
ఆకుపచ్చ సూర్యదయం
‘రామరాజు దళం రంగూన్ పారిపోయే ప్రయత్నంలో ఉంది. ఇందుకు డబ్బు కూడా వసూలు చేస్తోంది.’1923
1
‘రామరాజు దళం రంగూన్ పారిపోయే ప్రయత్నంలో ఉంది. ఇందుకు డబ్బు కూడా వసూలు చేస్తోంది.’1923 జనవరిలో ఒక్కసారిగా ఈ మాట మన్యమంతా పాకింది. బలంగా వ్యాపించిన వదంతి. పెద్దగడ్డపాలెం, లింగాపుర ం ఓటమి తరువాత రామరాజు దళం కదలికలు ఎక్కడా కనిపించలేదు. అయినా ఆ వదంతిని వదంతిగానే చూస్తే మంచిదని చెప్పిన వాళ్లే ఎక్కువ. రామరాజునీ, కొండదళం సభ్యులనీ పట్టిచ్చినవారికి బహుమతులంటూ, గ్రామాల మీద సామూహిక శిక్షా సుంకం అంటూ హిగ్గిన్స్ అట్టహాసంగా ప్రకటన వెలువరించిన రెండు మూడు రోజులకే పెద్దవలçసలో మలబార్, బళ్లారి స్పెషల్ పోలీసు బలగాలు ఉన్న ఏడు పాకలకు నిప్పంటుకుంది.
ఆ మరునాడే నర్సీపట్నం పోలీసు శిబిరంలో నీళ్లు కల్తీ అయ్యాయి. 1923, ఆరంభంలో కొండలలో తిరుగుతున్న బలగాలు తక్కువేమీ కాదు. 665 మంది కానిస్టేబుల్స్ గాలిస్తున్నారు. వాళ్ల మీద 73 మంది హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎనమండుగురు సార్జెంట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ముగ్గురు పోలీస్ సూపరింటెండెంట్లు, ఇద్దరు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు ఇన్స్పెక్టర్లు, 28 మంది సబ్ఇన్స్పెక్టర్లు నిద్రాహారాలు మానేసి తిరుగుతూనే ఉన్నారు. అలాంటి సమయంలోనే గూడెం ప్రాంతంలో పదహారు మందితో రామరాజు కనిపించాడని సమాచారం.కంగుతిన్నది జిల్లా యంత్రాంగం. ఏప్రిల్ మండుటెండలలో, నెల మధ్యలో వడదెబ్బ లాంటి మరో సమాచారం.
2
సూర్యోదయ వేళ!
‘మూలతో బ్రహ్మరూపాయ; మధ్యతశ్చ మహేశ్వరం... అగ్రతః విష్ణు రూపాయ; త్రై్యక రూపాయతేనమః’రత్నగిరి కొండల పక్కన నుంచి సాగుతున్న పంపా నది పలచగా ప్రవహిస్తోంది. స్నానం ముగించి, భక్తిగా కళ్లు మూసుకుని ఈ శ్లోకం వల్లిస్తున్నాడు, చెరుకూరి నరసింహమూర్తి. రత్నగిరి మీద ఉన్న శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామిని దర్శించుకోదలచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కూడా నదిలో స్నానం చేస్తున్నారు. నరసింహమూర్తి దైవ దర్శనం కోసం వచ్చినవాడు కాదు. ఆ ఊరివారి అల్లుడు. అసలు ఊరు గోదావరి జిల్లాలోనే రామచంద్రపురం దగ్గర దంగేరు. శ్లోకం పూర్తయ్యాక కళ్లు తెరిచి చూశాడు మూర్తి. జనమంతా పరుగులు తీస్తున్నారు ఊరి వైపు. కొందరు మళ్లీ వచ్చి స్నానం చేయవచ్చునన్నట్టు బట్టలు కట్టేసుకుని సంచులు తీసుకుని పరుగు అందుకుంటున్నారు.
