
ఆకుపచ్చ సూర్యోదయం
ఎక్కడ నుంచి వచ్చిందో ఆ ఆవేశం– మళ్లీ భారతదేశమంతా ‘గాంధీజీకి జై’ అంటూ ముక్త కంఠంతో నినదించింది. కృష్ణదేవిపేటలో కూడా ఊహించని పరిణామం.
గూడెం తాలూకా కార్యాలయం. క్యాంప్: కృష్ణదేవిపేట., తేదీ 29–1–1922. రంప అసిస్టెంట్ కమిషనర్ వారి సముఖమునకు! సరైన ఆధారాలు లేకున్నా అల్లూరి రామరాజు తిరుగుబాటు లేవదీయనున్నాడని పుకార్లు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీనితో కృష్ణదేవిపేట మొత్తం రాత్రంతా పోలీస్స్టేషన్ దగ్గరే గడిపింది. 28వ తేదీ రాత్రి కూడా ప్రజలు పోలీస్స్టేషన్ దగ్గర లేదా పొలాలలో పడుకున్నారు. ఈ ఉదయం నేను ఎ. రామరాజును ఇంటర్వూ్య చేశాను. అయితే తాను సహయ నిరాకరణవాదిని కానని ఆయన చెప్పాడు. తాగుడుకు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం చేస్తున్నానని అన్నాడు. ఇవన్నీ వదంతులేనని ఈ రగడ సద్దుమణిగే దాకా తాను నర్సీపట్నం వెళ్లిపోతానని కూడా చెప్పాడు. ఇప్పటి పరిస్థితినిబట్టి పెద్ద ప్రమాదమేదీ ఉందని చెప్పను. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోలీసుల సాయంతో ఏ పరిణామాన్నయినా ఎదుర్కొనగలనని మనవి చేస్తున్నాను.
– అల్ఫ్ బాస్టియన్.
ఆ స్టేట్మెంట్ ఫజులుల్లాకి ఇస్తూ అన్నాడు స్వైర్, ‘‘నువ్వు కూడా ఇలా రాస్తావని అనుకోలేదు.’’ ‘‘ఆ మాటేమోగానీ, మీరు ఇలా తిరుగు టపాలోనే విచారణకి వస్తారని నేనూ ఊహించలేదు.’’ అన్నాడు స్టీవర్ట్.‘‘చూడు స్టీవర్ట్! మునసబు పంపిన నివేదికలో ఫిబ్రవరి ఒకటో తేదీన ఫితూరీ మొదలవుతోందంటూ వదంతి పుట్టిందని రాశాడు. ఆ ఫిబ్రవరి ఒకటో తేదీనే ఎం.కె.గాంధీ తన సహాయ నిరాకరణోద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు చెప్పాడు గుర్తులేదా?. ఈ రెండింటికీ అంతుపట్టని సంబంధం ఉందేమోనని అనుమానించాను.’’ అంటూ మనసులో మాట చెప్పాడు స్వైర్, గొంతు తగ్గించి.‘‘నిజమే సుమా!’’ అన్నాడు స్టీవర్ట్. ‘‘ఒక్కటి గుర్తుంచుకోండి. ఫజులుల్లాఖాన్, బాస్టియన్– మీరు కూడా వినండి. అవసరమైతే, ఇంకో ఫిర్యాదు ఏది వచ్చినా, కృష్ణదేవిపేటలో ఏ నినాదం వినిపించినా ఈ యువకుడిని మరుక్షణం నర్సీపట్నం పంపండి!’’ కటువుగానే అన్నాడు స్వైర్.
9
ఎక్కడ నుంచి వచ్చిందో ఆ ఆవేశం– మళ్లీ భారతదేశమంతా ‘గాంధీజీకి జై’ అంటూ ముక్త కంఠంతో నినదించింది. కృష్ణదేవిపేటలో కూడా ఊహించని పరిణామం. ఫిబ్రవరి 1, 1922.. ఆ మధ్యాహ్నానికే నర్సీపట్నం నుంచి జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని ఆ రోజు నుంచి మరింత ఉధృతం చేయబోతున్నట్టు గాంధీగారు ముందుగా చేసిన ప్రకటనకు తగ్గట్టే ఉంది దేశంలో వేడి.
