
ఆకుపచ్చ సూర్యదయం
కానీ ఆ సమయంలో ఆయన లేడు. ఆ చీకటిలోనే రామరాజును తీసుకుని గంతన్న, కొటికల బాలయ్య బయటపడ్డారు. మల్లు, పడాలు నాయకత్వంలో పోరాటం సాగుతోంది.
కానీ ఆ సమయంలో ఆయన లేడు. ఆ చీకటిలోనే రామరాజును తీసుకుని గంతన్న, కొటికల బాలయ్య బయటపడ్డారు. మల్లు, పడాలు నాయకత్వంలో పోరాటం సాగుతోంది. అర్థరాత్రి వరకు ఒక కసితో, ఉన్మత్తతతో కాల్పులు సాగించారు పోలీసులు.చివరికి మల్లు కూడా గాయప పక్కకి తప్పుకున్నాడు.
4
తెల్లవారింది. అలాంటి వేకువని మన్యం ఏనాడూ చూడలేదు. అడవిబిడ్డల నెత్తురులోని ఎరుపును కూడా రంగరించుకుని మరింత ఎర్రబడ్డాడు సూర్యుడు. లింగాపురం నుంచి శరభన్నపాలెం వైపు నడుస్తున్నాయి –మూడు పోలీసు పటాలాలు.ఒక పటాలం ముం. రెండు పటాలాలు వెనుక. వాటి మధ్యలోనే పదమూడు నులక మంచాలు.ఒక్కొక్కదాని మీద ఒక్కొక్క శవం. పొట్ట చీలి పేగులు బయటకు కనిపిస్తున్న శవం ఒకటి. తలలో తూటా దిగిన శవం ఒకటి. గుండె చీలినది ఒకటి.... నిన్నటి పోరులో కన్నుమూసిన అడవి బిడ్డల శవాలే అన్నీ.
ఒళ్లు జలదరించేటట్టు....రక్తం గడ్డకట్టేటట్టు ఉన్నాయి కొన్ని. ఇంకా రక్తమోడుతున్నవి కొన్ని. పెద్దగడ్డపాలెంలో చనిపోయిన వాళ్లు ఐదుగురు. లింగాపురంలో కూలినవాళ్లు ఎనిమిదిమంది....అదొక నిలువెత్తు రక్తపు ముద్దల ఊరేగింపు. ఛిద్ర మానవాంగాల భయానక ప్రదర్శన.పోయిన భయం మన్యవాసుల కళ్లలో మళ్లీ వచ్చి చేరుతున్న సంగతి పోలీసులకి తృప్తినిస్తోంది.పొగిలి పొగిలి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అణచి పెట్టుకుంది మన్యం.దొరికిన పదిమందిని చేతులు కట్టేసి నడిపిస్తున్నారు.ఇది ఘన విజయమంటూ మద్రాసుకు తంతి వార్త పంపాడు హెపెల్.
5
మలబారు పోలీసులు ఉన్న ఆ డేరాలోకి దూసుకొచ్చాడు ఇన్స్పెక్టర్.అంతా కంబళ్లు కప్పుకుని పడుకుని ఉన్నారు. అక్కడికొచ్చి మళ్లీ విజిల్ వేశాడు కర్ణకఠోరంగా.కృష్ణదేవిపేటలో వేసిన పది డేరాలలో మొదటే ఉంది. నులక మంచాల మీద వరసగా పడుకుని ఉన్నారు రెండు పటాలాల స్పెషల్ పోలీసులు. అంటే దాదాపు యాభయ్ మంది.కుడివైపు నాలుగో మంచం మీద ఉన్నవాడు కంబళి సర్రున విసిరి, ‘‘ఎవడ్రా ఆడు? మనిషా పశువా? ఏంటా గోల? బయటికిపో!’’ అన్నాడు గొంతు పగిలేటట్టు.
‘‘నేను ఇన్స్పెక్టర్ని. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.’’ అన్నాడు విజిల్ నోట్లోంచి తీసి.‘‘అయితే ఏంటంట!’’ నాలుగో మంచం మీది మనిషే అన్నాడు. అతడో కానిస్టేబుల్.‘‘తక్షణం మీ రెండు పటాలాలు శరభన్నపాలెం వెళ్లాలి. ఇది ఆర్డర్.’’ అన్నాడు ఇన్స్పెక్టర్.‘‘కుదరదు.’’ అన్నాడు నాలుగో మంచం మీద వ్యక్తి సర్రున లేస్తూ, అంతే పెద్ద స్వరంతో.‘‘తాగున్నావా రాస్కెల్? ఏం మాట్లాడుతున్నావ్?’’ మీదకొచ్చాడు ఇన్స్పెక్టర్.అన్ని మంచాల మీద నుంచి పోలీసులు లేచి నిలబడ్డారు, గబగబా. అందరి కళ్లు ఎర్రబడి ఉన్నాయి. నిద్రాభంగమైనందుకు మండిపోతున్నారు వాళ్లంతా.‘‘ఎవడ్రా తాగి ఉన్నాడు? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు!’’ అన్నాడు నాలుగో మంచం మీద మనిషి.
