ఆ టైమ్లో ఇద్దరి కోసం తినాలా?
మహిళకు గర్భం వచ్చాక ఆ ఇంట్లోని పెద్ద వారు ఆహారం తీసుకోవడం విషయంలో చేసే ఒత్తిడి అంతా ఇంతా కాదు.
అవాస్తవం
మహిళకు గర్భం వచ్చాక ఆ ఇంట్లోని పెద్ద వారు ఆహారం తీసుకోవడం విషయంలో చేసే ఒత్తిడి అంతా ఇంతా కాదు. కడుపులో ఉన్న బిడ్డకు ఆహారం పుష్కలంగా అందాలని, అందుకోసం గర్భవతులు ఇద్దరి ఆహారం తినాలంటూ పెద్దలు అంటుంటారు. కానీ గర్భవతులు ఇద్దరి కోసం తినాల్సిన పనిలేదు. కడుపులోని బిడ్డకు తగిన ఆహారాన్ని తల్లి నుంచి అందుతూనే ఉంటుంది.
కాబట్టి సాధారణ బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు మామూలుగానే తింటే సరిపోతుంది. నిజానికి గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవాలి. అంటే సాధారణ ఆహారంతో పాటు పాలు, గుడ్లు, పండ్లు, మొలకెత్తిన గింజలు వంటివి తీసుకోవడం మంచిది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేపలు తినవచ్చు.
శాకాహారులు తమ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు గర్భధారణ సమయంలో అసలు బరువే పెరగకపోవచ్చు. అయితే ఇలా బరువు పెరగకపోవడం అన్నది వారి సాధారణ ఆరోగ్యానికి లేదా ఆరోగ్యకరమైన గర్భధారణకు (హెల్దీ ప్రెగ్నెన్సీకి) అవరోధమేమీ కాదు.


