
ఆకుపచ్చ సూర్యోదయం
విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ పట్టణాలలో ప్రసంగాలు ఇచ్చి రాజమండ్రి వచ్చిన బిపిన్బాబు ఆరు రోజులు ఉన్నారు.
విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ పట్టణాలలో ప్రసంగాలు ఇచ్చి రాజమండ్రి వచ్చిన బిపిన్బాబు ఆరు రోజులు ఉన్నారు. ఆ పట్టణాలలో మాదిరిగానే ఇక్కడ కూడా వేర్వేరు చోట్ల సభలు ఏర్పాటయ్యాయి. బ్రహ్మ సమాజం గురించి, స్వదేశీ ఉద్యమం గురించి, విదేశీ వస్తు బహిష్కరణ గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉర్రూతలూగిపోయారు జనం.
ఆ రోజు ఆఖరి సభ.
ఎండ తీవ్రత తగ్గి గోదావరి మీద నుంచి చల్లని గాలి వీచడం మొదలైంది. వేసవి కాబట్టి చిన్న చిన్న మేటలు వేసింది గోదావరి. తీరానికి రెండు ఫర్లాంగుల ఇవతల ఇన్నీస్పేటలోనే, నదికేసి ముఖం పెట్టి నిర్మించారు విశాలమైన వేదిక. కౌతా రామశాస్త్రి వేదిక మీద నిలబడి ప్రార్థనా గీతం పాడుతుండగా శ్రీరామరాజు చేయి పట్టుకుని, సభా వేదికకు దగ్గరగా రాగలిగాడు వెంకటరామరాజు. ‘‘వందేమాతరం... మాతరం... సుజలాం సుఫలాం.. మాతరం...’’బిపిన్బాబు, ముట్నూరి కృష్ణారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గున్నేశ్వరరావు ఇంకా ఎందరో వేదిక మీద ఉన్నారు.
ముట్నూరి కృష్ణారావుగారు పరిచయం చేసిన తరువాత ఉపన్యసించడం కోసం బిపిన్చంద్రపాల్ లేచి నిలబడ్డారు.
ఆ వెంటనే బాలభారతి సమితి సభ్యుడొకరు చిలకమర్తి వారిని చేయి పట్టుకుని ఆయన పక్కన నిలిపాడు. ‘‘ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారు. ఇంకో రెండు పాటలు పాడతారా?’’అమాయకంగా అడిగాడు శ్రీరామరాజు.‘‘లేదు. పాల్గారు ఇంగ్లీషులో మాట్లాడితే, అదే మనకి తెలుగులో చెబుతారు పంతులుగారు.’’ చెప్పాడు వెంకటరామరాజు.‘‘ఇంత సుందరమైన గోదావరి ఒడ్డున ఈ సాయంకాలం నేను చెప్పేది వినడానికి దయతో వచ్చిన రాజమండ్రి పౌరులారా! వందేమాతరం!’’ అంటూ ఉపన్యాసం ప్రారంభించారు పాల్.
వెంటనే చెవియొగ్గి వినడం మొదలుపెట్టారు– అన్ని వేల మంది కూడా.
‘‘మీరంతా చూపిస్తున్న ఈ ఆదరణ, ఇస్తున్న ఈ గౌరవం ఒక వ్యక్తిది కాదు. ఒక దృక్పథానిది. ఒక ఆలోచనది. ఒక ఆచరణది. అవే – స్వదేశీ, జాతీయ విద్య, విదేశీ వస్తు బహిష్కరణ.... భారతజాతి ముక్తకంఠంతో నినదించగలదన్న గొప్ప సత్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి తెలిసేటట్టు చేస్తున్న శ్రేణుల ముందు నిలబడి మాట్లాడుతున్నానని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
‘‘బెంగాల్ను విభజిస్తున్నట్టు 1905 ఆగస్ట్ 7న కర్జన్ ప్రకటించగానే మేమంతా– బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, అరవింద్ ఘోష్, లాలా లజపతిరాయ్, చిత్తరంజన్ దాస్– యాభైవేల మందితో కలసి గంగా స్నానం చేసి ఈ దుశ్చర్యను ఆపుతామని ప్రతిజ్ఞ చేశాం.