‘‘తూర్పు కనుమల వాకిలిలో గాంధీగారి సహాయ నిరాకరణోద్యమనాదం వినిపించడం అపూర్వమే! ఆ ఉద్యమం ఇంత దూరం వచ్చిందంటే, గాంధీగారు దేశప్రజల హృదయాలకు ఎంత చేరువయ్యారో కదా!’’ దాదాపు వివశత్వంతో అన్నాడు శ్రీరామరాజు, తన పక్కనే నిలబడి ఉన్న అల్లిపూడి కరణం రాళ్లపల్లి కేశన్నగారితో. ఆయన కరిణీకం వదిలేసి ఈ ప్రాంతంలో ఉద్యమం నడుపుతున్నాడు.
నర్సీపట్నం నుంచి, ఇతర గ్రామాల నుంచి వచ్చిన జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు అరవై మందికి పైగానే ఉన్నారు. అంతా తెల్లటి ఖద్దరు దుస్తులలో ఉన్నారు. భుజాల మీద జాతీయ కాంగ్రెస్ త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. వారపు సంత జరిగే చోట ఏర్పాటు చేసిన బహిరంగ సభ అప్పుడే పూర్తయింది. సభాస్థలి నుంచి వారంతా బస చేసిన గ్రామచావడి దగ్గరకి వెళుతున్నారు– నినాదాలు చేసుకుంటూ.
‘‘గాంధీజీకి....’’; ‘‘జై!’’‘‘స్వదేశీ.....’’; ‘‘మన ఆశయం, మన ప్రాణం!’’‘‘స్వదేశీ విద్య....’’;‘‘అసలైన విద్య!’’ఆ నినాదాలు ఉద్వేగానికి గురి చేస్తున్నాయి.
‘‘విదేశీ వస్త్రాలు....’’;‘‘మనకొద్దు!’’
‘‘మన చేనేత....’’;‘‘మన సంపద, మనకి గౌరవం’’
‘‘ఖలీఫాను’’; ‘‘పునరుద్ధరించాలి!’’
‘‘వందేమాతరం.....’’;‘‘మనదే రాజ్యం!’’
కృష్ణదేవిపేట అంతా ఉద్యమ నినాదాలతో మారుమోగిపోతోంది.
రెండో తేదీ.... తెల్లవారగట్ట ఐదుగంటలకే ఊరంతా లేచి కూర్చుంది. మామూలుగా ఆ వేళకు పక్క దిగని కుర్రాళ్లు కూడా లేచిపోయారు. చిరు చలిలో వీధులన్నీ నగర సంకీర్తనతో మారుమోగుతున్నాయి. అంతా ఖద్దరు వస్త్రాలు ధరించి, జెండాలతో ఆ చిరుచలిలోనే అప్పటికే పాటలు పాడుతూ తిరుగుతున్నారు. ఏడున్నర గంటలకు మళ్లీ సభ. నగర సంకీర్తన తరువాత అక్కడికి ఊరేగింపుగా వెళుతూ పాట అందుకున్నారు.‘మాకొద్దీ తెల్లదొరతనము– దేవ... మాకొద్దీ తెల్లదొరతనము.
మా ప్రాణాలపై పొంచి– మానాలు హరియించె..
మాకొద్దీ తెల్లదొరతనము
పన్నెండు దేశాలు–పండుచున్నాగాని
పట్టెడన్నమె లోపమండి!
ఉప్పు! ముట్టుకుంటే దోషమండి
నోట! మట్టికొట్టిపోతాడండి
అయ్యొ! కుక్కలతో పోరాడి–కూడు తింటామండి....... !!మాకొద్దీ!!
