ఆకుపచ్చ సూర్యదయం | funday specials story | Sakshi
Sakshi News home page

ఆకుపచ్చ సూర్యదయం

May 28 2017 12:22 AM | Updated on Sep 5 2017 12:09 PM

ఆకుపచ్చ సూర్యదయం

ఆకుపచ్చ సూర్యదయం

ఖాకీ నిక్కరు మీద, ఖాకీ చొక్కా ధరించాడు రామరాజు. రెండు జేబులు. వాటి పై భాగాలు మూసి ఉన్నాయి. మెడలో తూటాల దండ. ఆయన ఒంటికి ఆ బట్టలు

ఖాకీ నిక్కరు మీద, ఖాకీ చొక్కా ధరించాడు రామరాజు. రెండు జేబులు. వాటి పై భాగాలు మూసి ఉన్నాయి. మెడలో తూటాల దండ. ఆయన ఒంటికి ఆ బట్టలు కొద్దిగా పెద్దవిగానే ఉన్నాయి.భుజం మీద తుపాకీతో ఆయనను చూడడం మరీ మరీ వింత. కాళ్లకి చెప్పులు మాత్రం లేవు.  మల్లు, గంటం, పడాలు, బోనంగి పోతరాజు, సంకోజి పండడు, కొటికల బాలయ్య, కర్రి కణ్ణిగాడు ఇంకో ఇద్దరు ముగ్గురు ఖాకీ బట్టలలో, భుజాన తుపాకీతో ఉన్నారు.

హుందాగా పేరుపేరునా పలకరిస్తూ ,అక్కడ నుం జనం వెంటరాగా గ్రామచావడి దగ్గరకు నడిచాడు రామరాజు. ఎవరో మరి, అప్పటికే నులక మంచం వేసి, తెల్లని వస్త్రం పరిచారు.దాని మీద కూర్చున్నాడు రామరాజు. ఒక్క నిమిషం తరువాత వెనక్కి విశ్రాంతిగా మోచేతుల మీద వాలారు. ఆ క్షణంలో యుద్ధ శిబిరంలో సేద తీరుతున్న యోధుడిలా ఉన్నారాయన.ఆయన చుట్టూ కొద్దిదూరంలో నిలబడ్డారు సాయుధులు. ముందు ఊరి బారికకు కబురంపాడు రామరాజు, డప్పుతో సహా రమ్మని. తక్షణమే వచ్చాడతడు. ‘ఊరివారిని చూడాలి. వారి దర్శనం కావాలి’ అని నా మాటగా చాటింపు వేయమని చెప్పాడు.

పడమరన సూర్యుడు ఎర్రబడుతున్నాడు. అటే తలపెట్టి కూర్చున్నాడు రామరాజు. అప్పుడు వచ్చాడు నూకాలు.‘‘దండాలు బాబయ్యా!’’ అక్కడే గొంతుక్కూర్చున్నాడు, ఆప్యాయంగా, గౌరవంగా చూస్తూ. ఆనాడు తాండవలో చూసిన దృశ్యమే మళ్లీ గుర్తుకు వచ్చింది అతడికి. ‘‘నూకాలు! బావున్నావా?’’ అంతే గౌరవంగా అడిగాడు రామరాజు లేచి కూర్చుంటూ. ‘‘అంతా రాములోరి దయ! బావున్నాను స్వామి!’’ అన్నాడు రెండు చేతులూ జోడించి. ‘‘అన్నయ్య గారు.....?’’ అర్ధోక్తిగా ఆపేశాడు రామరాజు.‘‘ఊరెళ్లారు బాబయ్యా!’’ అన్నాడు నీళ్లు నములుతూ నూకాలు.నూకాలు ముఖంలోకి చూసి చిన్నగా నవ్వాడు రామరాజు.