ఆయన కూడా గట్టు మీదకు వచ్చి, పరుగులు తీస్తున్న ఒక యువకుడిని ఆపి ఆడిగాడు, ‘‘ఏమైంది?’’ ‘‘అల్లూరి శ్రీరామరాజుగారు వచ్చారంటండి!’’ అన్నాడా యువకుడు.‘‘ఏమిటి? అల్లూరి శ్రీరామరాజే?’’ రెట్టించి అడిగాడు నరసింహమూర్తి. ‘‘ఆయ్, ఆయనేనంటండి! పోలీసు స్టేషన్కాడ ఉన్నారంటండి!’’ అనేసి రుగందుకున్నాడతడు. నిజమే రామరాజు మొదట పోస్టాఫీస్కు వెళ్లాడు. తరువాత పోలీస్ స్టేషన్కు వెళుతున్నాడని తెలిసింది.
ఇంటికి వెళ్లిపోయి పొడిబట్టలు కట్టేసుకుని, ఐదే ఐదు నిమిషాలలో స్టేషన్ దగ్గరకొచ్చి పడ్డాడు నరసింహమూర్తి– చేతిలో డైరీ, జేబులో కలంతో.గర్భగుడి ముందు ముఖమండపాన్ని గుర్తుకు తెస్తున్నది ఆ దృశ్యం. మూల విరాట్ ముందు నిలబడి ఉన్నట్టు చేతులు జోడించి భక్తి పారవశ్యంతో చూస్తున్నారు జనం– సబిన్స్పెక్టర్ కూర్చొనే ఆ గది లోపలికి. ఎస్ఐ కూర్చునే కుర్చీలో కూర్చుని ఉన్నాడాయన. ఖద్దరు నిక్కరు, దాని మీద ఎర్రటి ఖద్దరు చొక్కా. ఆయనే రామరాజని అర్థమైంది. అందమైన ముఖం.
దాని మీద చక్కని చిరునవ్వు. పక్కనే నిలబడి ఉన్న మనిషి అవతారాన్ని బట్టి మల్లుదొర అని అర్థమైంది. అతడి పక్కనే ఉన్నాడు మరో మనిషి, గంతన్న అని తరువాత తెలిసింది. ఇంకో పది మంది వరకు ఒక పక్కగా నిలబడి ఉన్నారు. ఎవరికీ పైన ఆచ్ఛాదనలు లేవు. కాళ్లకి చెప్పులూ లేవు. తుపాకీ, విల్లు, కత్తి, గొడ్డలి– ఏదో ఒక ఆయుధం ఉంది అందరికీ. నుమానం తీరని మల్లుదొర స్టేషన్ అంతా తిరిగి చూశాడు. నిజమే సబిన్స్పెక్టర్ చెప్పినట్టు ఆయుధాలు స్టేషన్లో లేవు.
తరువాత ఆయన బయటకు వచ్చాడు. అప్పటికే రెండు మూడు వందల మంది చేరిపోయారు. అందరికీ నమస్కరిస్తూ రామరాజు మెట్లదారి వరకూ వచ్చాడు. తాను స్నానం చేయవలసి ఉందనీ, మళ్లీ కలుసుకోవచ్చుననీ చెప్పి అక్కడే ఉన్న సత్రంలోకి వెళ్లాడు. చొక్కా జేబులో నుంచి గడియారం తీసి చూసుకున్నాడు రామరాజు. అప్పటికే సమయం ఏడు గంటలయిపోతోంది. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు రామరాజు. ప్పుడే వచి చేతులు జోడించి అన్నాడు నరసింహమూర్తి, ‘‘నమస్కారం!’’చిరునవ్వుతో అన్నాడు రామరాజు, ‘‘నమస్కారం.’’
తను ఎవరో చెప్పాడు మూర్తి. రాక కారణం కూడా చెప్పాడు. మూర్తి అంటే ఎవరో తెలియదు. అయినా ఎదురుగానే ఉన్న మరో కుర్చీలో కూర్చోబెట్టి తన ఉద్దేశం, తన పంథా, ఆలోచన అన్నింటి గురించి ఓపిగ్గా సమాధానం చెప్పాడు రామరాజు. తరువాత సత్రం ప్రాంగణంలోనే ఉన్న బావి దగ్గర అరగంట సేపు స్నానం చేశారాయన. కొద్దిసేపు జపం చేసుకున్నాడు. ఆపై సబిన్స్పెక్టరు, పోస్టుమాస్టరు, డిప్యూటీ తహసీల్దారు ఆహ్వానాల మేరకు వాళ్ల ఇళ్లకు వెళ్లాడు రామరాజు. అక్కడికీ అనుసరించారు జనం. ఆ ఇల్లాళ్లు స్వయంగా వారే కాళ్లు కడిగి, నీటిని నెత్తిన జల్లుకున్నారు.