మద్రాసు ప్రెసిడెన్సీలో చాలా గ్రామాలని ఈ గేయం ఉర్రూతలూగిస్తోంది. స్టెన్సిల్స్ తీసి అమ్ముతున్నారు అణాకి. కళ్ల ముందు జరుగుతున్న చీరాల–పేరాల ఘటన, పల్నాడు, పెదనందిపాడు పన్నుల సత్యాగ్రçహం అన్నీ ఆ గేయంతో పరిచయం చేసేశాడు కవి. అంతలోనే పోలీసులు వస్తున్నట్టు కబురు. కార్యకర్తలు హడావుడిగా సామాను సర్దుకుని నర్సీపట్నం వెళ్లిపోయారు.
10
మూడో తేదీ ఉదయం ఎనిమిదిగంటల వేళ...
ఫజులుల్లా ఖాన్ ఆరుగురు పోలీసులతో హఠాత్తుగా రామాలయం దగ్గరకు వచ్చి, రామరాజును తీసుకుని వెంటనే రావలసిందని మునసబుకు కబురు పెట్టాడు. పోలీసులను పంపించి గ్రామ పెద్దలను కూడా అక్కడకు రప్పించారు.‘‘ఆర్డర్ చూపించు!’’ అప్పుడు ఆదేశించాడు ఫజులుల్లాఖాన్. భాస్కరుడికీ, స్వామినాయుడికీ, రామరాజుకీ ఆర్డర్ నకళ్లు ఇచ్చాడు కానిస్టేబుల్. ‘‘రామరాజుగారూ! ఏమిటిది?’’ అన్నాడు స్వామినాయుడు కంగారు పడుతూ.‘‘రంప ఏజెన్సీ సబ్ డివిజినల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వారి ఆదేశం. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం కృష్ణదేవిపేట గ్రామంలో 144వ సెక్షన్ విధించారు.’’ అన్నాడు రామరాజు, ఏమీ ఆశ్చర్యపడకుండా.‘‘రామరాజుగారు! మిమ్మల్ని నిర్బంధంలోకి తీసుకుంటున్నాం. అయితే ఇది అరెస్టు కాదు.
ఇంటర్న్మెంట్. పొలిటికల్ సస్పెక్ట్గా తీసుకురమ్మని ఆదేశం. మాతో నర్సీపట్నం రావాలి!’’ అన్నాడు ఫజులుల్లా ఖాన్. ∙∙l‘‘హలో... నర్సీపట్నం హెడ్క్వార్టర్స్... ఓవర్...!’’ ఆ గొంతు విని, చటుక్కున ముందుకు వచ్చాడు ఫర్బీస్.‘‘హలో.... హలో...కేడీపేట క్యాంప్.....ఈవ్లింగ్... నువ్వేనా? హలో... ఏమిటి? ఇక్కడ నుంచి ఆ సమాచారం పంపేందుకు ప్రయత్నించమంటావా? ఓవర్’’ అన్నాడు ఫర్బీస్. ‘‘అదే మంచిది. చూడు, రామరాజుని మంపలో అరెస్టు చేశారు. అక్కడ నుంచి నేరుగా కేడీపేట తీసుకువచ్చి స్పెషల్ ఆఫీసర్కే అప్పగించాలి. ఈ ఆదేశంలో ఒక్క అక్షరం మారకూడదు. ఈ విషయమే కొయ్యూరు వాళ్లకి కచ్చితంగా చెప్పాలి. ఓవర్.’’
∙∙l
ఐదవ అధ్యాయం
1
నర్సీపట్నం సబ్ జైలులో రెండో నంబర్ సెల్.
త్రయంబకేశ్వరం పేరు చెప్పగానే స్వేనీ ముఖంలో పోటెత్తిన కంగారూ, ఫజులుల్లాlమాటలలో వచ్చిన ఆటుపోట్లూ పదే పదే గుర్తుకు వస్తున్నాయి రామరాజుకి. గోదావరి పుట్టిన ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లానంటూ తను ఇచ్చిన వాగ్మూలం ఆ ఇద్దరు బ్రిటిష్ సేవకులను కొంచెం కూడా నమ్మించదని రామరాజుకు తెలుసు. అదీ ఆ స్థల మహత్యం.
