ఆకుపచ్చ సూర్యోదయం | Green sunrise | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యోదయం

Apr 30 2017 2:21 AM | Updated on Sep 5 2017 9:59 AM

ఆకుపచ్చ సూర్యోదయం

ఆకుపచ్చ సూర్యోదయం

ఇదిగో రాజులబ్బాయ్‌! తమరికి సర్కారు వారు రాసిచ్చిన భూమి ఇదే. యాభయ్‌ ఎకరాలు. సీలేరు ఒడ్డు. నక్క తోకని తొక్కి వచ్చావ్‌! అదే తూర్పు.

‘‘ఇదిగో రాజులబ్బాయ్‌! తమరికి సర్కారు వారు రాసిచ్చిన భూమి ఇదే. యాభయ్‌ ఎకరాలు. సీలేరు ఒడ్డు. నక్క తోకని తొక్కి వచ్చావ్‌! అదే తూర్పు. తాసీల్దారుగారి మేలు జన్మలో మరచిపోకూడదు. ఆ దిబ్బ మీదే ఇల్లు కడతాం. ఇల్లంటే ఓ పాక. అది పడమర. అక్కడ ఆ తాటితోపే సరిహద్దు.

నేను ముందే చెబుతున్నాను. నాకు పితూరీలూ, సభలూ అంటే సరిపడవు. ఇందులో ఎంత దున్నుతావో ఆలోచించుకో. అప్పటిదాకా అన్నీ మేమే పంపుతాం. అన్నట్టు నీకు తల్లిగారు, తోడబుట్టినోడు ఉన్నారంట కదా! ఆళ్లని ఎప్పుడు తీసుకొస్తావు? తాదూర సందులేదు గానీ, మెడకో డోలంట! సరే, జన్మ అన్నాక అమ్మా అయ్యా, అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్లూ ఉండకపోరు. కానీ భారం మన మీదున్నప్పుడు మొయ్యాలి కదా! అందుకంటన్నాను.’’పుల్ల విరిచి పొయ్యిలో పెట్టిన రీతిలో అంతా చెప్పేశాడు దుచ్చర్తి ముఠాదారు చెక్కా లింగందొర.

లింగందొర రంప రాజ్యంలో గొప్ప ప్రభుభక్తి పరాయణుడు. ముందురోజు మధ్యాహ్నమే నర్సీపట్నం పోలీసులు తీసుకువచ్చి ఫజులుల్లాఖాన్‌ ఆదేశం మేరకు దుచ్చెర్తిలో లింగందొరకి అప్పగించారు శ్రీరామరాజుని. ‘‘గిల్లితే పాలుగారేలా ఉన్నాడు, ఈ కుర్రోడి గురించేనా మీరు ఇంత హైరానా పడతన్నారు?’’ అని పోలీసులని లింగందొర వెక్కిరించాడు కూడా. ఎప్పుడొస్తాడో తెలియదు, వచ్చి ఒకసారి చూసి పోతుంటాడతడు గుర్రం మీద వచ్చి.పదిరోజుల తరువాత యాభయ్‌ ఎకరాలకి శాశ్వత పట్టా తెచ్చి చేతిలో పెట్టాడు లింగందొర.