‘‘ఏయ్....!’’ ఇంకా మీదకు రాబోయాడు ఇన్స్పెక్టర్. ‘‘ఆగండి సార్! ముందుకు రాకండి!’’ అప్పుడు కలగచేసుకున్నాడు ఆ చివర మంచం మీద నుంచి అప్పుడే లేచిన ఇంకో కానిస్టేబుల్.ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చి అడిగాడు అతడు, ‘‘ఏంటిసార్! ఆడు తాగి ఉన్నాడా? ఇప్పుడు సెర్చ్కి వెళ్లాలా? రెండురోజుల నుంచి రాత్రీపగలూ లేకుండా కొండలంట తిప్పుతున్నారు. రాత్రి ఒంటి గంటకి వచ్చి పడుకున్నాం. ఇంకా ఆరు కూడా అయి ఉండదు. ఇప్పుడు మళ్లీ వెళ్లాలా? మేమేమన్నా పొలం దున్నే పశువులం అనుకున్నారా?’’ అని నిలదీశాడు.‘‘ఈ ఉద్యోగంలో విధులు ఇలాగే ఉంటాయి. తెలియకుండానే చేరారాæ?’’ అన్నాడు దర్పంగా ఇన్స్పెక్టర్.
‘‘అందరి విధులు ఒకలా లేవు. మీ పనిగంటలు వేరు. మాకు ఆ లెక్కలు ఉండవు. మీకు సకల సదుపాయాలు ఉంటాయి. వేళకి సుష్టుగా భోజనం ఉంటుంది. కంటి నిండా నిద్ర ఉంటుంది. మాకేం ఉంది?’’ అంటూ బిగ్గరగా అరిచాడు ఇంకో కానిస్టేబుల్. ‘‘కొండల్లో తాగడానికి నీళ్లు కూడా లేవు. మోత పనీ మాదే. మా కాళ్లు చూడండి! ఎలా వాచిపోతున్నాయో! మీ సామాను గుర్రాలు మోస్తాయి. మీరేమో పంకాలు ఏసుకుని సుబ్బరంగా పడుకుంటారు. మేం దోమలతో జాగారాలు చేస్తున్నాం. మేం ఇప్పుడు పోలేం. మాకు కొంచెం విశ్రాంతి కావాలి!’’ మొదట మాట్లాడినవాడే చెప్పేశాడు.
‘‘మీ అంతు చూస్తాను!’’ అంటూ రుసరుసలాడుతూ వెనుదిరిగాడు ఇన్స్పెక్టర్.
6
మలబారు పోలీసులు తిరగబడిన తరువాత మరునాడే వచ్చాడు సాండర్స్.అప్పటికి వాళ్ల మీద ఫిర్యాదుల గుట్ట తయారై సిద్ధంగా ఉంది. దర్యాప్తు అన్నారు అధికారులు.మొదట ఇన్స్పెక్టర్ మీద అరిచిన కానిస్టేబుల్ది క్రమశిక్షణా రాహిత్యమని నిర్ధారించారంతా.పోలీసులు మరీ మొండికేశారు. నిన్నటి నుంచి వెళ్లమన్న చోటకి వెళ్లడానికి కుదరదని చెబుతున్నారు. తూర్పు దిక్కున సెర్చ్ చేయమంటే నీళ్లు లేవు, ఎలాగంటున్నారు. పోనీ దక్షిణం వైపు వెళ్లమంటే మనుషులని రుచి మరిగిన పులి ఉందంటున్నారు. ఈ సమస్యని చాలా మెత్తగా తుంచాలని సాండర్స్ అభిప్రాయం. ఇలాంటి వాళ్లతో పనిచేయించడం కష్టం. వదుల్చుకోవడమే మంచిది. విశాఖ మన్యంలో గాలింపు నుంచి మాత్రమే కాదు, అసలు ఆ శాఖ నుంచి ఉద్వాసన చెప్పడమే వీళ్లకి సరైన మందు అని తీర్మానించుకున్నాడు.