మన జాతి మహాకవి రవీంద్రనాథ్ టాగోర్ ఇప్పుడు ఈ మహోద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న ఆ గీతానికి బాణీ కట్టారు. ఆ క్షణాలు ఇప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి– ఈ పవిత్ర గోదావరి నదినీ, ఈ జనసాగరాన్నీ చూస్తుంటే.’’ బెంగాల్ యాస కూడా ఆయన ఉపన్యాసానికి ఒక సొగసును తెచ్చింది. ఉపన్యాసంలోని ప్రతి అంశాన్ని అంతే కవితాత్మకంగా అనువదిస్తూనే పాల్గారి ఉపన్యాస నైపుణ్యాన్ని ఆస్వాదించారు చిలకమర్తి. తెలియకుండానే రెండు గంటలు గడిచిపోయాయి.చీకట్లు ముసురుకుంటున్నాయి.
వేదిక మీద సిద్ధంగా ఉంచిన నాలుగు నిలువెత్తు దీపపు సెమ్మెలలోని ఒత్తులను ఎవరో వచ్చి వెలిగించారు. పైన వెన్నెల కురిపించడానికి చంద్రుడు తొందరపడుతున్నాడు.జాతీయ విద్య అవసరం, విదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమాలను ఒక ఉద్యమంగా నిర్వహించవలసిన అవసరం గురించి చివరిగా చెప్పారు బిపిన్బాబు. వినమ్రంగా నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు.చప్పట్లు మారుమోగాయి. ఇంతలోనే తన గొంతు సవరించుకున్నారు చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు.
కొన్ని సెకన్ల తరువాత మళ్లీ నిశ్శబ్దం.
‘‘ఈ భరతఖండమే ఒక బందిఖానా అని నేను రాశాను. కాదు, కాదు... అమ్మవారే నా చేత ఒక కఠిన వాస్తవాన్ని పలికించింది. బిపిన్బాబును చూస్తుంటే జైలులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఝంఝామారుతం గుర్తుకు వస్తోంది. ఈ బందిఖానాలోనిదే మరో బందిఖానాలోకి ఈ ఝంఝామారుతాన్ని మళ్లించకుండా ఆంగ్లజాతి ఉండలేదు. సోదరులారా! ఇంగ్లిష్ జాతి భారతదేశాన్ని డొల్ల చేస్తోంది. కానీ తెల్లజాతిది న్యాయబుద్ధి అని మనలో చాలమందికి ఇప్పటికీ ఓ గుడ్డినమ్మకం. వాళ్లదా న్యాయం? వనరులు ఇక్కడివి. వస్తూత్పత్తి అక్కడ. అందుకు ఇచ్చే వేతనాలూ, కూలీ డబ్బులూ అక్కడి వాళ్లకే. వాటి అమ్మకాలు మాత్రం ఇక్కడ. లాభాలు మాత్రం మళ్లీ అక్కడికే. ఆవు మనది. గ్రాసమూ మనదే. పాలు మాత్రం వాళ్లకి!’’ అంటూనే ఒక పద్యం అందుకున్నారాయన, రాగయుక్తంగా:
‘‘భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులెల్ల లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి!’’
చిన్నగా రాగం తీసి, రెండు చేతులు జోడించారు లక్ష్మీనరసింహం ‘సెలవు’ అన్నట్టు.
