
నాట్య తరంగిణి
నామకరణం కూడా చేయని నేను... ఎత్తుపల్లాల్లో మైళ్లకొద్దీ ప్రయాణిస్తాను!
ప్రవాహమైన అప్పుడప్పుడు హిమంగా మారిపోతాను! చుక్కచుక్కగా భూమి పొరల్లోకి ఇంకిపోతాను! సూర్యుని వేడికి ఆవిరిగా మారిపోతాను! నదిని నేను! ఈ నదీ స్వగతాన్ని ‘మిన్నామిని’ అనే సంపుటిలో అక్షరీకరణ చేశారు ఐపీఎస్ అధికారి తేజ్దీప్కౌర్ మీనన్. ఆ కవితా సంపుటిలోని ‘ద పోరస్ ఎర్త్’ని నాట్యంగా మలిచారు ప్రముఖ భరతనాట్య కళాకారిణి హేమమాలిని ఆర్ణి! ఆ నదీ ప్రస్థానం నృత్య రూపకంలో హైదరాబాదీలకు కనువిందు చేయనున్నారు నాట్య
కళాకారులు కిరణ్మయి, ప్రియాప్రేమానంద్! ఈరోజు రవీంద్రభారతి వేదికగా ప్రదర్శితమవుతున్న ఆ దృశ్యకావ్యం గురించి...
కట్ట కవిత
తేజ్దీప్ కౌర్ మీనన్... సీరియస్ పోలీసాఫీసర్గానే మనకు తెలుసు. కానీ ఆమె మంచి కవయిత్రి. ‘కాట్ ఇన్ ఎ స్టాంపెడ్’, ‘ఫైవ్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్’, ‘మిన్నామిని’, ‘ఆయిస్టర్స్ ఇన్ పెయిన్’... ఇవన్నీ ఆమె కలం నుంచి జాలువారిన కవితా సంపుటాలు. సమకాలీన ఇండియన్ ఇంగ్లిష్ పొయెట్రీలో కొత్త టెక్నిక్స్ని, ట్రెండ్ని పరిచయం చేసిన పుస్తకాలు. అందులో నుంచి ఎంపికైన కవితలు కొన్ని ఇంటర్నేషనల్ కలెక్షన్స్లో ప్రచురితమయ్యాయి. ‘మిన్నామిని’ సంపుటిలోని ‘ద పోరస్ ఎర్త్’ కవిత ఆధారంగా రూపొందిన నృత్యమే
ఈ రూపకం.
చాలెంజింగ్...
టి.బాలసరస్వతి, శ్రీవజువూర్ రామయ్య పిళ్లై వంటి గురువుల చేతిలో రాటుదేలిన వజ్రం హేమమాలిని. నలభై ఏళ్లుగా ఎంతో మంది శిష్యులను తయారు చేసిన ఘనత ఆమెది. ఇప్పుడు తేజ్దీప్ కవిత ‘ద పోరస్ ఎర్త్’ను నృత్యరూపకంగా మలిచారు. ‘నేను ఎప్పుడూ భిన్నంగా ఉండాలని కోరుకుంటా. తేజ్దీప్ మిన్నామిని పుస్తకాన్ని నాకు ఇచ్చారు. ఆరు నెలల కిందట ఈ కవితకి కొరియోగ్రఫీ చేయడం మొదలుపెట్టాను. క్లాసికల్ డ్యాన్సర్నై ఉండి... ఇలాంటి దానికి కొరియోగ్రఫీ చేయాలంటే కష్టమే. అయినా చాలెంజింగ్గా చేశాను’ అని చెప్పారు హేమమాలిని. ఈ నృత్య నాటికలో ఆమె శిష్యురాలు కిరణ్మయి ప్రధాన నృత్యం, ప్రియా ప్రేమానంద్ కవితను వర్ణిస్తూ ఉంటారు.
నది-స్త్రీ
కిరణ్మయి, ప్రియా.. ఈ ఇద్దరు నదీ ప్రయాణాన్ని నాట్యం ద్వారా వర్ణిస్తారు. ‘పుట్టుక, ప్రయాణం, పర్వతాలను ఒరుసుకుంటూ, జీవరాశులకు ప్రాణం పోస్తూ ప్రవహించే నదిని ఆనకట్టలతో మనిషి అడ్డుకుంటున్నాడు. కానీ నది తనకు ఏదీ ప్రతిబంధకం కాకూడదని కోరుకుంటుంది. కలుషితమవుతుంటే ఆవేదన చెందుతుంది. అందుకే సముద్రంలో కలిసేందుకు తొందరపడుతుంది. ఇందులో పర్యావరణ కోణం కూడా ఉంది’ అంటారు ప్రియ. ‘ఈ కవితలో నది రూపంలో స్త్రీ ప్రతిబింబిస్తుంది. నదిలాగే పుట్టుకలో అమ్మాయినీ అలాగే ముద్దు చేస్తారు. ఆ తరువాత పెళ్లి పేరుతో ఆమెకు ఆంక్షలు పెడతారు నదికి ప్రాజెక్టుల్లా. నదిలాగే చివరకు ఆమెకు మిగిలేది దుఃఖం, బాధే’... ఇది
కిరణ్మయి అభిప్రాయం. ఈ నృత్యరూపకానికి రవికిరణ్ మ్యూజిక్ అందించారు.
వేదిక: రవీంద్రభారతి
సమయం: రాత్రి 7 గంటలకు, ప్రవేశం ఉచితం