సత్యస్వరూపమైన భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానానికే వేదం అని పేరు. పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల మాదిరి ఇవి ఒకరు రాసినవి కావు. అందుకే వీటిని అపౌరుషేయాలు అన్నారు. అంటే మానవుడు చెప్పింది కాదు అని అర్థం. అలాగే వీటికి లిపి ఉండదు. అనాదిగా ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలో అందుతూ వస్తున్నాయి కాబట్టి శృతులని పేరు. అంటే ఋషులు తీవ్రమైన తపోనిష్ఠలో ఉన్నప్పుడు ఆకాశవాణి రూపంలో వీటిని విని, అక్షరబద్ధం చేశారు. అలా వేదం నిరంతర ప్రవాహంగా, అనంతంగా సాగిపోయింది. ఈ అనంతమైన వేద విజ్ఞానాన్ని వ్యాసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు భాగాలుగా విభజించాడు. అందుకే ఆయనకు వేదవ్యాసుడని పేరు. ఈ వేదరాశులు అనాగరిక మానవుని కాలం నుంచి నిష్కల్మషంగా, నిర్మలంగా ప్రవహిస్తూ, మానవుని మలిన రహితునిగా చేసి, మేధోవంతునిగా, సంస్కారవంతునిగా తీర్చిదిద్దుతూ వస్తున్నాయి.
వేదాలను అర్థం చేసుకోవడానికి మహర్షులు ఆరు వేదాంగాలను, నాలుగు ఉపవేదాలను అందులో భాగం చేశారు. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం లేదా నిఘంటు. ఛందస్సు, జ్యోతిషం, కల్పం... ఈ ఆరూ వేదాంగాలు. గాంధర్వవేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం అనే నాలుగూ ఉపవేదాలు. వేదార్థాలను తెలుసుకోవడానికి వేదాలు మంత్రభాగం. అంటే వాటిలో మంత్రాలు మాత్రమే ఉంటాయి కాని, క ర్మ విధానం ఉండదు.
ఋగ్వేదం వాక్కు ప్రధానంగా కలది. అది ప్రజలకు చేరడానికి సంధానకర్తగా పైలుడనే రుషి వ్యవహరించాడు. అతి ప్రాచీనమైనది ఋగ్వేదమే. ఋగ్వేదంలో ఉండే మంత్రాలకి ఋక్కులని పేరు. ఇవి ఛందోబద్ధంగా ఉంటాయి. రెండవది యజుర్వేదం. ఇంద్రియాలతో కర్మలు చేసే విధానం తెలిపేది. దీనిని మానవులకు అందించింది వైశంపాయన మహర్షి. యజ్ఞయాగాదుల గురించిన వివరణ ఇందులో ఉంటుంది. ఇందులో రెండు భాగాలున్నాయి. అవి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం మూడవది సామవేదం. సామం అంటే గానం అని అర్థం. అంటే సామవేదం సంగీతానికి సంబంధించింది. ఇది అన్ని వేదాలలోకీ చిన్నది. దీనిని జైమిని ముని వ్యాపింపచేశాడు.
నాలుగవది అధర్వణ వేదం. దీనిలో యుద్ధవిద్యలు, పౌరధర్మాలు, ఆరోగ్యం, మూలిక చికిత్స, రాజ్యం, రాజ్యాంగం, రాజకీయవ్యవస్థల గురించిన వర్ణనలు, అనేకరకాలైన చికిత్స విధానాలు ఉంటాయి. దీని నిర్వహణ కోసం వేదవ్యాసుడు సుమంతుడనే ఋషిని నియమించాడు.
అసలు వేదాలలో ఏమేం ఉంటాయో తెలిపేవే పురాణాలు. వేదాన్ని కథలు కథలుగా వివరిస్తూ, వర్ణనాత్మకంగా చెప్పేవే ఇతిహాసాలు.
అనంతమైన విజ్ఞానాన్ని నిబిడీకృతం చేసుకున్న వేదాలు మానవుని ఐహిక, పారమార్థిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ ప్రవచించాయి. సత్యధర్మాలతో గడిపే జీవనమార్గానికి అనేక మంత్రాలు, స్తోత్రాల రూపంలో మనకు అందించాయి. అవే యజ్ఞయాగాదులు, పూజలు, ప్రార్థనలు, వ్రతాలు, మొక్కులుగా మారాయి. వేదాల చివరి భాగాలనే వేదాంతాలని, వేదసూత్రాలని అంటారు. వీటికే ఉపనిషత్తులని కూడా పేరు. ఇవి... వేదాలు, ఉపాంగాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నాయి.
- కూర్పు: డి.వి.ఆర్