నాసికా త్రయంబకం .... త్రయంబకేశ్వరం....
రాజమండ్రిలో తండ్రి నడిపిన స్టూడియోలో మాయాలాంతరు బొమ్మలు చెప్పిన కథలలోనే మొదటిసారి ఆ పేర్లు విన్నాడు రామరాజు. ఓ పచ్చటి కొండ, దాని మీద నుంచి జారే నాలుగైదు ధారలు. అదే గోదావరి. ఆ సన్నటి ధార రాజమండ్రి చేరేసరికి అఖండ గౌతమిగా, మూడు మైళ్ల వెడల్పుతో విశ్వరూపం దాలుస్తుందని అప్పుడే విన్నాడు రామరాజు. అక్కడ నుంచి దిగువకు ధవళేశ్వరం వెళ్లి, పాయలుగా చీలి, అందులో ఒకటి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుందని కూడా తెలుసుకున్నాడు.
సెల్ అంతటా చీకట్లు ఆవరించుకున్నాయి. ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. అర్ధరాత్రి దాటింది.జూన్లో కృష్ణదేవిపేట నుంచి బయలుదేరిన రామరాజు వర్షాలు ముమ్మరమయ్యే నాటికి త్రయంబకం చేరుకున్నాడు. జ్ఞాపకం వెంట జ్ఞాపకం మాయలాంతరులోని దీపంలా జ్వలించడం మొదలుపెట్టాయి. ఏవేవో దృశ్యాలు కదిలిపోతున్నాయి. దృష్టిపథంలో వీటన్నిటినీ అధిగమిస్తూ, నిన్న మొన్నటి తన త్రయంబక యాత్రాస్మృతి ఒక వరదలా ముంచెత్తుతోంది......నిత్యం వేకువనే గోదావరి జన్మస్థలం బ్రహ్మగిరి ముందే నిలబడి చేతులెత్తి నమస్కరించేవాడు రామరాజు.
త్రయంబకేశ్వరం అడుగడుగూ ప్రకృతి సౌందర్యమే. అక్కడక్కడ రుద్రాక్ష చెట్లు సహా, రకరకాల మహావృక్షాలు. వాటి మధ్య ఎన్నో తీర్థాలు. ఆ తీర్థాల ఒడ్డునే రమణీయ శిల్పకళతో ఎన్నో ఆలయాలు. వాటన్నిటికీ తలమానికంగా ఉంటుంది నల్లని రాతితో కట్టిన త్రయంబకేశ్వరాలయం. గౌతముడు తన కోసం గోదావరిని అక్కడ ఆపాడని స్థలపురాణం. గోదావరి సరే, రామలక్ష్మణ తీర్థం, గౌతమ తీర్థం, విశ్వనాథ తీర్థం, బిల్వతీర్థం, ఇంద్రతీర్థం, నీలాంబరతీర్థం, ప్రయాగ తీర్థం... ఇంకా ఎన్నో!
వీటిని చుట్టుకుని ఎన్నెన్నో స్థలపురాణాలు, గాథలు, కథలు! రామరాజుకు బస ఏర్పాటు చేసిన క్షేత్రోపాధ్యాయుడు (అక్కడి పురోహితులని క్షేత్రోపాధ్యాయులంటారు. వారికి పెద్ద పెద్ద ఇళ్లుంటాయి. వాటిలో భక్తులకు బస కల్పిస్తారు) అవన్నీ చెబుతూ ఉండేవాడు. బ్రహ్మగిరి, హరిహరగిరులకు ప్రదక్షిణలు చేస్తున్నా, పాండవుల గుహలు, జైనుల మందిరాలు తిరుగుతున్నా ఎన్నో పురాణ కథలు చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. తనువు పులకరింప చేసే ఎన్నో శ్లోకాలు విన్నాడు. అన్నీ ఆ నేల ప్రాశస్త్యాన్ని చాటేవే!