రకరకాల పువ్వులు కాళ్ల మీద వేసి కళ్లకి అద్దుకున్నారు. ఇంటిల్లి పాది పాదాభివందనాలు చేశారు. చాలామంది కొత్త బట్టలు ఇచ్చారు. కొందరు డబ్బు చేతిలో పెట్టారు. ఆ వెంటనే అనుచరులతో కొండపైకి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నాడు రామరాజు. అప్పుడు సమయం తొమ్మిది. ఇంకో గంటలో ఇక్కడికొచ్చే రైలేదో ఉంది. అందులో బలగాలు వచ్చే అవకాశమే ఎక్కువ. అప్పుడే ఆ యువకుడు ఎదురుగా వచ్చి నమస్కరించి అన్నాడు, ‘‘నా పేరు ఆవంత్స వెంకట రామారావు. శంఖవరం నుంచి వచ్చాను. మా నాన్నగారు వెంకటరావుగారు. తమరిని మా ఊరికి ఆహ్వానించాలని ఆయన కోరిక.’’
ఒక్క నిమిషం పాటు ఆలోచించి, ‘‘నడవండి!’’ అన్నాడు రామరాజు ఆ యువకునితో. విస్తుపోయాడతడు. స్టేషన్లో ఆయుధాలు దొరకలేదు. కానీ తన మీదా తన ఉద్యమం మీదా మైదాన ప్రాంత తెలుగు ప్రజలకి ఎంత విశ్వాసం ఉందో రుజువు దొరికింది. ∙ పదింటికి అన్నవరం చేరుకోవలసిన మద్రాస్ మెయిల్ను పిఠాపురంలో నిలిపివేశారు. కారణం– అన్నవరంలో రామరాజు దళం ఉంది. ప్రయాణికులంతా ప్లాట్ఫారమ్ మీదకి దిగిపోయి ఆ విషయమే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విస్తుపోయి మాట్లాడుకుంటున్నారు. అందరితో పాటు ఆ యువకుడు కూడా దిగాడు.
శ్రీరామరాజు వీరోచిత కృత్యాలు అతడిని రోమాంచితం చేస్తున్నాయి. ఉప్పొంగిపోతున్నాడు మనసులో. అతడి గమ్యం కలకత్తా. బెంగాల్ తీవ్ర జాతీయవాదులతో కలసి పనిచేయడం. అతడిని అగ్గిరాజు అంటారంతా. ఆవేశపరుడు కావడం వల్ల కొందరు మిత్రులు ముద్దుగా ఆ పేరు పెట్టారు. అసలు పేరు వేగిరాజు సత్యనారాయణరాజు. పాతికేళ్లుంటాయి. ఎంత ఆవేశపరుడో, అంత ధర్మవర్తనుడు కూడా. భీమవరం దగ్గరి కుముదవల్లి నుంచి వస్తున్నాడు. తండ్రి లేడు. చదివింది నాలుగో తరగతి. తల్లీ, తను. ఇల్లు గడవడానికి పాలేరుతనం చేసేవాడు. అక్కడ నుంచి ఖద్దరు ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, భీమవరం కాంగ్రెస్ శిబిరంలో స్వచ్ఛంద సేవకుడు– ఇలా ఎదిగి వచ్చాడు. అడవి బాపిరాజు వంటి రచయితలు, విద్యావంతులతో అనుబంధం పెరిగింది.
కానీ గాంధీజీ పిలుపు మేరకు ప్రజలు అహింసాయుతంగా ఉద్యమిస్తున్నారు. కానీ పోలీసులేమో యువకులు, బాలలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చావగొడుతున్నారు. అహింస అంటే ఇదే అనిపించింది. పోలీసులంటే ఒకరకమైన కక్ష. అందుకే జాతీయ కాంగ్రెస్ను విడిచిపెట్టాడు. తరువాత ఇల్లు కూడా విడిచిపెట్టాడు. కలకత్తా బయలుదేరాడు. యాదృచ్ఛికంగా ఆ ఉదయమే నిడదవోలు వచ్చి ఈ రైలెక్కాడు. గంట తరువాత పిఠాపురం నుంచి రైలు బయలుదేరింది. మరో గంటకి అన్నవరం చేరుకుంది. అగ్గిరాజు మనసు మారిపోయింది. అక్కడే దిగిపోయాడు. శంఖవరంలో ఆవంత్స వెంకటరావు గారింటికి వెళ్లింది రామరాజు దళం. అన్నవరానికి నాలుగు మైళ్లు.తన కోసం నేయించి పెట్టుకున్న ఖద్దరు పంచెను వెంకటరావుగారు రామరాజుకు బహూకరించారు.
