హుజూర్ నజర్ | who will win in huzurnagar constituency | Sakshi
Sakshi News home page

హుజూర్ నజర్

Apr 13 2014 1:18 AM | Updated on Aug 14 2018 5:54 PM

రాజకీయ చైతన్యం ఉన్న హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం వైపు ఇప్పుడు రాష్ట్రమంతా ఆసక్తిగా చూస్తోంది.

అసెంబ్లీ నియోజకవర్గం
 హుజూర్ నగర్
 ఎవరెన్నిసార్లు గెలిచారు:
 కాంగ్రెస్ - 3, పీడీఎఫ్-3, స్వతంత్రులు-1
 ప్రస్తుత ఎమ్మెల్యే: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)
 రిజర్వేషన్: జనరల్
 నియోజకవర్గ ప్రత్యేకతలు: సిమెంట్ పరిశ్రమకు కేంద్రం, రైసు మిల్లులు అధికం, వ్యవసాయ ప్రధాన ప్రాంతం, క్రిష్టియన్ ఓట్లు అధికం


 ప్రధాన అభ్యర్థులు వీరే..
 ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
 డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ)
 కాసోజు శంకరమ్మ (టీఆర్‌ఎస్)
 వంగాల స్వామిగౌడ్ (టీడీపీ)
 
 (ఎన్.క్రాంతి, నల్లగొండ)
 రాజకీయ చైతన్యం ఉన్న హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం వైపు ఇప్పుడు రాష్ట్రమంతా ఆసక్తిగా చూస్తోంది. ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ నియోజకవర్గ ఓటర్లు ఈసారి విలక్షణ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
 
 గెలుపుకోసం ‘ఉత్తమ్’ కష్టాలు
 
 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇటీవలే నియమితులైన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి హుజూర్‌నగర్ నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పార్టీ కేడర్‌కు దూరంగా ఉండడం, జిల్లా కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   
 
 తుపాను వేగంతో ‘ఫ్యాన్ ’గాలి
 
 వైఎస్సార్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన గట్టు శ్రీకాంత్‌రెడ్డి.. నియోజకవర్గవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉన్న వైఎస్సార్ అభిమానులే అండగా దూసుకుపోతున్నారు. ఆయన సంక్షేమ పథకాల వల్ల లబ్ధిపొందినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలవనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్న వైఎస్సార్ సీపీ సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. గ్రామాల్లో పార్టీ కేడర్ బలంగా ఉండడం శ్రీకాంత్‌రెడ్డికి కలిసివచ్చే అంశం. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత కూడా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా మారనుంది. మొత్తంగా వాయువేగంతో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ ఇక్కడ గెలుపుతో సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
 
 సెంటిమెంట్‌తో శంకరమ్మ
 
 జిల్లాకు చెందిన తెలంగాణ అమరడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ టీఆర్‌ఎస్ తరపున ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీకి దిగింది. సెంటిమెంటే ఆశగా ఆమె గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ‘ద్రోహానికి, త్యాగానికి మధ్య జరుగుతున్న పోరుగా’ ఆమె అభివర్ణిస్తోంది. సంస్థాగతంగా అంత బలం లేని టీఆర్‌ఎస్ ఇక్కడ సెంటిమెంటునే నమ్ముకుని ముందుకు సాగుతోంది.
 
 నిరాశలో టీడీపీ
 
 జిల్లా అధ్యక్షుడిగా మెజారిటీ మండలాల తిరస్కరణకు గురైన వంగాల స్వామిగౌడ్‌ను ఇక్కడి నుంచి టీడీపీ బరిలోకి దించింది. స్థానిక కేడర్‌కు ఆమోదయోగ్యం కాని వ్యక్తిగా ఉన్న స్వామిగౌడ్‌కు ఇక్కడి పార్టీ శ్రేణులు సహకరించడం లేదు. మోత్కుపల్లి ద్వారా టికెట్ సంపాదించిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారనే అనుమానం ఆ పార్టీ కేడర్‌ను పట్టి పీడిస్తోంది. ఎంతకష్టపడ్డా గెలిచే అవకాశం కనిపించకపోవడంతో పార్టీ నిరాశలో కూరుకుపోయింది.
 
 
 సాగు భూములకు  సాగునీరందిస్తా
 పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ
 పథకాలను వర్తింపజేస్తా
 విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తా
 యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా
 హుజూర్‌నగర్ పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తా    
 - గట్టు శ్రీకాంత్‌రెడ్డి
 
 
 తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా
 నియోజకవర్గంలోని బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేస్తా
 నియోజకవర్గంలో ర హదారుల  అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటా
 హుజూర్‌నగర్‌లో మిర్చి మార్కెట్‌యార్డు
 ఏర్పాటుకు ప్రయత్నిస్తా    
 - కాసోజు శంకరమ్మ
 
 గ్రామాలన్నింటికీ తాగునీరు సరఫరా చేస్తా
 కాలవ చివరి భూములకు కూడా  పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తా
 హుజూర్‌నగర్- మిర్యాలగూడ, నేరేడుచర్ల - జాన్‌పాడ్ రహదారులను విస్తరిస్తా
 గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మించి ఇస్తా    
 - వంగాల స్వామిగౌడ్
 
 రూ.50 కోట్లతో మట్టపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తా
 గ్రామాలకు కృష్ణానది తాగునీరు సరఫరా చేస్తా
 నాగార్జునసాగర్ కాలవల ఆధునికీకరణ పనుల పూర్తికి కృషిచేస్తా
 గరిడేపల్లి మండలంలో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు పూర్తిచేస్తా
 హుజూర్‌నగర్‌లో డిగ్రీ,  ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేస్తా    
 - ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement