నేటి నుంచే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
సార్వత్రిక పోరుకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బీ.శ్రీధర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికలు, నామినేషన్ల అంశానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ సెలవు రోజు (ఆదివారం) మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. పోటీచేసే అభ్యర్థి సహా ఐదుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి ఉంటుందన్నారు. మూడు వాహనాలకు మించి లోనికి అనుమతించన్నారు. మిగతా అనుచరగణాన్ని కార్యాలయానికి 100మీటర్ల దూరంలో నిలిపివేయడం జరుగుతుందన్నారు. వివరాలు సంపూర్ణంగా ఇవ్వని వారి నామినేషన్లను తిరస్కరించడం జరుగుతుందన్నారు.
నామినేషన్ల దాఖలు గడువు: 2 నుంచి 9వతేదీ వరకు
సమయం: ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలు
ప్రధాన నిబంధన : రిటర్నింగ్ అధికారి వద్దకు అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతి
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 10
ఉపసంహరణ : ఏప్రిల్ 12 (మధ్యాహ్నం 3గంటలలోపు)
పోలింగ్ : ఏప్రిల్ 30 ఓట్ల లెక్కింపు : మే 16