2
జైలు ప్రాంగణమంతా చిమ్మచీకటి, నిశ్శబ్దం. సెల్ మధ్యలో రామరాజు, నిద్రకు దూరమై. దూరం నుంచి గంట వినిపించింది. అప్పుడర్థమైంది– వేకువ ఐదుగంటలైంది. ఖైదీలంతా స్నానాదికాల పనిలో పడ్డారు.తెచ్చుకున్న చిన్న సంచిలో నుంచి కుంకం తీసి బొట్టు పెట్టుకుంటూ ఉంటే, పెద్ద సీమవెండి గ్లాసుతో పాలు పట్టుకొచ్చి వినయంగా నిలబడ్డాడు, ఒక ఉద్యోగి.కింద పెడుతూనే అన్నాడు, ‘‘బాబుగారూ! తమ కోసం కృష్ణదేవిపేట నుంచి ఎవరో వచ్చారు. ఇక్కడికి తీసుకురమ్మంటారా? ’’
ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు రామరాజు. ‘‘నేనే వెళతాను.’’
చెట్టు కింద కనిపించారు ఆ ఇద్దరు. చర్నాకోల చంకలో పెట్టుకుని జైలు ప్రాంగణాన్ని వింతగా పరికిస్తున్నాడు నారాయణమూర్తి. చెట్టు మొదలు చుట్టూ గుండ్రంగా కట్టిన అరుగును ఆనుకుని, తలొంచుకుని నిలబడి ఉన్నారు, చేతులు కట్టుకుని– భాస్కరుడు.‘‘నమస్కారం అన్నయ్యగారు!’’ దగ్గరగా వెళ్లి పలకరించాడు రామరాజు.‘‘నమస్కారం. రాజుగారూ!’’ ప్రతి నమస్కారం చేసి, ఒక్క నిమిషం పాటు మాట్లాడలేకపోయాడు భాస్కరుడు. తరువాత కొంచెం బాధగానే అన్నాడాయన, ‘‘మిమ్మల్ని ఈ స్థితిలో చూడవలసి వస్తుందని అనుకోలేదు. ఘటన కాబోలు!’’ అన్నాడు భాస్కరుడు గారు.
కొండవాళ్ల కోసం ఫితూరీ లేవదీయబోతున్నాడని శ్రీరామరాజు మీద వదంతులు వచ్చినప్పటి నుంచి భాస్కరుడి గారి మనసులో కల్లోలం రేగుతూనే ఉంది.
‘‘ఇంకో రెండు రోజులలో వదిలి పెడతారనే అనుకుంటున్నాను.’’ అన్నాడు రామరాజు.‘‘శుభం. కానీ మీ అమ్మగారు, మా అమ్మ చాలా కలవరపడుతున్నారు.’’ అన్నాడు భాస్కరుడు.ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. తరువాత అడిగాడు రామరాజు. ‘‘ఏమిటి విశేషాలు!’’ ‘‘మీరు విడుదలవుతున్నట్టు శుభవార్త చెప్పారు గానీ, నేను మాత్రం మీకు ఎంత మాత్రం రుచించని, ఇంకా చెప్పాలంటే, అమంగళమైన వార్తే తెచ్చాను.’’ అన్నారు భాస్కరుడు.
‘ఏమిట’న్నట్టు చూశాడు రామరాజు.
‘‘మీరు జైలుకు వచ్చాకా చాలా పరిణామాలు జరిగిపోయాయి. ఫిబ్రవరి మూడో తేదీన మిమ్మల్ని తీసుకువచ్చారు కదా! ఆ రోజు సాయంత్రమే మాకు ఫిబ్రవరి ఒకటో తేదీ ఆంధ్రపత్రిక చేరింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్టు చేసిన వారందరినీ వారంలోగా విడుదల చేయకపోతే పన్నుల నిరాకరణ, శాసనోల్లంఘన మొదలవుతుందని గాంధీ ప్రభుత్వానికి తుది హెచ్చరిక ఇచ్చారన్న వార్త చదివాం.’’
‘‘మంచి మలుపే కదా అన్నయ్యగారూ!’’ అన్నాడు రామరాజు.
