సొంతూళ్లో గెలవడం పెద్ద గొప్పేముంది.. పక్క ఊరికి వెళ్లి అక్కడ నీ దమ్మేంటో చూపించు అంటారు.
సొంతూళ్లో గెలవడం పెద్ద గొప్పేముంది.. పక్క ఊరికి వెళ్లి అక్కడ నీ దమ్మేంటో చూపించు అంటారు. సొంత నియోజకవర్గంలో గెలవడం ఒక ఎత్తయితే, పక్క నియోజకవర్గాలకు వెళ్లి పోటీ చేసి అక్కడ కూడా విజయం సాధించడం మరో ఎత్తు. అది కూడా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం అంటే మరీ కష్టం. ఇలాంటి ఫీట్లు సాధించిన నాయకులు తూర్పు గోదావరి జిల్లాలో ఒకళ్లు, ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు ఉన్నారు.
దివంగత మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు బూరుగుపూడి, కడియం, ముమ్మిడివరం.. ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కోచోట రెండేసి సార్లు గెలిచారు. అంటే మొత్తం ఆరు సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారన్న మాట. ఇక పంతం పద్మనాభం పెద్దపురం, జగ్గంపేట ఈ రెండు చోట్ల నుంచి గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే కె. వీరన్న కోరుకొండ, బూరుగుపూడి రెండుచోట్లా గెలిచారు. నడింపల్లి రామభద్రరాజు చెయ్యేరు, అమలాపురం నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. గెడ్డం మహాలక్ష్మి, సయినాల గణేశ్వరరావు.. ఈ ఇద్దరూ కూడా రాజోలు, నగరం నియోజకవర్గాలు రెండింటిలోనూ గెలిచినవాళ్లే. ఇంట గెలిచి రచ్చ గెలవడం తమకు తెలుసని వీళ్లు నిరూపించారు.