వైరల్
మిలియన్ల కొద్ది వ్యూస్ ఊరకే రావు... ఎంతో కొంత శక్తి ఉండాలి! అలాంటి శక్తి ఈ ఉర్దూ కవితకు ఉంది. ‘పాత కాలంలో– ఈ కాలంలో’ టాపిక్పై తన్వీ జోషి అనే మహిళ చదివిన ఉర్దూ కవిత విని నెటిజనులు ‘వాహ్వా వాహ్వ’ అంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఒకేరోజులో 30 మిలియన్ల మందికి పైగా వీక్షించడం విశేషం. ప్రముఖ ఉర్దూ కవయిత్రి షబీనా ఆదీల్ రాసిన కవితను కాస్త మార్చి చెప్పింది జోషి. ‘డబ్బు మనిషిని మారుస్తుందా?’
యస్... అంటుంది ఈ కవిత్వం. ‘నడమంత్రపు సిరి నరం మీది కురుపు ఊరకనే ఉండనివ్వదు’ అనే సామెత మన తెలుగులో ఉంది కదా! అకస్మాత్తుగా ధనవంతులైన వారిలో కొందరికి నేల మీద కాలు ఆనదు. గత జీవితాన్ని మరిచిపోతారు. గర్వం తలకెక్కుతుంది... ఇలాంటి వారి గురించి ప్రస్తావించడమే కాదు, పాతతరం కుటుంబ విలువలు, కొత్తతరం కుటుంబ విలువల మధ్య తేడా గురించి చెబుతుంది ఈ ఉర్టూ కవిత. కవిత్వంలోని పంక్తుల పదును మాట ఎలా ఉన్నా, ‘మిజాజ్’లాంటి పదాల ఉచ్చారణకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. కవిత్వం చదివిన వ్యక్తి ఏఐ–జనరేటెడ్ మోడల్ అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె ఏఐ మోడల్ కాదని పంజాబ్ అమ్మాయి అని తెలిసింది.