‘‘అంటే.... స్వామీ.....!’’
‘‘నేను ఇంతలోనే కొత్త మనిషినయిపోయానా?’’ నవ్వుతూనే అడిగాడు రామరాజు.  గ్రామ ప్రజలంతా గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. చాటింపుతో పరిస్థితి మారిపోయింది.మొదటిగా అక్కడ ప్రత్యక్షమైనవాడు చింతల అచ్చయ్యనాయుడు. రామరాజు లేచి సాదరంగా చేతులు సాచి ఆలింగనం చేసుకున్నాడు. తరువాత చింతల నారాయణస్వామి వచ్చాడు. ఎలా తెలిసిందో ఏమో, కొంగసింగి నుంచి మర్రి సన్యాసిదొర వచ్చాడు.వెంటనే తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి పథకం ఆరంభించాడు రామరాజు. ‘‘ఇప్పుడు కృష్ణదేవిపేట ఎస్‌ఐ ఎవరు? స్టేషన్‌లో ఎవరుంటారు?’’‘‘కర్రి లక్ష్మీనారాయణ. ఊళ్లో లేడు. ఏదో ట్రైనింగ్‌ కోసం విశాఖపట్నం వెళ్లాడని తెలిసింది. హెడ్‌ కానిస్టేబుల్‌ రంగనాయకులు, స్టేషన్‌ రైటర్‌ గంగుల రాజయ్య, సెంట్రీ కానిస్టేబుళ్లు చిక్కాల రామస్వామి, సింగ్‌ అని మరో కానిస్టేబులు ఉన్నారు. జగన్నాథం అని మరో కానిస్టేబుల్‌ కూడా ఉండాలి.’’ చెప్పాడు అచ్చయ్యనాయుడు. ‘‘అచ్చయ్య నాయుడుగారూ! మీ భావాలు నాకు తెలుసు. మీ ధైర్యమూ తెలిసినదే. చిన్న రాయబారం చేసి పెట్టండి.’’ అన్నాడు రాజు.

‘‘సంతోషంగా చేస్తాను.’’ చెప్పాడు అచ్చయ్యనాయుడు. ఒక నిమిషం తరువాత మల్లును పిలిచాడు రామరాజు. ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆయుధాలు కావాలని, మర్యాదగా అప్పగించమని చెప్పమని పంపాడు.అందరినీ కూర్చోమన్నాడు గంతన్న దొర. ఎంతో ఒద్దికగా కూర్చున్న గ్రామస్థుల దగ్గరగా వచ్చాడు రామరాజు. తన గుండె మీద తన చేత్తోనే నెమ్మదిగా చరుచుకుంటూ అన్నాడు రామరాజు.‘‘మీ ముందు నిలబడి ఉన్నది మీ శ్రీరామరాజే. మేం మొదలుపెట్టినది ఫితూరీ కాదు. ఇది ఉద్యమం. ఇప్పుడు హిందూదేశం మొత్తం తెల్లవాడి మీద ఆగ్రహంతో ఉంది. మాకు కావలసినవి ఆయుధాలు. నిన్న చింతపల్లి వెళ్లినా, ఇవాళ ఈ ఊరు వచ్చినా వాటి కోసమే. అవి తెల్లవాడి మీద ఎక్కుపెట్టడానికే కానీ, సాటి భారతీయుడిని బాధించడానికి కాదు. ఇళ్ల మీద పడడం, దోచుకోవడం జరగదు. మేం ఎక్కడికి వెళ్లినా కోరేది ఒక్కటే. ఒకటి రెండు పూటలకు సరిపోయే భోజన సంబారాలు. అది కూడా మీరు సంతోషంగా ఇస్తేనే తీసుకుంటాం.’’ అక్కడ అందరి మనసులు బాధపడ్డాయి, రామరాజును శంకించినందుకు.