పదిహేను రోజుల తరువాత పాక కూడా సిద్ధం చేయించాడు. పైడిపుట్ట నుంచి అడ్డతీగెలకు మూడుమైళ్లు. నిత్యం వెళ్లి పోలీసు స్టేషన్‌లో సంతకం చేసి రావాలి. ఆ దారిలో వెళుతున్నప్పుడూ అంతే, అప్పుడప్పుడు ఒక కానిస్టేబుల్‌ తనని వెంటాడడం గమనించాడు రామరాజు. తల్లినీ, తమ్ముడినీ పైడిపుట్ట పంపవలసిందని కృష్ణదేవిపేట ఉత్తరం రాశాడు రామరాజు. ఆ రోజు సాయంత్రం రామరాజును వెతుక్కుంటూ నది దగ్గరకు వచ్చింది సూర్యనారాయణమ్మ.వేసవి. నదిలో తెల్లటి ఇసుక తిన్నె మీద వెల్లకిలా పడుకుని ఉన్నాడు రామరాజు.తమ్ముడు సత్యనారాయణరాజు నత్తగుల్లలు ఏరుతున్నాడు దూరంగా.‘‘రా అమ్మా!’’ అన్నాడు రామరాజు. ఆమె వచ్చి కొడుకుకు దగ్గరగా కూర్చుంది.పది నిమిషాలు మౌనంగా ఉండి తరువాత అందామె.‘‘చిట్టిబాబూ! ఈ కొండ్ర నీకు ఎందుకిచ్చారో నాకైతే అర్థం కావడంలేదు. ఈ భూమితో నిన్ను రైతుని చెయ్యాలనుకుంటున్నారో, ఖైదీని చేయాలని అనుకుంటున్నారో తెలియడం లేదు. ఇంకొకటి చెప్పనా! తమ్ముడు ఇలాగే ఉంటే రేపన్ననాడు ఏం చేస్తాడు? వాడూ నాలుగు అక్షరాలు నేర్చుకోవాలి.

మనం ఏ నరసాపురమో, భీమవరమో– నీకు నచ్చే చోటికి– వెళ్లిపోదాం, ఆలోచించు నాన్నా!’’ ‘‘నిజమేనమ్మా! పైడిపుట్ట నాకు గోడల్లేని కారాగారమే.’’ అన్నాడు రామరాజు.‘‘అయితే, ఆలోచించావన్నమాట. తుని, మోగల్లు ఎక్కడికైనా సరే. వెళ్లిపోదాం మరి!’’ అన్నదామె, ఆర్తిగా.‘‘అక్కడికి నేనెలా రాగలనమ్మా! ఇది చూడు! నిన్న ప్రవహించిన నదికి జాడ కదా! ప్రవాహం లేకపోయినా కంటికి కనిపిస్తూనే ఉంది నది. నిన్నటి ప్రవాహం అలికిడి చెవులలో మిగిలే ఉంటుంది. నా జీవితమూ అంతే. దద్దాకీ, చుట్టాలకీ ఇప్పుడు నామీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందో నేను ఊహించగలను. తమ్ముడి చదువు ముఖ్యం. నువ్వు వెళ్లు. నేను నేపాలు యాత్రకి వెళ్లాలని అనుకుంటున్నాను.’’ అన్నాడు రామరాజు.

నిలువెల్లా వణికిపోయింది ఆ మాట విని, ఆమె.‘‘మళ్లీ యాత్రలేమిటి నాయనా? సంపాదించిన పుణ్యం చాలకా? ఇంక నన్ను బాధ పెట్టకురా!’’ ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ అన్నది సూర్యనారాయణమ్మ. ‘‘నిన్ను బాధ పెట్టాలని నేను ఏనాడూ అనుకోనమ్మా! పరిస్థితులు అలా వస్తున్నాయి. అందుకు నన్ను క్షమించమ్మా! ఈ నిఘా, ఈ పరోక్ష కారాగారం మనకొద్దు. మీరు ముందు వెళతారు. నేను నేపాలు యాత్ర తరువాత వస్తాను.’’ అన్నాడు రామరాజు.‘‘చిట్టిబాబూ! నన్ను వదిలిపోకు నాన్నా!’’ అంది దాదాపు ఏడుస్తూ.‘‘వెళ్లనమ్మా! కానీ నేను అక్కడికి వస్తే నీకు కొత్త కష్టాలు తప్పవు. తమ్ముడి చదువూ సాగదు.