ముగ్గుర్ని పిలిచి మాట్లాడాడు.
అంతే కరుకుగా మాట్లాడారు వాళ్లు. కావాలంటే రాజీనామా తీసుకోమని రాసుకొచ్చిన కాగితాలు టేబుల్ మీద పడేశారు. కంగుతిన్నాడు సాండర్స్. వీళ్లని సోమరులనేకంటే, కొండదళంతో కుమ్మక్కయిపోయారని అనడం సరైనదన్న అభిప్రాయానికి వెంటనే వచ్చేశాడు సాండర్స్. అదే, కొండదళంతో వీళ్లు కుమ్మక్కు కావడమే నిజమైతే ఇంక ఏ తెల్లవాడు బతకలేడు. 1857లో సిపాయీలు తెల్లఅధికారులను చంపినట్టు చంపినా ఆశ్చర్య పోనక్కరలేదు. ‘‘ఓకే... ఇంకా ఎందరు రాజీనామాలు ఇస్తారో అవి కూడా ఇచ్చేస్తే, కొత్తవాళ్లని రప్పిస్తాం!’’ దర్పంగా అన్నాడు.‘ఆమోదించడమే తరువాయి...’అన్నట్టు రెండు రోజులలోనే 47 మంది రాజీనామాలు చేసేశారు.మొదట తిరుగుబాటుచేసిన కానిస్టేబుల్ని మాత్రం అరెస్టు చేయించి, మూడు నెలలు జైలు శిక్ష పడేటట్టు చేశారు.
7
గాయపడి అప్పుడప్పుడే కోలుకుంటున్న సైనిక శిబిరంలా ఉంది కంపమానుపాకలు పూజబస. పెద్దగడ్డపాలెం– లింగాపురం పోరాటం తర్వాత చెదిరిన గుండెను కొండదళం ప్రోది చేసుకుంటున్న క్షణాలలో ప్రభుత్వం ఈ ప్రకటన మన్యం మీదకి వదిలిపెట్టింది. శ్రీరామరాజు జీవించి ఉన్నట్టా, లేనట్టా? అన్న అనుమానం కలిగేటట్టు చేసింది ప్రభుత్వం. పూజబస మధ్యగా అగ్నిహోత్రం ఇంకా వెలుగుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే శ్రీరామరాజు సంధ్యావందనం పూర్తి చేసుకుని, తనను కలుసుకోవాలని ఆదరాబాదరా వచ్చిన మునసబులు, మొఖాసాదారులతో సమావేశం ప్రారంభించాడు.
బస మధ్యలోనే ఉంది అగ్నిహోత్రం. దాంతో లోపలంతా కాస్త వెచ్చగా ఉంది. రామరాజు, ఇంకో ఇద్దరు ముగ్గురు మినహా అంతా గొంగళ్లు కప్పుకుని కూర్చుని ఉన్నారు, నేల మీద. డిసెంబర్ మాసం, చివరి రోజు. చలితో వేళ్లు కొంకర్లు పోతున్నాయి.ఇప్పుడు ఇలాంటి శిబిరమే శ్రేయస్కరమని పదిరోజుల క్రితం రామరాజునీ, కొండదళం ముఖ్యలనీ ఇక్కడికి తీసుకువచ్చినవాడు లక్ష్మయ్య అయ్యవారే. ఆ స్థలానికి కొన్ని గజాల ముందు జలజలా పారుతూ ఉంటుంది జలపాతం– పెద్ద శబ్దంతో. దాని పక్క నుంచి పైకి ఎక్కి కొండ పక్క నుంచి నడిస్తే చిన్న బాట కనిపిస్తుంది. అక్కడ నుంచి పది గజాలు వెళ్లాక కొండరాళ్ల వరస, చిన్నకోటలా. ఆ లోపలే ఉంది కంపమానుపాకలు గ్రామం. అక్కడ నిర్మించి ఉంచారు ఒక పూజబస.