పది నిమిషాలలో వెనక్కి వచ్చారు మల్లు, అచ్చయ్య.‘‘స్టేషన్‌లోకి వస్తే కాల్చేయగలను అన్నాడు సామీ, ఆ కానిస్టేబులు. తమరి ఆజ్ఞ లేదని ఊరుకున్నాను.  మా కాడా ఉన్నాయి తుపాకులు అని చెప్పి వచ్చేశాను.’’ అన్నాడు మల్లు, కొంచెం ఆవేశంగా.‘‘ఇంకా ఆలస్యం ఎందుకు? తుపాకులతోనే నడవండి!’’ అన్నాడు రామరాజు.శ్రీరామరాజు ముందు నడవగా గంతన్న, మల్లు, ఎండు పడాలు, కణ్ణిగాడు ఇంకో నలుగురు తుపాకులతో మళ్లీ స్టేషన్‌ దగ్గరకి వెళ్లారు.

వీళ్లని దూరం నుంచి చూసే సరికి స్టేషన్‌ వదిలి పారిపోయారంతా.ఏడు తుపాకులు దొరికాయి లోపల. కొంత మందుగుండు స్వాధీనమైంది. లోపల నుంచి బయటకు వచ్చాడు రామరాజు. చింతపల్లిలో సేకరించిన పదకొండు తుపాకులు, ఇప్పుడు స్వాధీనం చేసుకున్న ఏడు మొత్తం– పద్దెనిమిది తుపాకులు. పద్దెనిమిది మంది పట్టుకుని స్టేషన్‌ బయట వరుసగా నిలబడి గాలిలోకి కాల్చారు. రాజు వెంట వచ్చిన రెండొందల మందికి పైగా ఉద్యమకారులు, గ్రామ ప్రజలు అంతా కలసి ఐదువందల మంది అక్కడ గుమిగూడారు.గంతన్న నినాదం ఇచ్చాడు ‘‘గాం«ధీ గారికీ!’’ అంతా స్పందించారు ‘‘జై!’’‘‘వందేమాతరం’’ ‘‘మనదే రాజ్యం!’’

‘‘అల్లూరి శ్రీరామరాజుగారికీ’’ ‘‘జై’’అప్పుడే జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వచ్చారు కృష్ణదేవిపేట వైశ్యులు నూతిగట్టు కామరాజు, పూసర్ల లక్షో్మజీ, తమ పనివాళ్లతో కలసి. ‘‘రామరాజుగారూ! ఉడతాభక్తిగా ఈ సంబారాలు మేం సమర్పించుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఇస్తున్నాం. కాదనకండి!’’ అన్నారు.పది కుంచాల బియ్యం, నాలుగు తవ్వల పప్పు, ఇంకొన్ని సంబారాలు మూటల్లో మోయించుకొచ్చారు. ‘‘సంతోషం!’’ అంటూ సైగ చేశాడు రామరాజు. కొండదళంలో ఎవరో ఇద్దరు వచ్చి ఆ మూటలు తీసుకున్నారు.

అచ్చయ్యనాయుడు మళ్లీ రామరాజు దగ్గరగా వచ్చాడు.‘‘అచ్చయ్య గారూ! రాములవారినీ, నీలకంఠేశ్వరుడినీ కూడా దర్శనం చేసుకోవాలని ఉంది. ఒక్కసారి శ్రీరామవిజయనగరం కూడా’’ అన్నాడు రామరాజు.గంతన్న, పోతరాజు కూడా వస్తామంటే వద్దని వారించాడు రామరాజు. మల్లు ఒక్కడు ఉంటే చాలునని, అటూ ఇటూ చూశాడు. ఆ దరిదాపుల్లో కనిపించలేదు మల్లు. ఊరి చివర ఉంది ఆ దుకాణం. అంతా శ్రీరామరాజును చూసే హడావుడిలో ఉన్నారు. దానితో అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. దలే బెన్నయ్య ఒక్కడే చిన్న ఆముదం దీపం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు, చిన్న గుడిసెలో. అది అతడి సారా దుకాణం. చాలా రహస్యంగా నడుస్తోంది.