నా పేరు చెబితే ఏ బడిలో చేర్చుకుంటారు చెప్పు! నేను వెళ్లేది నేపాలు యాత్రకే!’’ అన్నాడామె చేతులు పట్టుకుని.బావురుమందా తల్లి హృదయం. అది విని తమ్ముడు వచ్చాడు గబగబా. తల్లిని ఓదార్చడం రామరాజు వల్ల కాలేదు. తన కారణంగా ఒక అమాయకురాలికి, ఒక సాధారణ గృహిణికి వచ్చిన కష్టంతో అతడికి కన్నీళ్లొచ్చాయి. పరిస్థితుల మీద ఆగ్రహం కలిగింది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పది నిమిషాలకి ఏదో నిశ్చయానికి వచ్చినట్టు లేచి నిలిచిందామె.

6                                                           
‘మీకు కల్పించగలనన్న వాతావరణం నేను కల్పించలేకపోయాను. అందుకు క్షంతవ్యుణ్ణి. పోలీసు నిఘా నేనూహించింది కాదు. సరే, నీ కోరిక మేరకే, నిన్ను ఇంటర్న్‌మెంట్‌ నుంచి విడుదల చేస్తున్నాను. నీవు నేపాల్‌ యాత్రకు వెళ్లు. గండకీ నది నుంచి సాలగ్రామాలు తెచ్చుకోవాలన్న నీ ఆకాంక్షకి నేను అడ్డు చెప్పలేను. చెప్పే హక్కు నాకు లేదు.’ అని చెప్పి అనుమతిపత్రం రాసిచ్చాడు ఫజులుల్లా.  
ఆ పత్రం ఇస్తూ కళ్లలోకి చూశాడు ఫజులుల్లా ఖాన్‌. ఆ కళ్లు నిజం చెప్పడంలేదనిపించింది.

7                                                 
 పైడిపుట్ట వచ్చి మూడు మాసాలు పూర్తవుతున్నాయి అంతే. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్న తన ఆకాంక్ష తల్లి నోటి నుంచి కూడా వినిపించాక తనను ఎవరో నడిపిస్తున్నారన్న భావన కలిగింది రామరాజుకి. ఆ రోజు హఠాత్తుగా విన్న వార్తతో అది మరింత బలపడింది.అడ్డతీగెలకు ఐదు మైళ్ల దూరంలోనే ఉంది తిమ్మాపురం. అక్కడున్న ప్రభుత్వ అతిథి గృహంలో ఫజులుల్లా ఖాన్‌ జూలై 27న హఠాత్తుగా చనిపోయాడు. ఒక పక్క అలాంటి మనిషి కన్నుమూయడం బాధాకరంగానే ఉంది. మరో పక్క ఇక తను స్వేచ్ఛాజీవి. ఆ విషయం మాత్రం తెలియని ఆనందాన్ని నింపుతోంది.  lముందు ఎద్దుల బండి వెళుతోంది. వెనకే రామరాజు గుర్రం మీద అనుసరిస్తున్నాడు. అది చెక్కా లింగం దొర గుర్రాలలో ఒకటి.పృష్ఠం మీద సెగగడ్డ విపరీతంగా బాధ పెడుతోంది మూడురోజుల నుంచి. కొద్దిగా జ్వరం కూడా ఉంది. కానీ ఆ బాధ తల్లి గమనించకుండా జాగ్రత్త పడుతున్నాడు.
సత్యనారాయణరాజు మాత్రం బండిలో నిద్రపోతున్నాడు.

వేటమామిడి వచ్చింది. గుర్రం దిగి తల్లి దగ్గరకి వచ్చి కాళ్లు రెండూ స్పృశిస్తూ దణ్ణం పెట్టాడు రామరాజు. కంట తడి పెట్టలేదు సూర్యనారాయణమ్మ. ‘‘ఈ తల్లి బతికే ఉందని గుర్తుంచుకో తండ్రీ! క్షేమసమాచారాలు తెలియచేస్తూ ఉండు చాలు!’’ అన్నదామె.  కొడుకును కంటి నిండా చూసుకుని మళ్లీ బండెక్కిందామె. అది రాజమండ్రి దిశగా కదిలిపోయింది.రామరాజు గుర్రం వెనుదిరిగింది. రెండు నిమిషాలకే పృష్ఠం మీద కురుపు చితికింది. ఇంతకాలం బాధించిన ఆ సలుపు చేత్తో తీసి పక్కన పెట్టినట్టయింది.