ఆ మంత్రాలతో పాటే జనమంతా తరతమ భేదం లేకుండా వల్లించే మరో మంత్రం రామరాజు చెవులను తాకేది. అది – వందేమాతరం.
మరో ఘట్టం వివరం కూడా తరచుగా అతడి చెవిని తాకుతూ ఉండేది.గోదావరికి బ్రహ్మగిరి జన్మనిచ్చినట్టు, అక్కడ వందేమాతర మంత్రానికి జన్మనిచ్చినది ఆ ఘట్టమే. పదిహేనేళ్ల క్రితమే జరిగిన ఆ ఘట్టంలో తన వంతు నిర్వహించిన పాత్రను చూసుకుని త్రయంబకం కూడా గర్వపడుతూ ఉంటుందనిపిస్తుంది .....
ఆగస్ట్ 26, 1906.
బాలగంగాధర తిలక్ నాసిక్ వచ్చాడు. అంతకు ముందుటేడు జరిగిన బెంగాల్ విభజనలో శ్వేతజాతి పాలకులు ఎంత ద్రోహబుద్ధిని ప్రదర్శించారో చెప్పడానికే వచ్చాడు. అప్పుడే ఆవిర్భవించింది అభినవ్ భారత్ సంస్థ. విభజనతో జ్వలించిన ఆగ్రహాన్ని ఉద్యమరూపంలోకి మార్చే ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో చాలామంది నాసిక్కు తూర్పు దిశగా ఉన్న ఔరంగాబాద్ లేదా దేవగిరి కేంద్రంగా పనిచేస్తున్న మిత్రమేళా అనే రహస్య సంస్థ సభ్యులే. మిత్రమేళా ఆశయం అందరికీ తెలుసు– కన్నుకు కన్ను. తెల్లజాతి విషయంలో ఇదే సత్యం. అనుసరణీయం. చేయవలసింది యుద్ధం. అందుకు ఆయుధాలను సేకరించాలి. భారత్ను చెరబట్టిన బ్రిటిష్ పాలకుల మీద ఎక్కుపెట్టాలి.
ఈ కార్యక్రమం, ప్రణాళికల వెనుక ఉన్నవారు ముగ్గురు సోదరులు. వారిలో పెద్దవాడు చదువుకోసం ఇంగ్లండ్ వెళ్లిపోతున్నప్పుడు, 1906 జూన్లో ఒక రహస్య ప్రదేశంలో, మారుమూల తీసుకున్న ఫొటో. ఇప్పటికీ నాసిక్, త్రయంబకాలలో చాలా ఇళ్లలో కనిపిస్తుంది. రామరాజు బస చేసిన క్షేత్రోపాధ్యాయుడి ఇంట్లో కూడా ఉంది. తమ నాయకుడి చుట్టూ నిలబడి మిత్రమేళా సభ్యులు కొందరు తీయించుకున్న ఫొటో అది. వారి చేతులలో శివాజీ మహరాజ్ చిత్రపటాలు, వాటి కింద వందేమాతరం నినాదం. ఆ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్.
నాసిక్ కలెక్టర్ జాక్సన్ అణచివేత మొదలుపెట్టాడు. అభినవ్ భారత్ సభ్యులంటే చాలు చిత్రహింసలతో జీవచ్ఛవాలను చేయించాడు. సహజంగానే ఇతడు మిత్రమేళాకు లక్ష్యంగా మారి, చావును ముందుకు తెచ్చుకున్నాడు.డిసెంబర్ 21, 1909.... ఆ రోజు అనుకోకుండా జరిగిపోయింది. నాసిక్లోనే విజయానంద నాటకశాలలో శారద అనే నాటకం చూస్తున్నాడు జాక్సన్. అనంత్ కన్హేరే అనే మిత్రమేళా సభ్యుడికి ఈ సంగతి తెలిసింది. నాటకశాలకు వెళ్లి రివాల్వర్తో కాల్చేశాడు. కన్హేరే సహా ముగ్గురిని ఉరి తీశారు. ‘మరి... నేను అఖండంగా దర్శనమిచ్చే రాజమండ్రి తీరంలో చిన్నతనంలో నువ్వు కూడా చూసిన ఆ ఘట్టం గుర్తు లేదా ఏమిటి!’ అని అప్పుడప్పుడు నదీముఖం నవ్వుతూ అడిగిన ట్టనిపించేది. అప్పుడు ఆ ఘటనల గురించి ఆ జలపాతంతో మాటామంతీ జరిపేది తన బాల్యం..........