‘‘ఎవరది?’’ మామూలుగానే అడిగాడు బెన్నయ్య.‘‘మనం మల్లుదొర. శ్రీరామరాజుగారికి నమ్మినబంటులం.’’ ‘‘అలాగా! ఇటొచ్చావేంటి?’’ అన్నాడు బెన్నయ్య, ఆశ్చర్యంగా.‘‘ఒక డ్రాము....’’ సారాయి కావాలన్నట్టు సైగ చేశాడు మల్లు.‘‘అయ్యయ్యో! స్వామి ఈటికి దూరంగా ఉండాలనేవారు.’’ అన్నాడు బెన్నయ్య.‘‘నేను ఈటికి దగ్గరే. ఇంత కష్టపడుతున్నాం. ఇంత దూరం వచ్చాం.. జేజేలు కొడతన్నాం. ఓ సుక్క...’’ అన్నాడు మల్లు, బతిమాలుతున్నట్టు.

‘‘సరే, ఒక డ్రాము తీసుకో!’’ అన్నాడు బెన్నయ్య.
‘‘చాలు!’’ చెప్పాడు మల్లు. చిన్న గాజు గ్లాసులో పోసి ఇచ్చాడు బెన్నయ్య.అది తాగిన రెండు నిమిషాలకే అన్నాడు మల్లు, ‘‘ఇదిగో, ఇంకొక్క డ్రాము. నీకు పుణ్యముంటది!’’ ఇంత క్రితమే పోలీసు స్టేషన్‌ను కొట్టిన సంగతి విన్నాడు బెన్నయ్య. ఆ సాహసం అతడినీ కదిపింది. అందుకే మరో డ్రాము కూడా పోశాడు.నాలుగు నిమిషాలు గడిచాయి.  మల్లు అసలు రూపం బయటపడింది.‘‘రేయ్‌...! ఇంకొకటి పోయ్‌రా!’’ అన్నాడు గద్దిస్తూ.‘‘ఏంట్రోయ్‌ కొండోడా! ఏదో స్వాములోరి మనిషినన్నావని పోశా. మళ్లీ మాట్లాడావంటే, ఇప్పుడే వెళ్లి స్వాములారితో చెబుతా. పో!’’ అన్నాడు బెన్నయ్య.‘‘వద్దులే..పోతన్నా.’’ తూలుతూ బయలుదేరాడు.

 నీలకంఠేశ్వరుడిని చూసి, అచ్చయ్యనాయుడితోనే  తిరిగి వస్తున్నాడు రామరాజు. రామాలయం సమీపంలోకి వచ్చాక ఆ ఇద్దరూ గమనించారు – ఆలయం అరుగు మీద ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు.చీకట్లో.రామరాజు ఆయన దగ్గరగళ్లి, ‘‘సూర్యాస్తమయం తరువాత భాస్కర దర్శనం! ఎంత పుణ్యం చేసుకున్నాను!’’ అన్నారు.‘‘మన్నించాలి రాజు గారూ! పొరబడ్డాం.’’ రెండు నిమిషాల తరువాత అన్నాడు భాస్కరనాయుడు.‘‘ఇప్పుడు నా గుండె తేలికపడింది అన్నయ్యగారూ!’’ ఆనందంగా చెప్పాడు రామరాజు.‘‘తెల్లవాడితో ఇలా పోరాడగలమా?’’ అడిగాడు భాస్కరుడు, ఒక నిమిషం తరువాత.‘‘గాంధీగారు పోరాడుతున్నారు కదా!’’ అన్నాడు రామరాజు.

‘‘ ఆ మార్గం గురించే నేనూ చెబుతున్నాను రాజుగారు!’’ అర్థింపుగా చూస్తూ అన్నాడు భాస్కరుడు. ‘‘జలియన్‌వాలా బాగ్, చౌరీచౌరా వంటి దురాగతాలను గాంధీగారు మరచిపోయినంత సులభంగా నేను వాటిని మరచిపోలేను. జాత్యహంకారం సాగిస్తున్న పాలనలో నేను హాయిగా ఉండలేను అన్నయ్య గారూ! పోరాడతాను. లేదా పోరాడి మరణిస్తాను. ఇప్పుడు ఇంటికి రాలేను. అర్థం చేసుకోగలరు కదా!  మళ్లీ ఎప్పుడు కలుస్తామో! ఎలా కలుస్తామో! సెలవు.’’ అన్నాడు రామరాజు, చేతులు జోడించి.