రామరాజు నులక మంచం మీద మోచేతుల మీద వాలి ఉన్నాడు వెనక్కి. దాని పక్కనే వెదురుబొంగులతో చేసిన ఆసనం మీద కూర్చుని ఉన్నాడు కూడా లక్ష్మయ్య. ‘‘పిడికిలి బిగిస్తున్నారు!’’ లేని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు లక్ష్మయ్య.‘‘అది అనూహ్యం కాదు కదా అయ్యవారు!’’ నిబ్బరంగా అన్నాడు రామరాజు.‘‘మిమ్మల్ని పట్టిచ్చిన వారికి ఇనాం ప్రకటించింది స్వామీ ప్రభుత్వం!’’ చాలా బాధగా, ఆవేశంతో అన్నాడు ఒక మునసబు. ఒక్క నిమిషం మౌనం. తరువాత అన్నాడు రామరాజు, ‘‘ఇది ఇక్కడితో ఆగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. సరే, అంతా విందాం, చదవండి మీరే!’’ అన్నాడు రామరాజు.గొంతు సవరించుకుని చదవడం మొదలుపెట్టాడు లక్ష్మయ్య.
‘‘ప్రకటన
(1) గూడెం తాల్కు, యెల్లవరం తాల్కు, రంపచోడవరం తాల్కులో ఉన్న ముఠాదార్లు, విలేజి మేజిస్ట్రేటులు, విలేజీ మునసబులు, యిజారాదార్లు, భూఖామందులు, రయితులు, గ్రామస్తులు అందర్కి మహారాజ రాజశ్రీ యేజన్సీ డివిజన్ యేజన్సీ కమిషనరు దొరవారు ప్రచురించే ప్రకటన యేమనగా:–
(2) యీ సంవత్సరం ఆగష్టు నెలలో దిగువ నుంచి అల్లూరి శ్రీరామరాజు అనేవాడు పయిన చెప్పబడిన తాలూకాలలో నుంచి 200 మంది మనుష్యుల సహాయముతో గవర్నమెంటు వారి మీద పితూరీ చేసినాడన్న సంగతి మీకు అందరికి తెలిసేయున్నది. యీ పితూరీ మొనగాడు అయిన శ్రీరామరాజు గవర్నమెంటు పటాలములను అతి సులువుగా ఓడించి పై తాలూకాలకు రాజును అవుతానని బహిరంగముగా చాటినాడు. యింతవర్కు కొంచెముమంది తప్ప యావన్మంది ముఠాదార్లు, గ్రామ మేజిస్ట్రేటులు విలేజి మునసబులు, యిజారాదార్లు, భూఖామందులు, రయితులు, గ్రామస్తులు పోలీసు వార్కి యేమీ సహాయం చేయడం లేదు. సహాయము చేయకపోవడము సరిగదా, అనేకమంది ముఠాదార్లు, గ్రామ మునసబులు, యిజారాదార్లు, భూఖామందులు యేకమయి పితూరీదార్లకు బియ్యం వగయిరా సప్లయిలు యివ్వడం, వాండ్ల సామానులు మోయిడము, వాండ్ల సమాచారం,
వాండ్ల జాడలు తెలియకుండా దాచిపెట్టడము, కొండలలో వాండ్లు దాగుందుకి వీలయిన స్థలములు చూపించడము వగయిరా పనులు చేసినారు. అందుచేత పితూరీదార్లకు సాయము చేసిన వాండ్లపయిన యీ దిగువ చర్య జరిగించబడినది. పితూరీదార్లకు సాయము చేసినందుకు మాకారము ముఠా గవర్నమెంటువారు తీసుకున్నారు. ఆ ముఠాదారును శిక్షించి జెయిలులో పెట్టినారు. అలాగునే పితూరీదార్లకు సాయము చేసినందుకున్నూ, పితూరీదార్ల విషయమయి సమాచారం యివ్వనందుకున్నూ చిట్టింపాడు గ్రామ మున్సబు శిక్షించబడ్డాడు. కొంతమంది ముఠాదార్లు నవుఖరి నుండి మన్నా చేయబడ్డారు. పితూరీదార్లకు సాయము చేసినంద్కు గంగరాజుమాడుగుల ముఠాదారు పయినిన్ని, దామనాపల్లి గ్రామ మునసబు పయినిన్ని కేసులు చేయబడినవి.
(3) 6–12–1922 తేదీని పితూరిదార్లను పోలీసువారు 2 మాటులు ఓడించి 13 మంది పితూరిదార్లను చంపివేసినారు. అనేకమందికి గుండుదెబ్బ తగిలి పట్టుబడ్డారు. దీనినిబట్టి యేమి అగుపడుతుందంటే గవర్నమెంటు పటాలములను యెప్పుడూ ఓడించివేస్తాను, పితూరీదార్లకు గుండుదెబ్బ తగలదు అని శ్రీరామరాజు మీకు చెప్పిన మాటలు అబద్ధాలని తెలియవస్తుంది.