అందరికీ భోజనాలు పెట్టారు. గ్రామంలో వసూలైన కొంత పైకం కూడా ఇచ్చి పంపించారు.ఆ సాయంత్రమే వెంకటరావుగారింటికి పోలీసులు వచ్చారు. ఆయన్ను అరెస్టు చేసి తీసుకుపోయారు. రామరాజు శంఖవరం రావడం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బ్రేకన్ అన్నవరంలో దిగడం దాదాపు ఒకసారే జరిగాయి. సత్కారాల గురించి తప్ప రామరాజు గురించి తెలియలేదు. కొండలలో పోలీసు స్టేషన్లని కొట్టిన తరువాత రామరాజు ఇప్పుడు మైదాన ప్రాంతాల స్టేషన్ల మీద దృష్టి సారించాడా? ఆ ప్రశ్న వేసుకుంటేనే వణుకు పుడుతోంది. అన్నవరం, శంఖవరాల మీద నాలుగువేల రూపాయల సామూహిక శిక్షా సుంకం విధించాడు.
3
ఆ రోజు ఏప్రిల్ 24, 1923. శనివారం. చాలా మందికి గుర్తుండిపోయిన రోజు. అన్నవరంలో రామరాజు ఇచ్చిన ఇంటర్వ్యూను ఆంధ్రపత్రిక ఆ రోజునే ప్రచురించింది. ఏప్రిల్ 17వ తేదీన రామరాజుతో మాట్లాడిన నరసింహమూర్తి మరునాడే ప్యాసింజరు రైలులో కాకినాడ వచ్చాడు. అక్కడ ఆంధ్రపత్రిక విలేకరిని వెతికి పట్టుకుని సంభాషణ అంతా ఇచ్చాడు. అదే అచ్చయింది.శ్రీరామరాజు హృదయాన్ని చాలా వరకు ఆవిష్కరించిన ఇంటర్వ్యూ మరి. ఆయన పట్ల మరింత గౌరవాన్ని పెంచిన ఇంటర్వ్యూ. ఇంకా చెప్పాలంటే పత్రికలలో ఇంతకాలం వచ్చిన ఉద్యమ వ్యతిరేక వార్తలన్నింటికీ, ఊహాగానాలన్నింటికీ, అర్ధ సత్యాలన్నింటికీ సమాధానం అన్నట్టుంది.
కొంచెం ఆలస్యం కావచ్చు. అయినా ఎక్కడలేని ఆసక్తితో చదువుకుంటున్నారు కృష్ణదేవిపేట వాసులు రామరాజు ఇంటర్వ్యూని. ఊరిలోకి పోలీసు శిబిరాలు వచ్చిన తరువాత ఆంధ్రపత్రిక కూడా బహిరంగంగా చదువుకోవడానికి ధైర్యం చాలడం లేదు, ఊరివాళ్లకి. అందుకే భాస్కరుడిగారి ఇంటి వెనుక పెరడంతా కిక్కిరిసిపోయి ఉంది. ఒకసారి భాస్కరుడుగారు చదివి వినిపించారు. చాలామందికి తృప్తి కలగలేదు. రెండోసారి చదువుతున్నాడు దాలినాయుడు. ఎప్పుడూ లేనిది సోమమ్మ, మరికొందరు మహిళలు కూడా వచ్చి వింటున్నారు ప్రశ్న జవాబుల రూపంలోని ఆ ముఖాముఖీ.... నరసింహమూర్తి: మీరే సంకల్పముతో ఫితూరీని నడుపుతున్నారు?