‘వందేమాతరం’ అంటూ తెలుగు, దేవనాగరి, ఉర్దూ లిపులలో రాసిన ఆ బ్యానర్ గోదావరి గాలికి రెపరెపలాడడం ఇప్పటికీ గుర్తే, రామరాజుకి.
ఆ ఇన్నిస్పేటలోనే జవ్వాదివారి కొట్లలో ఉంది వెంకటరామరాజు ఫొటో స్టూడియో. ఆ రెండు రోజులు శ్రీరామరాజు అక్కడ జరిగిన ఏర్పాట్లన్నీ కన్నార్పకుండా చూశాడు.‘19–4–1907– రాజమండ్రి’ఆ అంకెలూ, ఆ ఇంగ్లిష్ అక్షరాలూ చూసేసి, డబ్బు తీసుకుని దాదాపు విసిరేస్తున్నాడు అతడు టికెట్లు.
అన్నీ ప్లాట్ఫారమ్ టికెట్లే.
ఒక్కసారిగా వచ్చి పడ్డారు జనం. రాజమండ్రి రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్లో కూర్చున్న ఆ తెల్లజాతి ఉద్యోగికి సంభ్రమంగా ఉంది. భయంగా కూడా ఉంది. ఎవరో గత రాత్రి స్టేషన్ లోపలి గోడల మీద తాటికాయలంత ప్రమాణంలో; తెలుగు, ఇంగ్లిష్లలో ఆ నినాదాలు అందంగా లిఖించారు– ‘వందేమాతరం’... అంటూ. తోసుకు తోసుకు వస్తున్నారు జనం. అన్నీ ప్లాట్ఫారమ్ టికెట్లే. కిటకిటలాడిపోతోంది ప్లాట్ఫారమ్. స్టేషన్ బయట ఇంకో రెట్టింపు జనం.రైళ్లు వచ్చి ఆగే చోటకు కొంచెం ఇవతల నిలబడి ఉన్నారు రాజమండ్రి ప్రముఖులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు, స్టేషన్లో. తనకు ఎదురుగా చేతులు జోడించి సవినయంగా నిలబడి ఉన్న ఆయన భుజాలు ఆప్యాయంగా రాస్తున్నారు– పంచె, చొక్కా, పైన నల్లని కోటుతో, తల మీద తెల్లని తలపాగాతో ఉన్న ఆ పెద్దాయన.
తెల్లటి బొద్దు మీసాలు హుందాతనం ఇస్తున్నాయి. వారే చిలకమర్తి లక్ష్మీనరసింహంపంతులుగారు. అప్పటికే చూపు పోయిందాయనకి. చేతులు జోడించి నిలబడి ఉన్న వారే సత్యవోలు గున్నేశ్వరరావు. రాజమండ్రి కరణం. ఇంతకాలం జాతీయోద్యమానికి రహస్యంగా అండదండలు ఇచ్చినవారే కరణంగారు. ఇప్పుడు బాహాటంగా ముందుకు వచ్చారు. ఆ ఇద్దరికీ కొంచెం దగ్గరగా నిలబడి ఉన్నాడు, ఓ యువకుడు. పేరు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. రాజమండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో విద్యార్థి. విద్యార్థి నాయకుడు. గాడిచర్ల వెనుకే దండ పట్టుకుని మరో యువకుడు నిలబడి ఉన్నాడు. అతడు మునగాల రాజా నాయని వెంకటరంగారావు. కౌతా శ్రీరామశాస్త్రి, దంటు సుబ్బావధాని, డాక్టర్ బ్రహ్మజోశ్యుల సుబ్రహ్మణ్యం, యర్రమిల్లి జగ్గన్నశాస్త్రి, గోటేటి వెంకటరావు... అంతా అక్కడే ఉన్నారు.