అప్పటికే గ్రామంలో చాలామంది అక్కడికి చేరుకున్నారు. లాంతర్లు, కాగడాలు పట్టుకుని ఉన్నారు. రామరాజును చూడగానే డప్పుల మోత మొదలయింది. దాదాపు రెండువందల మంది గ్రామస్తులు రామరాజును, కొండదళం సభ్యులను ఊరి చివరి దాకా సాగనంపడానికి వెళుతున్నారు. కాగడాలు, లాంతర్ల వెలుగూ, డప్పుల మోత క్రమంగా దూరమవుతుంటే, ఆ వైపే చూస్తూ ఉండిపోయాడు భాస్కరుడు.ఊరి బయట వేచి ఉన్న మల్లు చడీచప్పుడూ లేకుండా కొండదళంలోకి చొచ్చుకుపోయాడు.

3                                                             
ఆగస్టు 24:
తెలతెలవారుతోంది. చిరుచలిగా ఉంది. అప్పుడే లేచి వచ్చాడు రామరాజు.  కృష్ణదేవిపేట నుంచి అర్ధరాత్రికి  కంతారం∙చేరుకుని, రోడ్డు కూలీల కోసం అక్కడ ఎప్పుడో నిర్మించిన పాకలోనే విశ్రమించింది రామరాజు దళం. అప్పటికే పాక బయట వేపపుల్లలతో పళ్లు తోముకుంటూ మాట్లాడుకుంటున్నారు గంతన్న, ఎర్రేసు. వేపపుల్ల పడేసి అన్నాడు గంతన్న భక్తిగా ‘‘దండాలు సామీ!’’ ‘‘ఇక్కడే ఓ జలపాతం ఉంది సామి! స్నానం చేయవచ్చు!’’ వినయంగా చెప్పాడు ఎర్రేసు.ముందు రామరాజు నడుస్తుంటే, వెనక గంతన్న, ఎర్రేసు నడుస్తున్నారు.‘‘సామీ!’’ నెమ్మదిగా పిలిచాడు గంతన్న.

‘‘చెప్పు గంతన్న!’’ రామరాజు అన్నాడు.
‘‘మొట్టాడం వీరయ్యదొర పేరు విన్నారు కదా! ఇప్పుడు రాజవొమ్మంగి స్టేషన్‌లో పెట్టి ఉంచారట.  ఇవాళే రాజమండ్రి కోర్టుకి తీసుకుపోతారంట. అడ్డతీగల తాసీల్దారుతో ఆ సంగతి  మాట్లాడ్డానికే వెళుతూనే  చింతపల్లి ఎస్‌ఐ మనకి తారసపడ్డాడు. లాగరాయి పితూరీ కాణ్ణుంచి వీరయ్యదొరని విజయనగరం జైల్లోనే ఖైదు చేసి ఉంచారు. మళ్లీ  జైల్లో ఏస్తే ఇక ఆయన అక్కడే కన్ను మూస్తాడు. ఆయన్ని మనం విడిపించుకుంటే కలిసివస్తాడు. ’’తన్న మాటంటే ఎంతో గురి. అయినా తల పంకించి స్నానానికని జలపాతం కిందకి వెళ్లాడు రామరాజు. స్నానం చేసి, అరగంటకు పైగా ధ్యానం చేసి అప్పుడు వచ్చాడు.‘‘మన వాళ్లని శ్రమ పెడుతున్నాం. అయినా తప్పదు. రాజవొమ్మంగి బయలుదేరదాం.ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్లాలి!’’ 

4             
ఆ సెల్‌ నుంచి మరోసారి భారంగా వినిపించింది మూలుగు. వెంటనే ఆగకుండా దగ్గు, ఒక నిమిషం పాటు. చీకటిగా ఉంది సెల్‌. లోపల చింకి చాప మీద ఒక మనిషి పడుకుని ఉన్న సంగతి కూడా తెలియడం లేదు.రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌.మరోసారి చటుక్కున లేచి గుమ్మం దాకా వెళ్లి బయటికి తొంగి చూశాడా జవాను. రామరాజుకు పోలీసు స్టేషన్లే లక్ష్యం. కానీ రాజవొమ్మంగే వస్తాడనేమిటి? అలాగే రాడని చెప్పడానికీ లేదు.

