
అతివలకు స్వస్థతనిస్తూ ...
ఆ ఆసుపత్రిలో ముందురోజు రాత్రి ఏడుగురు మహిళలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరిగాయి.
ఆ ఆసుపత్రిలో ముందురోజు రాత్రి ఏడుగురు మహిళలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. అప్పటికే ఆ ప్రాంతానికి వరద తాకిడి ఉందని హెచ్చరికలు అందుతున్నాయి. అనుకున్నంత పనీ అయింది. మర్నాడు పొద్దున వరదనీరంతా ఆసుపత్రిలోకి వచ్చేసింది. కిందగదిలో ఉన్న ఈ ఏడుగురు మహిళల మంచాల కిందకు నీరుచేరిపోయింది.
ఎవరూ కూడా మంచం దిగే పరిస్థితుల్లో లేరు. విషయం డాక్టర్కి తెలియగానే మెడలో స్టెతస్కోప్ పక్కన పడేసి మరో ఇద్దరు అటెండర్ల సాయంతో మహిళల్ని భుజాలపై వేసుకుని నిచ్చెనసాయంతో ఆసుపత్రి పై అంతస్థుకి తీసుకెళ్లారు. కళ్లముందే మంచాలన్నీ నీటిలో కొట్టుకుపోవడం చూసి ఆ మహిళలంతా మాకోసం ఆ దేవుడే మీరూపంలో వచ్చాడంటూ డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ డాక్టర్గారి పేరే వెంకయ్య. ప్రశాశం జిల్లాలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తన వైద్యజీవితాన్నంతా పల్లెకే అంకితం చేసిన ఆయన ఇవాళ ఎంతోమంది మహిళలకు ఆరోగ్యదాత.
కుటుంబ నియంత్రణకు సంబంధించి ‘బటన్హోల్ ఆపరేషన్’ అనే పేరు వినే ఉంటారు. 1997 సంవత్సరంలో ఈ సరికొత్త పద్ధతిని తెలుగువారికి పరిచయం చేసిన వైద్యుడు వెంకయ్యే. ఆయన ఇప్పటివరకూ 90 వేల కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ శస్త్రచికిత్స ఎక్కువమందికి అందుబాటులోకి రావడం కోసం మరో 200మంది డాక్టర్లకు ఈ శస్త్రచికిత్సపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లాలోని మున్నూరు గ్రామానికి చెందిన కోటయ్య అనే రైతుకి ఏకైక సంతానం వెంకయ్య. పెద్దయ్యాక మెడిసిన్ చదివి తన ఊరివాళ్లకు వైద్యం చేయాలన్నది ఆయన చిన్ననాటి కల. తీరా డాక్టర్ అయ్యాక ఎక్కడ వైద్యం చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకునే చాలామందికి భిన్నంగా వెంకయ్య చిన్నప్పటి తన కలకే కట్టుబడ్డారు.
‘‘గుంటూరు మెడికల్ కాలేజీలో ఎమ్ఎస్ జనరల్ సర్జన్ పూర్తిచేశాక ప్రకాశం జిల్లాలో ఉద్యోగం కోసం ప్రయత్నించాను. ఉలవపాడు ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. కుటుంబనియంత్రణ ఆపరేషన్లో ఇప్పటికీ అనుసరిస్తున్న పద్ధతి వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని చూసి ‘బటన్హోల్ ఆపరేషన్’ అవసరాన్ని గుర్తించి దాన్ని పరిచయం చేశాను. కర్ణాటకలోని రామకృష్ణారెడ్డి, గౌడ్ అనే ఇద్దరు డాక్టర్లతో కలిసి క్యాంపులకు వెళ్లినపుడు బటన్హోల్ ఆపరేషన్ గురించి తెలుసుకున్నాను. నగరాల్లో ఉన్న మహిళలకు ఆధునిక వైద్యవిధానాలన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ పల్లెటూరి మహిళలు కనీస వైద్యసదుపాయాలకు కూడా నోచుకోలేరు. అందుకోసం నేను నాలుగువేల వైద్యశిబిరాల్ని ఏర్పాటు చేసి బటన్హోల్ ఆపరేషన్లను నిర్వహించాను’’ అని చెప్పారు వెంకయ్య.
సాహసాల డాక్టర్...
డాక్టర్ వెంకయ్య సేవతో పాటు సాహసాలు కూడా చేశారు. సేవ చేయడానికి మనసుంటే చాలు...కాని సాహసం చేయడానికి ధైర్యం ఉండాలి. ఒకసారి 60ఏళ్ల వృద్ధుడికి రైలు ప్రమాదం జరిగింది. రైలు చక్రాలు అతని కాలిపై ఎక్కాయి. డాక్టర్గారికి సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి వచ్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో అక్కడికక్కడే శస్త్రచికిత్స చేసి ఆ వృద్ధుడి కాలుని కట్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు అన్నిటికన్నా సంతృప్తినిచ్చిన సంఘటన మరొకటి ఉంది. ‘‘మా ఊరిపక్కన ఒక గిరిజన మహిళకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు. ఆ శిశువులందరినీ బతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే ఒకరు చనిపోయారు. మిగతా ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారు’’ అని వివరించారు వెంకయ్య. చిత్తూరు జిల్లాలో ఆయన ఎనిమిది గంటల్లో 381 కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ర్ట ప్రభుత్వం గత ఏడాది ‘స్త్రీ శక్తి అవార్డు’తో సత్కరించింది.
‘స్త్రీశక్తి’ అవార్డుని మొదటిసారి ఒక పురుషుడికివ్వడంలోని ఆంతర్యం ఏమిటో మనకు ఇప్పటికే అర్థమైంది. వైద్యులంతా పట్టణం చుట్టూ తిరగకుండా పల్లెప్రజలకు కూడా సేవలందించండంటూ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు కోరినా... అందరూ స్పందించడంలేదు. వెంకయ్యలాంటివారిని ఆదర్శంగా తీసుకుంటేగాని ఆ పని జరగదు. ‘నా దేశంలో ఏ ఒక్కరూ వైద్యం అందకుండా మరణించకూడదు’ అని కోరుకుంటున్న ఈ డాక్టర్గారి కోరిక పెద్దదే. కానీ, ఆత్మవిశ్వాసం, దానికి తగ్గ ఆచరణ ఉంటే అసాధ్యం ఏముంటుంది!