 8                                                      
‘కిన్నెరల వాగు దగ్గర!’’
ఆ వచ్చినవాడు చెప్పాడు ఎండు పడాలుకి. ‘‘మొదట గుర్రం నడుముకు అంటుకున్న రక్తాన్ని కడిగాడు. అతడికి ఎడమవైపున నడుం నుంచి కాలి దాకా పంచంతా రక్తమే. అది కూడా కడుగుతున్నాడు. ఏదో గాయం కాబోలు!’’ ఇంకొంచెం వర్ణించాడతడు. ‘‘నడు చూద్దాం!’’ గొంగళి కప్పుకుని ఆ వచ్చినవాడి వెంటే వెళ్లాడు పడాలు. అతడు పడాలు మనిషే. అప్పుడే తెల్లవారుతోంది. వర్షాకాలం కారణంగా నిండుగా పారుతున్న కిన్నెరలవాగు నీళ్లు సంజకెంజాయలో ఎర్రగా ఉన్నాయి. ఆగంతకుడు స్నానం కూడా పూర్తి చేసినట్టున్నాడు. సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నాడు.

గుర్తు పట్టలేకపోయాడు ఆ మనిషిని. అడుగులో అడుగు వేసుకుంటూ వాగు గట్టు దాకా వచ్చి నిలబడ్డాడు పడాలు. నెమ్మదిగా అన్నాడు, ‘‘ఎవరు?’’అతడు తిరిగి చూశాడు. వెంటనే మూడుసార్లు దోసిలితో నీళ్లు వదిలి గట్టు మీదకు వచ్చాడు. సరాసరి పడాలు ఎదురుగానే నిలబడి అడిగాడు, ‘‘బాగున్నారా పడాలు గారూ!’’ఒక్క లిప్త ఆలస్యమైనా చటుక్కున గుర్తు పట్టాడు పడాలు, ఆ గొంతు.‘‘స్వామీ! మీరా!? మీరు... మీరు ఇక్కడ....?’’ అన్నాడు పడాలు, రెండు చేతులు జోడించి, విస్మయంగా.

‘‘ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాను. ఎందుకు రావాలో అందుకే వచ్చాను.’’ అన్నాడు రామరాజు, నడుమకు కట్టుకున్న అంగవస్త్రం తీసి పిడుస్తూ. ‘‘ఏదైనా దెబ్బ తగిలిందా స్వామీ! కులాసాగానే ఉన్నారు కదా! రక్తం కడుక్కున్నారట....’’ అన్నాడు ఆందోళనగా పడాలు. తన పొడవాటి జులపాలను పిడిచిన గుడ్డతోనే తుడుచుకుంటూ అన్నాడు రామరాజు. ‘‘అదే పడాలు గారూ! వేధించి వేధించి, అర్ధరాత్రి చితికింది.. వ్రణం. ఎంత హాయిగా ఉందనుకున్నారిప్పుడు. ఆ జ్వరం, ఆ సలుపు అన్నీ పోయాయిప్పుడు.’’ ∙వారం రోజుల తరువాత లింగందొరని ఒక యువకుడు కలసి, తనను శ్రీరామరాజు పంపించాడని చెప్పి,  గుర్రాన్నీ, ఒక లేఖనీ అప్పగించాడు.
లేఖ తెరిచి చూశాడు లింగందొర.