రామరాజు: ప్రజలకు స్వాతంత్య్రము లభించుటకే!నర: ఏ సాధనము వలన?రామ: దౌర్జన్యము వలననే! యుద్ధము చేసినగానీ మనకు స్వరాజ్యము రాదు.నర: స్వాతంత్య్రము బడయుగలుగుదునను నమ్మకము మీకు గలదా?రామ: రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించునను నమ్మకము నాకు కలదు.నర: రెండేండ్లలో స్వరాజ్యము ఎట్లు లభించును? మీరవలంభించుచున్న పద్ధతి వలనే స్వరాజ్యము వచ్చునా?రామ: వచ్చును. తప్పక వచ్చును. నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది. జనము లోటేమియూ లేదు. కానీ తుపాకులను మందుగుండునూ కావలెను. వాని కొరకే సంచారము చేయచున్నాను.
నర: దౌర్జన్యముతో కూడిన యుద్ధముల వలన జన నష్టముల వలన ప్రపంచము విసుగు చెందియున్నది. దౌర్జన్యము కూడదను సిద్ధాంతమునే ఇపుడు ప్రపంచములోని అన్ని దేశముల వారు ఆదరించుచున్నారు. జర్మనీ వారు గూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్య రాహిత్య శాంతి సాధనములందు మాత్రమే మాకు నమ్మకము కలదు. బోధించుటకు దేవదూత గాంధీ మహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచము వారందరునూ నమ్ముచున్నారు. రామ: నాకు దౌర్జన్యరాహిత్యమునందు నమ్మకము లేదు. దౌర్జన్యము వలననే స్వరాజ్యము బడయగలుగుదుమని నేను గట్టిగా నమ్ముచున్నాను.
నర: దౌర్జన్యము వలన ప్రాణ నష్టమునూ, వినాశనమునూ కలుగును. శాంతి సాధనముల వలననే స్వరాజ్యము లభించును. ఇంతకు పూర్వము మీకునూ, పోలీసు వారికిని జరిగిన యుద్ధములందు మీ స్థితి ఎట్లుండెను?రామ: మొదటి ఐదు యుద్ధములలోను నేను సులభముగానే జయమును బడసితిని. ఆరవ యుద్ధమునను, కడపటి యుద్ధమునను మేము నిద్రపోవుచుండగా పోలీసువారు హఠాత్తుగా తలపడిరి. వారు దూరము నుంచి మరతుపాకులను కాల్చసాగిరి. అరగంట సేపటుల విడవకుండా వారు కాల్చిన పిమ్మట మా జట్టులోని వారికి మెలకువ వచ్చినది. మరి రెండు నిమిషములకు నాకునూ మెలకువ వచ్చెను. నేను లేచి చూచుసరికి పోలీసుల సంఖ్య విస్తారముగా నుండెను.
మావారి సంఖ్య తక్కువగా నుండెను. తుపాకి రవ్వలు తగిలి నా పరుపంతయు చిల్లులు పడియుండెను గాని నాకొక్కటియును తగులలేదు. నేనంతట మావారితో గూడ తప్పించుకొనిపోతిని.నర: ఈ నాలుగు నెలలును మీరేమి చేయుచుంటిరి? రామ: నేను తపము చేయుచుంటిని.నర: గయలో జరిగిన కాంగ్రెస్ సభకు మీరు వెళ్లినారని ప్రజలు విస్తారముగా చెప్పుకొనుచుందురు. అది నిజమేనా?రామ: నా స్థూల శరీరము గయకు పోలేదు. కాని నా యాత్మ అచటికి పోయినది.నర: అచట జరిగిన విషయములన్నియు తెలియునన్నమాటేనా?రామ: నేనంతయు స్వయముగా చూడగలిగితిని.
రెండు కక్ష్యలేర్పడెను. కొందరు శాసనసభలను బహిష్కరింపవలెననగా, మరికొందరు సభలకు వెళ్లవలెననిరి. వెళ్లవలెననువారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పము. ఉప్పు పన్నును హెచ్చించినందులకు, ధర్మాదాయ చట్టమునామోదించినందులకు భారత శాసన సంఘ సభ్యులలోను చెన్నపురి రాష్ట్రీయ శాసనసంఘ సభ్యులలోను ఎవరైనా రాజీనామాలిచ్చారా? నర: ఎవరును రాజీనామాలనీయలేదు. గాని మీకీ రాజకీయ విషయములన్నియు నెటుల తెలియుచున్నవి?రామ: నేనందులకు తగిన ఏర్పాట్లు చేసితిని. ఇంకో వార్త ఏదీ తెలుసుకోవాలని అనిపించలేదు ఎవరికీ. దీర్ఘంగా నిట్టూర్చి లోపలికి Ðð ళ్లారు సోమమ్మ.
