గౌటీ ఆర్థరైటిస్ అంటే...? | health Counseling | Sakshi
Sakshi News home page

గౌటీ ఆర్థరైటిస్ అంటే...?

Jul 20 2016 11:55 PM | Updated on Aug 24 2018 7:14 PM

మా నాన్న వయసు 52 ఏళ్లు. అప్పుడప్పుడు కాళ్ల వేళ్లు వాచి నొప్పిగా ఉంటున్నాయి.

కౌన్సెలింగ్
 

మా నాన్న వయసు 52 ఏళ్లు. అప్పుడప్పుడు కాళ్ల వేళ్లు వాచి నొప్పిగా ఉంటున్నాయి.  డాక్టర్‌ను సంప్రదిస్తే గౌటీ ఆర్థరైటిస్ అన్నారు. దాని గురించి మాకు అవగాహన లేదు. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏమిటో తెలియజేయగలరు. హోమియోలో దానికి పరిష్కారం ఉందా?  - శ్రీనివాస్, నెల్లూరు
 మన శరీరంలో ఉండే కీళ్లలో ఉప్పు లాంటి స్ఫటికాలు తయారై వాచినట్లుగా ఉండి, మంట నొప్పి వంటి లక్షణాలతో బాధిస్తూ ఉంటే ఆ సమస్యను గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఇది చిన్న కీళ్లలో మరీ ముఖ్యంగా కాలి బొటనవేలి వాపుతో ప్రారంభమవుతుంది. దీన్ని అలాగే వదిలేస్తే మిగతా కీళ్లను బాధిస్తుంది.

కారణం : మానవుని రక్తంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇలా తయారైన యూరిక్ యాసిడ్ ఎక్కువగా స్రవిస్తున్నప్పుడు దాన్ని మూత్రపిండాలు సమర్థంగా బయటకు పంపకపోతే రక్తంలో ఆ పదార్థం పాళ్లు పెరిగి ఈ సమస్యకు దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలతోనూ, మాంసాహారం, మద్యం వంటివి తీసుకునే వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.
 
ఎలా ఏర్పడుతుంది : రక్తంలో ఎక్కువ మోతాదులో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల అది కీళ్లలోని మృదులాస్థిలోకి చేరి అక్కడ పేరుకుపోవడం మొదలవుతుంది. అలా పేరుకున్నది కాస్తా చిన్న చిన్న స్ఫటికాలుగా తయారవుతుంది. ఈ స్ఫటికాలు క్రమేపీ కీలు మధ్య భాగంలో చేరి ఈ సమస్య వస్తుంది.

లక్షణాలు:  ఈ సమస్య సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది  కీలు నొప్పి సాధారణంగా రాత్రిపూట, తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది  వాపు  సూదులు పొడినట్లుగా ఉంటుంది   కీలో లోపలి ఆగంలో మండుతున్నట్లుగా ఉంటుంది  12 - 24 గంటల్లో నొప్పి తీవ్రస్థాయికి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో మందులు వేసుకున్నా, వేసుకోకపోయినా 4-5 రోజుల్లో నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకో, కొన్ని నెలలకో ఈ సమస్య మళ్లీ మొదలువుతుంది  కీలు ఎర్రగా వాచిపోయి కదలికలు కష్టంగా ఉంటాయి  వాపు తగ్గుతున్న దశలో చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది.

నిర్ధారణ:  ఇది కూడా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగే నొప్పితో మొదలవుతుంది. కానీ కీళ్లలో వాపు ఉండి ఎక్కువగా నొప్పి రావడం జరుగుతుంది. లక్షణాలతో పాటు రక్తపరీక్ష, ఎక్స్-రే, కీలులోని ద్రవపరీక్ష చేసి సమస్యను నిర్ధారణ చేస్తారు.
 నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు:  చాలా మంది నొప్పి తగ్గగానే ఈ సమస్యను మరచిపోతారు. కానీ దీనికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీ సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉంటుంది.

హోమియో చికిత్స:  రోగి లక్షణాల ఆధారంగా కాన్స్‌టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు. క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచుతూ పోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 

Advertisement
 
Advertisement
Advertisement