‘‘కానీ ఫిబ్రవరి పన్నెండో తేదీ ఆంధ్రపత్రిక, రెండు రోజులు ఆలస్యంగా నిన్ననే వచ్చింది. అందులో వార్త చదివి, ఇక మిమ్మల్ని చూడకుండా ఉండలేక ఇవాళ వేకువనే బండి కట్టుకుని వచ్చాం!’’ అన్నారాయన.‘‘పన్నెండో తేదీన ఏమైంది?’’ అడిగాడు రామరాజు.‘‘గాంధీగారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేశారు.’’‘‘ఏమిటి?’’ తాను విన్నది నిజమేనా అన్నట్టు పలికాడు రామరాజు. ఏదో శూన్యంలోకి తను, తనలా ఎందరో వెళుతున్న భావన.‘‘మరి పన్నుల నిరాకరణ, శాసనోల్లంఘన...!’’ వాటి సంగతి ఏమిటన్నట్టు గొప్ప అశాంతితో అడిగాడు రామరాజు, ఒక నిమిషం తరువాత.
‘‘సహాయ నిరాకరణోద్యమం నిలిచిపోయిందంటే, అవి రెండు మొదలుకావడం లేదనే కదా!’’ అన్నాడు భాస్కరుడు.తుపాను మొదలవుతోంది రామరాజు మనసులో.‘‘ఎందుకు నిలిపివేశారాయన?’’ ఆ మాటలో కొంచెం అసహనం, ఇంకెంతో బాధ.‘‘ఆయన చూపించిన అహింసా పథం నుంచి ఉద్యమం పక్కకు తప్పుకుందట!’’‘‘అదెలా!’’‘‘చౌరీచౌరా మూకుమ్మడి హత్యాకాండ. అది గాంధీని కలచివేసిందట.’’
అంటూ ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తల వివరాలు ఇచ్చారు భాస్కరుడు.
3
మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతం. అదే ఆలోచిస్తున్నాడు రామరాజు, సెల్లో దిగాలుగా. భాస్కరుడుగారు తెచ్చిన వివరాలు కళ్ల ముందు కదులుతున్నాయి.ఉద్యమం చేస్తే చర్యలు తప్పవని ప్రకటించాడు వైస్రాయ్ రీడింగ్. ‘సూరత్ జిల్లా బార్డోలీలో పన్నుల నిరాకరణోద్యమం ఆరంభిస్తున్నాం.’ అంటూ ఫిబ్రవరి 1, 1922న వైస్రాయ్కి రాశారు గాంధీగారు. సరిగ్గా మూడోరోజునే, అంటే ఫిబ్రవరి 4న చౌరీచౌరా ఘటన జరిగింది. మధ్య పరగణాలలో గోరఖ్పూర్ దగ్గరే ఉంది ఆ చిన్నపట్టణం చౌరీచౌరా. మద్యం అమ్మకాన్ని నిరసిస్తూనూ, పెరిగిన ధరలు తగ్గించాలని కోరుతూనూ ధర్నా చేశారు సత్యాగ్రహులు. పోలీసులు వచ్చారు. గుంపు చెదరగొట్టడం పేరుతో ప్రజలను చావగొట్టారు.ఇందుకు నిరసనగా సత్యాగ్రహులు పోలీసు స్టేషన్ ముందు ధర్నా ప్రారంభించారు. ఈసారి కాల్పులు జరిపారు పోలీసులు. జనం తిరగబడ్డారు. పోలీసులు వెనక్కితగ్గి పోలీసు స్టేషన్లోనే దూరి తలుపులు బిడాయించుకున్నారు.