(4) పితూరిదార్లు వేగిరము పట్టుబడుటకు గాను గవర్నమెంటువారు యీ దిగువ బహుమతులు అనగా యినాములు యిచ్చుటకుగాను హుకూము దయచేసినారు.1. అల్లూరి శ్రీరామరాజుని పట్టుకుంటే రూ. 1500 – 00 యినాము.2. గనర్లపాలెం కాపరస్తుడు గాం గంతన్నదొరను పట్టుకుంటెను రూ. 1000 – 00 యినాము.3. గనర్లపాలెం కాపరస్తుడు గాం మల్లుదొరను పట్టుకుంటే రూ. 1000 – 00 యినాము. 4. ముఖ్యమయిన యే పితూరిదారునయినా పట్టుకోవడము గానీ లేదా వాడి విషమయి గతిన సమాచారం యిచ్చి పట్టించడముగానీ చేస్తే అటువంటి ఒక్కొక్క ముఖ్యమయిన పితూరిదారు విషయము రూ. 50–0–0 యినాము.
(5) ఒక్క పోలీసు తుపాకి గానీ, ఒక బళ్లారి తుపాకి గానీ అప్పగించితే రూ. 50–0–0 లు యినాము. యీ మీద చెప్పిన బహుమానములు యిస్తామన్నప్పటికి యీ దేశప్రజలు తగిన సహాయం చేయకపోయినా పితూరిదార్లను అప్పజెప్పకపోయినా నియమింపబడిన గానీ, సంబంధము కలిగినాగానీ పితూరిదార్ల విషయము తగిన సమాచారము యివ్వకపోతే వాండ్లందరి పయిన కఠినమయిన చర్య జరిగించబడుతుంది. అందరు నమ్మవలసింది. యేలాగంటే పితూరిదార్లు అందరిని అప్పజెప్పడముగానీ లేదా పితూరిదార్లు పట్టుబడేటట్టు పోలీసువార్కి సమాచారము యివ్వడము గానీ – యీ రెండు పనులు జరిగేవర్కు పోలీసు వార్కి, కంచరగాడిదెలకు, ఏనుగులకు వగయిరా అయ్యేటటువంటి ఖర్చులన్నీ కట్టి పుచ్చుకోబడును. యిదిగాక యింకా హుకుములు మన్నించనటువంటిన్ని, సాయము చేయనటువంటిన్ని ముఠాదార్లు తాల్కు ముఠాలు గవర్నమెంటు వారిచే తీసుకోబడును.
గ్రామమున్సబులను ఏజెన్సీ వారంట్ల పయిని ఏజెన్సీ నుంచి పయికి పంపి వేయుటకున్నూ క్రిమినల్ ప్రొశీజరు కోడ్డు శె. 44–45నులు యింకా యితర శెక్షనుల ప్రకారం మున్సబులను భూఖామందులనున్నూ, రయితులను అరష్టు చేసి కేసులు చేయబడును. (6) కొంతమంది పితూరిదార్లు యొక్క జాబితా యిందులో జతపరిచినాము. ప్రతి ముఠాదారు ప్రతి యిజారాదారు ప్రతి గ్రామ మున్సబు ఆ గ్రామాల్లో పితూరిలో కలసినటువంటి పితూరిదార్ల పేర్లు తక్షణం రిపోర్టు చేయవలసినదని యిందుమూలముగా కఠినముగా ఉత్తరువు చేయడమయింది. ఇదిగాక, ప్రజలకు యిదివర్కు గానీ, యిప్పుడు గాని వున్నటువంటి యెటువంటి బాధలు అయినప్పటికి తెలియచేసుకున్న యెడల కమిషనరువారు తక్షణం తగిన దరియాప్తు చేసి న్యాయం యిప్పిస్తారని యిందుమూలముగా తెలుసుకోవలసింది.