పైడిపుట్ట 14–6–1922
మహారాజశ్రీ దుచ్చర్తి ముఠాదారు శ్రీ చెక్కా లింగం దొరగారికిఅల్లూరి శ్రీరామరాజు వ్రాయు లేఖార్థములునేను నేపాళము వెళ్ల నిశ్చయించితిని. కావున, ఈ సంవత్సరం నాకు పైడిపుట్టలో 50 ఎకరములకు ఇప్పించిన శాశ్వతపు పట్టా మాయమ్మయ్యగారు వెళ్లేటప్పుడు పుస్తకములలో పెట్టుకుని వెళ్లిపోయినారు. నాకా భూమితో ఏ జోక్యము లేదు. మీ ఇష్టం వచ్చినవారికి ఈయవచ్చు. ముందు ఎప్పుడూ నేనా భూమి విషయమై ఏ తగాయిదాయున్నూ చేయను. మీరు నాకిప్పించిన పట్టా నా వద్ద ప్రస్తుతము లేనందున ఈ యుత్తరము వ్రాయడమైనది.చిత్తగించవలెనుశ్రీ అల్లూరి శ్రీరామరాజు‘అసలేంటి ఈ కుర్రోడు?’ అనుకుంటూ ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు లింగందొరకి.

నలభై నిమిషాల తరువాత అప్పుడే హఠాత్తుగా మోగింది, కేడీపేటలో వైర్‌లెస్‌.‘‘హలో... కొయ్యూరు క్యాంప్‌... కొయ్యూరు క్యాంప్‌... ’’ ఎవరో కానిస్టేబుల్‌ గొంతు.‘‘హలో... హలో... కేడీపేట క్యాంప్‌. ఏరా బాస్టర్డ్స్‌! రామరాజుని అరెస్టు చేసేశామని ఒళ్లు తెలియడం లేదా? ఎక్కడ చచ్చారు? ఓవర్‌!’’ అరిచాడు ఫర్బీస్‌.‘‘అందర్నీ బయటే కాపలా ఉండమని చెప్పారు మేజర్‌ దొరవారు.’’ అన్నాడు అవతల కానిస్టేబుల్‌.‘‘వాడొకడు. ఎవరిమాటా వినడు.’ మనసులోనే అనుకున్నాడు ఫర్బీస్‌‘‘సరే, నర్సీపట్నం నుంచి ఈవ్‌లింగ్‌ చెప్పిన సమాచారం కొయ్యూరు క్యాంప్‌ అధిపతికి చేరిందా? లేదా?’’ స్పష్టంగా, పట్టిపట్టి అడిగాడు ఫర్బీస్‌.
‘‘తెలియదు దొర!’’ అన్నాడు అవతల కానిస్టేబుల్‌.

‘‘గోటూ హెల్‌! గొంతు పగిలేటట్టు అరిచాడు ఫర్బీస్‌. ఆరవ అధ్యాయం‘‘మన పోరాటం మొదలైంది!’’ శబరికొండ మీద ప్రకటించాడు రామరాజు. ‘‘తొలి అడుగు వేయడానికి ముందే గుర్తించవలసిన కొన్ని వాస్తవాల గురించి  మననం చేసుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం.’’ మళ్లీ రామరాజే అన్నాడు.ఈ మాటతో ఉప్పొంగిపోయారు అక్కడ ఉన్న అరవై డెబ్బయ్‌ మంది. ఇప్పుడు వాళ్లంతా చూస్తున్న శ్రీరామరాజు, కృష్ణదేవిపేటలో చూసిన ఆ యోగి కాదు. యుద్ధభూమిలో ఆయుధం పట్టి నిలిచిన యోధునిలా  కనిపిస్తున్నాడు.
19–8–1922... రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం.

 ఉదయం రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి అందరితో కలసి పూజలు చేశాడు రామరాజు. వంద కలశాలతో నీళ్లు తెప్పించి అభిషేకం చేయించాడు. చివరిగా పూజ కోసం వచ్చిన పెద్దలనీ, ఉద్యమంలో భాగస్వాములు కాబోతున్నవారినీ ఒకచోట సమావేశపరిచాడు. ఆ కొండ గ్రామం రచ్చబండ దగ్గర కూర్చున్నారంతా. అవసరమైతే ఉపయోగపడతాయని తెచ్చిన ఐదారు లాంతర్లు చప్టాలా ఉన్న పెద్ద రాయి మీద మసక వెలుతురునిస్తున్నాయి. నక్షత్రాలు మసకబారిపోయాయి, ఆ శ్రావణమాసపు వెన్నెల ఆకాశంలో.

