బరిలో ‘బాహుబలి’లు | donn's in bihar elections | Sakshi
Sakshi News home page

బరిలో ‘బాహుబలి’లు

Apr 21 2014 1:43 AM | Updated on Mar 29 2019 9:24 PM

బరిలో ‘బాహుబలి’లు - Sakshi

బరిలో ‘బాహుబలి’లు

రాజకీయ నేతలుగా మారిన దాదాపు డజను మంది డాన్‌లు (స్థానికంగా వారిని బాహుబలి అంటారు) బీహార్ ఎన్నికల బరిలో ఉన్నారు.

రాజకీయ నేతలుగా మారిన దాదాపు డజను మంది డాన్‌లు (స్థానికంగా వారిని బాహుబలి అంటారు) బీహార్ ఎన్నికల బరిలో ఉన్నారు. వారే కాదు కొందరు డాన్‌ల భార్యలు, గ్యాంగ్‌వార్‌లలో చనిపోయినవారి భార్యలు కూడా ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ పప్పూయాదవ్ ఆర్జేడీ తరఫున మాధేపుర నుంచి జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌పై పోటీ చేస్తున్నారు. సీపీఎం నేత అజిత్‌సర్కార్‌ను హత్య చేసిన కేసు నుంచి ఇటీవలే ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. 1991, 96, 99లలోనూ ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. విశేషమేంటంటే.. పప్పూయాదవ్ భార్య, మాజీ ఎంపీ రంజితా రంజన్ కూడా కాంగ్రెస్ టికెట్‌పై సుపాల్‌నుంచి బరిలో ఉన్నారు.
 
పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి మొహమ్మద్ తస్లీముద్దీన్ ఆర్జేడీ టికెట్‌పై అరారియా నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులున్న వారికి టికెట్లివ్వడంలో ఆర్జేడీనే ముందుంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవించినవారి తరఫున వారి భార్యలు పోటీలో దిగారు. ఇలాంటి వారు బీహార్ లోక్‌సభ బరిలో దాదాపు ఆరుగురున్నారు. షోహర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రమాదేవి.. ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన ప్రఖ్యాత గ్యాంగ్‌స్టర్ బ్రిజ్‌బిహారీ ప్రసాద్ భార్య కావడం గమనార్హం. ఒక క్రిమినల్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆనంద్‌మోహన్ భార్య లవ్లీ ఆనంద్ కూడా షోహర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement