్లొస్తామంటూ తుని నుంచి బయలుదేరారు– రామరాజు, ఆయన తుని మిత్రులు. కానీ మరునాడు పెద్దాపురంలో దిగారు, తెలతెలవారుతుండగా.పెద్దగా కష్టపడకుండానే అతడి చిరునామా తెలిసింది. పేరు షేక్ మదీనా. ఊరు మొదట్లోనే చిన్న పెంకుటిల్లు. రిటైర్డ్ పోలీసు ఉద్యోగి మదీనా. అరవై అయిదేళ్లుంటాయి. వాళ్లలో రేగరాజు మహా చురుకు. మాటకారి. ‘‘నవాబుగారూ! నమస్కారం. మాది తుని. క్షత్రియులం’’ అన్నాడు.‘‘నమస్కారం బాబూ!’’ అన్నాడతడు ఎంతో మృదువుగా. ‘‘తుపాకీ కాల్చడంలో తమది అందె వేసిన చేయి అని విని వచ్చాం, ఇంతదూరం. మా శ్రీరామరాజుకి వేటాడాలని కోరిక. మీరు తుపాకీ పట్టడం నేర్పించాలి. కాదనకూడదు.’’ అన్నాడు రేగరాజు.‘‘ఎంతమాట బాబూ! నేర్పిస్తాను. ఓ మూడు రోజులు ఉంటారా! ఇంతకీ ఎక్కడుంటారు?’’ అన్నాడు మదీనా.‘‘ఉంటాం. సత్రంలో బస.’’ మళ్లీ అన్నాడు రేగరాజు. ‘‘అదిగో! చూశారుగా, ఆ కొండ, ఆ గుడి. అదే పాండవులమెట్ట. మధ్యాహ్నం మూడు గంటలకి వచ్చేయండి. నా తుపాకీ ఉంది. దానికి లైసెన్సు కూడా ఉంది. నేర్పించేద్దాం!’’ అన్నాడు మదీనా.‘‘ఇప్పుడైతే ఏం?’’ అమాయకంగా అడిగాడు పేకేటి సుబ్బరాజు.‘‘లేడికి లేచిందే ప్రయాణం అంటే కాదు బాబూ! ఈ ఊళ్లోనే సారస్వత సంఘం అని ఉంది. దాన్లో పనిచేస్తున్నాను. మధ్యాహ్నం ఖాళీ. పైగా ఆ వేళకి మెట్ట మీద ఎవరూ ఉండరు.’’ అన్నాడు మదీనా. సాయంత్రానికి నెమ్మదిగా వచ్చాడు మదీనా, రెండు భుజాల మీద రెండు రైఫిళ్లతో.