వారంతా మొన్న డిసెంబర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల కోసం కలకత్తా వెళ్లివచ్చినవారే. వందేమాతర గేయాన్ని జాతీయగీతంగా స్వీకరించాలని, స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని ఆ సభలో చేసిన తీర్మానాలు ఉద్యమిస్తున్న భారతీయులకి కొత్త రక్తాన్ని అందించినట్టయింది. చిలుకూరి వీరభద్రరావుగారు ఏదో చెబుతుంటే బాలభారతి సమితి నాయకులు టంగుటూరి శ్రీరాములు, గంటి లక్ష్మన్న, కంచుమర్తి రామచంద్రరావు వంటి వారు దీక్షతో వింటున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బాలభారతి సమితి సభ్యులు కొందరు కలకత్తా జెండాలు పట్టుకుని నిలబడ్డారు. కొందరి చేతులలో ప్లకార్డులు. కలకత్తా జెండా–దీర్ఘచతురస్రాకారంగా, మూడు రంగులతో రూపుదిద్దుకుంది. పైన ఎరుపు. ఈ భాగంలోనే సగం విచ్చుకున్న ఎనిమిది పద్మాలను వరసగా చిత్రించారు.మధ్యన పసుపు వర్ణం. దీని మీదే దేవనాగరి లిపిలో నల్లటి రంగుతో ‘వందేమాతరం’ అని రాశారు.కింది భాగంలో ఆకుపచ్చ రంగు. ఎడమవైపున సూర్యుడి బొమ్మ, కుడి వైపున చంద్రవంక ముద్రించారు. నిరుడు కలకత్తాలో పార్సీ బగాన్ స్క్వేర్లో ఆవిష్కరించారు. అందుకే కలకత్తా జెండా అంటున్నారు.
అప్పుడే దూరంగా రైలుకూత వినిపించింది. రెండు నిమిషాల తరువాత స్టేషన్లోకి దూసుకొచ్చింది రైలు. అంతా అటు పరుగు తీశారు. తెల్లటి పంచె, లాల్చీ, తలపై తెల్లటి పాగా ధరించిన ఆ ధీర గంభీర వదనుడు మొదట కింద అడుగుపెట్టారు. ఆయన ముట్నూరి కృష్ణారావు. కృష్ణాపత్రిక ఎడిటర్. వెంటనే వెనుదిరిగి, దిగుతున్న ఆ వ్యక్తికి చేయి అందించారు. పేరు కృష్ణారావే అయినా, రథం దిగుతున్న గీతాచార్యుడికి చేయి అందిస్తున్న అర్జునుడిని గుర్తు చేస్తున్నారు ముట్నూరి వారు. ఆ చేతిని ఆప్యాయంగా అందుకుని, చిరునవ్వుతో కిందికి దిగారా వ్యక్తి∙కూడా. సన్నటి పొడవైన మనిషి. ఆపాదమస్తకం బెంగాలీ ముద్ర. మధ్య పాపిడి, కళ్లకి నాజూకైన గుండ్రటి సులోచనాలు, తెల్లటి పంచె, లాల్చీ, పైన వల్లెవాటుగా వేసుకున్న కశ్మీర్ శాలువా. ఆయన బిపిన్ చంద్రపాల్. ఆయనను చూడగానే ఒక్క పెట్టున నినాదాలు వినిపించాయి ‘వందేమాతరం’ అంటూ. రైలు ఇంజన్ శబ్దం చిన్నబోయేటట్టుæ మారుమోగుతూనే ఉన్నాయి నినాదాలు ‘‘వందేమాతరం....’’, ‘‘వందేమాతరం....’’, ‘‘వందేమాతరం....’’