 మనుషులు వినడం సాధ్యంకాని సంగీతమేదో అడవికి వినిపిస్తున్నట్టుంది వెన్నెల. కొద్దిగా అవతల కనిపిస్తున్న ఆ లోయ గుండె నిండా వెండి వెలుతురు బిందువుల కుంభవృష్టి. స్పర్శకు అందని, ఆకృతికి అతీతమైన మహాశిల్పంలా మలిచి అడవి అందాన్ని ఇంకా ఇంకా పెంచుతోంది వెన్నెల. గాం సోదరులు, ఎండు పడాలు, గోకిరి ఎర్రేసు, మోదిగాడు, కణ్ణిగాడు, పనసల కణ్ణయ్య పడాలు, గోలిసింగి సన్యాసి, కాకూరు లచ్చమయ్య, కొర్రాబు లింగయ్య, సెగ్గి ఎర్రయ్య, బోనంగి పండుపడాలు, రీమల సన్యాసి, సుంకరి పోతయ్య, సరిబాల పరదేశి, కాకూరు గంగడు, కాకూరి బాలయ్య, కొటికల బాలయ్య ... ఎందరో రామరాజు ఇంకా ఏం చెబుతాడోనని ఎదురు చూస్తున్నారు. నిశ్చలమైన స్వరంతో చెబుతున్నాడు రామరాజు.

‘‘ఇంకా మిన్నకుంటే మహా ద్రోహమే అవుతుంది. గండకీ నదిలో సాలగ్రామాల కోసం నేపాళం వెళతానన్న మీరు ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమం ఎందుకు ఆరంభిస్తున్నారు? అని అడిగారు కూడా లక్ష్మయ్య గారు, ఉదయం పూజ వేళ. ఈ పరిస్థితులలో భారతీయుడన్నవాడు తిరుగుబాటు చేయకుండా ఉంటాడా?! ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం?! తిరగబడకపోయినా నీ నేలలో నీవు తిరుగుబాటుదారుడవే అవుతున్నావు. నీ ఆకలికేక వాళ్ల దృష్టిలో అలజడి కోసం నినాదం. ఇంక తిరుగుబాటుకు వెనకడుగెందుకు? పోరాటం భుజాలకెత్తుకుని పుట్టిన తరం మనది.  ‘‘ఆకలితో, భయంతో చచ్చిపోవడం ఎందుకు? ధైర్యంగా ఉద్యమమే చేద్దాం! మన ఉనికిని కాపాడుకుందాం! ఉద్యమం అంటే భవ్యమైన భవిష్యత్తును గర్భంలో మోస్తున్న సంక్షుభిత వర్తమానమే.

‘‘ఎంతో రక్తపాతం తరువాత మళ్లీ సాహసించి ఇంకో పోరుకు సిద్ధమవుతున్న మన్యం చాలా విషయాలు గమనించాలి. నిన్నటి లాగరాయి అలజడి సమయంలో ఏం జరిగిందో, చివరికి ఏమైందో కూడా తెలుసు. అది గుర్తుకు తెచ్చుకుంటూ, రేపు మనం ఎలా అడుగేయాలో నేర్చుకుందాం. అంతా కలసి అడుగులో అడుగు వేయాలి. అంతా కలసి గొంతు విప్పాలి. అందుకే మీ గొంతులు గంధకపు గనులు కావాలి. మీ గుండెల్లో, గొంతుల్లో తరతరాల నుంచి గూడుకట్టుకుని ఉన్న మౌనాన్ని కొండలలో వదిలి, కొండగాలితో మీ ఊపిరి తిత్తులను నింపుకోండి. మనందరి ఉమ్మడి శ్వాసే ఉద్యమ రూపం దాల్చాలి.