4
‘‘చౌరీచౌరా తరువాత సహాయ నిరాకరణోద్యమాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం కంటే, ఈ తీర్పు మీద నోరెత్తకపోవడమే మరింత నిరంకుశత్వమని నేనంటాను.’’ వేకువజాము ఐదుగంటల ప్రాంతం. సంగోలు పూజ బస ఎదురుగా ఉన్న ఏరులో స్నానం చేస్తున్నారు అగ్గిరాజు, రామరాజు. అన్నవరంలో రైలు దిగిపోయిన అగ్గిరాజు తుని, కోటనందూరుల మీదుగా నర్సీపట్నం చేరుకున్నాడు. అక్కడే ఆంధ్రపత్రిక కొనుక్కుని చదివాడు. అందులోనే ఉంది ఆ వార్త. పద్నాలుగు మాసాల తరువాత ఏప్రిల్ 20, 1923న అలహాబాద్ హైకోర్టు చౌరీచౌరా కేసు మీద తుది తీర్పు ఇచ్చిందట.
నర్సీపట్నం నుంచి డౌనూరుకు వచ్చాడు అగ్గిరాజు, రామరాజును వెతుక్కుంటూనే.చిత్రంగా దారంతా కొండవాళ్ల పిల్లలు అతడిని రహస్యంగా అనుసరిస్తూనే ఉన్నారు. రామరాజు కోసం వాకబు చేసుకుంటూ వస్తున్నాడని తెలిసి, ఒక మునసబు పంపించాడు, అగ్గిరాజుని. ‘‘నాది ఆవేశమని అంతా అంటారు. దీని మీద కూడా ఆవేశపడకుండా నోరు మూసుకుని పడి ఉంటే ఇక ఈ మానవ జన్మ ఎందుకు రామరాజుగారూ?’’ అన్నాడు అగ్గిరాజు. ‘‘ఈ తీర్పు గురించేనా?’’ అడిగాడు రామరాజు.
‘‘ఔను. చౌరీచౌరా పోలీసు స్టేషన్ని తగలబెట్టినప్పుడు ఎంతమంది చనిపోయారు? 22 మంది కదా! 225 మందిని ఎనిమిది నెలలు విచారించారు. వాళ్లలో 172 మందికి మరణశిక్ష వేసేస్తాడా జడ్జి? హింస మొదలు పెట్టింది వాళ్లు. శిక్ష మాత్రం అహింసాయుతంగా సత్యాగ్రహం చేసినవాళ్లకి! ఆరుగురు విచారణ సమయంలో పోలీసు కస్టడీలోనే చనిపోయారట. వాళ్లదీ మరణదండనే. ఇంత అన్యాయం జరుగుతోంది, ఒక్కమాట అన్నాడా గాంధీగారు? తర్వాత అలహాబాద్ హైకోర్టు ఆ 172 మందిలో 19 మందికి మరణదండనని ఖరారు చేసింది. 110 మందికి యావజ్జీవ ఖైదు వేసింది.
చౌరీచౌరాలో ఉల్లంఘన జరిగిందనే అనుకుందాం. దానికి ఇంతమందిని ఉరికంబం ఎక్కిస్తారా? ఇలాంటి జాత్యహంకారుల ముందా భారతజాతి చేతులు జోడించి దేహీ అంటూ స్వరాజ్యం ఇమ్మని అడిగేది? అలా చేయమనే కదా గాంధీగారు, ఈ మోతీలాలు, కొండా వెంకటప్పయ్యలు చెబుతున్నది! ఎమ్మెన్ రాయ్ గారట ఎవరో, ఆయన అన్నారట, తీర్పు గురించి. ఇది లీగలైజ్డ్ మర్డర్ అని. ఆయన కి శిరసు వంచి నమస్కరించాలి.’’ అంటూ అనర్గళంగా, అదే ఆవేశంతో చెప్పాడు అగ్గిరాజు. శ్రీరామరాజు స్నానం ముగించి గట్టున నిలబడి మొలకు కట్టిన తుండుగుడ్డే విప్పి పిడిచి తల తుడుచుకుంటున్నాడు.