యువతతోనే అభివృద్ధి సాధ్యం | development possible with youth | Sakshi
Sakshi News home page

యువతతోనే అభివృద్ధి సాధ్యం

Apr 19 2014 12:16 AM | Updated on Aug 15 2018 7:35 PM

యువతతోనే అభివృద్ధి సాధ్యమని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ అన్నారు.

మనూరు, న్యూస్‌లైన్:  యువతతోనే అభివృద్ధి సాధ్యమని నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ అన్నారు. మనూరు మండలం నాగల్‌గిద్దలో వివిధ పార్టీలకు చెందిన యువకులు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో యువత కీలకంగా మారిందన్నారు. మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్‌లో యువకులు విద్యావంతులుగా తయారుకావాల్సిన అవసరముందన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే అది కేవలం యువత చేతుల్లోనే ఉందని సూచించారు.

 యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమన్నారు. గత ఐదేళ్లలో నాగల్‌గిద్ద గ్రామం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని, ఇది ముమ్మాటికి పాలకుల నిర్లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. తనకు ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశమిస్తే గ్రామంతోపాటు నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా మొహియొద్దీన్‌ను, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. పార్టీలోకి చేరిన వారిలో నరేశ్, భీందాస్, కృష్ణ, దిగంబర్‌రావు, రమేశ్, సంతోష్, దత్తు, సంగమేశ్వర్, ప్రకాశ్ తదితరులు చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేశ్ యాదవ్, అంబదాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement