
ఎలుకల టెన్షన్!
చుట్టూ పదుల సంఖ్యలో పారా మిలటరీ సిబ్బంది.. మూడు అంచెలుగా పోలీసు పహారా.. 24 గంటలూ కంటికి రెప్ప వేయకుండా కాపలా కాసే అధికారులు.. సీసీ కెమెరాలు.. ఇంకా అదనంగా అభ్యర్థుల అనుచరులు.
ఘజియాబాద్: చుట్టూ పదుల సంఖ్యలో పారా మిలటరీ సిబ్బంది.. మూడు అంచెలుగా పోలీసు పహారా.. 24 గంటలూ కంటికి రెప్ప వేయకుండా కాపలా కాసే అధికారులు.. సీసీ కెమెరాలు.. ఇంకా అదనంగా అభ్యర్థుల అనుచరులు.. ఇంత చేస్తున్నా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ ఎన్నికల అధికారులకు మాత్రం కంటిమీద కునుకుపట్టడం లేదు! కారణమేమిటో తెలుసా?.. ఎలుకలు. బీజేపీ తరఫున ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్, ఆప్ అభ్యర్థి షాజియా ఇల్మి, కాంగ్రెస్ నుంచి రాజ్ బబ్బర్ వంటి మహామహులు పోటీపడుతున్న నియోజకవర్గం ఇది.
ఏప్రిల్ 10నే ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈవీఎంలను ఇక్కడి గోధుమల మార్కెట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. గోధుమ మార్కెట్ కావడంతో.. పెద్ద సంఖ్యలో ఎలుకలు ఉన్నాయి. అవి ఈవీఎంలను ఎక్కడ పాడు చేస్తాయో..? వైర్లను, సర్క్యూట్లను ఎక్కడ కొరికేస్తాయో? అని అధికారులు తలపట్టుకుంటున్నారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. భారీ సంఖ్యలో ‘ర్యాట్ కిల్లర్’లను కొని స్ట్రాంగ్ రూమ్ల వద్ద పెడుతున్నారు.