సంతకం
జె.ఆర్. హిగ్గిన్స్, ఏజెన్సీ కమిషనర్, 29–12–22’’చివాల్న లేచి నిలబడ్డాడు రామరాజు. పూర్తిగా ఆరిన పొడవాటి వెంట్రుకలు భుజం దాకా వేలాడుతున్నాయి. భృకుటి మధ్య నుంచి పాపిడి దాకా ఉన్న కుంకం బొట్టు కొద్దిగా చెదిరి ఉంది. ‘‘ఇక యుద్ధం విశాఖ మన్యానికీ, బ్రిటిష్ మకుటానికీ మధ్య జరుగుతుంది. ఇది మనం ఎత్తుకోబోతున్న పెద్ద భారమే. ఆ వాస్తవాన్ని అంగీకరిద్దాం! మనం చనిపోవలసి వస్తే చనిపోదాం కూడా! కానీ మన హక్కును రక్షించుకునే ప్రయత్నంలో చనిపోవాలి. అది జీవితమనిపించుకుంటుంది. రామరాజు, గంతన్న, మల్లు – ఈ ముగ్గురి తలలు తెగి పడితే ఉద్యమం నిలిచిపోతుందా? భ్రమ. గ్రామాల మీద శిక్షా సుంకం విధించారు. అంటే పొత్తిళ్లలో బిడ్డ మీద కూడా రాజద్రోహం ముద్ర వేశారు. వాడు ప్రకటించినవి ఇనాములు కాదు. లంచాలు. సహకరించకుంటే కఠినచర్యలు తీసుకుంటాడా? అయితే ఇంకా పోరాడుతాం. ఇంకా పోరాడుదాం. ఇంకా ఇంకా పోరాడతాం.
మనం పోరాటం విరమించే దశను దాటి ఎంతో దూరం ముందుకు వచ్చేశాం. పోరాటం ఆపితే అందుకు ముష్టిలా పడే జైలు కూడు నాకు అవసరం లేదు. అంతకంటే పోరాడి మరణిస్తాను. దేనికోసం ఈ పోరాటం? దేనికోసం ఈ తెగింపు? మన బతుకులు కోసమేనా? మీ బిడ్డల కోసమేనా? కాదు, బతుకునిచ్చే అడవి కోసం కూడా. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, ఒంజేరి, దామనాపల్లి, అడ్డతీగెల, రంపచోడవరం, పాడేరు, తూరమామిడి, లక్కవరపుకోట – పది విజయాలు – మనం సాధించాం.. మన దురదృష్టం... మన దురదృష్టం– పెద్దగడ్డపాలెం– లింగాపురంలో విజయం సా«ధించలేకపోయాం.
పది విజయాల ముందు ఒక అపజయం ఎంత అని నేను అనను. ఆ అపజయంలోనూ త్యాగం ఉంది. అది మన సోదరులది. కొద్ది తుపాకులే ఉన్నా, ఈ గోచిపాతరాయుళ్లూ, ఈ బక్కప్రాణాలూ బాణాలు, శూలాల సాయంతో సాధించిన ఈ పది విజయాలు గొప్పవా? బలిసిన శరీరాలతో, యూనిఫారాలతో, కాలికి బూట్లతో, తలలకు ఉక్కు టోపీలతో, ప్రపంచ యుద్ధపు ఆయుధాలతో వచ్చి సాధించిన ఒకే ఒక్క విజయం గొప్పదా? ఇక కొండలను దాటి దాటి వెళ్లి అక్కడ స్టేషన్లు కొడదాం. ఆయుధాలు తెచ్చుకుందాం.’’ అన్నాడు రామరాజు. ‘‘మీ వెంటే మేమంతా స్వామీ!’’ అన్నాడు మల్లన్న లేచి, ఉద్విగ్నంగా.అక్కడ ఉన్నవాళ్లంతా లేచి నిలబడ్డారు, మల్లుదొరకు మద్దతు అన్నట్టు.
∙∙
‘‘హలో నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్.... హెడ్క్వార్టర్స్.... ఓవర్’’ అవతల నుంచి ఈవ్లింగ్ కంఠం.‘‘హలో కేడీపేట... క్యాంప్.. ఓవర్....ఈవ్లింగ్.... ఏమిటి?’’ అన్నాడు ఫర్బీస్.‘‘స్పెషల్ కమిషనర్ బయలుదేరి చాలాసేపయింది. జాగ్రత్త. చాలా ఘటికుడు. కొంచెం తేడా వచ్చినా చీల్చి చెండాడతాడు. ఓవర్.’’ ఈవ్లింగ్.‘‘తెలుస్తూనే ఉంది. ఓవర్.’’ ఫర్బీస్.‘‘సరే, రామరాజుతో ఇంకా ఎవరు పట్టుబడ్డారు?’’ ‘‘ఇంకా ఎవరా? ఒక్క రామరాజే దొరికాడంటున్నారు కదా!’’ ‘‘ఇంత పెద్ద రెబెలియన్ నడిపినవాడు చివరికి ఒక్కడైపోయాడా? ఇదెలా సాధ్యం?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఈవ్లింగ్.