కడుపు మండిపోయి ఉన్న సత్యాగ్రహులు స్టేషన్ భవనానికి నిప్పు పెట్టారు. 22 మంది పోలీసులు చనిపోయారు. భారతదేశం నాగరికమైన పంథాలో సత్యాగ్రహం చేసే స్థితికి చేరలేదు. కాబట్టి సహాయ నిరాకరణోద్యమం నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు గాంధీగారు. చౌరీచౌరాలో సత్యాగ్రహుల కారణంగా జరిగిన హింసాకాండకు పరిహారంగా ఐదు రోజుల నిరాహార దీక్ష చేశారు గాంధీగారు. దేశం నిర్ఘాంత పోయింది. అశాంతిగా ఉంది రామరాజుకి ఇక జైలు గోడల మధ్య ఉండడం అసాధ్యమనిపించింది తొలిసారి.కాదు, వాటిని బద్దలుకొట్టాలని అనిపిస్తోంది. అశాంతి.... గుండె నిండా అశాం
4
మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతం. రామరాజు ఉన్న సెల్ దగ్గరకి వచ్చి చెప్పాడు సెంట్రీ, ‘‘అయ్యా! తమర్ని పోలవరం డిప్యూటీ తహసీల్దార్ దొరవారు పిలుచుకురమ్మన్నారు.’’ సెంట్రీ వెంటరాగా జైలర్ గదివైపు నడిచాడు రామరాజు– అన్యమనస్కంగానే.రో పదడుగుల దూరంలో ఉంది ఆ గది. ఆ రాతి కట్టడంలో ప్రతిధ్వనిస్తూ, అక్కడికి కూడా వినిపిస్తోంది ఖళ్ ఖళ్ మంటూ దగ్గు. ఒళ్లు జలదరిస్తోంది.
లోపల ఒక్కరే ఓ కుర్చీలో కూర్చుని ఉన్నారు ఫజులుల్లా ఖాన్, నోటికి అడ్డంగా చేయి పెట్టుకుని దగ్గుతూ.గుమ్మం దగ్గర అలికిడికి ఇటు తిరిగిన ఫజులుల్లా లోపలికి రమ్మన్నట్టు సైగ చేశాడు, ఇద్దర్నీ, దగ్గుతూనే.
చాలా తీవ్రమైన దగ్గు.. సెంట్రీ గబగబా వెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చాడు.ఒక నిమిషం తరువాత గాని దగ్గు తగ్గలేదు. అప్పుడు నీళ్లు తాగారాయన. ఐదు నిమిషాల తరువాత తేరుకున్నారు. ‘‘నాలుగు రోజుల నుంచి ఏమీ బాగుండడం లేదు రామరాజు గారూ! దగ్గూ, ఆయాసం. అన్నట్టు మీరు వైద్యం చేస్తారట. నాకేదైనా మంచి మందు చెప్పకూడదు!’’ అన్నారు నవ్వుతూ. మాటలో ఇంకా ఆయాసం ఉంది.‘దానికేం భాగ్యం తహసీల్దారు గారూ! కానీ మాదంతా మూలికా వైద్యం.’’ అన్నాడు రామరాజు.‘‘అది నా ఒంటికి సరిపడదులెండి! మాదంతా ఇంగ్లిషు వైద్యం’’ అన్నారాయన, చివరి రెండు పదాలు ఒత్తి పలుకుతూ.
ఖాళీ నీళ్ల గ్లాసు సెంట్రీకి అందిస్తూ, ‘‘ఇంక నీవు వెళ్లు!’’ అన్నారాయన.‘‘రామరాజు గారూ! మీరొక అర్జీ రాసివ్వండి. ఇలాగే!’’అంటూ కూడా తెచ్చుకున్న బ్యాగులో నుంచి కాగితాల బొత్తి ఒకటి తీసి రామరాజుకు ఇచ్చాడాయన.అదో దరఖాస్తు.తాను పేదవాడిననీ, సేద్యం చేసుకుని ప్రశాంతంగా బతకదలిచాననీ, అందుకు కొంత భూమి కేటాయించవలసిందనీ ఏజెన్సీ కమిషనర్కు పెట్టుకునే అర్జీ నమూనా.
చదివి ఇచ్చేశాడు రామరాజు.
‘‘ఇది మీకు రుచించేది కాదని తెలుసు. నిజమే. మీ మీద నాన్ కోఆపరేటర్ ఆరోపణలు వచ్చాయి. కానీ ఒక్క రుజువూ దొరకలేదు. అయినా మిమ్మల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఊరికే వదిలేస్తుందని అనుకోకండి. మిమ్మల్ని వదలకుండా నిఘా వేసి ఉంచే బాధ్యత ప్రభుత్వం ఎవరికి అప్పగించిందో తెలుసా? నాకే.’’ అంటూ నవ్వారాయన.
‘‘పైడిపుట్ట అని, వినే ఉంటారు మీరు. అడ్డతీగెలకి మూడు మైళ్లు. అక్కడ మీకు మంచి భూమి ఇప్పిస్తున్నాను. రోజూ అడ్డతీగెల పోలీసు స్టేషన్లో సంతకం చేయడం, సేద్యం చేసుకోవడం. ఈ లక్ష్మణ రేఖ తప్పితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. దీనిని బెదిరింపుగా తీసుకోకండి. మీ మేలుకోరి నేను చేస్తున్నపని.’’ అన్నాడు ఫజులుల్లా.
తనకు తెలియకుండానే పెద్దగా నిట్టూర్చాడు రామరాజు.
రెండు నిమిషాలు మౌనం.
అప్పుడు అన్నాడు ఫజులుల్లా.
‘‘రామరాజుగారు! మీ బాధ నాకు అర్థమవుతోంది. ఈ పురాతన దేశం ఇప్పటికైనా ఒక మార్పుకు సిద్ధపడుతోంది. మీ ఆవేశం మీద నీళ్లు చల్లడం నా ఉద్దేశం కాదు. బిపిన్చంద్రపాల్ రాజమండ్రి వచ్చిన తరువాత కందుకూరి వీరేశలింగం అంతటివాడు చెప్పినట్టు, ఇవాళ దేశంలో పెల్లుబుకుతున్న ఆవేశాన్ని ఆకతాయి మూకల అల్లరిగా నేను చెప్పను. మీ ఆవేశాన్ని సమయం వచ్చినప్పుడు వినియోగించండి! అప్పటిదాకా మౌనం వహించండి! ’’రెండు నిమిషాలు మౌన. ‘‘రామరాజుగారు! మీ క్షేమం కోరేవాడిని. అర్జీ రాయండి!’’
గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్లీ ఆయనే అన్నారు.‘‘బాబూ రామరాజు! అసలు ఈ తరానికీ, ఈ వయసు వారికీ ఈ కాలం ఏదో ప్రత్యేకతను ప్రసాదించింది. వీళ్ల చైతన్యం వేరు. మీరు మోహన్దాస్ గాంధీ నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారో నాకు తెలియదు. అహింస. ఈ మాట విన్న తరువాత దేశంలో వచ్చిన చైతన్యం వైవిధ్యంగా ఉంది. ఇందుకు ఒక్క రుజువు చూపిస్తాను. భగవంతుyì ని ఊరేగించే రథాలలో గాంధీగారి బొమ్మ పెట్టమని అడుగుతున్నారు ఉద్యమకారులు.
ఈ విశాల దేశంలో మారుమూల ప్రాంతాలు ఏవీ అని చూసుకుని ఒక పది కుగ్రామాలు ఎంచుకుంటే, అందులో అంతర్వేది ఒకటి. ఆ మారుమూల సముద్రతీర గ్రామంలో ఏం జరిగిందో తెలుసా? ది హిందూ లాంటి పేపరు ఆ వార్తని కవర్ చేసింది. చదువుతుంటే మీరే గుర్తుకొచ్చారు.’’ బ్యాగులో నుంచి తీసి ఇచ్చాడు మడత పెట్టి ఉన్న ఆ న్యూస్పేపర్.లోపల పేజీలలో ఒక చోట ఉంది వార్త. ఫిబ్రవరి 13, 1922 నాటి సంచిక అది. వార్త మాత్రం పదో తేదీ డేట్లైన్తో ఉంది.‘రథం లాగడానికి ప్రజలు ఎందుకు నిరాకరించారు?