 ‘‘మనం ఆరంభించే ఈ కొత్త ఉద్యమంలో పాల్గొనేవారు కొన్ని నియమాలు పాటించాలి. అవి చెబుతాను. బ్రహ్మచర్యం పాటించాలి. దుర్వ్యసనాలు వదలాలి. స్త్రీలను తల్లుల్లా చూడాలి. ఇది ప్రజల కోసం ఉద్యమం. ఉద్యమకారుల పోషణ బాధ్యత ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవాలి. ఇందులో బలవంతం మాత్రం లేదు.’’ఒక్క క్షణం ఆగాడు రామరాజు.‘‘సామీ! బేస్టీను అనే రాక్షసుడి కతేమిటి?’’ అడిగాడు కొటికల బాలయ్య, ఇక ఉండలేనట్టు.ఆ గొంతు నుంచే వినిపించినా, మౌనంగా ఉన్న చాలా మంది పెదవుల మీద ఉన్నదీ అదే ప్రశ్న. ‘‘మీ ఆక్రోశం అర్థమైంది. బాస్టియన్‌ అధికార మదం గురించి నాకూ తెలుసు. కానీ ఒక ఉద్యోగి చేసిన దుర్మార్గాల మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం మనం ఉద్యమం మొదలుపెట్టడం లేదు. ఏ ఉద్యోగినైనా చంపడం ఏమంత కష్టం? కానీ దానివల్ల  ప్రయోజనం ఎంత? ఈ బ్రిటిష్‌ సామ్రాజ్యంలో నా పినతండ్రి ఓ ఉద్యోగి. వారి దృష్టిలో నేను రాజద్రోహిని. మేమిద్దరం ఎంత ద్వేషించుకున్నా, మాలో ప్రవహించే ఒకే రక్తం మాటేమిటి? అలాగే భారతీయులంతా.

కానీ నేను ఒక చెంప కొడితే మరో చెంప చూపమని మాత్రం చెప్పడం లేదు. ఆయుధం పట్టమంటున్నాను. కానీ మన చేతి ఆయుధం ప్రభుత్వం పంచన చేరిన భారతీయులని శత్రువులుగా చూస్తూ, వారి మీద గురిపెట్టడానికి కాదు. మనం ఏ కోశానా భారతీయుడన్నవాడిని ద్వేషించం. మన శత్రువు తెల్లవాడు.’’ వివరించాడు రామరాజు.ఎవరూ మాట్లాడలేదు. రెండు రోజుల తరువాత కలుసుకోవాలని నిర్ణయించి అంతా వెళ్లిపోయారు.ఆ ఊరి మునసబు ఇంటి దగ్గర దిగబెట్టిన గంతన్నతో అన్నాడు రామరాజు. ‘‘బాస్టియన్‌ రోడ్డు పనిలో ఎంత అమానుషంగా ప్రవర్తించాడో నాకూ తెలుసు.

ఇప్పుడు ఆ రోడ్డు ఉద్యమానికి బాటలు పరిచింది. ఇలాంటి సమయంలో ఆ బాస్టియన్‌ అనే వాడిని చంపేస్తే మనవాళ్ల ఆవేశం ఇక నిలబడదని నేను చెప్పగలను. ఆవేశం చల్లారితే ఇక ఉద్యమం ఎక్కడిది?’’ అన్నాడు రామరాజు. ‘‘సత్యమే చెప్పారు. సెలవు.’’ అని వెళ్లిపోయాడు గంతన్న.ఒంటరిగా కూర్చున్నాడు రామరాజు. నిద్ర రావడం లేదు. తనే కాదు, అక్కడకొచ్చిన వారంతా కూడా నిద్రకు దూరమయ్యారు.ఆ రోడ్డు వారి కళ్లల్లో కదలాడుతోంది–పచ్చటి మన్యం మీద ఎప్పటికీ చెరగని నెత్తుటి వాక్యంలా. రోదనను నింపుకున్న ఆ చిక్కటి ఎర్రధూళి గానం చేస్తోంది – కొండవాళ్ల గుండెల్లో మానని గాయం గాథ....

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement