రిపోర్టింగ్‌లోనూ.. కమిట్‌మెంట్

రిపోర్టింగ్‌లోనూ.. కమిట్‌మెంట్


వెండితెరపై భిన్న రూపాల్లో విరబూసి.. దిగంతాలకు చేరిన ఆ నవ్వులో అందరికీ ఓ సాల్మన్‌రాజ్.. ఓ రెనా (రెడ్డినాయుడు).. మరో బొక్కా వెంకట్రావ్.. కనిపిస్తారు. కామన్‌మ్యాన్‌ను కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీకింగ్ ను స్టార్ రిపోర్టర్‌గా మార్చి ఆయనలోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది సిటీప్లస్. రీల్‌లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ పాత్రలు పోషించిన ఎమ్మెస్.. రియల్‌లైఫ్‌లో రిపోర్టర్‌గా అవతారం ఎత్తి తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ముచ్చట్లు మీకోసం..

- భువనేశ్వరి


 

ఎమ్మెస్ స్టార్ రిపోర్టర్‌గా తోపుడుబండ్లపై కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేయడం యాధృచ్చికంగా జరగలేదు. ఎమ్మెస్ ఇంటర్వ్యూ చేయడానికి నాలుగు వృత్తులను సూచిస్తే.. ఆయన మాత్రం కూరగాయలు అమ్మేవారిని ఇంటర్వ్యూ చేస్తానన్నారు. ‘ఎందుకు సార్.. అంత ఇంట్రెస్ట్?’ అని అడిగితే.. ‘రిపోర్టర్‌గా నేను నా మనసును కదిలించిన వారిని పలకరిస్తే వృత్తి తృప్తి కలుగుతుంది. పైగా నాకున్న సందేహాలు తీరడంతో పాటు పాఠకులకూ ఆ వృత్తిని నమ్ముకున్న వారి బాధలు తెలుస్తాయని చెప్పారు. ఇంకా నాడు ఏమన్నారంటే..

 

చెవిలోన చేరేలా..

తెల్లవారుజామున మంచి నిద్రలో ఉండగా ‘ఆక్కూరలు.. బెండకాయ.. దొండకాయ.... కొత్తిమీర.. కరేపాకో..’ అంటూ ఓ అరుపు వినిపిస్తుంది. తలుపులన్నీ బిడాయించి..  ముసుగు తన్ని పడుకున్నా.. ఆ పిలుపు చక్కగా చెవిలోకి చేరిపోతుంది. వాళ్ల ఫ్రీక్వెన్సీ ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. ఆ క్షణంలో కాస్త చికాకు పుట్టినా.. వాళ్లు గుమ్మాల దగ్గరికి రాకపోతే.. మనం కాళ్లీడ్చుకుంటూ మార్కెట్ దాకా వెళ్లాల్సి వస్తుంది.  నవనవలాడే కూరగాయలు గుమ్మం ముందుకు వస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అందుకే వారంటే నాకు అభిమానం.

 

లైవ్ రిపోర్టర్లు..

వారు ప్రతి ఇంటికీ కావాల్సిన వారే. ఒక వీధిలో పది ఇళ్లుంటే అందరికీ అతను ఆప్తుడే. ముఖ్యంగా ఆడవాళ్లకు ఈ కూరగాయలబ్బిపై మక్కువ కాస్త ఎక్కువే. తాజా కూరగాయలు ఇస్తాడనో.. కసురుకోకుండా కొసరు వేస్తాడనో కాదు.. పక్కవీధి నుంచి తాజా తాజా కబుర్లు మోసుకొస్తాడని.ఆ ఇంటి ముచ్చట్లు ఇక్కడ.. ఈ ఇంతి ముచ్చట్లు అక్కడ చెప్పే పుల్లారావులు కూడా వీరిలో ఉంటారు. ‘మీలా బేరం ఆడకుండా.. డబ్బులిచ్చే వారు ఎక్కడుంటారు చెప్పండి’ అంటూ కాకాపెట్టే కాకారాయుళ్లూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తోపుడుబళ్ల వాళ్లు మనలో ఒకరన్నమాట’ అని వారిని తను చూసిన యాంగిల్‌లో వివరించారు ఎమ్మెస్.

 

బహుదూరపు వ్యాపారి..

నాలుగు రకాల కూరగాయలు అమ్ముకుని బతికే వారు.. ఈ డబ్బుతో అంతస్తులు కట్టుకోలేడు. కేవలం పొట్టనింపుకోగలడంతే. బండెడు కూరగాయలు అమ్ముకోవడానికి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడో తెలియదు. నేను వాళ్లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా.. పాఠకులకు కొన్ని విషయాలు చెబుదామనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. దండిగా డబ్బున్న వాళ్లు కూడా ఆకుకూరలు కొనే దగ్గర గీచి గీచి బేరాలాడుతుంటారు.



ఓ గంట బేరమాడి ఓ కట్ట ఎక్కువ సాధించనంత మాత్రాన మీరు మరింత ధనవంతులు కాలేరు! బేరమాడకుండా మీరు డబ్బులిచ్చినంత మాత్రాన వాటితో అతనేమీ మేడలు కట్టుకోలేడు !! బేరమాడకుండా తీసుకుంటే ‘చల్లంగా ఉండమ్మా’ అని దీవించి ఆ రోజు హ్యాపీగా ఉంటాడు. రిపోర్టర్‌గా వారిని పలకరిస్తే మానవీయ కథనంగానే కాకుండా వారి ఇబ్బందులను కూడా బయటకు తెచ్చిన వాడిని అవుతాను కదా !’ అంటూ వివరించారు ఎమ్మెస్.

 

ఇంటర్వ్యూ ముగిసాక..

రెహ్మత్‌నగర్ బస్తీలో ఓ పదిమంది బండ్లవారిని ఇంటర్వ్యూ చేసే ముందు వారితో.. ‘మిమ్మల్ని స్టార్‌గా పలకరించడం లేదు. సాక్షి తరఫున స్టార్ రిపోర్టర్‌గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. మీకున్న ఇబ్బందులన్నీ మన సువిప్పి చెప్పుకోవచ్చు. వాటిని పరిష్కరించడానికి నా వంతు సాయం తప్పకుండా చేస్తాను’ అన్నారు. రిపోర్టింగ్ ముగిశాక ‘తోపుడు బండ్లకు లెసైన్స్‌ల కోసం ప్రయత్నిస్తానని’ లోకల్ కార్పొరేటర్ కబురు పంపడంతో వారింటికి వెళ్లారు ఎమ్మెస్.



మీడియా ముఖంగా ఆ హామీ నెరవేరుస్తానని చెప్పాల్సిందిగా ఆమెను అడిగి.. ఓ బాధ్యతగల రిపోర్టర్‌గా వ్యవహరించారు. కొన్ని రోజుల తర్వాత సాక్షి స్టార్ రిపోర్టర్ సక్సెస్ మీట్ సందర్భంగా మళ్లీ ఎమ్మెస్‌ను కలిసినపుడు.. ఆ తోపుడుబండ్ల వారి లెసైన్స్‌ల పని ఎంత వరకు వచ్చిందని ఆత్రుతతో అడిగి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అలాంటి మంచి వ్యక్తికి.. మా స్టార్ రిపోర్టర్‌కు తుది వీడ్కోలు.



2014 సెప్టెంబర్ 14న సిటీప్లస్ లో ప్రచురితమైన రిప్టోరర్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top