’
స్వకీయ విలేకరి
ధవళేశ్వరం, ఫిబ్రవరి 10: అంతర్వేది పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన ఒక గ్రాడ్యుయేట్ టీచర్ ఈ విలేకరికి చెప్పిన సమాచారమిది. ఏటా ఏకాదశి రోజున అక్కడ జరిగే రథోత్సవం ఈ ఏడు జరగలేదు. అంతర్వేది మహా పుణ్యక్షేత్రంలో రథం కదలకుండా నిలిచిపోయిన ఏకైక సంవత్సరం చరిత్రలో బహుశా ఇదే. గత ఏడాది ప్రజల అభ్యర్థనను అధికారులు మన్నించారు. గాంధీ చిత్రపటాన్ని అలంకరించి రథోత్సవం జరుపుకోవడానికి అనుమతించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ ఉపా«ధ్యాయుడు చెప్పిన మరో అంశం– ఈ ఉత్సవానికీ, రథం మీద దేవునితో పాటు గాంధీ పటం కూడా ఉండాలన్న ఆశయానికీ, కాంగ్రెస్ వాదులకీ ఏమీ సంబంధం లేదు.
ఒక మతానికి చెందిన ఈ ఉత్సవంలో రథం లాగడం గురించి కాంగ్రెస్ కార్యకర్తలు జోక్యం చేసుకోరాదని పార్టీ తీర్మానం చేసింది. ఏది ఏమైనా, తాము కోరుకున్నట్టు గాంధీ చిత్రపటాన్ని రథం మీద అలంకరించడానికి అధికారులు నిరాకరించడంతో, రథాన్ని లాగడానికి భక్తులు కూడా నిరాకరించారు. పోలీసులు, సహాయవాదులు రథం లాగ వలసిందని ప్రజలను ముందుకు నెడుతూ బలవంత పెట్టగా ఘర్షణ కూడా జరిగింది. ఎంఎల్సీ దివాన్ బహదూర్ డి. శేషగిరిరావు మాటను కూడా భక్తులు పట్టించుకోలేదు.’’వార్త చదవడం ముగియడంతోనే ఆలోచనలో పడినట్టు కనిపించాడు రామరాజు.‘‘రామరాజు! గమనించవలసిన అంశం ఏమిటంటే– చిత్రపటం అలంకరించనందుకు అంతర్వేది రథం ఆగిపోవడం కాదు. గాంధీని ముందు పెట్టుకుని స్వరాజ్య ఉద్యమం జగన్నాథ రథంలా కదలడం. ఎమ్కే గాంధీ ఈ దేశ ప్రజలను ఏకం చేస్తున్నాడు. విను, అతడి మార్గం మంచిది.’’ అన్నాడు ఫజులుల్లాఖాన్.
రాజమండ్రికి దిగువన ఉన్న ధవళేశ్వరం పేరు వినగానే రెండు పాయలుగా చీలే గోదావరి గుర్తుకు వస్తున్నది రామరాజుకి. ఇప్పుడూ అదే గుర్తుకు వస్తోంది. అయితే ఇది వేరు. గోదావరి పాయలకు బదులు ఒక ఆలోచనా ధార చీలి ప్రవహిస్తున్నట్టు కనిపిస్తోంది. గాంధీగారు చూపించినదే మార్గమా? అదొక్కటే పోరాటమా? వేరే మార్గాలు కూడా ఉన్నాయి. ఇది నిజం.పెన్ను, కాగితం తీసి ఎదురుగా పెట్టాడు ఖాన్. క్షణం తరువాత కలం చేతిలోకి తీసుకున్నాడు రామరాజు.