ఎందుకైనా మంచిదన్నట్టు గుమ్మం ఎదురుగానే చూరుకు వేలాడుతున్న రెండు లాంతర్లు తీసుకుని లోపలికి వచ్చి మళ్లీ యథాస్థానంలో కూర్చున్నాడతడు.మరింత చీకటి కమ్ముకుంది పోలీస్‌ స్టేషన్‌ అరుగు మీద. అక్కడే గొంగళ్లు కప్పుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నారు– దాదాపు ఇరవైమంది. వాళ్లందరూ రాజవొమ్మంగి గ్రామస్థులే. తిమ్మాపురం డిప్యూటీ తహసీల్దారు బారికతో మాట్లాడి వాళ్లందరినీ ఇక్కడ పడుకునే ఏర్పాటు చేశాడు. నిజానికి నిన్న రాత్రి కూడా వాళ్లు వచ్చి పడుకున్నారు. మళ్లీ బయటకు వచ్చి చూశాడు ఆ పోలీసు. అతడు వచ్చి గంట దాటి పోయింది. అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌ నుంచి సైకిళ్ల మీద ఉరుకులూ పరుగుల మీద వచ్చారు– ఇతడూ, ఆ మూల చతికిల పడి ఉన్న మరో జవాను. ‘జాగ్రత్తలు’ చెబుతూ నర్సీపట్నం పోలీసు కార్యాలయం ఇచ్చిన ఆదేశాన్ని పట్టుకుని వచ్చారు.

నిజానికి ‘రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్ల మీద దాడి జరిగే అవకాశం ఉంది.’ అంటూ సబిన్స్‌పెక్టర్‌ నిన్ననే డిప్యూటీ తహసీల్దారుకి వర్తమానం పంపాడు. నిన్న రాత్రి గ్రామంలో ఉండి, ఇవాళ సాయంత్రమే అడ్డతీగల వెళ్లిపోయాడు.లాంతర్లు ఒకటి లాకప్‌ గది దగ్గర, మరొకటి ఎస్‌ఐ టేబుల్‌ మీద పెట్టి, ఓ బెంచీ మీద కూర్చున్నాడతడు. లోపలే బెంచీల మీద, గోడకి ఆనుకుని నేల మీద కూర్చున్నారు మరో ఐదుగురు. అందరిలోనూ అదే ఉత్కంఠ. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు జవాన్లు శవజాగారం చేస్తున్నారు. రంప డివిజన్‌లో చాలా కీలకమైన స్టేషన్‌ రాజవొమ్మంగి. పిన్ని వెంకటరెడ్డి అక్కడ ఎస్‌ఐ. స్టేషన్‌కు కొంచెం దూరంలోనే ఉన్న గ్రామం అలికిడి లేకుండా నిద్రపోతోంది. రాత్రి తొమ్మిది గంటల వేళ. చల్లగా ఉంది వాతావరణం.

‘‘ఎస్‌ఐగారు ఇవాళ రావాలి కదా!’’ కానిస్టేబుల్‌ అడిగాడు.‘‘రావాలి. రేపే ఈ మహానుభావుణ్ణి రాజమండ్రి తీసుకుపోవాలని అనుకున్నారు.’’ అన్నాడు రాజవొమ్మంగి స్టేషన్‌లో జవాను– లాకప్‌ గది వైపు చూస్తూ.గోడకు జారపడిన మరో జవాను ఒక్కసారిగా నిటారుగా అయ్యాడు.అది చూసి అడ్డతీగల నుంచి వచ్చిన జవాను హడలిపోయి, మళ్లీ గుమ్మం దాకా వెళ్లి వచ్చాడు.‘‘ఏం లేదులే మిత్రమా!’’ అని అడ్డతీగల వాడి సందేహాన్ని తీర్చి, తన సందేహం వెలిబుచ్చాడు.

‘‘ఆ చరిత్ర అయిపోయిందని అంతా అంటా ఉంటే మళ్లీ ఈ పితూరీ ఏంటండీ!’’ పితూరీ అన్న మాట వినిపించగానే లాకప్‌ గదిలో ఉన్న ఆ మనిషిలో చలనం. గోడవారగా పడుకున్నవాడల్లా లేచొచ్చి ఊచలు పట్టుకుని నిలబడ్డాడు. ఆ గదంతా చీకటే. అందుకే అతడు అక్కడ నిలబడి ఉన్న సంగతి అక్కడెవరూ గమనించలేదు. ‘‘మొన్న చింతపల్లి స్టేషను. నిన్న కృష్ణదేవిపేట. రెండు రోజుల్లో రెండు స్టేషన్లు కొట్టేశారు.’’ ‘‘ఈ రాత్రీ, రేపు పగలూ రాకుండా ఉంటే చాలు!’’ దేవుడికి దణ్ణం అన్నట్టు ఆకాశంలోకి వైపు చూస్తూ అన్నాడు ఓ జవాను.

‘‘ఏంటి దొరా! మళ్లీ పితూరీయా? నిజమా!?’’ ఆ చీకటి కొట్టులో నుంచి హఠాత్తుగా వినపడింది గొంతు. వెంటనే దారుణమైన దగ్గు తెర, అతడి నోటి వెంట. నిలబడే ఓపిక లేక అలాగే కూలబడ్డాడు లోపల.వాళ్లలో ఓ కానిస్టేబుల్‌కి దడుచుకున్నంత పనైంది. కానీ అంతలోనే తేరుకుని అన్నాడు. ‘‘ఏరా! మళ్లీ చేరతావా? రేపు రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి వెళ్లి చేరుదువుగాని. అప్పుడు ఏకంగా ఉరికంబమే. నోర్మూసుకు తొంగో.’’ ‘‘ఈడెవడు?’’ అడ్డతీగల నుంచి వచ్చిన జవాను అడిగాడు.

‘‘ఈడేరా బాబూ! వీరయ్య దొర. మొట్టాడం వీరయ్యదొర. ఈడి గురించి మాట్లాడ్డానికే మా ఎస్‌ఐ మీ తాసీల్దారు కాడికి వచ్చాడు.’’ చెప్పాడు రెండో కానిస్టేబుల్‌.‘‘ఈడా?! మరి చెప్పవేరా బాబూ! ఈణ్ణి విడిపించడానికి కొండదళం రావొచ్చని అనుకుంటున్నారు!’’ గొంతు తగ్గించి అన్నాడు అడ్డతీగల జవాను, భయంగా. ఒక్కసారిగా అందరిలోనూ సన్నగా ఒణుకు. మరో గంట గడిచింది, భారంగా.అడ్డతీగల నుంచి వచ్చినవాడే మళ్లీ బయటకొచ్చి చూశాడు.

అప్పుడే ఏదో వాసన ... కాలుతున్న వాసన. పోలీస్‌స్టేషన్‌ ఓ పెద్ద తాటాకు పాక. దానిని పరిశీలించాడు ముందు. ఎక్కడా మంట దాఖలా లేదు. అనుకోకుండా ఎడం వైపు చూశాడు. దూరంగా పొదల వెనక ఏదో కాంతి. కళ్లు చిట్లించి చూశాడటు. చిన్నగా వస్తోంది పొగ. అలా నాలుగైదు చోట్ల కనిపించింది. కుడివైపు కూడా చూశాడు. అక్కడా అంతే. గుండె ఆగిపోయినంత పనైంది, ఆ జవానుకి.హఠాత్తుగా రెండు వైపుల నుంచి అరవై డెబ్బయ్‌ మంది ఆ పొదలమాటు నుంచి లేచారు ఒక్కసారే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement